కంచి సరస్వతి – శృంగేరి భారతి.. ~ దైవదర్శనం

కంచి సరస్వతి – శృంగేరి భారతి..

ఈరోజు (మహాలయ అమావాస్య) దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం 34 పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి ఆరాధనా మహోత్సవాల సందర్భంగా 

ఇద్దరు జీవన్ముక్తులు సమకాలీనులుగా మహోన్నతములైన రెండు శంకర పీఠములకు దాదాపు 40 సంవత్సరములు అధిపతులుగా ఉండడం ఎంతో అరుదైన విషయం. విచిత్రంగా ఇద్దరి పేర్లు కూడా ఒక్కటే. కంచి మహాస్వామి వారు 1907లో పీఠాధిపత్యానికి వచ్చారు. తరువాతి సంవత్సరము అఖిలాండేశ్వరీ ఆలయ ప్రతిష్ఠకు జంబుకేశ్వరం వెళ్ళారు. అక్కడ భారతీ స్వామి వారి గురువుగారైన శివాభినవ నృసింహభారతీ స్వామివారిని యాదృచ్ఛికంగా చూశారు. వారు కూడా వీరిని చూశారు. ఈ సందర్భంలో కంచి స్వామివారు “వారిని చూడాలని ఆసక్తిగా ఉన్నందువల్ల చూశామనీ, వారికీ చూడాలనిపించిందేమో మరి చూశారనీ” చెప్పారు. మొత్తానికి ఒకరినొకరు చూసుకున్నారు. బహుశః ఆరోజున శ్రీ శివాభినవ నృసింహభారతీ స్వామివారికి కంచి స్వామివారిపై జనించిన ప్రియం వల్లనే తమ అత్యంత ప్రియ అంతేవాసులకు ఆ పేరుంచారేమో! ఆ యోగపట్టా “చంద్రశేఖర భారతీ” అని నృసింహ భారతీ స్వామివారు నిర్ణయించినదేనని “Mystic and Seer” లో స్పష్టపరచబడి ఉంది. శృంగేరీ పీఠపరంపరలో దదాపు 450 సంవత్సరములకు ముందు మాత్రమే ఈ పేరున్న స్వామివారున్నారు. శృంగేరీ సంప్రదాయంలో పది ఆశ్రమ నామాలలో (తీర్థ, అరణ్య, భారతీలాంటివి) ఏవయినా పెట్టుకోవచ్చు. అయితే సరస్వతి అనే అర్థం వచ్చే భారతీ పేరే పెట్టడం కూడా కాకతాళీయమైనా ఎంతో బాగుంది.

ఒక్క పేరులోనే కాదు. ఈ మహాస్వాములిద్దరికీ అనేక పోలికలున్నాయి. వీరిరువురికీ ఒకరిపై వేరొకరికి ఎంతో ఆదరాభిమానాలున్నాయి. భారతీస్వామివారి నిరంతర ఆత్మనిష్ఠను వేనోళ్ళ కొనియాడతారు కంచిస్వామి వారు. వీరి నియమ నిష్ఠలకు, ఆచారానుష్టానాలకు బ్రహ్మరధం పడతారు శృంగగిరి పీఠాధీశ్వరులు. ఇందులో ఒకరు హోయసల కర్ణాటక బ్రాహ్మణులు. తమిళ దేశంలో పీఠాధిపతులయ్యారు. వేరొకరు ములికినాటి తెలుగు బ్రాహ్మణులు. కర్ణాటక దేశంలో పీఠాధీశ్వరులు. కంచిస్వామి వారి పూర్వీకులు కంచి పీఠానికి, శృంగేరీ స్వామివారి పూర్వీకులు శృంగేరీ పీఠానికి ఎనలేని సేవ చేశారు. ఇద్దరు పీఠాధిపతులు మొదట ఇంగ్లీషు చదువులో ప్రవేశ పెట్టబడి అసమాన ధీవిశేషాన్ని ప్రదర్శించారు. ఇద్దరి తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రభుత్వోద్యోగాలలో ప్రవేశించాలని కోరుకున్నారు. ఇద్దరూ అప్పటి పీఠాధిపతులనే తమ తదనంతర పీఠాధిపతులుగా గుర్తింపబడి పరమాదర పాత్రులయ్యారు. అప్పటి కంచి పీఠాధిపతులు వీరు వచ్చేటప్పటికి కాలవిలంబనమవుతుందని శాస్త్రవిధిన వీరికి కాషాయం, దండం, కమండలం సిద్ధం చేసి ఉంచారు. కంచిస్వామి వారి పెత్తల్లి కుమారునికి పీఠాధిపత్యం ఇచ్చి వారు సిద్ధించారు. అయితే విధి విలాసమో, పరమ గురు సంకల్ప బలమో మహాదేవేంద్ర సరస్వతీ స్వామి వారు అనతి కాలంలోనే సన్నిపాత జ్వరంతో పరమగతి పొందారు. కంచిస్వాములు కలవై చేరేటప్పటికి వారు దీక్ష నిచ్చే స్థితిలో కూడా లేరు. పరమ గురువులు నిర్ణయించిన విధంగా, వారు వీరికి సిద్ధం చేసి ఉంచిన కాషాయదండ కమండాదులతో, తాము లేని పక్షంలో వీరికి ఏ రకంగా సన్యాసం ఇవ్వాలని పరమ గురువులు నిర్ణయించారో ఆవిధంగా సన్యాసమియ్యబడింది. భారతీ స్వామివారికి కూడా వారి గురువు నిర్ణయించిన విధంగా వారు సిద్ధిపొందిన తరువాత 27వ రోజున పీఠాధిపత్యమీయబడింది. ఇరువురికీ గురువుల ప్రత్యక్ష పర్యవేక్షణ లేదు. 

