మానస సరోవరం కైలాస పర్వతం. ~ దైవదర్శనం

మానస సరోవరం కైలాస పర్వతం.


కైలాస పర్వతం టిబెట్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన, కైలాస శ్రేణిలోని ఒక పర్వత శిఖరం. ఆసియాలోని అతి పెద్ద నదుల్లో కొన్నైన సింధు నది, సట్లేజ్ నది ( సింధూ నది యొక్క ప్రధాన ఉపనది), బ్రహ్మపుత్రా నది, కర్నాలి నది (గంగా నది యొక్క ఉపనది) ఈ పర్వతపు సమీపంలోనే ఉద్భవిస్తాయి. బోన్ (ఒక టిబెట్ మతం), బౌద్ధ ,హిందూ , జైన మతాలు ఈ పర్వతాన్ని పవిత్రస్థలంగా భావిస్తాయి. హిందూ మతంలో ఇది శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి నిలయంగా భావించబడుతుంది. ఈ పర్వతం టిబెట్ లోని మానససరోవరానికి , రాక్షసతాల్ సరస్సుకి సమీపంలో ఉంది.

కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఏవీ జరగలేదు. ఇది బౌద్దుల, హిందువుల నమ్మకాలకి వ్యతిరేక చర్యగా భావించి అధిరోహకులు ఈ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నాలు చేయలేదని భావించబడుతున్నది.


నామకరణం, పదవ్యుత్పత్తి..

సంస్కృతంలో కైలాశ అంటే "స్ఫటికం" అని అర్థం. సంస్కృత పదం కేలస నుండి ఈ పదం వచ్చిందని భావించబడుతున్నది. కేలస అనగా సంస్కృతంలో స్ఫటికం. ఈ పర్వతపు టిబెటన్ పేరు గాంగ్స్ రిన్-పో-చే . టిబెటన్ భాషలో గాంగ్స్ లేదా కాంగ్ అంటే మంచు శిఖరం ; రింపోచే అంటే "అమూల్యమైనది" అన్న గౌరవార్థక అర్థం, కనుక ఈ సంయుక్త పదాన్ని "విలువైన హిమ రత్నం"గా అనువదించవచ్చు.

"టిబెటన్ బౌద్ధులు దీనిని కాంగ్రి రింపోచే; 'విలువైన హిమ పర్వతం' అంటారు. బోన్ భాషా గ్రంథాల్లో ఈ పర్వతానికి జల పుష్పం , సాగర జల పర్వతం, తొమ్మిది దొంతరల స్వస్తిక్ పర్వతం మొదలైన అనేక పేర్లు ఉన్నాయి. హిందువులకి ఇది వన్య పర్వత దేవుడు శివుని ఇల్లు, అతని శక్తి చిహ్నం "ఓం " కు ప్రతీక. జైనులకిది మొదటి తీర్ధంకరుడు జ్ఞానం పొందిన చోటు; బౌద్దులకిది ప్రపంచపు నాభి; బోన్ అనుయాయులకి ఆకాశ దేవత సిపయిమేన్ నివాసం."

ఈ పర్వతానికి ఉన్న మరొక స్థానిక పేరు టిసే మూస: పర్వతం, ఇది ఝాంగ్-ఝుంగ్ భాషలోని టిసే నుంచి పుట్టింది, దీని అర్థం "జల శిఖరం" లేదా "నదీ శిఖరం". బోన్ పౌరాణికాల్లోని సింహం, గుర్రం , నెమలి ,ఏనుగు నదులకి మూలంగా భావించబడే ఈ పర్వతానికిది సముచితమైన పేరు. వాస్తవానికి సింధు, యార్లుంగ్ త్సాంగ్పో/డిహాంగ్/బ్రహ్మపుత్ర, కర్నాలి, సట్లేజ్ నదులు అన్నీ కైలాస-మానససరోవర ప్రాంతంనుండే ప్రారంభమవుతాయి.కైలాస పర్వతం యొక్క హిందూ ప్రాముఖ్యతను వివరించే విధంగా శివడు, పార్వతి, గణేశుడు మరియు కార్తికేయుడు కైలాస పర్వతంపై నివసిస్తున్నట్టూ చిత్రించిన పటము మతపరమైన ప్రాధాన్యత హిందూ మతంలో
హిందూ మతం ప్రకారం దుష్ట శక్తులను, బాధలను నశింపజేసే శివుడు కైలాస పర్వతమనబడే ప్రఖ్యాత పర్వతపు శిఖరాగ్రంలో నివశిస్తాడు, ఇక్కడ ఈయన తన భార్య పార్వతితో కలిసి నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు.

