పళని దండాయుధ పాణి స్వామి ~ దైవదర్శనం

పళని దండాయుధ పాణి స్వామి





🌷పర్వతీనందనా...సుబ్రహ్మణ్యా🌷


శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆరు ప్రఖ్యాతక్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో , మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్యక్షేత్రం పళని.


దండాయుధపాణి..


ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళం వాళ్ళు ఈయనను “పళనిమురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని , కౌపీన ధారియై , వ్యుప్తకేశుడై నిలబడి , చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణమహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్యఅవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” -  అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఈ పళనిక్షేత్రము జ్ఞానమును ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. 


ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశారు. తొమ్మిదిరకాల విషపూరిత పదార్ధాలతో (వీటిని నవపాషాణములు అంటారు) చేశారు. పూర్వ కాలంలో ఇక్కడ పళనిస్వామివారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుకనుండి స్వామివారి శరీరంనుండి విభూతి తీసి కుష్ఠరోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే , వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా , స్వామివారి తొడభాగం బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామివారిని వెనుకనుండి చూస్తే ఇది కనబడుతుందని పెద్దలు చెప్తారు. కాని మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు


ఇక్కడ స్వామివారిని ఈ క్రింది నామాలతో స్తుతిస్తూ ఉంటారు. కులందైవళం , బాలసుబ్రహ్మణ్యన్ , షణ్ముఖన్, దేవసేనాపతి , స్వామినాథన్ , వల్లిమనలన్ , దేవయానైమనలన్ , పళనిఆండవార్ , కురింజిఆండవార్, ఆరుముగన్ , జ్ఞానపండిత , శరవణన్ , సేవర్ కోడియోన్ , వెట్రి వేల్ మురుగా ...మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ ఇప్పుడు ఉన్న మందిరం సామాన్య శకం ఏడవ శతాబ్దంలో కేరళరాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పండ్యులకాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధిచేయబడింది. ఇంకొక విషయం ఏమిటంటే,పళనిలో కొండపైకి ఎక్కడానికి రెండుమార్గాలు ఉంటాయి. 


ఓపిక ఉన్నవారు మెట్లమార్గంలో వెళ్లడం ఉత్తమం. మెట్లు కాకుండా , రోప్ వే లాంటి చిన్న రైలుసౌకర్యం కూడా ఉంది. దీనికి టికెట్ యాభైరూపాయలు. ఒక సారి వెళ్ళడానికి బావుంటుంది. (ఓపిక లేకపోతే ప్రతీ సారి)..


పళనిక్షేత్ర స్థలపురాణము:..


పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని , పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జవినాయకుడిని , చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి ఈ భూలోకం చుట్టి ( అన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించి  ఆ క్షేత్రములను దర్శించి రావడం) ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే , 


అప్పుడు పెద్దవాడు , వినాయకుడు యుక్తితో ఆదిదంపతులు , తన తల్లిదండ్రులు అయిన ఉమామహేశ్వరుల చుట్టూ మూడుమార్లు ప్రదక్షిణ చేస్తారు. మన బుజ్జిషణ్ముఖుడు తన యొక్క

నెమలివాహనముపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కాని , వినాయకుడు


“తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణచేస్తే సకలనదులలోనూ స్నానంచేసిన పుణ్యం వస్తుంది” అనే సత్యము తెలుసుకుని , కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల , సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు  వెళ్ళినా , అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మనకు అందరకూ తెలిసినదే కర్తికేయుడు శివకుటుంబంలో చిన్నవాడు కదా , దానితో కాస్త చిన్నమొహం చేసుకుని, అలిగి ,కైలాసం వదిలి , భూలోకానికి వచ్చి ఒక కొండశిఖరంమీద నివాసం ఉంటాడు . ఏ తల్లిదండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదా , అందులోనూ చిన్నవాడు, శివపార్వతుల అనురాగరాశి గారాలబిడ్డ అయిన కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా!శివపార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండశిఖరం వద్దకు వస్తారు*. ఆ కొండశిఖరం ఉన్న ప్రదేశమును తిరుఆవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని , “ నువ్వే సకలజ్ఞానఫలానివి నాన్నా” అని ఊరడిస్తారు. 


