మహిషాసురుని పుట్టుక.. ~ దైవదర్శనం

మహిషాసురుని పుట్టుక..

దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన ‘మహిషాసురుడు’ తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి, మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ‘మహిషాసురా.., ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు.‘పితామహా.,నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు’ అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ‘మహిషాసురా..పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.., గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు సకలప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకూ, మహాపర్వతాలకూ కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతివిరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక,నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి, మరే వరమైనా కోరుకో’ అన్నాడు. అప్పుడు మహిషాసురుడు ‘విధాతా..అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే.. ఆడది నా దృష్టిలో అబల..ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక.,పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు’ అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. మహిషాసురుడు సంబరపడుతూ తన రాజధానికి చేరుకున్నాడు. వరబలదర్పితుడైన మహిషాసురుడు..తన పరాక్రమ ప్రదర్శనకు ముహూర్తం నిర్ణయించి యుద్ధప్రయత్నాలు ప్రారంభించాడు. చిక్షురుని సేనాధిపతిగా, తామ్రుని కోశాధిపతిగా, అసిలోమ, బిడాల,బాష్కల, త్రినేత్ర, కాలబంధకాది రాక్షసులను దండనాయకులుగా నియమించి జైత్రయాత్రకు బయలుదేరాడు. భూమండలంలోని సకలరాజులు మహిషుని పరాక్రమానికి తలవొంచి, సామంతులై, కప్పాలు కట్టడానికి సిద్ధపడ్డారు.

బ్రాహ్మణులందరూ మహిషునికి వశమై, యఙ్ఞయాగాదులలో దేవతలతో సమానంగా అతనికి హవిర్భాగాన్ని పంచుతున్నారు. పృధ్వీమండలమంతా మహిషుని పాదాక్రాంతం అయింది. ఇప్పుడు మహిషుని దృష్టి స్వర్గం మీదకు మళ్లింది. ధాన్ని స్వాధీనం చేసుకోవాలని సంకల్పించాడు. వెంటనే ఒక దూతను ఇంద్రుని దగ్గరకు పంపాడు. ఆ దూత దేవేంద్రుని దగ్గరకు వెళ్లి ‘మహేంద్రా..నేను మహిషాసురుని దూతను. నా ప్రభువు వెంటనే నిన్ను స్వర్గం విడిచి వెళ్లిపొమ్మన్నాడు. లేదా అమరుడివైనా నీకు మరణం తప్పదని హెచ్చరించమన్నాడు’ అని మౌనం వహించాడు. ధూత మాటలు విని ఇంద్రుడు క్రుద్ధుడై, ‘వరబలం ఉందికదా అని మహిషుడు విర్రవీగుతున్నాడు కాబోలు. మహేంద్రునితో యుద్దం అంటే మృత్యువుతో సమానమని ఎరగడేమో. బుద్దిగా గడ్డితింటూ బ్రతకమను. లేదా, వాడి కొమ్ములు విరిచి ప్రాణాలు తీస్తానని చెప్పు. దూతవు కనుక నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను వెళ్లు’ అన్నాడు. ఆ దూత వెళ్లి ఇంద్రుని ప్రతిసందేశాన్ని యథాతథం మహిషునికి వినిపించాడు. మహిషిసురుడు కుపితుడై.., సర్వసైన్యాన్ని యుద్ధానికి సంసిద్ధం చేసి స్వర్గంమీదకు దండయాత్రకు బయలుదేరాడు. ఈలోగా ఇంద్రుడు సకల దేవగణాలనూ సమావేశపరచి, దేవగురువు బృహస్పతితో సమాలోచన చేసి, మహిషునితో యుద్ధం అనివార్యం అని నిశ్చయించి.. దేవగణాలతో వెంటబెట్టుకుని, త్రిమూర్తులను కలిసి, మహిషునితో జరగబోయే యుద్ధంలో తనకు సహాయంగా రమ్మని అర్థించాడు. త్రిమూర్తులు అంగీకరించి ఇంద్రునితో కలిసి యుద్ధరంగానికి బయలుదేరారు. దేవదానవుల మధ్య భీకరయుధ్ధం ప్రారంభమైంది. ముందుగా చిక్షురుడు గజారూఢుడై ఇంద్రునితో యుద్ధానికి దిగాడుగానీ, ఇంద్రుని దెబ్బకు మరుక్షణంలో మూర్ఛబోయాడు. అదిచూసి బిడాలుడు ముందుకువచ్చి తన అస్త్రవిద్యా పాండిత్యాన్ని ప్రదర్శించాడు. కొంత సేపు భీకర సంగ్రామమే జరిగిందనే చెప్పాలి. కానీ, ఇంద్రుడు తన కుమారుడు జయంతునితో కలిసి బిడాలుని చంపేసాడు. దేవగణాలు ఇంద్రుని మెచ్చుకుని దుందుభులు మ్రోగిస్తూ తమ సంతోషాన్ని ప్రకటించారు. వెంటనే మహిషాసురుడు తామ్రుని పంపాడు. యముడు దండపాణియై ఇంద్రునికి సహాయంగా నిలిచాడు.

