చివటం అమ్మ.. ~ దైవదర్శనం

చివటం అమ్మ..

ఆధ్యాత్మిక దివ్యజ్యోతి అవధూత చివటం అమ్మ.

 సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకృతిలో వివిధ రూపాలలో ఎంత శోభాయమానంగా మన దృష్టిని ఆకట్టుకుంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతతో మనల్ని ఆకర్షిస్తాయి. కానీ ఇవన్నీ ఏ ఆకాశములోనయితేవున్నాయో అది వాస్తవానికి వీటన్నిటికంటే అద్భుతమైనదయినా మనలను ఆకట్టుకోదు. పరిపూర్ణ అవధూత స్ధితిలో వున్న మహాత్ములు కూడా, మనలను చిల్లర మహిమలను మంత్ర శక్తులను ప్రదర్శించేవారిలా ఆకర్షించరు. అటువంటి మహాత్ముల కోవకు చెందిన వారే అవధూత చివటం అమ్మ.      సాధు అమ్మగా ప్రసిద్ధి గాంచిన దిగంబరయోగిని చివటం అమ్మ అసలుపేరు అచ్చమ్మ. తణుకు సమీపాన గల చివటం గ్రామములో సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించిన ఈ తల్లి, భర్త బాధ్యతా రాహిత్యంగా తిరిగినా ఇరుగు పొరిగిండ్లలో పనిచేసి భర్తకు, బిడ్డకు వండిపెట్టేవారు. భర్త దుర్మార్గుడయి కొట్టినా పల్లెత్తి మాట అనేది కాదు. ఆమెకు రామనామమంటే ప్రీతి. గ్రామస్థుల దగ్గర అడిగి తెచ్చిన బియ్యం, పప్పు వండి పిల్లలందరికీ తినిపించటం ఆమెకు ఇష్టమయిన పని. కాలాన్ని వ్యర్ధంగా గడపక, పనిచేసే సమయములో కూడా రామనామాన్ని స్మరిస్తూవుండేవారట. ఖాళీ దొరికితే ధ్యానానికి కూర్చొనేవారు. అటువంటి అచ్చమ్మ ఒక రోజు కొడుకును తన తల్లికి అప్పజెప్పి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. కొన్నాళ్లు ఆమె చిన్నాయి గూడెంలో వున్నారు. ఆ రోజులలో ఆ తల్లి నోటివెంట కృష్ణా, రామా అనే పదాలు తప్ప మరేమీ వచ్చేవి కావు. తరువాత మన్నెం జగన్నాధపురం వెళ్ళి ఆ ప్రాంతంలో 12 సంవత్సరాలు మౌనంగా కఠిన దీక్షలు చేసారట. అక్కడ ఎన్నోలీలలు ప్రదర్శించేవారని ఇప్పటికీ చెప్పుకుంటారు. రాజమండ్రి స్త్రీల మఠములో కొంతకాలముండి, చివటం చేరారు.      చివటంలో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడక తన్మయస్థితిలో బట్టలు కూడా జారిపోతున్నా తెలియని స్ధితిలో వుండేవారు. ఒక రోజు జారిపోతున్న తన చీరను తీసి ఒకబాలునిపై వేసి అప్పటి నుండి దిగంబరంగా వుండిపోయారు. అమ్మ చివటం సమీపములో జమ్మిచెట్టుక్రింద ధ్యానం చేసుకుంటుండేవారు. ఎవరయినా అడిగితే కాయలు కాయని చెట్టుక్రింద కూర్చోవాలి అనేవారు.      ఎక్కువ కాలం అమ్మ స్మశానములో గడిపేవారు. అప్పుడప్పుడూ మూడు ఇళ్లకు మాత్రమే భిక్షకు వెళ్ళేవారు. భిక్ష చేతిలో వుంచుకుని పరుగులు తీసేవారు. తన గురించి, శరీరస్ప్రహే లేకుండా చిదానంద స్థితిలో వుండే ఆమెకు గ్రామములోనివారే మంచిచెడ్దలు చూసేవారు. శేషమ్మగారని ఒకావిడ బలవంతంగా తీసుకెళ్ళి స్నానము చేపించేవారు. చివటములో అలా 12 సంవత్సరాలు ధ్యానంలో గడిపారు.      