సహజ విరాగులయిన భారతీస్వామి అచిరకాలంలోనే పీఠ వ్యవహారాలను యాజమాన్యంపై వదిలివేసి, బ్రహ్మానుభవమగ్నులై ఎప్పుడో క్వచిత్తుగా మాత్రమే బాహ్య స్మృతిలో ఉండేవారు. కంచి స్వామివారు బ్రహ్మానుభవమగ్నులుగా ఉన్నప్పటికీ, వారణాసీ విజయయాత్ర తరువాత మఠ బాధ్యతలు తగిన వారసునికి అప్పగించి తాను ఏకాంతవాసం చేయాలని ఆకాంక్షను అనేకసార్లు వ్యక్తీకరించినప్పటికీ తమ పీఠ బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని నిరంతర ధర్మ ప్రచారం చేసేవారు. దీనికి వారు భారతీస్వాముల వారి వద్దకు ప్రతినిధులను పంపేవారు. “వారు బాహ్యస్మృతిలో ఉండరే! కలిసేదేలా?” అనుకుంటుంటే కంచిస్వామి ప్రయత్నించండి అనేవారట. అదేమి ఆశ్చర్యమో కంచి ప్రతినిధులు వెళ్ళే రోజునే భారతీ స్వామికి బాహ్యస్మృతి కలిగేది. ఎంతో ఆప్యాయంగా “పెద్దలు మద్యార్జునంలో చాతుర్మాస్యం చేస్తున్నారా” అని ఆరంభించేవారు. ప్రతినిధులు వచ్చిన కార్యం, కంచి స్వామివారి పథకం వివరిచారు. చిరునవ్వులు చిందే ప్రశాంత వదనం ఆనందంతో వెలిగిపోతుంది. మధ్యలో తమ ఆమోదం తెలియజేసే వాక్యాలు సుతిమెత్తగా వచ్చాయి.

“ఆయన ఒకరే ఆత్మానిష్టులయి ఉండి కూడా ప్రపంచం కోసం ఇలాంటి పధకాలు వేయగలరు. ప్రజలనాడి నెరిగి ప్రణాళిక వేస్తారు. అదే సమయంలో శాస్త్ర ఉల్లంఘన కాకుండా జాగ్రత్త తీసుకుంటారు. అందువలనే ఆధునికులు కూడా వారి పథకాలకు ఆకర్షితులవుతున్నారు. వారికి ఏ పధకాలు అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తాయో బాగా తెలుసు. వారు ఆ కార్యక్రమాలు మా తరపున కూడా నిర్వహిస్తున్నారు. మా సంపూర్ణ అంగీకారంతో పాటు వారికి కృతజ్ఞతలు కూడా తెలియచేయాల్సి ఉన్నది” అనేవారు. ప్రతినిధులకు సత్కారం కూడా చేసారు. ఇక్కడకు తిరిగి వస్తే ప్రతినిధులకు ఎదుర్కోలు సన్నాహమే జరుగుతుంది. ఆనందంతో వెలిగిపోతున్న కంచిస్వామి అంతటి తేజస్విని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? అదంతా వారి తపోనిష్ఠ ఫలితం – వారి పూర్వాశ్రమం కుటుంబ ఔన్నత్యము, వారి పూర్వ, పీఠాచార్యుల మహోన్నతము కూడా దానికి కారణం అంటూ శ్లాఘిస్తారు. 