యముని దండాయుధ ఘాతానికి తామ్రుడు చలించకుండా నిలబడ్డంచూసి యముడు ఆశ్చర్యపోయాడు. తామ్రుని యుద్ధవిద్యా నైపుణ్యానికి అష్టదిక్పాలకులు ఆశ్చర్యపోయి, ఒక్కుమ్మడిగా విజృంభించి, తామ్రుని సంహరించారు. అదిచూసి, మహిషాసురుడే స్వయంగా యుద్ధానికి దిగాడు. కొంతసేపు తన యుద్ధకళా ప్రతిభను దేవసైన్యానికి ప్రదర్శించాడు. మహేంద్రుడు దేవతలతో కలిసి మహిషునికి గట్టి పోటీనిచ్చాడు. దానితో విసుగు చెందిన మహిషుడు సర్వలోక సంహారకమైన తన శాంబరీవిద్యను ప్రయోగించాడు. అంతే..వందలు, వేలు సంఖ్యలో మహిషాసురులు ఉద్భవించి, దేవ సైన్యంమీద విరుచుకు పడ్డారు. వారి ధాటికి సకల దేవగణాలు చెల్లాచెదురైపోయాయి. ఏం జరుగుతోందో తెలియక ఇంద్రునికి మతిపోయింది. ఏం చేయాలో తోచక దిక్పాలకులు నిశ్చేష్టులై నిలబడిపోయారు. మహేంద్రుడు విష్ణువును శరణుకోరాడు. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది మహిషుని శాంబరీవిద్యను ఛిన్నాభిన్నం చేసింది. అదిచూసి మహిషుడు..అసిలోమ, త్రినేత్రక, బాష్కల, అంధకాది దండనాయకులతో కలిసి విష్ణువు మీదకు యుధ్ధానికి దిగి, శరవృష్టి కురిపించాడు. విష్ణువు ఆ శరజాలాన్ని తన బాణ పరంపరతో నిరోధించి, తన గదను ప్రయోగించాడు. ఆ గదాఘాతానికి మహిషుడు మూర్ఛబోయి, అంతలోనే తేరుకుని తిరిగి శ్రీహరితో యుద్ధానికి దిగాడు. శివునితో.,అంధకుడు, యమునితో.,త్రినేత్రుడు, వరుణునితో., అసిలోముడు యుద్ధం చేస్తున్నారు. ఎవరికి ఎవరూ తీసిపోవడంలేదు. పదిహేను రోజులు దేవదానవుల మధ్య భీషణ సంగ్రామమం జరిగింది. విసుగు చెందిన మహిషుడు ఒక పరిఘను శ్రీహరి మీదకు విసిరాడు.

ఆ దెబ్బకు శ్రీహరి మూర్ఛబోయాడు. అది చూసి గరుత్మంతుడు శ్రీహరిని వైకుంఠం తీసుకుబోయాడు. అంత వరకూ శక్తివంచన లేకుండా యుద్ధం చేస్తున్న శంకరుడు., మహిషుని జయించడం అసాద్యమని గుర్తించి త్రిశూలం భుజాన వేసుకుని కైలాసం చేరుకున్నాడు. హరిహరులే పలాయనం చేయగాలేనిది నేను చేస్తే తప్పేమిటి అనుకుని బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి సత్యలోకం చేరుకున్నాడు. త్రిమూర్తులు యుద్ధరంగం వదిలి పారిపోవడంతో రాక్షసవీరులు రెట్టించిన ఉత్సాహంతో దేవతలమీద విరుచుకుబడి వీరవిహరం చేసారు. రక్షించేనాథుడు లేక దిక్పాలకులతో సహా దేవసైన్యం భయంతో నాలుగు దిక్కులకు పారిపోయారు. అప్పటికి మహిషుని గెలవలేమని గ్రహించిన మహేంద్రుడు ఐరావతం మీదనుంచి దుమికి పారిపోయాడు. అది చూసి మహిషుడు విజయగర్వంతో వికటాట్టహాసంచేసి, ఐరావతం ఎక్కి స్వర్గం వెళ్లి ఇంద్ర సింహాసనం ఎక్కి, తన దానవులను దేవతల పదవులలో నియమించి, తన తండ్రి ఆశయంమేరకు విశ్వవిజేతయై, త్రిలోకాధిపతిగా అభిషిక్తుడయ్యాడు.

