ఉబ్బలి బసవన్న - శనగల బసవన్న ~ దైవదర్శనం

ఉబ్బలి బసవన్న - శనగల బసవన్న



స్కాంద పురాణం లో ఏకంగా ”శ్రీ శైల ఖండం” వుంది. 18 పురాణాలలో భారత, రామాయనాలలో, అన్ని భాషల గ్రంధాలలో శ్రీ శైల ప్రస్తావన వుంది. ఇక్కడే శంకర భగవత్పాదులు. మల్లి కార్జున భ్రమ రాంబా దర్శనం చేసి, ఇక్కడ తపస్సు చేసి ”శివానంద లహరి ”రాశారు ”సేవే శ్రీ గిరి మల్లికార్జున మహా లింగం శివా లింగితం” అని చెప్పుకొన్నారు. ఇక్కడి ప్రశాంత వాతావరనానికి ముగ్ధులై శ్రీ శంకరులు ”యోగ తారావళి” అనే గ్రంధంలో శ్రీ శైల పర్వత గుహలలో సిద్ధిని పొందాలి అని కోరు కోవటం ఈ క్షేత్రం గొప్ప తనం అని ప్రశంశించారు.

శ్రీశైల క్షేత్రంతో శిలాద మహర్షి, గుప్త వంశానికి చెందిన చంద్ర వతి, కుమార స్వామి, వసుమతి, అక్కమహా దేవి, మహా శివ భక్తురాలు హేమా రెడ్డి మల్లమ్మ, సిద్ధ రామప్ప, కుమ్మరి కేశప్ప, ఉబ్బలి బసవన్న, వృద్ధ మల్లికార్జునుడు, మొదలైన వారి కధలన్నీ ముడి పడి వున్నాయి..


ఉబ్బలి బసవన్న పురాణ గాథ..


పూర్వం శ్రీశైల ప్రాంతం లోని బ్రహ్మగిరి సమీపం లో ఒక మహా శివభక్తుడైన శిల్పి వుండేవాడు.ఆయన ఒకసారి మల్లికార్జున స్వామి ని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు. అలా స్వామిని పూజించి యింటికి చేరిన శిల్పి సదా ఆలయాన్నిగురించే ఆలోచించడం ప్రారంభించాడు. తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణం లోనూ బయటా కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు. ఉత్సాహంతో పని ప్రారంభించాడు. శిల్పి నక్త వ్రతాన్ని(పొద్దున్నించీ భోజనం చేయకుండా రాత్రి శివపూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు) పాటిస్తూ నలభై రోజులలో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు.కవలపిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా వున్న నందులను చూసి ఆనందించాడు.కానీ ఏమి లాభం?వెంటనే విచారం లో మునిగి పోయాడు. ఈ మహత్తర నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి? అన్నదే అతని బాధ. మధ్యలో పాతాళగంగను కూడా దాటాలి మరి. నిద్రకూడా పట్టలేదు. అర్ధ రాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పి. వెంటనే ఒక కల. కలలో స్వామి కరుణించాడు.స్వామి శిల్పి తో యిలా అన్నాడు.


భక్తా! నీ సంకల్పం మహత్తర మైనది. నీ శ్రమ ఫలించింది. ఇవిగో ఈ పలుపు త్రాళ్ళను తీసుకొని నందుల మెడలకు తగిలించు. వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో...


వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి.ఎదురుగా పలుపు త్రాళ్ళు కనిపించాయి.సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు వెంటనే త్రాళ్ళను నందుల మెడలకు తగిలించాడు. త్రాళ్ళను చేత బట్టి శ్రీశైలానికి బయల్దేరాడు. తెల్లవారు ఝాముకు పాతాళగంగను చేరుకున్నాడు. అలాగే కృష్ణానదిని దాట సాగాడు. నీటిలో కొంత దూరం వెళ్ళాడు. రెండవ ఒడ్డుకు చేరబోతున్నాడు. ఒక నంది అతని ముందు వున్నది యింకొకటి వెనక వస్తున్నది. వెనక వస్తున్న నంది కాలు నీళ్ళలోని రాళ్ళ మధ్య యిరుక్కొని అది రావడం మానేసింది కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి.  అంతే కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది. శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలి ఒక నంది తోనే శ్రీశైలం చేరాడు. ఇప్పుడు శ్రీశైలం లో వున్న నంది. ఆ శిల్పి చేసిన నందే నని చెప్తారు.


ఇదంతా కర్ణా కర్ణిగా వినపడుతున్న గాధ. . ఊబినుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది "ఉబ్బలి బసవన్న" అని పిలువబడుతూ ఇటీవలి కాలం వరకూ భక్తులకు దర్శన మిచ్చేది. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల పాతాళ గంగలో మునిగిపోయిన నంది 700 అడుగుల లోతున నీటిలో యిప్పటికీ వుంది. .. ప్రాజెక్టు కట్టకముందు ఆ నందిని చూసిన పెద్దవాళ్ళున్నారు...


గర్భాలయంలో కొలువుదీరిన మల్లికార్జునస్వామి స్వామి వారికి ఎదురుగా ఉన్న నందీశ్వరునికి శనగల బసవన్న అని పేరు. నందికి శనగలు ప్రియమైనవి. అందువల్ల భక్తులు గుడ్డలో శనగలు ఉంచి నంది మూతికి కడతారు. అందువల్ల శనగల బసవన్న అని పేరు వచ్చిందంటారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంత భక్తులు ఈ నందీశ్వరుని చెన్నుకల్లు బసవన్న అని పిలిచేవారు. ఆ పేరు కాలక్రమంలో శనగల బసవన్న అయి ఉంటుందని చెబుతారు.


Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List