మహాత్ములు కూడా ఆమె దర్శనము కోసం వచ్చేవారు. అయితే వచ్చిన వారిపాదాలను తాకి నమస్కరించేవారు అమ్మ. ఎదగటంలో ఎలావొదగాలో సాధకులకు చేసి చూపించారు అమ్మ. సాధూరాం బాబాజీ శిష్యులయిన హఠయోగి అప్పారావుగారికి కూడా అమ్మ అలా నమస్కరించబోగా ఆయన బాధపడి, అమ్మా నువ్వుపండిపోయావు నేనింకా పండవలసినవాడిని అని అన్నారు. ధ్యానం ఎలా చెయ్యాలి అని అడిగిన భక్తులతో, మొదట ఓమ్ కారం చెయ్యాలి ఆ తర్వాత రామరామ అనుకుంటూ మౌనంగా కూర్చోవాలి. ధ్యానములోంచి లేచేటప్పుడు కూడా, ఓంకారం చేయాలి. చీపురు  పెట్టి తుడిస్తే వాకిట్లో ఎంత శుభ్రంగా ఉంటుందో అలాగే ఓంకారం చేసినప్పుడు కూడా మనసులో మాలిన్యము తొలగి పోతుంది అని చెప్పారు. ఆధ్యాత్మికోపన్యాసాలు వినడం *కూర* అంత వినాలి, ధ్యానం *అన్నమంత* చేయాలి అనేవారు. ధ్యానం బంగారు ముద్దవంటిది, దానికి మించినది లేదు. అనిచెప్పేవారు, అండు కొరకు ఎటువంటి నిబంధనలు అక్కరలేదనేవారు. కాలు కడుక్కోక పోయినా పరవాలేదు రామరామా అనుకోండే అనేవారు. నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి ఎంత తాపయత్ర పడతామో అంతకన్నా ఎక్కువ ఆత్రుత పడాలి దైవం కోసం అనేవారు అమ్మ. రామాలయములో నివసిస్తూ స్వయంగా వంట చేసి అందరికీ తల్లిలా తిని పిస్తుండేవారు ఆ మహాత్మురాలు. తన సమాధిని ముందుగానే సూచించారు అమ్మ. మహాసమాధికి వారం రోజుల ముందు తన పంటిని పీకించి సూరమ్మ అనే భక్తురాలికిచ్చి దాచుకోమన్నారు. 1981 జూన్ 8 వతేదీ అర్ధరాత్రి కావస్తుండగా తన భక్తులను కూచోబెట్టుకుని .. ఎవరైనా ఏదన్నా అంటే మనం పది మాటలు అన కూడదు. ఎప్పుడూ దృఢంగా వుండాలి, గుమ్మములోనికి వచ్చిన వారికి ఒక ముద్దచేతిలో పెట్టి నీరు ఇవ్వాలి అని చెప్పారు. తరువాత గీత చదివించుకుని విన్నారు. తరువాత కొబ్బరికాయ కొట్టించి హారతి ఇప్పించుకుని ప్రశాంతంగా దేహత్యాగం చేశారు అమ్మ. సమాధి అయిన వెంటనే వచ్చిన వాడపల్లి బాబుగారు శిరస్శు చూసి అమ్మ కపాలభాగం చిట్లి రక్తం గడ్డకట్టి ఉన్నదని,  అమ్మ బ్రహ్మరంధ్రంగుండా శరీరాన్ని విడిచారని చెప్పారు. ఇక్కడికి ఎందుకొచ్చామే పిడకలెరు కోవటానికా? రామరామ అను కోండే అని తన చుటుపక్కల వారికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరణ ద్వారా చూపిన ఆసద్గురువు పాద పద్మాలకు మనసారా నమస్కరించు కుందాము.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List