దుష్టగ్రహ బాధలు నివారించే భీమశంకరుడు. ~ దైవదర్శనం

దుష్టగ్రహ బాధలు నివారించే భీమశంకరుడు.


భోళాశంకరుని లీలలు అనంతం. సర్వవ్యాపకుడైన శివుడు అనంతనామధేయుడు. ఆ దయామయుడ్ని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. భక్తితో ఏది సమర్పించినా ముక్తి ప్రసాదిస్తాడు. కైలాసవాసిగా, మహేశ్వరుడిగా, కాలరుద్రుడిగా ఇలా అనేక పేర్లు కల్గిన ఆ మహాదేవుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపుడై భక్తులను కటాక్షిస్తున్నాడు. ఆ తేజోమయుడు కొలువుదీరిన మరో ప్రసిద్ధ క్షేత్రం ‘్భమశంకరం’. మన దేశంలో ఉన్న శివక్షేత్రాలలో విశిష్టమైనదీ క్షేత్రం.

అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆరవదిగా, ఈ క్షేత్రం పేర్గాంచింది. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ శివ సన్నిధి మహారాష్టల్రోని పూణె జిల్లాలో ఖేడ్ తాలూకాలో ఉంది. ‘్భమశంకరం’ సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉంది. కనుక భీమశంకరుడు కొలువుదీరిన ఆలయ పరిసరాలన్నీ ప్రకృతి అందాలతో భక్తుల్ని, పర్యాటకుల్ని అలరిస్తాయి. భక్తులకు కావాల్సినంత ఆధ్యాత్మికానందాన్ని, మానసికానందాన్నిస్తున్న భీమశంకరం ప్రాంతంలో భీమా నది ఆవిర్భవించింది. ఆ కారణంగా ఈ క్షేత్రానికి భీమశంకరం అని పేరొచ్చింది.
సాక్షాత్తు మహేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో కొలువుదీరిన భీమశంకరం దివ్యక్షేత్రం మహిమాన్వితమైనది. ఇక్కడున్న భీమశంకరుడి ఆలయం అతి పురాతనమైనది. అయినప్పటికీ ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు కొదువ ఉండదు. రోజూ వేలాది మంది భక్తులు ఇక్కడ భీమశంకరం జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. అతి పురాతన భీమశంకర ఆలయం కొన్ని వందల సంవత్సరాల నాటిదిగా అవగతమవుతుంది. పూర్వం రఘునాథ్ పీష్వా అనే శివభక్తుడు ఇక్కడొక నుయ్యిని తవ్వించాడు. అనంతరం పీష్వాల దీవాన్ నాడాఫడన్‌వీస్ ఇక్కడొక ఆలయాన్ని నిర్మించాడు. అలాగే పూణెకు చెందిన చిమణ్‌జీ అంతాజీనాయక్ క్రీ.శ.1437లో ఈ ఆలయ ప్రాంగణంలో సభామండపాన్ని నిర్మించాడు.

