కార్తీక చతుర్దశి విశిష్టత...కార్తీకమాసంలో శివకేశవులను ఆరాధిస్తే..? ~ దైవదర్శనం

కార్తీక చతుర్దశి విశిష్టత...కార్తీకమాసంలో శివకేశవులను ఆరాధిస్తే..?

* వైకుంఠ చతుర్దశి రోజున లింగవ్రతాన్ని ఆచరించి జాగరణ చేసిన వారికి మోక్షం లభిస్తుంది....
* ఎన్నో విశిష్టలు కలిగిన కార్తీక వైకుంఠ చతుర్దశి....
* హరికి దీపరాధన చేయడం వలన కలుగు లాభాలు....
.
కార్తీక శుద్ధ చతుర్దశిని 'వైకుంఠ చతుర్దశి'గా పిలుస్తుంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఈ రోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. కర్తవ్యపాలన విషయంలోనే శివకేశవులు వేరుగా కనిపిస్తూ వుంటారు. నిజానికి వారిద్దరూ ఒకటేనని వేదకాలంలోనే చెప్పబడింది.
.
.
కార్తీకమాసంలో ఎవరైతే హరిహరుల దేవాలయాల ముందర నాట్యము చేస్తారో, వాళ్ళు శ్రీహరి ముందర నివసులౌతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠములో సుఖిస్తారు. కార్తీకమాస శుక్లపక్ష సాయంకాలాలందు విష్ణువును అర్చించే వారు – స్వర్గనాయకులౌతారు. ఈనెలరోజులూ నియమముగా విష్ణువు లేక శివాలయానికి గాని వెళ్ళి, దైవదర్శనం చేసుకునేవాళ్ళు, సాలోక్యమోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకూ – ఒక్కొక్క అశ్వమేధయజ్ఞ ఫలాన్ని పొందుతారు. ఈమాసంలో అస్సలు ఏ దేవాలయానికి వెళ్లనివారు ఖచ్చితంగా రౌరవాది నరకానికో, కాలసూత్ర నరకానికో పోతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు చేసే ప్రతీ సత్కర్మా అక్షయ పుణ్యాన్ని......... ప్రతీ దుష్కర్మా అక్షయ పాపాన్ని కలిగించుతాయి. కార్తీక శుక్లా చతుర్దశి నాడు విప్రసహితుడై , భక్తియుతుడై , గంధపుష్పాక్షత, దీపధూప, భక్ష్య, నివేదనలతో, విష్ణువును పూజించిన వారికి --- పుణ్యానికి మితి అనేది లేదు. శుద్ధ చతుర్దశి నాడు శివ – విష్ణువు ఆలయాలాలో ఎక్కడైనా గానీ, లక్షదీపాలను వెలిగించి, సమర్పించే వాళ్ళు, దేవతావిమానమెక్కి దేవతలచే పొగడబడుతూ, విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. ఈనెలరోజులూ దీపము పెట్టలేనివారు ..... శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి --- ఈ మూడు రోజులైనా దీపాన్ని పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేంత సమయమైనా దైవసన్నిధిలో దీపాన్ని వెలిగించేవాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులుంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని, మళ్ళీ వెలిగించేవాళ్ళు ఘోరమైన పాపాల నుండి తొలగింపబడతారు.
.
.
ఈ నేపథ్యంలో భక్తుల ముందుకు ఒక వరంగా వచ్చే విశిష్టమైన రోజే 'వైకుంఠ చతుర్దశి'. సమస్త మానవాళిచే పూజలు అందుకుంటూ వుండే విష్ణుమూర్తి, ఈ రోజున శివుడిని పూజిస్తాడంటే ఇది ఎంతటి పవిత్రమైన రోజో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి నేరుగా కాశీ నగరానికి వెళ్లి అక్కడి విశ్వనాథుడిని అర్చిస్తాడని అంటారు.
.
.
ఒకానొక సమయంలో దానవమూకలు మహా బలవంతులయ్యారు. దేవతలంతా విష్ణువు చెంత చేరి దానవులను అణచి వేయవలసిందిగా ప్రార్థించారు. ఇందుకు శివారాధనే శరణ్యం అని చెప్పి వెయ్యి కమలాలతో శివ సహస్ర నామాలను అర్చించాలని నిర్ణయించుకున్నాడు. వెయ్యి పువ్వులూ కోసి తెచ్చి పెట్టుకున్నాడు. నామానికొక పుష్పం అర్పిస్తున్నాడు నారాయణుడు.. శ్రీపతిని పరిక్షించాలని శివుడు ఓ పుష్పాన్ని మాయం చేశాడు, మాయమైన పుష్ప లోకులంతా కమలాక్షుడని తనను పిలవడం సంగతి గుర్తొచ్చి, ఆ వెయ్యోనామం అర్చించడానికి తన నేత్రాన్ని పెకలించాలని ఉధ్యుక్తుడవుతూండగా పరమశివుడు వారిస్తూ ప్రత్యక్షమయ్యాడు.. దేవతల సంరక్షణార్ధం ఇంత దుస్సాహసానికి వొడిగట్టిన శ్రీహరిని మనస్ఫూర్తిగా దీవించి తనచే నిర్మితమైన "సుదర్శనం" అనే చక్రాన్ని ప్రసాదించి, 'దీనికి ఎదురులేదు! ఎంత మందిని నిర్జించినా - తిరిగి నీవద్దకు చేరుకుంటుంది' అని అనుగ్రహించాడు.