చార్లెస్ అల్లెన్ ప్రకారం విష్ణు పురాణంలోని కైలాస పర్వతపు వర్ణనలో, దీనికి నాలుగు ముఖాలని, అవి స్ఫటికం, రూబీ , బంగారం మరియు లాపిస్ లజూయితో ఏర్పడ్డాయని చెప్పబడినది. ఇది ప్రపంచపు పునాది స్తంభమని, తామర పువ్వు రెక్కలలాగా విస్తరించి ఉన్న ఆరు పర్వత శ్రేణులు కలిసే కేంద్రస్థానంలో ఉంది.  కైలాశం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకి ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి.
మహారాష్ట్రలోని ఎల్లోరా గుహాలయాల్లో అతి పెద్దదైన మరియు అత్యంత ప్రధానమైన కైలాష గుడి పేరు కైలాస పర్వతం పేరు మీద పెట్టబడింది. దీనిలోని అనేక శిల్పాలు శివుడు,
పార్వతి మరియు రావణాసురుని కథలని చిత్రించినవే. రావణుడు శివభక్తుడు. రావణుడు కైలాస పర్వతాన్ని కదిలించిన వైనం రామాయణంలో చెప్పబడలేదు. రావణుడి తల్లి వ్యాధిగ్రస్తమవుతుంది. అవసాన దశలో ఉన్న తల్లికి కైలాస దర్శనం కలుగజేసేందుకు, గుడిని తన వీపు మీద పెట్టుకొని తల్లికి దగ్గరగా తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. శివుడు అతని ధైర్యానికి మెచ్చి అతను తను పెట్టిన భక్తి పరీక్షలో నెగ్గినందున అతనికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు.

బౌద్ధంలో టిబెటన్ మరియు నేపాలీ థంకా కళాశైలిలో చిత్రించిన కైలాస పర్వతం కైలాస పర్వతపాదంలో బౌద్ధ స్థూపాలు తాంత్రిక బౌద్ధులు కైలాసాన్ని చక్రసంవర (డెంచోక్) బుద్ధుని ఆవాసంగా భావిస్తారు. [6] ఈయన శాశ్వతానందానికి ప్రతినిధి. ఇక్కడి చాలా ప్రదేశాలు గురు రింపోచే (పద్మసంభవుడు) తో ముడిపడి ఉన్నవి. ఈయన క్రీ.శ. 7-8 శతాబ్దాలలో టిబెట్ లోని అనేక ప్రదేశాలలో చేసిన తాంత్రిక అభ్యాసాలు, బోధనలు ఈ దేశంలో బౌద్ధం ప్రధాన మతంగా పరిణామం చెందడానికి దోహదమయ్యాయి.


తాంత్రిక బౌద్ధ ప్రబోధకుడైన మిలరేపా (1052 – 1135) బోన్ మత ప్రబోధకుడైన నారో బోన్-చుంగ్ ని సవాలు చేయడానికి టిబెట్ వచ్చాడని చెపుతారు. ఈ ఇద్దరు మాంత్రికులు భీకరమైన మాంత్రిక మాయజాల యుద్ధం చేసారు కానీ ఎవరూ నిర్ణయాత్మకంగా విజయం సాధించలేదు. చివరికి కైలాస పర్వత శిఖరాగ్రాన్ని ఎవరైతే ముందుగా చేరతారో వారే విజేత అనే ఒప్పందం కుదిరింది. ఆ పోటీలో నారో బోన్-చుంగ్ మాయా ఢంకా మీద కూర్చొని పర్వత శిఖరం ఎత్తుకు ఎగరటం ప్రారంభించాడు. ఇలా ఉండగా, మిలరేపా సావధానంగా కూర్చొని ధ్యానం చేయడాన్ని చూసి ఆయన అనుయాయులు నిశ్చేష్టులయ్యారు. నారో బోన్-చుంగ్ దాదాపు శిఖరాగ్రానికి చేరుకోబుతుండగా మిలరేపా హఠాత్తుగా రంగంలోకి దిగి, సూర్య కిరణాలపై ప్రయాణం చేసి, నారో బోన్-చుంగ్ కంటే ముందే శిఖరాగ్రాన్ని చేరి పోటీలో గెలిచాడు. మిలరేపా అదే సమయంలో గుప్పెడు మంచుని దగ్గరిలోని పర్వతాగ్రంపై చల్లి బోన్పోకు (బోన్ మతావలంబికులను బోన్పో అంటారు) దత్తం చేశాడు. అప్పటినుండి అది బోన్రిగా పిలవబడుతూ, బోన్ మతంతో ఆ ప్రాంతపు సంబంధాలు కొనసాగేలా చేసింది.బోన్ లో టిబెట్ యొక్క స్థానిక మతమైన బోన్ లో, యావత్తు మార్మిక ప్రాంతం, తొమ్మిదంతస్థుల స్వస్తిక పర్వతాన్ని ఆధ్యాత్మిక శక్తికంతటికీ కేంద్రంగా భావిస్తారు.