స్కలజ్ఞానఫలం (తమిళంలో పలం), నీవు (తమిళంలో నీ) – ఈ రెండూ కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతముగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తారు. సుబ్రహ్మణ్యక్షేత్రాలలో జరిగే “కావడి ఉత్సవం” మొట్టమొదట ఈ పళని లోనే ప్రారంభం అయ్యింది కావడిఉత్సవము..


ఇడుంబన్ వృత్తాంతం..


సుబ్రహ్మణ్యస్వామివారి యొక్క గొప్ప శిష్యులలో అగస్త్యమహాముని ఒకరు  అగస్త్యమహాముని స్వామి దగ్గరనుండి సకలజ్ఞానము పొందారు అగస్త్యమహర్షికి ద్రవిడ వ్యాకరణము సుబ్రహ్మణ్యస్వామివారే నేర్పారు. పూర్వము                      దేవదానవయుద్ధములో చాలామంది దానవులు నిహతులైపోయారు. కాని అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రం అగస్త్యమహర్షిపాదములు పట్టుకున్నాడు.


అగస్త్యుడు సంతోషించి , వీడిలో మిగిలిపోయిన కొద్ది రాక్షసభావాలు తొలగించాలి* *అనుకున్నారు. సాధారణంగా ఎవరైనా పెద్దలు తనవల్ల కాని పని ఉంటే , తన గురువుకి అప్పచెప్తారు. వడు రాక్షసుడు కదా అని సంహరించడం కాదు , వీడిలో ఉన్న ఆసురీగుణములను తీసివేయాలి అని తలచి , లోకంలో ఆదిగురువు దక్షిణామూర్తి , శంకరుడు ఉండేది కైలాసంలో కదా , అందుకని ముందు అక్కడికి పంపిద్దాము అనుకుని ఇడుంబుడిని పిలిచి ,


“ఒరేయ్ నేను కైలాసంనుండి రెండుకొండలు తెద్దామని చాలాకాలంనుండి అనుకుంటున్నాను , వాటిని శివగిరి , శక్తిగిరి అంటారు. నువ్వు వెళ్లి ఆ రెండుకొండలను , ఒక కావిడిలో పెట్టుకుని నేను ఉన్న చోటికి తీసుకురా” అని ఆజ్ఞాపించారు సరే ఇడుంబుడు , వంట్లో ఓపికుంది కదా , కైలాసం వెళ్లి ఆ రెండుకొండలను తన కావిడిలో పెట్టుకుని బయలుదేరతాడు. ఈ రాక్షసుడి ఆసురీత్వం పోగొట్టడం , జ్ఞానరాశి అయినటువంటి మా సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అనుకుని శంకరుడు ఇడుంబుడిని వెళ్ళనిస్తాడు. ఇక్కడ స్వామి పళనికొండమీద చిన్నపిల్లవాడిగా ఉన్నారు , ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళనిదగ్గరకి వచ్చేసరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి , కాసేపు క్రిందపెట్టి సేదదీరాడు.