దానవ వంశానికి మూలపురుషుడైన ‘దనువు’కు… రంభుడు, కరంభుడు అని ఇద్దరు కుమారులు. వీరిద్దరు పుట్టుకతో దానవులైనా.. గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాళ్లు అని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికి ఉన్న ఒకేఒక లోపం సంతానం లేకపోవడం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు. కరంభుడు ‘పంచనదం’ అను మడుగులో దిగి ఒంటి కాలిమీద తీవ్రతపస్సు ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాలవృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్ఠతో అగ్నిదేవుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. కాలంతోపాటు వారిరువురి తపస్సుకూడా వేగంగా సాగుతోంది. వారి తీవ్రతపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది. అంతే.., మొసలి రూపం ధరించి, కరంభుడి పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి, రంభుడు తీవ్రవేదనకు గురయ్యాడు. ఇంద్రుని చంపేయాలనిపించింది. కానీ, తపోదీక్షితుడు క్రోధోద్రిక్తుడు కారాదు అనే ధర్మానికి కట్టుబడి.. శాంతచిత్తుడై ఆలోచించి., తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని., ఎడమచేతితో తన జుత్తు పట్టుకుని, కుడిచేత్తో తలను ఖండించుకోబోయాడు. మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై., ‘రంభాసురా., ఏమిటీ నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో’ అన్నాడు.

‘హుతవాహనా, అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ, ఇంద్రపదవిని ఆశించి మేమీ తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసికూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముని చంపి మా దానవజాతికి తీరని మహాపరాథం చేసాడు. అందుకు ప్రతీకారంగా.,సర్వప్రాణిగణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకలలోకవందితుడు, త్రిలోకవిజేత అయిన పుత్రుని నాకు వరంగా అనుగ్రహించు’ అని కోరుకున్నాడు రంభాసురుడు. ‘రంభాసురా., నీ మనసు ఏ కామినిమీద కామవశీభూతమౌతుందో, ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు’ అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగివస్తూ మార్గమధ్యంలో యక్షవిహారభూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూసాడు. అక్కడ ఒక మహిషి(గేదె) కామార్తయై విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుని మనస్సు చలించి, దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయింది. రంభుడు సంతోషించి, ఆ మహిషిని తన పాతాళనగరానికి పట్టమహిషిని చేసి, దాని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు.

ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగ్రుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడిచింది. దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్లముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూంటే, దాని వెంటబడింది ఆ దున్నపోతు. నిండుగర్భంతోనున్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్షవిహారభూమిని చేరి, అక్కడున్న యక్షులను శరణు కోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగయితేనేం యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం యక్షులు ఆ రాజమహిషాన్ని ఓదార్చి, రంభాసురుని మృతదేహాన్ని చితిపైకి చేర్చి, నిప్పుపెట్టారు. తన ప్రాణనాథుని పార్థివదేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతూంటే చూసి తట్టుకోలేక, ఆ రాజమహిషి పరుగుపరుగున వచ్చి, రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూండగా., ఆ చితిమంటలనుంచి ‘మహిషాసురుడు’ ఆవిర్భవించాడు. వాడే రంభాసురుని కుమారుడు. మహిష-రాక్షస సంగమ సంజాతుడు. ‘మహిషాసురుడు’ తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళరాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. మరణించిన రంభాసురుడు పుత్రవ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి ‘రక్తబీజుడు’ అనే పేరుతో ‘మహిషాసురుని’ ఆంతరంగిక అనుచరుడయ్యాడు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List