హేమాచల క్షేత్రం. ~ దైవదర్శనం

హేమాచల క్షేత్రం.


వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో హేమాచల క్షేత్రం ఉంటుంది. ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనర్సింహస్వామి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు. జిల్లా కేంద్రానికి 135 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీర ప్రాంతంలో ఏటూరునాగారం – భద్రాచలం ప్రధాన రహదారిని అనుకొని ఈ క్షేత్రం ఉంది. ఈ హేమాచల క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. హిమాలయాల్లో మాదిరిగానే ఈ క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రం పై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆరవ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని అంటుంటారు. ఈ క్షేత్రమంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆశ్రిత జన రక్షకుడు భక్తుల కల్ప తరువు లక్ష్మీనర్సింహస్వామి ఈ క్షేత్రంపై స్వయంభూగా వెలిశాడ‌ని ప్ర‌తీతి.
శాతవాహన శక ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహాంతర భాగంలో ఉన్నానని సెలవిచ్చినారట. మహారాజు 76 వేల సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతున్నది. ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. దీన్నే నాభి చందనంగా పిలుస్తున్నారు. స్వామి వారికి ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అను ఇద్దరు భార్యలు(దేవేరులు) ఉన్నారు. క్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయ స్వామి.. క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాలస్వామి, తూర్పు భాగంలో కోనేరు, దక్షిణాన నార నర్సింహ క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు. ఇచట స్వామికి నాభియందు దెబ్బతగలడం వల్ల అక్కడి నుంచి వచ్చే ద్రవానికి చందనం పెట్టి సంతానం లేనివారికి, కుజ, రాహు, కేతువు గ్రహ దోషముల నివారణకు ఈ చందనాన్ని ఇస్తారు.
కాకతీయ రాణి రుద్రమదేవి త‌న కాలంలో మల్లూరు హేమాచల క్షేత్రాన్ని సంద‌ర్మించిద‌ని.. ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చరిత్రకారులు చెబుతారు. ఓరుగల్లు రాజధానిగా పరిపాలనను సాగించిన కాకతీయ రాజుల ఏలుబడిలోనే ఈ హేమాచల క్షేత్ర ప్రాంతం ఉండేది. ఈ హేమాచల క్షేత్రం పై గోన గన్నారెడ్డి నేతృత్వంలో సైనిక స్థావరం నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కాకతీయుల పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17వ శతాబ్దంలో గజనీ మహ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వెయ్యి స్థంభాల గుడి, రామప్ప, కోటగుళ్ల లాంటి దేవాలయాలను ధ్వంసం చేసిన గజనీ మహ్మద్ సైన్యాలు హేమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదు. పైగా బంగారు బిస్కెట్లు ఆలయానికి కానుకలుగా సమర్పించినట్లు చెబుతున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధ చంద్ర నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండడమే ఇందుకు కారణం.
ఇక్క‌డి చింతామణి జలపాతం (అక్కధార – చెల్లెధార) సర్వరోగనివారిణిగా పనిచేస్తోంది. కాశీ, గంగలో దొరికే జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవి నమ్ముతారు భ‌క్తులు. వంద రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్ని నయమవుతాయట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయ‌ని భ‌క్తుల చెపుతున్నారు. హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం యేడాది పొడవునా పారుతూనే ఉంటుంది. హేమాచల క్షేత్రదర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుంది. ఈ క్షేత్రం పై భక్తుల ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమి పై ఒత్తిడి పెరిగి అడుగు నుంచి జలాలు ఎక్కువగా ఉబికి వస్తాయట.
రామబంటు ఆంజనేయుడి విగ్రహం ఎక్కడా లేని విధంగా ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్న షిఖాంజనేయుడి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయానికి పశ్చిమ భాగంలో కిలోమీటర్ దూరంలో ఈ షిఖాంజనేయ మహా విగ్రహం భక్తులను ఆశ్చర్యముఖులను చేస్తుంది. షిఖాంజనేయుడి పాదాలు, గోర్లు పొడవుగా ఉంటాయి. గంభీరమైన, భీకరమైన, తేజోవంతమైన రూపంతో ఆంజనేయ స్వామి విగ్రహం అతివీర భయంకరంగా ఉంటుంది. దీనికి తోడు ఆలయ ప్రాంగణంలో పంచముఖ ఆంజనేయుడు, ఎద్దు ముక్కు ఆంజనేయుడు, జలాంజనేయుడు రూపాల్లో దర్శనమిస్తాడు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List