మళ్ళీ కావిడి ఎత్తుకుందామని క్రిందకి వంగి కావిడిబద్ద భుజంమీద పెట్టుకుని లేచి నిలబడి , రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే ఒక వైపు ఎక్కువ బరువు , ఇంకో వైపు తేలిక అవుతోంది కాని , సమానంగా ఎంతసేపటికీ కుదరట్లేదు. ఇంక విసుగొచ్చి , ఏమిటిరా ఈ కావిడి అనుకుని , అలా పైకి చూస్తాడు ఇడుంబుడు. పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పకపక నవ్వుతున్నారు.  ఇది చూసి  ఇడుంబుడికి కోపం వచ్చింది. ఇదే రాక్షస ప్రవృత్తి అంటే , ఏదో చిన్న పిల్లవాడు నవ్వుతున్నాడులే అనుకోవచ్చు కదా. స్వామికేసి తిరిగి “ఏమిటా నవ్వు , నేనేమైనా ఈ కావిడి ఎత్తలేనని అనుకుంటున్నావా ? కైలాసం నుంచి తీసుకొచ్చాను. ఏమిటా వెర్రి నవ్వు , నిన్ను చంపేస్తాను ఇవ్వాళ అని ఆ కొండ మీదకి పరిగెత్తాడు. తెలిసి పరిగెత్తాడో , తెలియక పరిగెత్తాడో పళనికొండ మీదకి పాదచారియై వెళ్లాడు. పైకి వెళ్ళాక , స్వామి రెండుగుద్దులు గుద్దారు , ఇంక ప్రాణం వదిలేస్తున్నాను అన్నప్పుడు వాడికి తెలిసింది  ఈ పిల్లవాడు సామాన్యుడు కాదురా , మా గురువుగారికి (అగస్త్యుడు) గురువు , సాక్షాత్తు ఈశ్వరపుత్రుడు అని అప్పుడు “ఈశ్వరా తెలుసుకోలేక పోయాను , మీ చేతి గుద్దులు తిన్నాను , నాకు వరం ఇవ్వండి” అని వేడుకున్నాడు. ఏమిటో అడుగు అన్నారు స్వామి.


ఇడుంబుడు  “స్వామీ , నేను ఈ పళనిలోనే కదా , కావిడి ఎత్తలేకపోయాను , ఈ కావిడి వల్లనే కదా , మిమ్మల్ని చేరడానికి మార్గం అయ్యింది ,  అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుడిని ఏ ఆరాధనా చెయ్యకపోయినా , ఒక్క సారి కావిడి పాలతో కాని ,  విభూతితో కాని , పూలతో కాని , తేనెతో కాని , నేతితో కాని భుజం మీద పెట్టుకుని , మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరకి వెళ్ళిపోతున్నాం అని పాదచారులై నీ గుడికి వస్తే , అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన , శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో , అంత ఆరాధనా చేసిన ఫలితం వాళ్లకి ఇచ్చేసేయ్యాలి” అన్నాడు.. స్వామి అనుగ్రహించి సరేనని ఆ కోరికని కటాక్షించి , ఇక పై నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందు నీ దర్శనం చేసి నా వద్దకు రావాలని వరం ఇచ్చారు అందుకే అప్పటి నుంచి అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో (ప్రత్యేకం గా తమిళనాడులో) స్వామి వారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది , అక్కడ ఆయనకు నమస్కరించిన తరువాతే , సుబ్రహ్మణ్యుని దర్శనము చేసుకుంటారు సుబ్రహ్మణ్య కావడిలు..

అప్పటి నుంచి , తమిళదేశం వాళ్ళు సుబ్రహ్మణ్యకావిళ్ళు ఎత్తి సుబ్రహ్మణ్యుడిని తమ దైవంచేసేసుకున్నారు. 


అంతే కాక , ప్రతీ ఏటా స్కందషష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే , భక్తితో , పూనికతో స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్లకి తప్పక సత్సంతానప్రాప్తి కలుగుతుంది. వారి వంశంలో సంతానము కలగకపోవడం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా ఆ దోషపరిహారంచేసి స్వామి అనుగ్రహిస్తారు అని పెద్దలు చెప్తారు.


అంతటి శక్తివంతమైన క్షేత్రం , తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రము పళని. పళని దండాయుధపాణిస్వామివారి దర్శనం చేసి , జీవితంలో ఒక్క సారైనా సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి సుబ్రహ్మణ్య అనుగ్రహమును పొందగలమని ఆశిద్దాం..

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List