దీపజ్యోతిని దర్శించుకునే వారికి మరుజన్మ వుండదట.! ~ దైవదర్శనం

దీపజ్యోతిని దర్శించుకునే వారికి మరుజన్మ వుండదట.!



మనదేశంలో కొండపై వెలసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో రాష్ట్రంలోని తిరుమలేశుని ఏడుకొండలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శ్రీవారి వైష్ణవ క్షేత్రం లాగానే… తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై కొండపై (అరుణాచలకొండ) ప్రసిద్ధ శైవక్షేత్రం వెలసి ఉంది. ఈ అరుణాచలకొండపై శివుడు అరుణాచలేశ్వర స్వామిగా భక్తులకు అభయమిస్తున్నారు.
కోరిన కోర్కెలను నెరవేర్చే ఈ అరుణాచల కొండ చాలా మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. శివునికి ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరువణ్ణామలైలో జరిగే కార్తీక ఉత్సవాల్లో ముఖ్యమైన దీపోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. కార్తీక పౌర్ణమి రోజున ప్రపంచంలో ఏ జీవరాశి అయినా అరుణాచలేశ్వరుని ఆలయంలో వెలిగించే మహా దీపజ్యోతిని దర్శించుకుంటే మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.
కానీ అరుణాచలేశ్వర ఆలయంలో జరిగే దీపజ్యోతి దర్శించుకోలేని వారు ఆ రోజున ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో నేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ ప్రమిదెలతో దీపాలను వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. ఇంటిని రంగవల్లికలతో అలంకరించి.. వాటిపై దీపాలను అలంకరించే ముత్తైదువులకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.
ఇదిలా ఉంటే… అరుణాచల కొండ కృతాయుగంలో అగ్నిపర్వతంగానూ, త్రేతాయుగంలో మాణిక్య గిరిగానూ, ద్వాపర యుగంలో పసిడి కొండగానూ, కలియుగంలో రాతి కొండగా మారిందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
ఎనిమిది దిక్కుల్లో అష్టలింగాలను కలిగి యుండటం ఈ అరుణాచల పర్వత విశేషం. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతి లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం అనే ఎనిమిది లింగాలు అరుణాచల కొండ ప్రాంతంలో వెలసి ఉన్నాయి.
ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజుల్లో ఈ లింగాలను దర్శించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఈ లింగాల చుట్టూ పర్వత ప్రాంతం ఏర్పడి ఉండటంతో ఈ లింగాలను దర్శించుకుంటే.. కొండను కూడా ప్రదక్షిణ చేసినట్లవుతుంది. అందుకే అరుణాచలేశ్వర ఆలయంలో “గిరి వలం” (కొండ ప్రదక్షిణ) చేయడం అనాది కాలం నుంచి ఓ సంప్రదాయంగా వస్తోంది.
ప్రతినెలా వచ్చే పౌర్ణమి రోజుతో పాటు, కార్తీక మాసంలో వచ్చే పున్నమి రోజున ఈ కొండను ప్రదక్షిణ చేసుకుని ఎనిమిది లింగాలను దర్శించుకునే వారికి సర్వసంపదలు, సుఖసంతోషాలు, మోక్షమార్గాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.
14 కిలోమీటర్ల చుట్టుకొలత గల ఈ కొండను ప్రదక్షిణ చేసే భక్తులకు అక్కడక్కడ విశ్రాంతి గదులు, తాగునీటి వసతులు, అన్నదానాలు వివిధ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఈ ఆలయం గురించి చెప్పాలంటే.. అరుణాచల కొండ ప్రాంతాల్లో అనేక మంది సన్యాసులు నివసిస్తున్నట్లు ప్రజల్లో నమ్మకం ఉంది.
అందుచేత సిద్ధుల అనుగ్రహం కోసం ఈ పర్వతాన్ని ప్రదక్షిణ చేయడం శుభప్రదం. ముఖ్యంగా పౌర్ణమి రోజున కొండ ప్రాంతాల్లో సిద్ధులు పర్యటిస్తారని, మూలికా విశేషాలకు సంబంధించిన గాలి ఆ పర్వత ప్రాంతంలో వీస్తుంది.
అటువంటి మూలికా సమ్మేళనమైన ఆ గాలిని పీల్చడం ద్వారా మానవ శరీరంలోని కొన్ని వ్యాధులు నయమయ్యే అవకాశముండటం ఇందులో మరో విశేషం. అందుచేత ఈ అరుణాచలేశ్వరస్వామి కొండను ప్రదక్షిణ చేసుకునేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List