తీర్థయాత్ర..

మానసరోవరం (కుడివైపు) మరియు ముందువైపు రాక్షసతాల్ కలిగిన కైలాస పర్వతం యొక్క ఉపగ్రహచిత్రం ప్రతి సంవత్సరం వేల సంవత్సరాలనాటి సంప్రదాయాన్ని పాటిస్తూ వేలమంది కైలాస పర్వతానికి తీర్థయాత్ర చేస్తారు. అనేక మతాలకి చెందిన యాత్రికులు కైలాస పర్వతాన్ని పాదాలతో చుట్టిరావడం పుణ్యఫలదాయకమైన పవిత్ర ఆచారంగా నమ్ముతారు. హిందువులు, బౌద్ధులు ఈ ప్రదక్షిణాయాత్రని సవ్యదిశలో చేస్తారు. జైన, బోన్ పో మత అనుయాయులు ఈ పర్వతాన్ని అపసవ్య దిశలో చుడతారు. కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రదక్షిణామార్గం 52 km (32 mi) పొడవైనది.


కైలాస పర్వతం...

కొంతమంది యాత్రికులు కైలాస పర్వత ప్రదక్షిణ మొత్తం ఒక్కరోజులోనే పూర్తి చెయ్యాలని నమ్ముతారు. అదంత సులభం కాదు. మంచి శారీరక పటుత్వంతో వేగంగా నడవగలిగే మనిషికి ఈ 52 కిలోమీటర్ల యాత్రను పూర్తి చెయ్యడానికి దాదాపు 15 గంటలు పడుతుంది. అస్థిర వాతావరణం, ఎత్తుప్రదేశం వల్ల వచ్చే అస్వస్థత, ఈ ప్రక్రియలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకి భయపడినప్పటికీ కొంతమంది భక్తులు ఈ సాహసాన్ని ఒక్క రోజులోనే పూర్తిచేస్తారు. అలాగే మరికొంతమంది యాత్రికులు మొత్తం ప్రదక్షిణ అంతా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ ప్రదక్షిణను పూర్తిచేస్తారు. యాత్రికుడు వంగి, మోకాళ్ళ మీద కూర్చొని, మొత్తం సాగిలపడి వేళ్ళతో గుర్తు చేసి, మోకాళ్ళ మీద లేచి ప్రార్థించి, చేతులతో, మోకాళ్ళతో గుర్తిపెట్టిన స్థలం వరకు ప్రాకి మళ్లీ మళ్లీ ఈ పద్ధతిని పునరావృతం చేస్తారు. ఈ విధంగా ప్రదక్షిణ పూర్తి చేయడానికి కనీసం నాలుగు వారాల శారీరక ఓరిమి అవసరమవుతుంది. ఈ పర్వతం టిబెటన్ హిమాలయాలలో మారుమూల ప్రాంతంలో, ఆశ్రయం ఇవ్వడానికి కూడా ఎలాంటి జనావాసాలు కూడా లేని చోట ఉంది. యాత్రికుల సౌకర్యార్థం కొన్ని ఆధునిక వసతులైన బెంచీలు, విశ్రాంతి ప్రదేశాలు, ఉపాహార కేంద్రాలు ఏర్పాటుచేయబడ్డాయి. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాలు, పవిత్రమైన ఈ పర్వతంపై కాలు పెట్టటం మహా పాపమని నమ్ముతాయి. ఈ నమ్మకాన్ని మూఢనమ్మకంగా నిరూపించటానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలో మరణించారని చెపుతారు[ ఆధారం కోరబడింది ]. ఇక్కడినుండి స్వర్గానికి సోపానమార్గముందని కూడా భక్తులు నమ్ముతారు.


