తొలి మహిళ కాలజ్ఞాని శ్రీ ఈశ్వరీదేవి.. ~ దైవదర్శనం

తొలి మహిళ కాలజ్ఞాని శ్రీ ఈశ్వరీదేవి..


గొప్ప యోగిని, మహమాన్వితురాలు కందిమల్లయపల్లె శ్రీ ఈశ్వరమ్మ... ఒక మహాయోగి, చారిత్రక వ్యక్తి, కాలజ్ఞానకర్త, సిధ్ధపురుషుడు, సంఘసంస్కర్త అయిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పవిత్ర సంచారం తో, పవిత్రబోధలతో ప్రసిద్దమైన ఈ కందిమల్లాయ పల్లి దర్శనం సర్వపాపహరణం గా భక్తులు భావిస్తారు. 175 సంవత్సరములు జీవించి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు క్రీ.శ 1694 శ్రీముఖనామ సంవత్సర వైశాఖ శుద్ద దశమి ఆది వారం నాడు జీవసమాధి అయినట్లు తెలియుచున్నది. శ్రీ బ్రహ్మంగారి కుమారుడైన గోవిందయ్య కుమార్తె శ్రీ ఈశ్వరమ్మ జన్మతః బ్రహ్మజ్ఞాని గా కొనియాడబడినది. ఈమె సమాధి కూడ మనకు కందిమల్లాయపల్లె లో దర్శనమిస్తుంది. ఈశ్వరమ్మ నాయనమ్మ పేరు కూడా ఈశ్వరమ్మే..!
.
.
ఈశ్వరమ్మ(1703 - జూలై 12, 1803) ప్రముఖ యోగిని. ఈమె పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రెండవ కుమారుడు గోవిందయ్య సంతానం ఓంకారయ్య, సాంబమూర్తి, ఈశ్వరమ్మ, కాశమ్మ, శంకరమ్మ లలో ఒకతె. ఈమె గొప్ప యోగిని, మహమాన్వితురాలు. నిగ్రహానుగ్రమ సమర్థ. తాతకు తగ్గ మనుమరాలు. ఈమె వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి చెందక ముందే పుట్టినట్లు కొందరు, సమాధి చెందిన తరువాత పుట్టినట్లు కొందరు వ్రాసినారు.
.
.
ఈశ్వరమ్మ చిన్నప్పటి నుండియే తన ఈడుకు మించిన ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించింది. శారీరక సౌందర్యంతో పాటు ఆత్మ సౌందర్యంతో తల్లిదండ్రుల, సమకాలీనులైన పెద్దల మనసులు చూరగొన్నది. వీధిబడి చదువుల్లోనే రామాయణ భారత భాగవతముల సారం పుక్కిట బట్టినది. తాతగారి సమాధిని ఉదయాస్తమానములు సేవిస్తూ భక్తి జ్ఞానములు పండించుకొన్నది. ఒకసారి తండ్రి గోవిందయ్య నిద్రించి శయ్యవైపే సమాధినిష్టుడై మూడు దినాలదాకా ఉంటే, ఈశ్వరమ్మ గదితలుపులు మూసి దట్టాంగా సాంబ్రాణి పొగవేసి తండ్రిని మెలుకొలిపినది. ఆమె కుశ్రాగ్రబుద్ధికి సంతసించిన తండ్రి ఆమెకు కారణగురువైనాడు. రజయోగ రహస్యాలు బోధించినాదు. ఈశ్వరమ్మ పంచముద్రలు సాధిస్తూ 16 ఏండ్లు నిండేనాటికి నిండు పున్నమినాటి చంద్రునివలె యోగవిద్యలో ప్రవేశించింది.
.
.