ఒకప్పుడు శృంగేరీ పీఠ అనునాయులు, కంచిస్వామి వారు శృంగేరీ పరంపరా ప్రాప్త శిష్యవర్గముండే తిరునల్వేలి ప్రాంతాలతో పర్యటిస్తున్నారని ఫిర్యాదు చేశారట. దానికి శృంగేరీ భారతీస్వామీ ఎంతో సంతోషించి మన పనికూడా వారు చేస్తున్నందుకు కృతజ్ఞత చూపక ఫిర్యాదులెందుకన్నారట. కొంతమంది భక్తులు స్వామిని విస్తృత పర్యటన చేయమని, సందేశాలివ్వమని వత్తిడి చేసేవారట. దానికి వారు “అద్వైత సంప్రదాయానికి మేము, కంచివారు ప్రస్తుత ప్రతినిధులము. వారు చేసే మంచి పనులన్నీ మేము కూడా చేసినట్లే. వారి కీర్తి మన సంప్రదాయానికే సంప్రాప్తిస్తుంది” అనేవారు.

1925 సంవత్సరపు చాతుర్మాస్యాలకు ఈ స్వామివార్లిద్దరూ తమిళనాడు పుదుక్కోట సంస్థానంలో ఉన్న ఇలయాట్రం గుడి, కున్రత్తూరు గ్రామాల్లో విజయం చేసి ఉన్నారు. అక్కడి పండితులిక్కడికీ, ఇక్కడి పండితులక్కడికీ వెళుతుండేవారు. ఇరువురు స్వాములు వారినందరినీ గౌరవించి ఒకరి గురించి ఒకరు గౌరవంగా ప్రస్తుతించేవారట. 

ఇదే కాలంలో శృంగేరీ స్వామి తమ పరంపరా ప్రాప్తమైన శిష్యులున్న పన్రత్తూరు గ్రామంలో విడిది చేసి వెళ్ళిపోయిన రోజున కంచిస్వామికి ఆ ఊరిలో పెద్ద ఎత్తున పట్టణప్రవేశం జరిపించడానికి ఏర్పాట్లు జరిగినాయి. శృంగేరీ అనునాయులు భారతీ స్వామి వద్దకు పోయి ఇది ఉచితం కాదని మనఃస్తాపాన్ని వెలిబుచ్చారు. మరి స్వామివారో! ఎంతో సంతోషంగా ఈ ఊరిలో (తమ ప్రియశిష్యులున్న ఊరిలో) కంచిస్వామి హోదాకు ఏ మాత్రం తక్కువ కానివిధంగా పట్టణ ప్రవేశం జరగాలని కట్టడి చేస్తూ, తమ బోయీలను కంచిస్వామి పల్లకి మోయడానికి పంపారు.