దక్షిణ ముఖం..

1950లో చైనా సైన్యం టిబెట్ లో అడుగు పెట్టిన తరువాత, చైనా -భారత సరిహద్దులలో నెలకొన్న రాజకీయ, సరిహద్దు అనిశ్చితి వలన, ఈ తీర్థయాత్ర 1954 నుండి 1978 వరకు నిలిపివేయబడింది. దాని తరువాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది. వీరు చైనా మరియు భారతీయ ప్రభుత్వాల పర్యవేక్షణలో సుదీర్ఘమైన, క్లిష్టమైన హిమాలయాల అధిరోహణ చేస్తారు. కాట్మండు భూమార్గం గుండా ప్రయాణం చేయవచ్చు లేదా కాట్మండు నుండి లాసాకు విమానంలో ప్రయాణించి, అక్కడినుండి కారులో టిబెటన్ పీఠభూమిపై ప్రయాణిస్తూ ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ ప్రయాణం నాలుగు రాత్రులు పడుతుంది. చివరికి సముద్రతలానికి 4,600 మీటర్ల ఎత్తులో ఉన్న దార్చేన్ అనే చిన్న అవుట్ పోస్ట్ చేరతారు. ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం యాత్రా సమయంలో తీర్థయాత్రికులతో నిండిపోతుంది. కనిష్ఠ సౌకర్యాలు కలిగి ఉన్నప్పటికీ విదేశీ తీర్థయాత్రికుల కోసం ఆధునిక అతిధిగృహాలు అందుబాటులో ఉన్నాయి. అదే టిబెటన్ తీర్థ యాత్రికులయితే సాధారణంగా వారి సొంత గుడారాల్లో బసచేస్తారు. సుదూర-పశ్చిమ టిబెట్ ప్రాంతానికి సేవలందించడానికి, స్విస్ న్గారీ కోర్సం ఫౌండేషన్ 1997లో ఇక్కడ ఒక చిన్న ప్రాంతీయ వైద్య కేంద్రాన్ని నెలకొల్పింది.

పవిత్ర పర్వతం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో మాత్రం ప్రయాణమంతా, కాలి నడకన, లేదా పోనీపైగానీ, జడల బర్రె పై చేయాలి. ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు15,000 ft (4,600 m) టర్బోచే (జెండా స్తంభం) ఎత్తు నుండి అధిరోహించటం ప్రారంభిస్తే మూడు రోజులు పడుతుంది, డ్రోల్మ పాస్18,200 ft (5,500 m) దాటాక దారిగుండా రెండు రాత్రులు పడుతుంది. మొదట దిరాపుక్ గొంప మైదానం దగ్గర కొంచెం పాస్ కి ముందు, 2 to 3 km (1.2 to 1.9 mi) రెండు పాస్ దాటిన తరువాత సాధ్యమైనంత క్రిందకి దిగిన తరువాత (దూరంలో గౌరీ కుండ్ కనిపిస్తుంది).


పర్వతారోహణ...

కైలాస పర్వతపు ఉత్తరముఖం 1926 లో హ్యూగ్ రట్లెడ్జ్ పర్వతపు ఉత్తర ముఖాన్ని అధ్యయనం చేసి, 6000 అడుగుల ఎత్తున్న శిఖరాగ్రం ఎక్కడానికి చాలా కష్టతరమైనదని తీర్మానించాడు [11] ఈశాన్యపు అంచునుండి ఎక్కేందుకు ప్రణాళిక వేసుకున్నాడు కానీ, సమయం చాల్లేదు. రట్లెడ్జ్, ఆ ప్రాంతాన్ని కల్నల్ ఆర్.సి.విల్సన్ తో పాటు సందర్శించాడు. విల్సన్ పర్వతానికి అవతలి వైపున, త్సేతెన్ అనే షెర్పాతో పాటు ఉన్నాడు. విల్సన్ చెప్పినదాని ప్రకారం, త్సేతెన్ తాము ఉన్న కోణం (ఆగ్నేయం) నుండి పర్వతాన్ని అధిరోహించే వీలు ఉన్నదని భావించి "సాహిబ్ మనం దాన్ని ఎక్కగలం" అని అన్నాడు.