అతి పురాతన ఈ దివ్యాలయం పాతాళంలో ఉంటుంది. చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు విరబూసుకున్న కొండల మధ్య, లోయ భాగంలో ఈ మందిరం ఉంటుంది. అందువల్ల ఈ మందిరానికి వచ్చిన భక్తులు అక్కడ విధిగా నిర్మించిన మెట్ల మార్గం ద్వారా కిందికి దిగి భీమశంకరుడి ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.
పురాణగాథ: శివుడు ఈ క్షేత్రంలో కొలువుదీరి ఉండటానికి ఇక్కడ రెండు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడు దేవతలను, మునులను, అభాగ్యులను బాధిస్తూ ఉండేవాడు. వాడి ఆగడాలు భరించలేని మునులు, దేవతలు శివుడ్ని శరణువేడగా శివుడు త్రిపురాసురుడ్ని అంతమొందించాడు. శివుడికి, త్రిపురాసురుడికి మధ్య జరిగిన యుద్ధంలో అలసిపోయిన శివుడు శరీరం నుంచి ఓ స్వేద బిందువు పైకి ఉబికి పాయలుగా మారి కొలనుగా మారింది. అక్కడనుంచి భీమానది పుట్టింది. యుద్ధంలో అలసిపోయిన పరమేశ్వరుడు ఈ సహ్రాద్రి పర్వత శ్రేణి ప్రాంతంలో సేద తీరాడట. వారి అభీష్టం మేరకు ఆ మహాదేవుడు ఇక్కడ భీమశంకరుడి నామధేయంతో జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. కుంభకర్ణుడు కర్కటలకు పుట్టిన ‘్భమ’ నామధేయుడైన రాక్షసుడు తన తండ్రి మరణానికి శ్రీరాముడు, మునులు కారణమని భావించి శ్రీహరి సమేతంగా అందర్నీ మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బ్రహ్మ గురించి తపస్సు చేసి, బ్రహ్మ అనుగ్రహంతో అపార బలాన్ని పొందాడు. ఆ వరబలంతో దేవతలను, శ్రీహరిని తన వశం చేసుకున్నాడట. అనంతరం శివభక్తుడైన కామరూపేశ్వరుడ్ని హింసించి కారాగారం పాలుచేయగా, కామరూప్వేరుడు తనను రక్షించమని శివుడ్ని వేడుకున్నాడట. దయామయుడైన శివుడు కామరూపేశ్వరుడి మొర ఆలకించి శివలింగంలోంచి ఉద్భవించి ‘్భమ’ను అంతమొందించాడట. అనంతరం దేవతలు, మునుల అభీష్టం మేరకు భీమశంకర నామధేయంతో శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ వెలిశాడట.

చారిత్రకంగానూ, పౌరాణికంగానూ మహత్తుకల ఈ పుణ్యక్షేత్రం సందర్శనం సర్వపాపాలను హరిస్తుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. ఈ క్షేత్ర మహిమ అపారమైంది. ‘శివలీలామృతం’, ‘గురుచరిత్ర’, ‘స్తోత్ర రత్నాకరం’ వంటి ధార్మిక గ్రంథాలలో భీమశంకరం మహత్తు గురించి ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఛత్రపతి శివాజీ, రాజారామ్ మహరాజ్ తదితర మహనీయులు ఈ క్షేత్రంలోని భీమశంకరుడ్ని దర్శించి స్వామి ఆశీస్సులు పొందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అతి పురాతన ఈ దివ్యాలయంలో స్వామివారికి ఎదురుగా రెండు రాతి నందులుంటాయి. ఇక్కడే మరోపక్క శని దేవుడు కొలువుదీరాడు. ఇంకోపక్క శ్రీరామ మందిరం, ఆంజనేయస్వామి మందిరం, పార్వతి మాత మందిరాలున్నాయి. భీమశంకరం ప్రకృతి అందాలకు వేదిక. ఇక్కడున్న కోకణ్‌గార్ లేదా నాగ్‌ఫణ్ అనే ప్రదేశం చాలా భీతికల్గిస్తుంది. మూడువేల అడుగుల ఎత్తునగల ఈ ప్రదేశంనుంచి చూస్తే కోకణ్ ప్రదేశమంతా కనిపిస్తుంది. ఇక్కడే అతి పురాతన కమలజామాత మందిరం కూడా ఉంది. బ్రహ్మదేవుడు ఇక్కడ అమ్మవారిని కమలాలతో పూజించడం వల్ల అమ్మవారికి కమలజా మాత అని పేరొచ్చింది.

అతి పురాతన భీమశంకరం దివ్యక్షేత్రంలో కార్తీక, మాఘ మాసాలలో అత్యంత ఘనంగా పూజలు జరుగుతాయి. ఆయా పుణ్య దినాలలో భక్తులు పోటెత్తుతారు. అలాగే ఇక్కడ స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతాయి. భీమశంకరం క్షేత్రం పట్టణ వాతావరణానికి దూరంగా ఉండడంవల్ల ఇక్కడ వసతి సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. భీమశంకరం పూణెకు 125 కిలోమీటర్లు దూరంలో ఉంది. పూణె-ముంబాయి బస్సు మార్గంలో ఉందిది. ఇక్కడ స్వామిని దర్శిస్తే దుష్టగ్రహ పీడ నివారణమవుతుందంటారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List