ఒకనాడు రాజంపేట తాలూకా నగరపాడువాసి అయిన వీరబ్రహ్మేంద్రస్వామి గారి శిష్యుడు జగ్గరాజు, జగ్గమ్మ దంపతులకు వీరబ్రహ్మేంద్రస్వామి వరప్రసాదంగా రంగరాజు జన్మించాడు. ఆయన పెరిగి పెద్దవాడై ఆత్మవిదుడైనాడు. ఒకనాడు తన తండ్రికి వీరబ్రహ్మేంద్రస్వామి యిచ్చిన రాగి శాసనంలోని విషయం చూచి అక్షరపరతత్వాన్ని గ్రహించి, వీరబ్రహ్మేంద్రస్వామి కుటుంబంలోని కన్యను వివాహం చేసుకోవాలని తన తండ్రి అనుమతిపొంది కందిమల్లయ్యపల్లెకు చేరినాడు. అప్పటికి "గోవిందయ్య" కుమార్తె "ఈశ్వరమ్మ" ఒక్కతే వివాహం కాకుండా ఉంది. ఆయన గోవిందయ్య యింటికి పోయి వీరబ్రహ్మేంద్రస్వామి తన తండ్రికి యిచ్చిన రాగి శాసనము సంగతి తెలియబరచి గోవిందయ్య కుమార్తెను వివాహం చేసుకొనుటకు అంగీకారాన్ని కోరాడు. కానీ రంగరాజు క్షత్రియుడగుటచే గోవిందయ్య మరియు ఆయన సోదరుడు పోతులూరయ్యలు అంగీకరించలేదు. వీరబ్రహ్మేంద్రస్వామి సర్వమత సమదృష్టిని గూర్చి తెలియజేసినా వారు వినలేదు. తరువాత పోతులూరయ్య మరియు రంగరాజులు బనగానపల్లెకు పోయి వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో ఏదేని ఆధారం దొరుకుతుందోనని పరిశీలించారు. అందులో బ్రహ్మంగారు వ్రాసిన దేవరహస్యం ఎవరికి తోచినట్లు వారు అర్థం చేసుకున్నారు. రంగరాజు, ఈశ్వరమ్మలు పరస్పరం ప్రేమావలోకనంతో చూసుకొన్నారు. రంగరాజు స్వగ్రామమునకు పోయి తండ్రిగారి అనుమతితో 21-2-1717 న అగ్నికి ఆహుతి అయినాడు . ఆ వార్త తెలిసిన ఈశ్వరమ్మ తాను జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండి తపస్సు చేసుకోవటానికి నిశ్చయించుకున్నది. ఐతే బందువులు కులంవారితో పెళ్ళి చేయుటకు ఎంతో ఒత్తిడి తెచ్చారు. అయినా ఆమె నిశ్చయం మారలేదు. తర్వాత ఆమె ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది.
.
.
బ్రహ్మచర్యం-తపశ్చర్య మూలంగా ఆమె శరీరం వింతకాంతులతోను, ఆమె ముఖం బ్రహ్మవర్చస్సుతోనూ వెలిగేది. ఈశ్వరమ్మ మేనమామ ఆమె అందం చూసి మోహంతో బలాత్కరించబోయినాడు. అపుడు ఆమె అతనిని శపించింది. తత్ఫలితంగా అతడు కుష్టురోగిగ్రస్తుడైనాడు. ఈశ్వరమ్మ అమోఘ వచస్కురాలైనది. ఆమెకు నిగ్రహానుశక్తి కలిగినది ఒకనాదు కొందరు దొంగలు రేకులగుంట పాళెగాండ్రతో కలసి ఈశ్వరమ్మ సొమ్ములు, పట్టుచీరలు న్న పెట్టెను ఎత్తుకొనిపోయినారు. తమ పెట్టెల్లో దాచుకున్నారు. తనకు జరిగిన అపకారం దివ్యదృష్టితో గ్రహించిన ఈశ్వరమ్మ శపిస్తే ఆమె సొమ్ములు చీరలు పంచుకున్న వారి ఇండ్లలో వారి సొమ్ములు, బట్టలు కాలిపోయినవి. అది ఈశ్వరమ్మ మహిమగా గుర్తించిన దొంగలు ఆమె యెదుటికిర జడిసి ఆమె సొమ్ములు బట్టలు తెచ్చి మఠ ఆవరనలో పెట్టి పోయినారు. ఈశ్వరమ్మ త్రికాలజ్ఞాని అనీ, ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయురాలనీ తెలిసి జిజ్ఞానువులు ఆమె దరికి చేరి ఉపదేశం పొందేవారు. ఈశ్వరమ్మ తన తండ్రిగారి మఠంలో పూజాదికములు నిర్వహిస్తూ అప్పుడప్పుడు దేశ సంచారం చెస్తూ బ్రహ్మంగారి ప్రబోధలు ప్రచారం చేస్తుండేది.