వారి ప్రారబ్ధ కర్మ క్షయమైనది – యీ అవతార శరీరమునకు హేతువైన కర్మక్షయమగుటవలన తామీ దేహమును త్యజించవలసియున్నదని శ్రీ జగద్గురువులు గ్రహించి – పూర్వ మహర్షులు చేసిన విధముగా తామే దేహత్యాగమును చేయుటకు నిశ్చయించిరి. 1954వ సంవత్సరము సెప్టెంబరు 26వ తేదీ ఆదివారం (మహాలయామావాస్య) నాడు బ్రాహ్మీముహూర్తమున నిద్రలేచిరి. అప్పటికింకా చీకటిగానే యున్నది. ఆయన తుంగానది వైపునకు నడచిరి. పరిచారకుడొకడు ఆయనవెంట కొంతదూరము నడచెను. శ్రీ జగద్గురువులు నీటిలో దిగిరి. పరిచారకుడు “అచ్చట చాలలోతు” అనెను. శ్రీ జగద్గురువులు శాంతముగా “నాకు తెలియును” అని ముందుకు సాగి ఒక మునుగు మునిగి లేచి ప్రాణాయామము చేసి సంకల్పము చేసి మరొకసారి మునిగిరి. ఒకటి రెండు సెకండ్లలో ఆయన దేహము నదీ ప్రవాహమున ముందుకు పోయెను. గట్టుపైనున్న పరిచారకుడు ఆందోళనతో నీటదూకి శ్రీ జగద్గురువుల దేహమును పట్టుకొనెనే కాని ఆ ప్రయత్నములో స్మృతి గోల్పోయెను. గట్టుమీద కొంత దూరమునందుండి పరిచారకుడు నదిలో దూకుచు చేసిన ఆర్తనాదమును వినిన మరొక వ్యక్తి నీటదూకి పరిచారకుని శ్రీ జగద్గురువుల దేహమును బయటకు తెచ్చెను. ప్రథమ చికిత్సలో పరిచారకునికి శ్వాస వచ్చినది. తరువాత స్మృతి వచ్చినది. 

శ్రీ జగద్గురువుల దేహమున కట్లు కాలేదు. శ్రీ జగద్గురువుల శరీరము పద్మాసనమున కూర్చుండినట్లుండెను. ప్రథమ చికిత్సలో శ్వాస తెప్పించుటకు జరిగిన ప్రయత్నమున ఆ శరీరము నీటిలో మునిగి శ్వాస ఆడక నీరు మ్రింగినట్లు లేదు. బ్రతుకుకై ప్రయత్నము చేసినట్లు లేనేలేదు. శ్రీ జగద్గురువుల కెట్టి అనారోగ్యము లేదు. ఆయన జీవించి యున్నప్పుడు వైద్యులకు దిగ్భ్రమ కలిగించినట్లే సిద్ధి పొందినప్పుడు కూడ దిగ్భ్రమనే కలిగించిరి. జీవితకాలమునందును, దేహ త్యాగ కాలమందును – ఆయన ఆధ్యాత్మిక అనుభవములను భౌతిక వివరణము కోరు వారందరికీ పరిష్కరింపరాని సమస్యగానే మిగిలిపోయినారు. ఆవిధంగా శ్రీ జగద్గురువులు మన భౌతిక నేత్రములకు కన్పించకుండా వెళ్ళిపోయి యావద్భారతదేశముననున్న ఆయన శిష్య జనమును దుఃఖ సముద్రమున ముంచిరి. ఆయనకు గురువులైన జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వాముల వారి సమాధికి వామభాగమున వీరి భౌతిక శరీరము సమాధి చేయబడినది. ఆయన కనుమరుగైన దినము మహాలయామావాస్య. జయనామ సంవత్సర భాద్రపద అమావాస్య (26.9.1954). ఆనాడు శ్రీ శారదాదేవికి మహాభిషేకము. మరునాడు శ్రీ శారద నవరాత్ర్యుత్సవముల ప్రారంభము. శ్రీ జగద్గురువుల ఆరాధన శ్రీ శారదా దేవి మహాభిషేకముతో కలసిపోయి జరుగుచున్నది. ఆయన శ్రీదేవితో అభిన్నులని చెప్పుటకిది యొక నిదర్శనము.

ఆ జీవన్ముక్తులను ఈరోజు మనమందరమూ తలచుకొని మనల్ని ధర్మాచరణం వైపు నడిపించమని ప్రార్థిద్దాం

సదాత్మధ్యాన నిరతం విషయేభ్యః పరాజ్ఞ్ముఖం!
నౌమి శాస్త్రేషు నిష్ణాతమ్ చంద్రశేఖర భారతీం!!

జయతు జయతు నిత్యం చంద్రమౌళి ర్మహేశో 
జయతు జయతు నిత్యం శారదాభీష్ట దాత్రీ 
జయతు జయతు నిత్యం శంకరో దేశికేంద్రో 
జయతు జయతు నిత్యం చంద్రచూడో గురుర్నః!!


Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List