కార్తిక పురాణం - 2. ~ దైవదర్శనం

కార్తిక పురాణం - 2.

ద్వితీయ అధ్యాయము - సోమవార వ్రత మహిమ.

శ్లో|| ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరంతీ త్రయశ్శిఖాః |
తస్మై తారాత్మనే మేధాదక్షిణామూర్తయేనమః ||

జనకా! ఇంతవరకు నీకు కార్తిక మాసము నందాచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తిక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన, సోమవార వ్రత విధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము.కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీగాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు ఉపవాసముండి, నదీ స్నానము చేసి తమశక్తి కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈవిధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయుజాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను  తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగని తీసుకోనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి, శివసన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి, శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగ నొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను శ్రద్దగా వినుము.

కార్తిక సోమవార ఫలముచే కుక్క కైలాస మందుట.

పూర్వ కాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాల దినములుకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు'స్వాతంత్ర నిష్టురి', తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ యను సద్బ్రాహ్మణ యువకున కిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు, శాస్త్రములుఅభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గిన వాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును యగుటచే లోకులేల్లరునతనిని 'అపరబ్రహ్మ' అని కూడ చెప్పుకొనుచుండేడివారు. ఇటువంటి ఉత్తమపురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో, కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సాంగత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు పువ్వులు, ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ, శాంత స్వరుపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమెయందు అభిమానము పోక, ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి, ఛీ పోమ్మనక, విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ, చుట్టుప్రక్కల వారా నిష్ఠురి గయ్యాళి తనమును కేవగించుకుని - ఆమెకు'కర్కశ' అనే ఎగతాళి పేరును పెట్టుటచే- అది మొదలందరూ దానిని 'కర్కశా' అనియే పిలుస్తూ వుండేవారు. ఇట్లు కొంత కాలము జరిగిన పైన - ఆ కర్కశ, ఒకనాటి రాత్రి తన భర్త గాడ నిద్రలో నున్న సమయము చూచి, మెల్లగా లేచి, తాళి కట్టిన భర్త యన్న విచక్షణ గాని, దయాదాక్షిణ్యాలుగాని లేక, ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను. ఆ మృత దేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే, అతి రహస్యంగా దొడ్డి దారిని గొనిపొయి ఊరి చివరనున్న పాడు నూతిలో బడవేచి పైన చెత్త చెదారములతో నింపి, యేమియు యెరుగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు యే ఆటంకములు లేవని ఇంక విచ్చల విడిగా సంచరించుచు, తన సౌందర్యం చూపి యెందరినో క్రీ గంటనే వశపరచుకొని, వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడనూ రమించుచు వర్ణసంకరు రాలయ్యెను. అంతేయే గాక పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను, తమ మాటలతో చేరదీసి, వారిని కూడా దుర్భుద్దులు నేర్పి పాడు చేసి, విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనక రాజా! యవ్వన బింకము యెంతో కాలముండదు గదా! కాలమోక్కరితిగా నడవదు. క్రమక్రముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణములనుండి చీము, రక్తము రసికారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ట్టు వ్యాది బయలుదేరి దుర్గంధము వెలువడుచున్నది. దినదినమూ శరీర పటుత్వము కృశించి కురూపియై భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో వుండగా ఎన్నో విధాల తృప్తికలిగించిన విటులుయే ఒక్కరు ఇప్పుడామెను తొంగి చూడ రైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన యెడల తమునెటులైననూ పలుకరించునని, ఆ వీధిమొఘమైనను చూడకుండిరి. కర్కశ ఇటులనరక బాధలనుభవించుచు, పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి నన్నాళ్లు ఒక్కనాడైన పురాణ శ్రవణ మైననూ చేయని పాపిష్టురాలు గదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొనిపోయి ప్రేత రాజగు యముని సన్నిధిలో నుంచగా, యమధర్మ రాజు, చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి,"భటులారా! ఈమె పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే యీమెను తెసుకువెల్లి ఎర్రగా కాల్చిన యినుప స్త౦భమునకు కట్టబెట్టుడు" అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తభమును కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండ రాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యబిచారిణిలుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లితండ్రులకు,  అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగెంచి నోటిలోను, చెవిలోను పోసి, ఇనుపకడ్డిలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమను నరకములోవేయగా, అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెఱ్ఱులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు యిటు ఏడు తరాలవాళ్లు అటు ఏడు తరాలవాళ్లు నరకబాధలు పడుచుండిరి.ఈ ప్రకారముగా నరక భాదల ననుభవించి, కడకు కళింగదేశమున కుక్క జన్మమెత్తి, ఆకలిబాధ పడలేక యిల్లిల్లు తిరుగుచుండగా, కఱ్ఱలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచుండిరి. ఇట్లుండగా ఒకానొకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తిక సోమవార వ్రతమాచరించి ఉపవసముండి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి, బలియన్నము నరుగుపై పెట్టి, కాళ్లు చేతులు కడుగు కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్నమగుట చేతను ఆ రోజు కార్తికమాస సోమవారమగుట వలను, కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో వుండుటవలననూ, శివపూజ పవిత్ర స్థానమైన ఆ యింట దొరికిన ప్రసాదము తినుట వలననూ, ఆ శునకమునకు జన్మంతరజ్ఞాన ముద్భవించెను. వెంటనే ఆశునకము 'విప్రకులోత్తమా! నన్ను కాపాడుము' యని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరు లేనందున లోనికేగను. మరల 'రక్షింపుము రంక్షిపుము'యని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకు వచ్చి 'ఎవరు నివు! నీ వృత్తాంతమేమి!' యని ప్రశ్నించగా, యంత నా కుక్క "మహానుభావ! ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలముందు విప్రకులాంగనను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగ పెండ్లాడిన భర్తను జంపి, వృద్దాప్యములో కుష్టురాలనై తనువు చాలించిన తరువాత, యమ దూతలవల్ల మహానరక మనుభవించి నా పూర్వికుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తిక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా, మీరు చేసిన కార్తిక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్దించుచున్నాను"యని వేడుకొనగా, కార్తిక సోమవారవ్రతములో చాలా మహాత్మ్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పకవిమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికి వందనము జేసి అక్కడి వారందరూ చూచుచుండగానే యా విమాన మెక్కి శివ సాన్నిధ్యమున కేగెను.వింటివా జనక మహారాజా! కావున ఈ కార్తికసోమవార వ్రతమాచరించి, శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠునకు హితబోధచేసి, ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి రెండవ అధ్యాయము-రెండవ రోజు పారాయణము సమాప్తం.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive