మృత్యుధర్మము. ~ దైవదర్శనం

మృత్యుధర్మము.

ధర్మరాజు, భీష్ముడిని, "పితామహా ! కార్యబలము, వీర్యబలము, మనోబలము ఉన్న, అనేక మంది రాజులు, ఈ యుద్ధములో చనిపోయారు. వీరికి ఎంతబలము ఉన్నా6 మృత్యువును జయించలేక పోయారు. అది ఎందు వలన జరిగింది ? అసలు మృత్యువు అంటే ఏమిటి ? అది ఎలా జీవరాశులను చంపుతుంది ? వివరించండి" అని అడిగాడు. భీష్ముడు," పూర్వము అకంపనుడు అనే వాడు, యుద్ధములో చనిపోయిన తన కుమారుని కొరకు దుఃఖిస్తున్న తరుణంలో, నారదుడు అక్కడకు వచ్చి6 అతడి దుఃఖానికి కారణం అడిగి తెలుసుకుని, ఆ దుఃఖము పోగొట్టడానికి, అతడికి ఒకకథ వినిపించాడు. నీకు ఆకథ వినిపిస్తే, నీ సందేహములు అన్నీ తీరగలవు. బ్రహ్మదేవుడు, జగములను సృష్టించి6 తరువాత సమస్త జీవరాశులను6 సృష్టించాడు. జీవరాశులు! దినదినాభివృద్ధి చెంది6 చివరకు భూమి అంతా, జీవరాశులతో నిండి పోయింది. అప్పుడు బ్రహ్మ, ఈ జీవరాశులను ఎలా సంహరించాలా అని, అని ఆలోచించాడు. బ్రహ్మదేవుడి ఆలోచనల వేడిమికి, అతడి శరీరము దహించుకు పోసాగింది. బ్రహ్మదేవుడి నుండి పుట్టిన అగ్ని, మూడు లోకాలను దహించి వేయడానికి, సమాయత్తం అయింది. ఇది చూసిన శివుడు, బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి, బ్రహ్మదేవుడిని శాంతించమని అర్ధించాడు. బ్రహ్మదేవుడు శాంతించగానే, శివుడు, జీవులను చంపే విధానం ఇది కాదు, అని చెప్పి, ఆ మంటలను ఆర్పాడు. బ్రహ్మదేవుడి శరీరం నుండి, ఎర్రని కన్నులతో, ఒక స్త్రీ ఉద్భవించి, దక్షిణ దిశగా కదల సాగింది. బ్రహ్మదేవుడు, ఆమెను దగ్గరగా పిలిచి, ఓ మృత్యుదేవతా! నీవు ఈ ప్రాణులను, బలవంతుడు, బలహీనుడు, అని భేదము చూడక, అందరినీ సంహరించు, అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మృత్యుదేవత, కన్నుల నీరు నింపి," బ్రహ్మదేవా ! నీ నుండి పుట్టిన నేను, ఇంతటి క్రూరమైన పని9 ఎలా చేయగలను? నన్ను ఏదైనా ధర్మకార్యము కొరకు నియోగించు" అని కోరింది. బ్రహ్మదేవుడు, మృత్యుదేవత కన్నుల నుండి9 జలజలా రాలుతున్న కన్నీటిని, దోసిట పట్టి," మృత్యుదేవతా ! నేను నిన్ను, సంహారక్రియ కొరకే, సృష్టించాను. నీవు మారు మాటాడక, సంహరించవలసినదే "అని అన్నాడు. ఆ మాటలకు, మృత్యుదేవత కంపించి, "బ్రహ్మదేవా ! నేను మనష్యులను చంపి, వారి బంధువుల శోకము చూడ లేను. ఈ పని, నా వల్ల కాదు నేను తపస్సు చేసుకోవడానికి  అనుజ్ఞ ఇవ్వండి" అని అడిగింది. బ్రహ్మ," అది ఎలా కుదురుతుంది? మానవ సంహారం, నీ కర్తవ్యం. నీకు  అప్పగించిన పని, నీవు చేయకున్న, అది ధర్మవిరుద్ధము ఔతుంది. కనుక, నీవు ఈ పని చేయకతప్పదు".అన్నాడు. మృత్యుదేవత, మారు మాటాడక, అక్కడ నుండి, ధేనుకాశ్రమం వెళ్ళి, అక్కడ అనేక సంవత్సరాలు తపస్సు చేసింది. తరువాత, హిమాలయాలకు వెళ్ళి, బ్రహ్మదేవుడి గురించి, తపస్సు చేసింది. బ్రహ్మ దేవుడు ఆమె వద్దకు వెళ్ళి, మృత్యుదేవతా ! నీవిలా తపస్సు చేసి ఏమి ప్రయోజనం. నీవు నీ కర్తవ్యం నెరవేర్చు, అని అన్నాడు. మృత్యుదేవత," మహాత్మా ! ఆ పని నా వల్ల కాదు. నన్ను క్షమించు" అన్నది. బ్రహ్మదేవుడు," మృత్యు దేవతా ! నేను సత్యము పలుకుతున్నాను. మానవ సంహారం, నీకు పరమధర్మం. నా మాట కాదనకు. ఇందు వలన, నీకు ఏ పాపము అంటదు. మరొక్క మాట నీవు ఏడ్చినప్పుడు, నేను నీ కన్నీటిని పట్టి ఉంచాను. నేను ఆ కన్నీటిని, లోకంలోని ప్రజల మీద చల్లుతాను. అవి నానా రకములైన రోగములుగా మారి, జనులను పీడిస్తాయి. వాటికి, కామక్రోధములు  తోడౌతాయి. ప్రజలు ఆ రోగములతోనే, మరణిస్తారు. నీవు కేవలము, వారి ప్రాణములు మాత్రమే తీస్తావు. నీవు నిమిత్తమాత్రవు మాత్రమే. నీవు పురుషులను చంపు సమయంలో,
పురుషుడుగాను , స్త్రీలను చంపు సమయంలో, స్త్రీ గాను, నంపుంసకులను చంపు సమయంలో, నపుంసకుడి గానూ, మారే వరము, నీకు అనుగ్రహిస్తున్నాను. నీకు పాపము అంటదు సరి కదా , ఈ సంహార కార్యమే, ధర్మ కార్యము ఔతుంది" అని అన్నాడు. ఆ మాటలకు, ధర్మదేవత శాంతించింది. బ్రహ్మదేవుడి మాట వినక పోయిన, శాపముకు గురి కావలసి వస్తుందని అనుకుని, మానవసంహార కార్యం చేయడానికి, ఒప్పుకుంది. ఇలా మరణం ఆసన్నము కాగానే, జనులు, తమ శరీరాలను వదిలి, పూర్వాకృత కర్మలను అనుసరించి, తిరిగి జన్మిస్తుంటారు "అని భీష్ముడు చెప్పాడు.

ధర్మము:

మృత్యు దేవత గురించి విన్న ధర్మరాజు," పితామహా ! నేను ఇది వరకే, దీనిని గురించి విన్నా, నేను ఆ సమయంలో, అధిక దుఃఖానికి గురీయి ఉండడం వలన, అర్ధం చేసుకోలేకపోయాను. ఇప్పుడు, బాగా అర్ధం చేసుకున్నాను. మంచి వారు ఎప్పుడూ, ధర్మానికి భయపడుతుంటారు కదా ! నిజంగా ధర్మం అంత గొప్పదా ! వివరించండి అని అడిగాడు. భీష్ముడు," ధర్మనందనా ! వేదముల మీద భక్తి, దృఢమైనస్మృతి, మంచి ఆచారము, అందమైన శరీరము, ఇవే ధర్మములని కొందరి అభిప్రాయము. కాని, కేవలం ధనార్జనే, ధర్మమని, కొందరి అభిప్రాయము. కాని అన్యాయంగా, అధర్మంగా, అబద్ధాలు చెప్పి, ధనార్జన చేయడం, మహాపాపము. పరులసొమ్ముకు, ఆశించక, అబద్ధాలు చెప్పక, అక్రమాలు చెయ్యకుండా, ధనం సంపాదించడమే, పరమ ధర్మం. ధర్మము, అనేక రూపాలుగా ఉంటుంది. ధర్మము ఇలా ఉంటుంది, అని చెప్పలేము. ధర్మాన్ని గురించి, నాకు తెలిసింది చెప్తాను విను. ఇతరులు ఏ ఏ పనులు చేస్తే మన మనస్సుకు, శరీరానికి కష్టం నష్టం కలుగుతుందో, ఆయా పనులు, మనము ఇతరుల పట్ల చేయక పోవడమే, పరమ ధర్మం. ఇదే, ధర్మ సూక్ష్మం" అని చెప్పాడు.

ఆ మాటలకు సంతోషించిన ధర్మరాజు," తాతగారూ ! నేను అజ్ఞానంతో, ఏమేమో అడుగుతున్నాను. అడిగినవే తిరిగి తిరిగి అడుగుతున్నానని కోపము వద్దు. ఉత్తమమైన ఆచారము గురించి వివరించండి "అని అడిగాడు. భీష్ముడు "ధర్మరాజా ! వేదములలో, వివిధములైన ఆచారము గురించి, వివరంగా చెప్పారు. వాటిని ఆచరించడమే, మన ధర్మము. పెద్ద వాళ్ళు ఏది ఆచరిస్తే, అదే ఉత్తమమైన ఆచారము. ఈ సందర్భంలో, నీకు జాబాలికి, తులాధరుడు అనే వ్యాపారికి, జరిగిన సంవాదం వినిపించెదను, విను. పూర్వము జాబాలి అనే మహాముని, తపస్సు చేసుకుంటున్నాడు. అతడి తల మీద, ఒక పిచ్చుక గూడు కట్టింది. అక్కడ గుడ్లుపెట్టి, పొదిగి, వాటిని పిల్లలనుచేసింది. పెద్ద పిచ్చుక, పిల్లతో కలిసి, అక్కడ నివసించ సాగింది. ఆ విషయం తెలిసినా, జాబాలి, వాటిని తరిమి వేయకుండా, భరిస్తూ," ఆహా ! నా వంటి ధర్మనిష్టాగరిష్టుడు, ఎవరైనా ఉంటారా ! అని, తనను తాను, మెచ్చుకోసాగాడు. అప్పుడు ఆకాశవాణి, మహాత్మా ! తనను తాను మెచ్చుకునే ధర్మనిష్ట ఎక్కడైనా ఉంటాదా? నీ కంటే ధర్మనిష్టా పరుడైన తులాధరుడు కూడా, ఇలా ఎప్పుడూ మాట్లాడ లేదు. ఇక నీ వెంత ?" అని ఎగతాళి చేసింది. ఆ మాటలకు ఆశ్చర్యపడిన జాబాలి, ఆ తులాధరుడు ఎక్కడ ఉంటాడు. నేను అతడిని కలవాలి "అని అడిగాడు. అతడు వారణాశి పురంలో నివసిస్తున్నాడు, అని ఆకాశవాణి పలికింది. జాబాలి తులాధరుడి మీద కలుగిన మత్సరంతో, వారణాశికి వెళ్ళాడు. అక్కడ వ్యాపారం చేస్తున్న తులాధరుడిని, చూసాడు. జనులంతా అతడిని ధర్మాత్ముడని పొగుడు తున్నారు. జాబాలిని చూసి, తులాధరుడు, అతడికి అతిథి సత్కారాలు చేసి, మహానుభావా ! మీ తల మీద పిచ్చుకలు తిరుగుతున్నా చలించక, హాయిగా తిరుగుతున్న మీరు, జితేంద్రియులు. గౌరవించ తగిన వారు" అని అన్నాడు. అది విన్న జాబాలి," అది సరే నీవు చేసేది వ్యాపారం. అందులో ధర్మము తప్పక చేయడం, ఎలా సాధ్యము?" అని అడిగాడు. తులాధరుడు, "అయ్యా ! నేను వస్తువులు కొనడంలో, అమ్మడంలో, ఎలాంటి మోసములకు పాల్పడను. కొంత లాభంతో, తృప్తి పడతాను . లాభం వచ్చినప్పుడు పొంగిపోక, నష్టాలకు కుంగిపోక, సమ స్థితిలో ఉంటాను. నేను మట్టిబెడ్డను, బంగారపు ముద్దను, సమ దృష్టితో