విల్సన్ ఆల్పైన్ జర్నల్ (1928) అనే పర్వతారోహణా పత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని బట్టి, విల్సన్ ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు తీవ్రంగా నిశ్చయించుకున్నాడని తెలుస్తున్నది. కానీ విల్సన్ కూడా సమయాభావం వళ్ల ప్రయత్నించలేదు. హెర్బర్డ్ టీచీ 1936లో, గుర్లా మాంధాత పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం చేస్తూ, ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన, కైలాస పర్వతాన్ని ఎక్కగలమా అని న్గారీకి చెందిన ఒక గార్పోన్ వ్యక్తిని అడగగా, ఆ గార్పోన్ వ్యక్తి "పూర్తిగా పాపరహితమైన వ్యకులు మాత్రమే కైలాస పర్వతాన్ని ఎక్కగలరు. అలాంటి వ్యక్తులు ఈ ఏటవాలు హిమకుడ్యాలను ప్రయాసపడి ఎక్కనవసరం లేదు. ఒక పక్షిలాగ మారి శిఖరాగ్రానికి ఎగరగలడు" అని సమాధానిమిచ్చాడట. 1980వ దశకం మధ్యలో చైనా ప్రభుత్వం, ఇటలీకి చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడైన, రైన్హోల్డ్ మెస్నర్ కు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు అవకాశమిచ్చింది కానీ, ఆయన దాన్ని తిరస్కరించాడు.

2001లో చైనా, ఒక స్పానిష్ పర్వతారోహణ బృందానికి కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు అనుమతినిచ్చింది కానీ, అంతర్జాతీయ అభ్యంతరాలకు తలొగ్గి, పర్వతారోహణ ప్రయత్నాలన్నింటినీ నిషేధించేందుకు నిర్ణయించింది. స్పానిష్ బృందపు ప్రణాళికను ఖండిస్తూ, రైన్హోల్డ్ మెస్నర్, "మనం ఈ పర్వతాన్ని జయిస్తే, ప్రజల మనసుల్లోని పవిత్ర విశ్వాసాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తాము..నేను వారిని (స్పానిష్ బృందం) ఇంకాస్త కఠినమైన పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రోత్సహిస్తాను. కైలాస పర్వతం పెద్ద ఎత్తయినది కాదు, అంత కష్టమైనది కూడా కాదు." అని అన్నాడు.


మానసరోవరానికి పశ్చిమాన రాక్షస్తల్ అనే ఉప్పు నీటి సరస్సు, ఉత్తరాన హిందువులు శివుని నివాస స్థలంగా భావించే కైలాస పర్వతం ఉన్నాయి. ఈ మంచినీటి సరస్సు సముద్రమట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉంది. 88 మీటర్ల చుట్టుకొలత, 300 అడుగులు లోతు, 320 చరదరపు కిలోమీటర్ల ఉపరితలము కలిగియున్న మానస సరోవరం గంగా చు (Ganga Chu) చానల్ ద్వారా రాక్షస్తల్ సరస్సుకి అనుసంధానమైయున్నది. ఈ ప్రాంతంలో ఎండాకాలం మే నెల నుండి ఆగస్టు నెల వరకూ ఉంటుంది. ఎండాకాలం (Summer) లో గరిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది.
ఋతుపవనాలు (Monsoons) సెప్టెంబరు నెల నుండి నవంబరు నెల వరకూ ఉంటాయి. చలికాలం (Winter) లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుండి -15 డిగ్రీల మధ్య ఉంటుంది. అతి శీతలమైన ఈ సరస్సు ప్రాంతంలో ఎక్కడ చూచినా కొండలు , బండ రాళ్ళు, అక్కడక్కడా చిన్నపాటి గడ్డి జాతి మొక్కలు మాత్రమే కనిపిస్తాయి.


సాంస్కృతిక ప్రాధాన్యం...

సంస్కృతములో మానస అనగా మనసు, సరోవరము అనగా సరస్సు. పూర్వ కాలములో
భారత దేశం , టిబెట్, నేపాల్ సరిహద్దులతో నిమిత్తం లేకుండా కలిసియుండేవి. అందువలన మానసరోవరము భారతీయులకు, నేపాలీలులకు, టిబిటియన్లకు పవిత్ర స్థలమైయున్నది., అనగా హిందువులకు, బౌద్ధులకు, జైనులకు మనసరోవరం పవిత్రమైన సరస్సు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి ఆలోచననుండి మానసరోవరం ఆవిర్భవించి భూమ్మీద పడినది. మానసరోవరంలోని నీరు త్రాగితే మరణించిన తర్వాత నరకానికి వెళ్ళకుండా నేరుగా కైలాసానికి చేరవచ్చని, సరస్సులో స్నానమాడితే నూరు జన్మల వరకూ పాపాలు పరిహారమైపోతాయని, జ్ఞానానికి మరియు అందానికి ప్రతిరూపాలైన హంసలు (Swans) మనసరోవరములో విహరించేవని హిందువులు నమ్ముతారు.బ్రహ్మ దేవుడు మానసాన ఊహించి భూమిపై ఆవిష్కరించినది కనుక ఇది మానస సరోవరంగా చెపుతారు.


తెలుసుకున్న విశేషాలు...

ప్రపంచంలో కెల్లా ఈ సరోవర జలం స్వచ్ఛమైనది, అత్యుత్తమమైనదిగా ప్రతీక. స్వచ్ఛమైన ఈ సరోవరంలో తెల్లని హంసలు అదనపు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మానస సరోవర పరిధి దాదాపు 90కి, మీ. ఆసియా ఖండంలోని నాలుగు గొప్పనదులు - బ్రహ్మపుత్ర, కర్నలి, ఇండస్, సట్లెజ్ లకి ఆధారం మానససరోవర జలం. ఇక అన్నిటికంటే ప్రత్యేకత వేదమాత విహరించే స్థలం మానససరోవర తీరం. వేదాలు అభ్యసించి, శాస్త్రాలు ఆచరించలేక పోయినా ఈ సరోవర జలం తీర్థంలా సేవించి, సరోవరంలో స్నానం చేస్తే జన్మధన్యం అనేది నమ్మకం.

యాత్రలు..

చలికాలములో సరస్సు ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఫలితంగా అక్కడి వాతావరణం యాత్రీకులకు ప్రతికూలంగా ఉంటుంది కనుక యాత్రీకులు (Tourists) సాధారణంగా ఎండాకాలంలోను, ఋతుపవనాల కాలంలోను మనసరోవరాన్ని దర్శిస్తారు. భారత దేశంలో ఉత్తర కాశీ నుండి మరియు నేపాల్ లో కాఠ్మండునగరం నుండి ప్రతి సంవత్సరము కైలాస మానసరోవర యాత్రలు జరుగుచున్నవి.వేద, పురాణ ఇతిహాసాల ప్రమాణికంగా కైలాసగిరి-హిమాలయాలు భరత ఖండానికి చెందినవి, 7వ శతాబ్దం టిబెట్ స్వతంత్ర దేశంగా పాలన మొదలు పెట్టినప్పడి నుండి ఈ కైలాసగిరి టిబెట్ దేశానికి చెందినది. అందువల్ల హిందువులకే కాక బౌద్ధ, జైనులకి కూడా ఇది ఎంతో పవిత్రమైన పుణ్యస్థలము. 1950 చైనా టిబెట్ ని ఆక్రమించుకున్నాక, భారతీయులకి కైలాస సందర్శనం కష్ట సాధ్యమయ్యింది. 1959 నుండి 1978 వరకు దాపు 20 సంవత్సరాలు అసలు ఎవరికీ ఈ గిరిని దర్శించడానికి అనుమతి ఇవ్వలేదు.ఆతరువాత 1980 నుండి కొద్దికొద్దిగా యాత్రికులని భారత ప్రభుత్వం ద్వారా వెళితే అనుమతించేవారట. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా పలు ట్రావెల్ ఏజెంట్స్ ఈ యాత్రని కొంత సుగమం చేసే ప్రయత్నం చేస్తున్నారు.


యాత్ర జాగ్రత్తలు..