ఇక ఈ రోజున లింగవ్రతాన్ని ఆచరించి జాగరణ చేసిన వారికి మోక్షం లభిస్తుంది. శివకేశవులను ఆరాధిస్తూ అనుగ్రహాన్ని పొందే ఈ రోజున ఇత్తడి కుందుల్లో గానీ, రాగి కుందుల్లో గాని దీపాలను వెలిగించి వాటిని దానాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు సకల పాపాలు తొలగిపోతాయి ... ఆశించే శుభాలు ఆనందంగా చేకూరతాయి.
.
.
కార్తీక వ్రతాచరణ ఫలితం :....
పూర్వకాలంలో సరస్వతీ నదీతీరంలో ఎన్నోఏళ్ళ నుండి పూజలులేక శిధిలమైపోయిన ఒక విష్ణువు ఆలయం ఉండేది. కార్తీకస్నానం కోసం ఆ నదికి వచ్చిన ఒక ముని, ఆ ఆలయాన్ని చూసి, తన తపొధ్యానానికి ఆ ప్రదేశం ఏకాంతంగా ఉంటుందని తలచి, ఆ గుడిని శుభ్రపరచి, దగ్గరలో ఉన్న గ్రమాన్నుంచి నూనె, ప్రత్తి, పన్నెండు ప్రమిదలను తెచ్చి, దీపాలను వెలిగించి ‘నారాయనార్పణమస్తు’ అని తనలో తానే అనుకొని, ధ్యానము చేసాడు. ఆ ముని ప్రతీరోజూ ఈవిధంగా చేస్తూండగా --- ఒకసారి కార్తీక శుద్ధ చతుర్దశి రోజున రాత్రి , ఆహారం ఎక్కడా దొరకని, ఆకలితోనున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి, దీపాల దగ్గరకు వచ్చి, ఒక ప్రమిదలో ఆరిపోయిన నూనె వత్తిని ఆహారంగా భావించి, నోట కరచుకొని, ప్రక్కనే వెలుగుతున్న మరోదీపం ఈ వత్తుకు అంటుకొని వెలిగెను. ఆరోజు కార్తీక శుద్ధ చతుర్దశి అగుట, ఆలయంలో ఆరిపోయిన వత్తిని వెలగటం వలన ఆ ఎలుక దివ్యమైన పురుష శరీరాన్ని పొందటం జరిగింది.

ధ్యానంలోనున్న ముని లేచి “ఎవరు నువ్వు? ఇక్కడకు ఎలా వచ్చావు?” అని అడుగగా ...... ఆ అద్భుత పురుషుడు “ఓ మునివర్యా ! నేను ఒక ఎలుకను. నాకీదివ్యతేజం ఎలా వచ్చిందో, పూర్వజన్మలో నేనెవరినో, ఎలుకగా ఎందుకు జన్మించవలసి వచ్చిందో తెలపండి” అని చేతులు జోడించి ప్రార్థించాడు. అంతట ఆ ముని తన మనోనేత్రంతో అతని గతజన్మను దర్శించి , ఈ విధంగా చెప్పసాగెను.
.
.
“పూర్వం జైమనీగోత్ర సంజాతుడవైన బహ్లికుడనే బ్రాహ్మణుడివి నీవు. సంసార పోషణకై, నిరంతరము స్నానసంధ్యాదులని వదలి, వ్యవసాయమును చేబట్టి, విప్రులను – యోగ్యులను నిందిస్తూ, సంభావనా లాలసతో శ్రాద్ధ భోజనానలను చేస్తూ, నిషిద్ధ రోజులలో రేయింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. అందగత్తెయైన నీభార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయంకోసం, ఒక దాసీని నియమించి, బుద్ధి వక్రించిన వాడివై, నిత్యం ఆ దాసీని తాకుతూ, మాట్లాడుతూ, నీ పిల్లలు – నీవునూ కూడా ఆమె చేతి భోజనమే చేస్తూ, అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు – పెరుగులు అమ్ముకుంటూ సొమ్మును కూడబెట్టావు. కొంత సొమ్మును తీసుకొని కన్నా కూతురిని కూడా అమ్ముకన్నావు. ఈ విధంగా కూడబెట్టిన సొమ్మును- ఒక గోతిలో దాచిపెట్టి ..... అర్థాంతరంగా కన్నుమూసావు. ఆ పాపాల కారణంగా నరకాన్ని అనుభవిస్తూ, చివరికి ఎలుకగా జన్మించి, ఈ శిధిలమైన ఆలయంలో బాటసారులు దేవునికి సమర్పించిన వాటిని భుజిస్తూ కాలం గడిపావు. ఈరోజు మహాపుణ్య మైన కార్తీకశుద్ధ చతుర్దశి అవ్వటం వలన, ఆరిపోయిన దీపం నీచేత వెలిగించబడటం వలన, ఇది విష్ణువు సన్నిధి కారణంగా.....నీకు ఎలుక రూపం పోయి –నారా రూపం వచ్చింది.”
ముని చెప్పినది విని – తన గతజన్మ పాపాలకు పశ్చాత్తాపం చెంది, ముని చెప్పినట్టుగా ఆ మరునాటి నుండి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఆ మూడురోజులూ, సరస్వతీ నదిలో ప్రాతః స్నానాన్ని చేస్తూ, ఆ పుణ్య ఫలము వలన వివేకవంతుడై, ప్రతీ సంవత్సరమూ కార్తీక వ్రతాచరణ చేస్తూ, చివరి కాలంలో సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కావున కార్తీక శుద్ధ చతుర్దశి నాడు భాగవత్పరాయణుడై – స్నాన, దాన, దీప మొదలైనవి ఆచరించేవారు—విష్ణువుకు ప్రీతిపాత్రుడై సాయుజ్య పదాన్ని పొందుతారు.

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive