గాంగేశ్వరస్వామి ~ దైవదర్శనం

గాంగేశ్వరస్వామి



సర్వం శివమయం జగత్‌ అని అంటారు. ఓం నమఃశివాయ అని స్మరిస్తే చాలు... సర్వపాపాలూ పోతాయనేది భక్తుల నమ్మకం. కోరిన కోర్కెలు తీర్చే పరమశివుడు కొన్ని చోట్ల స్వయంభువుగా వెలిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో దేవతలూ, మునులూ శివలింగాలను ప్రతిష్ఠించారని అంటారు. అలా భీష్ముడు ప్రతిష్ఠించిన స్వామిని చూడాలంటే.. పశ్చిమగోదావరి జిల్లా తడికలపూడిలో ఉన్న గాంగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాలి.


గోదావరి నదీతీరంలో... చుట్టూ పచ్చని వాతావరణం మధ్య కనిపించే ఆలయమే గాంగేశ్వరస్వామి గుడి. ఈ ఆలయంలోని రాజగోపురం... దానిపైన ఉన్న ఐదు కలశాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయని అంటారు.


ఈ ఆలయంలో 41 రోజులు క్రమం తప్పకుండా ప్రదక్షిణలు చేసి దీపారాధన చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శివరాత్రి, కార్తిక పౌర్ణమి రోజుల్లో స్వామికి సహస్ర బిల్వార్చన నిర్వహిస్తారు.


ఆ సమయంలో కొందరు భక్తులు నాగస్వరం ఊదుతూ చేసే శివతాండవాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. వీటన్నింటితో స్వామి ప్రసన్నుడయాడనడానికి ప్రతీకగా శివలింగం పై నుంచి పువ్వులు కిందకు జారతాయట.


వెంగి చాళుక్యులూ, విజయనగరం ప్రభువులూ ఈ మహా శైవక్షేత్రాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో 10, 11 శతాబ్దాల నాటి అపురూప శాసనాలు కూడా ఉంటాయి. విటిని బట్టి ఒకప్పుడు స్వామిని అరణ్యేశ్వరస్వామి, అయ్యనేశ్వరస్వామి, అరుణేశ్వర మహాదేవుడిగా కీర్తించినట్లు తెలుస్తోంది. వేంగి రాజుల పాలనలో స్వామికి ఎంతో వైభవంగా పూజలు జరిగేవట. ఇక్కడ స్వామికి శైవ ఆగమ ప్రకారం పూజలు నిర్వహిస్తారు.


స్థలపురాణం..


తిడికలపూడి గాంగేశ్వర స్వామి ఆలయానికి పురాణ ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం రెండూ ఉన్నాయి. ఈ ఆలయంలోని స్వామిని సాక్షాత్తూ భీష్మ పితామహుడే ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. గాంగేయమనే ప్రత్యేక శిలతో ఇక్కడ శివలింగాన్ని రూపొందించారట. భీÅష్ముడు ప్రతిష్ఠ చేయడం వల్లే ఇక్కడ స్వామిని గాంగేశ్వరుడిగా పూజిస్తారు.


స్వామివారి మహాలింగంపైన ప్రతిబింబించే సూర్యకాంతుల తళుకుల వల్ల గ్రామానికి మొదట తళుకులపూడి అనే పేరు వచ్చిందనీ కాలక్రమంలో అదే తడికలపూడిగా మారిందనీ చెబుతారు. భష్ముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించినా... ఆలయం లేకపోవడంతో అది కొన్నాళ్లకు భూమిలోకి కూరుకుపోయిందట. అది జరిగిన కొన్నేళ్ల తరువాత... జిలకర్ర గూడెంలో ఉన్న రాజావారిని కలిసేందుకు వెళుతున్న కరణం గుర్రం కాలి గిట్ట శివలింగంపైన పడిందట.


దింతో ఆ గుర్రం ముందుకు కదల్లేకపోయిందట. కరణం అక్కడే ఆగిపోయి... స్థానికుల సాయంతో ఆ ప్రాంతాన్ని తవ్విచూడగా అప్పుడే ఉద్భవిస్తున్న శివలింగం కనిపించిందట. ఆ రాత్రి శివుడు కరణానికి కలలో కనిపించి ఆలయం నిర్మించకపోతే తాను లింగరూపాన ఎదిగిపోతానని చెప్పాడట. మర్నాడు కరణం ఆ ఊరి ప్రజలతో కలిసి స్వామికి ఓ ఆలయాన్ని కట్టించాడట. అప్పటినుంచీ ఈ ఆలయం గురించి అందరికీ తెలిసిందని అంటారు.


ప్రత్యేక పూజలు..


ఈ ఆలయంలో కార్తికమాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బిల్వార్చన, సహస్ర బిల్వార్చన, సహస్ర కుంకుమార్చన, లక్ష దీపార్చన సహస్ర లింగార్చన నిర్వహిస్తారు. కార్తికమాసంలో 30రోజులు నిత్యమహన్యాస పూర్వక రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుందిక్కడ.


శ్రావణమాసం నాలుగు శుక్రవారాలు కుంకుమ పూజలు, సహస్ర నామాలు అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే దేవీ నవరాత్రుల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి రోజున స్వామి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారిక్కడ. ఈ ఆలయంలో స్వామి విగ్రహంతోపాటూ మరికొన్ని ఉపాలయాలూ ఉన్నాయి. శివపార్వతుల అంశతో జన్మించిన వీరభద్రుడు, గణపతి ఆలయాలను కూడా ఇక్కడ చూడొచ్చు. కాల సర్పదోష నివారణార్థం జంటనాగుల ప్రతిమల మండపం కూడా ఈ ఆలయంలో కనిపిస్తుంది.


ఎలా చేరుకోవాలి..?


విజయవాడ, విశాఖపట్నం నుంచి ఏలూరుకు రైలు, బస్సు మార్గాలున్నాయి. ఏలూరు నుంచి 25 కిమీ దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి స్థానికంగా బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు..

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List