పొలతల మల్లేశ్వర క్షేత్రం. ~ దైవదర్శనం

పొలతల మల్లేశ్వర క్షేత్రం.

* శేషాచల అభయారణ్యంలో అద్భుత పొలతల మల్లేశ్వర క్షేత్రం...
* పునితలు పొలతలగా ప్రసిద్ధి చెందిన మహిమాన్వతమైన ఆలయం..
* సీతమ్మరాకను అన్వేషిస్తు రామలక్ష్మణులు వచ్చి పూజలు నిర్వజహించిన క్షేత్రం..
* సాంబశివ అన్నయ్య, బండెన్న అంటూ పరమశివుని స్మరిస్తున్న క్షేత్రం..
* 101 కోనేర్లు గల ఏకైక ఆలయం..
* సర్వాంగ సుందరంగా ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి పరచిన ఏకల వీరులు ..
.
శేషాచల దట్టమైన పర్వతశ్రేణుల్లో పచ్చని చెట్లు, సేలయేళ్ల మధ్య ఈ పొలతద క్షేత్రం వెలసింది. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో పరుచుకున్న పచ్చదనం.. గలగలపారే సెలయేరు.. నింగికి నిచ్చెన వేసినట్లున్న కొండలు.. కనువిందు చేసే కమనీయ దృశ్యాలు.. జంతువుల ఘీంకారాలు.. మేను పులకరించే ప్రకృతి అందాలు.. ఆస్వాదించడానికి ఈ ప్రకృతి సౌందర్యం.. ఇది అందరికీ ఓ ఆనంద వరం.. వికసించి విరబూసే రంగురంగుల పుష్పాలు.. ఆలపిస్తూ, ఆకృతినిచ్చే అందమైన కొనలలు.. ప్రకృతినే మురిపించే పచ్చని చెట్లు.. శేషచల అడవి సౌందర్యం, మదిలో ఓ ఆనందం... శేషాచల అడవుల్లో ఉన్న పొలతల ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఈ క్షేత్రంలో మల్లేశ్వరస్వామి, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామి, వినాయకుడు, అక్కదేవతలు, బండెన్నస్వామి ఆలయాలు ఉన్నాయి.
.
‘ఓం నమశ్శివాయః .. హరహర మహాదేవ.. శంభో శంకర..హరోం హరా’..అంటూ శైవ క్షేత్రం మార్మోగుతుంది. భక్తుల పంచాక్షరి మంత్రోచ్చాటనతో ప్రతిధ్వనిస్తుంది. సాంబశివ అన్నయ్య, బండెన్న అంటూ పరమ శివుని స్మరిస్తూ పూనకంతో ఊగిపోతు అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో పొలతల క్షేత్రం కిటకిటలాడుతుంటుంది.
.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప జిల్లా, పెండ్లిమర్రి మండలంలో గల శేషాచల అభయారణ్యంలో మహా మహిమాన్వితమైన అద్భుత పొలతల మల్లేశ్వరుడు క్షేత్రం కలదు. ప్రతి రోజు ఉదయం స్వామివారికి గణపతి పూజ, మహాన్యాస రుద్రాభిషేకం, మహామంగళ హారతి, అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తురు. భక్తులు కోనేర్లలో స్నానాలాచరించి మల్లేశ్వరస్వామిని, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యంస్వామి, అక్కదేవతలు, బండెన్నస్వామిని దర్శించుకుంటారు. జిల్లా నలుమూలల నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు.
.
పోలతల క్షేత్రం చరిత్ర:..
.
రాయలసీమ జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన క్షేత్రం పొలతల. కడపజిల్లా పెండ్లిమర్రి మండలంలోని గంగనప్లలె పంచాయతీ పరిధిలోని శేషాచల పర్వతశ్రేణుల్లోని కొండ కోనల నడుమ ఈ పోలతల క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ శివక్షేత్రంలో శ్రీ పొలతల మల్లికార్జునస్వామి వెలసివున్నారు ఇంకా అక్కదేవతలు, పులిబండెన్నలు కూడా వెలసి ఉన్నారు. ఈ క్షేత్రంలో సీతమ్మరాకను అన్వేషిస్తు ఇచ్చట రామలక్ష్మణులు కొలనులో స్నానం చేసి శివుని దర్శించి పునీతులైనారని పురాణాలు చెప్తున్నాయి. తర్వాత పాండవులు వనవాస కాలంలో అర్జునుడు కందమూలములతో, మల్లెపూలతోను పూజించినందున మల్లికార్జును ప్రసిద్ధి పొందారని పురాణాలు చెబుతున్నాయి. ఇచ్చట కొలువైన మల్లికార్జునికి లోక కల్యాణార్థం శివపార్వతులు సంచరిస్తూ ఇచ్చట కాలుమోపగా కొతం భూమి కుచించు పోయిందని భక్తులు చెబుతుంటారు. కావున పునితలు పొలతలగా ప్రసిద్ధి చెందినది.
.
ఈ పొలతల మల్లికార్జునస్వామి దేవస్థానానికి ఎంతో మహనీయమైన ధార్మిక చరిత్ర వుంది. దాదాపు 800 సంవత్సరాల క్రితం పొలతల గ్రామం దాన్ని చుట్టుపక్కల ఏడు చిన్న ఊర్లు వుండేవని, ప్రజల జీవనం పంటసిరి, పాడిసిరితో సాగేదని పెద్దలు చెబుతుంటారు. ఈ ఊర్లకు చెందిన ఆవుల మందను కాసే ధార్మిక మానవుడు రామయ్య. ఆయనకు ఒక శిష్యుడు. ఆయన పేరు పిలకత్తు. తాము కాసే ఆవుల మందలో ఒక ఆవు శూలుకట్టడం కానీ, ఈనడం కానీ లేకుండా చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆ విషయం గుర్తించి దాని రాక పోకలపై దృష్టి పెట్టాడు పిలకత్తు. ఒకరోజు అందరి కన్ను గప్పి ఆవు మందకు అడ్డంగా బిగించిన కంచెను అవలీలగా ఎగిరి అవతలికి దూకింది. వడివడిగా ఎక్కడికో పోసాగింది. పిలకత్తు దాని వెనుకగా చేత గొడ్డలి పట్టుకుని అనుసరించాడు. అలా ఆవు కొంతదూరం వెళ్లింది. ఓ ముళ్లపొద గొడుగులా పైకి లేచింది. దాని కింద ఒక దివ్యపురుషుడు పరుండి ఉన్నాడు. ఆ ఆవు తన పొదుగునుంచి క్షీరాన్ని ఆ దివ్యపురుషుని నోటి లోనికి వదలసాగింది. ఈ ఘటన చూసిన పిలకత్తు అగ్రహోదగ్రుడై ఎవరో అగంతకుడు ఆవుపాలు ఇలా దొంగచాటున జుర్రుకుంటున్నాడని తలపోశాడు. ముందు వెనుక ఆలోచించకుండా చేతిలోని గొడ్డలితో ఆ దివ్య పురుషుని మడిపై మోదాడు. చివ్వున రక్తం పైకి చిమ్మింది. నెత్తురు చూసిన పిలకత్తు కంగారుపడి పోయాడు. తన గురువు రామయ్య వద్దకు పరుగున వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. రామయ్య వృత్తాంతం అంతా విని జరిగిన పొరబాటు విని ఎంత బలీయమైనదోనని ఆందోళన చెందుతుండగానే పిలకత్తు క్షణాలలో పూనకం వచ్చినట్లు వూగిపోయాడు. వెంటనే పిలకత్తును ఆవహించింది సాక్ష్యాత్తు పరమశివుడే అన్నది తెలిసిపోయింది. అనంతరం జరిగిన అపరాధాన్ని క్షమించమని పరిహారంగా గుడికట్టి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటామని కన్నీరు మున్నీరై సాష్టాంగ దండ ప్రమాణాలు చెల్లించాడు రామయ్య. అనంతరం ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి మల్లికార్జునస్వామి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. అక్కదేవతలు- పులిబండెన్నల ఆగమనం ఒకప్పుడు పొలతల ప్రాంతంలో 101 కోనేర్లు పులివింజ మానులు, విశాలమైన ప్రకృతి పచ్చదనాలతో అలరారేది.. ఆ ప్రశాంత ప్రకృతి వాతావరణంలో మహిమాన్విత మధుర జలాలతో ప్రాణకోటికి జీవనాధారమైన 101 కోనేర్లకు సమీపంలోనే మబ్బుకోన అనే ఒక గని ఉండేది. ఆగనిలో దివ్య పురుషుడు అయిన తులశ బ్రహ్మ తపోదీక్షలు ఉండేవారు. అలాగే గనిలో పునీత మహిమలైన అక్కదేవతలు ఏడుగురు కూడా ఉండేవారు. అక్కదేవతల బాషణలు లేని తులశ బ్రహ్మకు అవరోధంగా మారాయి. కన్నీయమనులైన అక్క దేవతలను తులశబ్రహ్మ తన తపోసమాధికి ఎదురవుతున్న ఆటంకాన్ని తెలిపి సమీపంలోని కోనేర్లకు ఆధార భూతంగా చేసుకుని జీవించమని కోరారు. మేని మాటలను మన్మించి ఆ కన్నియలు గవి విడచి కోనేరు వద్దకు చేరి జలక్రీడలలో ఆనందించసాగారు. ఒకరోజు ఒక ఓం కారశద్దంతో ఒక సుడి తాటిచెట్టంత ఎత్తులేచింది. దీంతో ఆ కన్నియలు పారిపోయి బంగాళా బోడు దగ్గర వెలిసివున్న శివుని గుడిలో ప్రవేశించి శివుని శరణువేడారు. పరమశివుడు ప్రత్యక్షమై కన్యకలను దుమ్ము, ధూలి రూపంలో వెంబడిస్తున్న శక్తిని నిలువరింపచేశారు. శివుని దర్శనంతో ఆ అప్రకటిత శక్తి తన నిజస్వరూపంలో శివుని ఎదుట నిలువక తప్పిందికాదు. నీవు ఓం శక్తివి కావు పులి బండైవున్న నీ శక్తి యుక్తులు ఇకపై లోక కళ్యాణార్థమై వెచ్చించు. అలాగే మహిమాన్వితులైన ఈ ఏడుగురు కన్నేలు కూడా భక్తాదుల మనో కామి తలను సిద్దింప చేస్తారు. ఇకపై మొదటిపూజ అక్కదేవతలైన కన్నేలకు, పిమ్మట తనకు ఆ తరువాత పులిబండెన్నకు పూజలు జరుగుతాయని చెప్పి పరవ శివుడు అదృశ్యమయ్యాడు. అదేవిధంగా నేడు కూడా తొలి పూజలు అక్కదేవతలకు జరుగుతున్నాయి.
.
కదిరిలోని నరసింహస్వామి దేవాలయ గోపురర శిఖరం ఒకసారి ఉన్న ఫలంగా ఒక వైపునకు ఒరిగింది. ఈ పరిస్థితిని గుర్తించిన ధార్మిక జనులైన భక్తాదులు అపచారం జరిగిందని ఏదో అరిష్టం ముంచుకుని రాబోతుందని తీవ్ర ఆందోళన చెందారు. ఆలయ శిఖరం ఒక వైపునకు ఒరిగిపోయిన విషయం తెలిసి అరవై ఆరు మంత్రవేత్తలైన పూజారులు తమ శక్తి యుక్తులను ప్రయోగించారు. కాని వారి మంత్రాలకు వొరిగిన ఆలయ శిఖరం ఎంత మాత్రం సరికాలేదు. ఈ పరిస్థితి ఆనోటా ఈ నోటా విన్న పొలతల లోని మల్లికార్జున ఆలయ పూజారి రామయ్య తన వద్ద ఉన్న దేవర ఎద్దును మరో వంద మందిని వెంటబెట్టుకుని కదిరి నరసింహస్వామి ఆలయానికి వెళ్లాడు. దేవరఎద్దు ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేసి మంత్ర మహిమాన్వితమైన తన కొమ్ముతో ఆలయాన్ని కుమ్మింది. మరుక్షణం ఒరిగిన శిఖరం సరిగా కుదురుగా నిలబడింది. అయితే గోపురం పై నుంచి ఒక కప్పు దేవర ఎద్దుపై పడటంతో ప్రాణాలు వదిలింది. ప్రతిఫలంగా ఇరవై ఎకరాల మాన్యాన్ని పొలతల మల్లికార్జునస్వామి ఆలయానికి కదిరి నరసింహ ఆలయం వారు ఇచ్చారు.
.
పొలతల ప్రాంత ప్రజలు తరచు దివిటి దొంగల బారిన పడేవారు. దివిటీ దొంగలు సర్వం దోచుకుని వెళ్లేవారు. అంతేగాక కలరా వ్యాధితో చాలామంది మృత్యువాత పడ్డారు. ఈ కారణాలతో పొలతల ప్రాంతంలోని ప్రజలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లడం ప్రారంభించారు. దీంతో చాలాకాలం మల్లికార్జున స్వామికి ధూప దీప నైవేద్యాలు కరువయ్యాయి. ఇదిలా వుండగా వేంపల్లె తూర్పున గండి ఆంజనేయ క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి మూడు మైళ్ల దూరంలో ఏక దంతనాయుడు కోట ఉండేది. ఆ కోటలో దొంగతనాలు చేసి జీవించే 50 కుటుంబాల వారు జీవించేవారు. వీరు పరాక్రమవంతులు. వీరిని ఏకల వీరులు అని కూడా పిలిచేవారు. ఏకదంత నాయుడితో పాటు ఏకల దొరలు కొందరు ఒకరోజు వేటకు వెళ్లి పొలతల ప్రాంతాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ పిమ్మట పొలతల మల్లికార్జున స్వామి ఆలయాన్ని బంగాళా బోడు నుంచి పక్కనే గల మరోబోడు పైకి మార్చి సర్వాంగ సుందరంగా ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి పరచి తమ భక్తి ప్రవుత్తులను చాటుకున్నారు. దివిటి దొంగలలో మానసిక మార్పు తెచ్చి భక్తి మార్గానికి మల్లించిన పొలతల మల్లికార్జునస్వామి మహిమలు అనంతం..ఇక్కడికి వచ్చే స్త్రీ , పురుషులు తమ కోర్కెలు తీరాలని ముడుపులు కడుతుంటారు. ఇక్కడ స్వామికి కొబ్బరికాయ కొట్టినా ఇక్కడే వదలిపెట్టి వచ్చే సంప్రదాయం ఉంది.
.
మహాశివరాత్రి, కార్తీకమాస, వారోత్సవాలకు జిల్లా నుంచే కాక ఇతర రాష్టాల్ర నుంచి వేలాది వాహనాల్లో భారీగా భక్తులు తరలివస్తారు. ప్రతి సోమవారం జిల్లాతోపాటు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పొలతల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యం ప్రతి రోజు ప్రత్యేక బస్సును కూడా పొలతల క్షేత్రానికి నడుపుతున్నారు.
.
రచన..
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి .
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List