చూస్తాను. నేను ఎవరిని పొగడను తిట్టను. నన్ను నేను పొగొడుకోను. ఇతరులను హింసించను. సాటి జీవులయందు, దయ కలిగి ఉంటాను. ఎల్లప్పుడూ సత్యమునే పలుకుతుంటాను. నేను భోగభాగ్యములను కాని, కీర్తిప్రతిష్టలు కాని కోరను. ఎవరికైనా ఉపకారము చేసి నేను ఇంత ఉపకారము చేసాను, అని చెప్పుకోను. నాకు దేని మీద మమకారము ద్వేషము లేవు. ఈ లోకమును ఆటవస్తువులుగా చూస్తూ, బయట ప్రపంచానికి, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాను" అని అన్నాడు. జాబాలి, "తులాధరా ! నీవు యజ్ఞములు, యాగములు, తపస్సు ,మొదలగు ధర్మము గురించి, మాట్లాడ లేదు. వేదవిధులు, వీటిని సత్కర్మలు అంటారు కదా ! మరి ఇవి ఆచరించ తగిన ధర్మము కాదా !" అని అడిగాడు. "మహానుభావా ! ఈ యజ్ఞములు, యాగములు, తపస్సులు, ఏవేవో కోరికలు తీరడానికి చేస్తారు. కనుక వాటి అవసరం లేదని, నా అభిప్రాయం. దేవతలు వాటిని మెచ్చరని, నా భావన. ఈ యజ్ఞ యాగాలు, జననమరణ చక్రం నుండి, మానవులను విముక్తి చేయలేవు . ఎవరైతే సత్యమునే ఒక యజ్ఞముగా పాటిస్తూ, నిత్య తృప్తుడై ఉంటాడో, అతడికి శాశ్వత ఆనందము కలుగుతుంది,అని నా నమ్మకము," అని అన్నాడు తులాధరుడు. జాబాలి, "తులాధరా ! నీవు కర్మలు వదలకుండా, చేస్తున్నావు కదా ! దానికి ఏమి కారణం ?" అని అడిగాడు. అందుకు, తులాధరుడు, ఇలా చెప్పాడు. తులాధరుడు," ఎవరు సతతము, ధర్మమునే ఆచరిస్తాడో, ఎవరు ధర్మముతో చెలిమి చేస్తాడో, ఎవరు నిష్కల్మష హృదయంతో, కర్మలు చేస్తుంటాడో, అతడికి, కర్మలు ఆచరించకపోతే, కలిగే ఆనందము కలుగుతుంది. అన్ని నగరాలూ, పుణ్య క్షేత్రములే, అన్ని నదులూ పుణ్య నదులే, నిష్కల్మష హృదయంతో ఉన్న వాడికి, అన్నీ పవిత్రనదులే. వృత్తిధర్మంగా, పని చేస్తున్నాను, ఫలితం భగవంతుడికి అప్పగిస్తాను, అనుకుని, కర్మలు చేసే వాడికి, ఏ దోషము అంటదు. ఫలితం ఆశించి చేసే కర్మలకు, దోషం అంటకుండా, ఎలా ఉంటుంది? నాకు తెలిసిన, ధర్మము ఇది. ఇది సరి అయిన ధర్మం ఔనోకాదో, సజ్జనులను అడిగి తెలుసుకుందాము. నీవు ఇన్ని రోజులు తండ్రిలా పోషిస్తున్న ఆ పిచ్చికలు, హాయిగా ఎగురుతున్నాయి. వాటిని పిలిచి లాలించు "అని అన్నాడు. అప్పుడు జాబాలి, పిచ్చుకలను దగ్గరకు పిలిచాడు.
అవి అతడి దగ్గరకు రాకుండా, అలా ఆకాశంలో ఎగురుతూ,
 " ఓ మునీంద్రా ! మేము ధర్మ దేవత దూతలము. ధర్మదేవత పంపగా, నిన్ను పరీక్షించడానికి వచ్చాము. మేము, మీకు కలిగిన సందేహము, తీరుస్తాము. ఎవరి మనసులో ఇతరుల ఎడ ద్వేషము, మాత్సర్యము ఉంటుందో, అతడికి, ఇతరులతో తగవులాడాలని కోరిక కలుగుతుంది. అందు వలన, హింస చెలరేగుతుంది. కనుక, మునీశ్వరులు తమలో తాము ద్వేషించడం, మాత్సర్యము వహించడము, కూడనివి. స్పర్ధ, ధర్మాన్ని నాశనం చేస్తుంది. ధర్మం నశిస్తే, మనిషి నాశనం ఔతాడు. కనుక, మానవుడు, స్పర్ధను వదలాలి. సత్వగుణము వలన, శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధ ఉన్నవాడు, తాను తెలుసుకో తగిన దానిని, తెలుసుకుంటాడు. కనుక ప్రతి మనిషికి, శ్రద్ధ ముఖ్యము. శ్రద్ధలేని తపసు, శ్రద్ధలేని యజ్ఞ యాగము, నిష్ఫలములు. కనుక, శ్రద్ధే అన్నిటి కంటే ముఖ్యము. శ్రద్ధ ధనమువంటిది. అది మనసును చెడు దారిలో పోకుండా, కాపాడుతుంది. శ్రద్ధ జీవాత్మ యొక్క ప్రసన్నత్వము. యాగము చేయుటకు, శ్రద్ధ, శుచిత్వము ముఖ్యము. శ్రద్ధలేని శుచిత్వము, శుచిత్వములేని శ్రద్ధ, నిష్ఫలమే. ఇదే విషయాన్ని, బ్రహ్మ, దేవతలతో, ఇలా చెప్పాడు. శ్రద్ధ కలిగిన వాడు ఉత్తముడు. అతడి చేతి భోజనము, అత్యంత శ్రేష్టము. ధనము వడ్డికి ఇచ్చి, ఆ వడ్డీతో దానధర్మలు చేసేవాడు, వేదవేదాంగములు చదివినా, లోభి అయినవాడితో సమానమే. అందులో, యాగములో, దానము, చేసిన వాడు శ్రేష్టుడు. శ్రద్ధలేని వాడికి, దానము చెయ్యడానికి, మనస్కరించదు. శద్ధ కలిగిన వాడి మనసులో, మత్సరం ఉండదు. అందుకని, శ్రద్ధ కలిగిన వాడు శ్రేష్టుడు." అని బ్రహ్మదేవుడు చెప్పాడు, అని పిచ్చుకలు, జాబాలికి చెప్పాయి . ఆ మాటలు విన్న జాబాలి, తులాధరుడిని చూసి, "మహాత్మా ! నాకు ఆన్ని తెలుసు అనుకున్నాను. నాకు ఏమి తెలియదని, ఇప్పుడు తెలుసుకున్నాను. నేను మునుల మాటలను వినలేదు కనుక, నన్ను నేను పొగుడు కోవడము అనే దోషం, నాకు పట్టుకుంది. నీ మాటలతో, నాకు దోషము పోయింది. ఇక నేను, ప్రశాంత చిత్తంతో, జీవిస్తాను" అని పలికాడు జాబాలి. తులాధరుడు ,
 "ఓ మహాత్మా ! ఎవరికైనా, స్వధర్మ కంటే మించిన ధర్మము, మరొకటి లేదు.
తరువాత జాబాలి, తులాధరుడి వద్ద శలవు తీసుకుని వెళ్ళి పోయాడు. అని చెప్పి, భీష్ముడు, "ధర్మనందనా ! తులాధరుడి మాటలు విన్నావు కదా ! వాటిలోని ధర్మ సూక్ష్మాలు తెలుసుకుని ప్రవర్తించు" అన్నాడు.

కాలము కార్యనిర్వహణ:

ధర్మరాజు," పితామహా ! ఒక కార్యమును నిర్వహించడానికి, ఎక్కువ సమయం తీసుకుంటే మంచిదా ! తక్కువ సమయం తీసుకుంటే మంచిదా ! వివరించండి" అని అడిగాడు. భీష్ముడు," ధర్మనందనా ! ఏ కార్యమైనా, తొందర పడకుండా, చక్కగా ఆలోచించి, ఒక నిర్ణయం తీసుకుని, తరువాత చేయడం మంచింది. అలా చేసిన కార్యములకు, మంచి ఫలితాలు ఇస్తాయి. కాని కొంత మందికి, ఓర్పు సహనము ఉండదు. ఏదో చెయ్యాలని తహతహ. అలాంటి వారు ఆలోచించి, పని చేసే వాడిని చూసి, వారికి చురుకుతనం లేదు. అన్నింటా ఆలస్యమే . అది మంచిది కాదు. ఈ సందర్భంలో, నీకు మేధాతిథి అనే ముని కుమారుడైన, చిరకారిని గురిoచిన కథ, చెప్తాను. చిరకారి ప్రతి పనిని చక్కగా ఆలోచించి చేస్తాడు. అందుకనే, అతడిని, చిరకారి అని పిలుస్తారు. ఒక సందర్భంలో మేధాతిథికి, తన భార్య మీద కోపము వచ్చి, ఆమెను చంపమని, తన కుమారుడైన చిరకారిని ఆదేశించి, బయటకు వెళ్ళాడు. ఏ పని అయినా చక్కగా ఆలోచించి చేసే చిరకారి, మనసులో తండ్రి ఆజ్ఞను మీరడానికి వీలులేదు కనుక, తల్లిని చంపాలి. కాని తల్లిని చంపడం కంటే, మహా పాపం మరొకటి లేదు. తండ్రికి నచ్చ చెబుతాము, అనుకుంటే తండ్రి ఆజ్ఞను దిక్కరించడము పాపము, అని పెద్దలు చెప్తారు. తల్లిని రక్షించుకోవడము కుమారుడి ధర్మము. పుత్రుడికి స్వతంత్రంగా వ్యవహరించే వీలు లేదు. కనుక ఏదైనా ఉపాయము ఆలోచించాలి. తండ్రి ఆజ్ఞ ప్రకారము, తల్లిని చంపితే, నరకము తప్పదు. తండ్రి ఆజ్ఞను దిక్కరించినా, నరకము తప్పదు. తల్లి భూమి, తండ్రి బీజము. జన్మకు కారణమైన తల్లి, తండ్రి, ఇద్దరూ ముఖ్యమే. ఎవరిని వదలడము కుదరదు. తoడ్రికి, కుమారుడు ప్రతి రూపము కనుక, తండ్రి ఆజ్ఞను పరిపాలించిన కుమారుడికి, ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. తపస్సు, ధర్మము, విద్య, ఇవన్ని, తండ్రికి ప్రతిరూపాలు. తండ్రికి ప్రీతి కలిగే పనులు చేసిన దేవతలు కూడా, దీవిస్తారు. ఇక తల్లి వైపు, కొయ్య నుండి అగ్ని పుట్టినట్లు, తల్లి గర్భము నుండి కాళ్ళు, చేతులు, తల, ముక్కు, చెవులు, మొదలైన అంగములతో, కుమారుడు పుడతాడు. కుమారుడికి జన్మ నిచ్చే తల్లి, ఎంతో గర్భ క్లేశము అనుభవిస్తుంది. తల్లి తన బాగోగుల కంటే, కుమారుల బాగోగులకే, ఎక్కువ ముఖ్యత్వము ఇస్తుంది. అందుకే తల్లిని మించిన దైవము లేదు. తండ్రికి, బిడ్డను పైపైన చూస్తాడు. కాని తల్లి, బిడ్డల గురించి, ఎక్కువగా ఆలోచిస్తుంది. కనుక ధర్మశాస్త్రాలు, తండ్రి కంటే, తల్లికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. కొడుకు, బాలుడైనా, ప్రౌఢ వయసులో ఉన్నా, వృద్ధుడైనా, తల్లికి కొడుకు మీద ప్రేమ తగ్గదు. కనుక ,తల్లి ఈ జగతికి, మూలాధారము. క్షుద్ర జంతువుకైనా, ఉన్నత వంశస్థులకైనా, తల్లి ఒకే విధంగా ఉంటుంది. తల్లి ఒడిలో లభించే జీవితము, ప్రపంచంలో ఎక్కడా లభించదు. ఎవరికైనా, మాతృవియోగం కలిగినప్పుడు, అతడు సర్వము కోల్పోయినట్లు బాధపడతాడు. ప్రపంచం అంతా శున్యము అయినట్లు ఉంటుంది. మనసంతా చలించి పోతుంది. ఉన్నవాడైనా, బలవంతుడైనా, బలహీనుడైనా, బుద్ధి ఉన్న వాడైనా, బుద్ధి లేని వాడైనా, వీరందరికి, తల్లి సంపదతో సమానము. తల్లి జీవించి ఉంటే, సకల సంపదలు, సకల సుఖములు, ఉన్నట్లే. అటువంటి తల్లిని చంపడం, ఎలా చూసినా, మహాపాపమే. ఈ విషయము తెలుసుకోవడానికి, పెద్ద విద్యలు అవసరం లేదు. పశువుల కాపరికి కూడా, ఇది తెలుసు. తల్లిని చంపడానికి మనసెలా వస్తుంది? చేతులెలా వస్తాయి. ఈ విధంగా, పరి పరి విధముగ, చిరకారి ఆలోచిస్తున్నతరుణంలో, బయటకు వెళ్ళిన, మేధాతిధి, 'అయ్యో ! ఏదో చిన్న తప్పుకు భార్యను చంపమని, కుమారుడికి చెప్పి వచ్చాను. నా కుమారుడు, తల్లిని చంపడు కదా ! ఎంత తొందర పడ్డాను. అయినా నాకుమారుడు, ఏ పనీ ఆలోచించి కాని చెయ్యడు. తల్లిని చంపడు, అని వడి వడిగా ఇంటికి వస్తూ, "కుమారా ! నీ తల్లి, నిన్ను నవమాసాలు కని పెంచింది. నేను తొందరపడి ఆమెను చంపమని ఆజ్ఞాపించాను. కాని నువ్వు తొందరపడి, ఏపని చెయ్యవు. అని నాకు తెలుసు" అని అనుకుంటూ, ఇల్లు చేరాడు. తండ్రిని చూసి, చిరకారి, తల్లిని చంపడానికని ఎత్తిన కత్తిని, కిందకు పెట్టి, తండ్రికి నమస్కరించాడు. అతడి తల్లి కూడా, భర్తకు నమస్కరించింది. వారిరువురిని చూసి మేధాతిధి, ఆనందభాష్పాలు రాల్చి  వారిద్దరిని దీవించాడు. మేధాతిథి, ఒక కార్యము చెయ్యవలసి వచ్చినప్పుడు, ఆలోచించి ధైర్యంగా చెయ్యాలి. అటువంటి వాడిని, లోకము ఆర్యుడని అంటుంది. ఆలోచించక తొందరపడి పని చేసే వాడిని, లోకము అనార్యుడని అంటుంది. ఒక పని చెయ్యడానికి ముందు, ఇతడు మిత్రుడా, శత్రువా, ఇతడు యోగ్యుడా, అయోగ్యుడా, అని ఆలోచించి, నిర్ణయించే వాడు, బుద్ధిమంతుడు. అలాంటి వాడికి సకల శుభములు కలుగుతాయి" అని అన్నాడు మేదాతిథి. కనుక ధర్మనందనా ! ఏ పని అయినా, ఆలోచించి చేస్తేనే, మంచి ఫలితాలు కలుగుతాయి" అని భీష్ముడు అన్నాడు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List