.
.
ఒకసారి ఈశ్వరమ్మ దేశసంచారం చేస్తూ పొదిలె తాలూకా పెదారిగట్ల గ్రామానికి వెళ్ళింది. అక్కడి విశ్వబ్రాహ్మణులు కొందరామె మహాత్మ్యం పరీక్షింపదలచి దిగ్బంధన యంత్రం ప్రతిష్ఠించి దానిపైన ఆమె కూర్చుండి పూజ చేసుకోవటానికి ఫీఠం అమర్చారు. వారు చేసిన కపటం ఈశ్వరమ్మ గ్రహించి "మీ మంత్ర విద్య అంతా ప్రయోగించినారా?" అంటూ ఎవరూ కదపజాలని ఆ పీఠాన్ని ఎడమ చేతి బొటనవ్రేలితో జరిపినది. అందరూ ఆమెకు పాదాక్రాంతులై బ్రహ్మ రథ పట్టిపూజించి సమారాధన ఏర్పాటు చేసారు. భోజన సమయానికి పొరుగూరినుండి నెయ్యి రలేదు. ఈశ్వరమ్మ సమార్థన చేసేవారితో ఊరి చెరువుకు పోయి తనమాటగా గంగమ్మ తల్లినడిగి కావళ్ళతో నీళ్ళు తెమ్మన్నది. ఒకడు పోయి అట్లే చేసి గంగ తీర్థం తెచ్చాడు. ఆ తీర్థం నేయిగా మారినది. వడ్డన జరిగింది. అందరూ తిన్న తరువాత పొరుగూరి నుండి నేయి వచ్చింది. ఈశ్వరమ్మ ఆ నేయిని చెరువుకు తీసుకపోయి గంగమ్మకర్పించి రండన్నది. వారట్లే చేసారు. ఆ అధ్బుతం చూసిన కులజులే కాదు తదితరులు కూడా ఈశ్వరమ్మ మహినాన్విరువాలో గుర్తించి గౌవరించి పూజించారు.
ఈశ్వరమ్మకెందరో శిష్యులు. వారిలో అగ్రగణ్యుడు యోగి సుబ్బయ్య. అతడు ఈశ్వరమ్మకు చరుర్విధశుశ్రూషలు, మఠం సేవలు చేశేవాడు. ఆతర్వాత చాటకొండ చంగయ్య అనే శిష్యుడు కూడా ఆమె అనుగ్రహానికి పాత్రుడైనాడు.
.
.
ఈశ్వరమ్మ దాదాపు నూరు సంవత్సరాలు బ్రతికి సమాధి చెందే సమయం ముందుగానే చాటినది. అందువలన రెండు దినాలకు ముందే ఆమె భక్తులు, శిష్యులు దూరప్రాంతాలనుండి కందిమల్లయ్యపల్లెకు చేరినారు. ఆయమ్మ వారికి కాలజ్ఞానం బోధించింది. ఆమె శాలివాహన శకం రుధిరోద్గాది సంవత్సరం మార్గశిరబహుళ నవమి బుధవారం 1803, జూలై 12 న మఠం బాధ్యతలు శిష్యుడైన సుబ్బయ్యకు అప్పగించి సమాధి ప్రవేశించారు.
.
.
బ్రహ్మంగారి కుమార్తె వీరనారయణమ్మ సంతతికి చెందిన (ఏడవ తరం)వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి ప్రస్తుత 11వ మఠాధిపతి. ఈయన బ్రహ్మంగారి సాహిత్యం, సారస్వతాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చినారు. మఠంలో నిత్యాన్నదానం జరుగుతుంది. బ్రహ్మంగారి పేరుతో పలు విద్యాసంస్థలు వెలిసినాయి. సిద్దయ్య మఠము ఈశ్వరమ్మ మఠము చూడదగిన విషయములు కలిగిన స్థలములు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List