మానసిక సంకల్పంతో పాటు శారీరకంగా కూడా అక్కడి వాతావరణం తట్టుకునే శక్తి కావాలి. ఈ యాత్రకి సిద్దం కావడానికి ముందు నుండి ఉదయం సాయంత్రం నడక, శ్వాసకి సంబంధించిన వ్యాయామం, యోగా చేయడం ఎంతైనా తోడ్పడతాయి. మధుమేహం, స్పాండిలైటీస్, బాక్పేఇన్ ఆస్తమ, సైనస్ వంటివి ఉంటే, ఈ యాత్ర చేయలేరు. అయినాసరే ఈ యాత్ర చేయాలనుకుంటే డాక్టర్ని సంప్రదించి సరైన పర్యవేక్షణలో చేయాలి. సముద్ర మట్టం నుండి 4000 మీటర్ల ఎత్తు వెళ్లిన తరువాత, శరీరానికి తగినంత ప్రాణవాయువు అందడం కష్టం అవుతుంది. అందుకు డైమాక్స్ అనె టాబ్లెట్ రోజు రాత్రి తప్పనిసరి వేసుకోవాలి. ఇది ఏ ఆల్టిట్యుడ్ లో మొదలుపెడితే, తిరుగు ప్రయాణంలో అక్కడకి వచ్చేదాకా వేసుకోవాలి. ఇక జలుబు దగ్గు, గొంతునొప్పి, నడచి అలసిపోతె వేసుకోడానికి పారాసిటిమాల్, వికారం, వాంతులు, విరోచనాలకి సంబందిచిన ఇంకా ఏ ఇతర వాటికోసమైనా మందులు మన దగ్గర ఉంచుకోడం ఎంతైనా అవసరం. అలాగే చలికి తట్టుకునే విధమైన వస్త్రాలను ధరించాలి. అంతేకాదు ఈ ప్రయాణంలో స్నానం, టాయిలెట్ సౌకర్యం అన్నిచోట్లా సరిగ్గా ఉండదు.అక్కడి పరిస్థితులని బట్టి సర్దుకుని పోడానికి సంసిద్దం కావాలి.

భారతీయ అద్భుతాలు -మానస సరోవరం..

కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకాలు ఇవి. అందుకే జీవితంలో ఒకసారైనా- మానస సరోవరంలో స్నానం చేయాలని.. కైలాస పర్వతాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని కోట్లాది మంది భావిస్తూ ఉంటారు. కాని సముద్రమట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తున ఉన్న మానస సరోవరాన్ని.. దానికి సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించటం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కల. తీరని కోరిక. కాని ఇప్పుడు చైనా ప్రభుత్వం అక్కడికి సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. భారీ వాహనాలు సైతం సునాయాసంగా ప్రయాణించటానికి వీలుగా రోడ్లు.. కొండ చరియలు విరిగి పడకుండా ఇనుప కంచెలు.. హఠాత్తుగా వరదలు వచ్చి రోడ్డు కొట్టుకుపోకుండా పక్కనే కాలువలు వంటి అనేక సదుపాయాలను కల్పిస్తోంది. వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ యాత్రను సులభంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రపంచంలో అత్యంత కఠినమైన యాత్రలలో కైలాస యాత్ర ఒకటి. వేల అడుగుల నుంచి జారిపడే జలపాతాలు, పెట్టని కోటల్లా ఎటువైపు చూసినా కనిపించే పర్వతాలు, అడుగు జారితే ఎముకలు కూడా దొరకవనే భయం కలిగించే లోయలు- ఇవన్నీ కైలాస యాత్రలో భాగాలు. ఒక విధంగా మానస సరోవరానికి, కైలాస పర్వతానికి ఆకర్షణను కలిగించేవి కూడా ఇవే. హిందూ పురాణాలలోను, కావ్యాలలోను ఈ ప్రదేశాల గురించి సవివరమైన వర్ణనలు ఉన్నా, అనుభవైక్యం అయితే తప్ప వాటి గొప్పతనం అర్థం కాదు. చైనా అధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో మానస సరోవరం, కైలాస పర్వతం రెండూ ఉన్నాయి. ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచి నీటి తటాకం మానస సరోవరం. దీనికి పశ్చిమంగా రాక్షసతాల్ అనే సరోవరం, ఉత్తర భాగంలో కైలాస పర్వతం ఉంటాయి.

సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరోవర చుట్టుకొలత దాదాపు 88 కిలోమీటర్లు ఉంటుంది. లోతు దాదాపు మూడు వందల అడుగుల దాకా ఉంటుంది. బ్రహ్మ మదిలో ఈ సరోవరం పుట్టిందని.. బ్రహ్మే దీనిని భూమిపైకి తీసుకువచ్చాడని హిందూపురాణాలు చెబుతాయి. బ్రహ్మ మానసంలో (మనసు) పుట్టింది కాబట్టి దీనికి మానససరోవరం అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఈ సరోవరంలో స్నానం చేస్తే వంద జన్మల్లో చేసిన పాపాలన్నీ పోతాయనేది హిందువుల నమ్మకం. బౌద్ధ జాతక కథలలోను, ఇతర గ్రం«థాలలోను కూడా ఈ సరోవరం ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. ‘అనవతప్త’ అని బౌద్ధులు పిలుచుకొనే ఈ సరోవరం ఒడ్డున ‘చూ గంప బౌద ్ధఆరామం’ ఉంది. బుద్ధుడు భూమిపై ఉద్భవించటానికి బీజం ఈ సరోవరం ఒడ్డునే పడిందనేది బౌద్ధుల నమ్మ కం. నిజానికి ఎన్ని వేల ఏళ్ల నుంచి ఇక్కడ జనసంచారం ఉందనే విషయాన్ని చెప్పటానికి కచ్చితమైన ఆధారాలేమీ లేవు. కొన్ని వేల ఏళ్ల నుంచి భారత ఉపఖండంలో నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తున్నారనే విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. రెండు మార్గాలు.. ఒకప్పుడు ఈ ప్రదేశాలను సందర్శించటానికి ఒకే ఒక మార్గం అందుబాటులో ఉండేది.

మన దేశం నుంచి ఆ ప్రాంతానికి వెళ్లి తిరిగి రావడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టేది. పర్వతాలలో కాలిబాటలు తప్ప వేరే మార్గమే ఉండేది కాదు. యాత్రకు వెళ్లాలనుకొనేవారు ముందు నేపాల్ చేరుకొనేవారు. ఖాట్మండులోని పశుపతి నాథుడి ఆలయాన్ని సందర్శించుకొని.. అక్కడి నుంచి కాలినడకన మానస సరోవరానికి బయలుదేరేవారు. వెంట పశువుల్ని తీసుకెళ్లి పర్వత సానువుల్లో పెరిగే గడ్డిని తినటానికి ముందుగా వాటిని వదిలేవారు. ఆ పశువులు వెళ్లే మార్గాన్ని గమనిస్తూ వాటి వెనకే వెళ్లేవారు. ఎముకలు గడ్డకట్టే చలిలో ఆహారం దొరకక, ఆక్సిజన్ సరిగ్గా అందక మరణించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉండేది. అందుకే ఒకప్పుడు మానస సరోవర యాత్రకు వెళ్లి వచ్చిన వారిని ప్రజలు మృత్యుంజయులుగా చూసేవారు. వారిని అమితంగా గౌరవించేవారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత కూడా టిబెట్లోను, అక్కడి మౌలిక సదుపాయాల విషయంలోను ఎటువంటి మార్పు రాలేదు కాని భారత్, చైనాల మధ్య కొన్ని వివాదాలు చెలరేగాయి. దీనితో 1954లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని సందర్శించటానికి భారత యాత్రికులకు అనుమతి ఇవ్వటం మానేసింది. ఆ సమయంలో కూడా కొందరు నేపాల్ చేరుకొని అక్కడి నుంచి రహస్యంగా కైలాస పర్వతాన్ని సందర్శించటానికి వెళ్లేవారు. అదెలాగున్నా 24 ఏళ్ల తర్వాత- 1978లో చైనా సర్కారు మళ్లీ భారత యాత్రికులను ఈ ప్రాంతానికి అనుమతించటం ప్రారంభించింది. ప్రతి ఏడాది దాదాపు వెయ్యి మందిని మాత్రమే అనుమతించేవారు. అతి తక్కువ మందిని అనుమతించటం కూడా ఈ యాత్రకు అదనపు ఆకర్షణగా తయారయింది.

1990ల తర్వాత టిబెట్ పట్ల చైనా ప్రభుత్వ వైఖరి మరింత కఠినమయింది. ఇదే సమయంలో- ఈ ప్రాంతంలోకి యాత్రికులను అనుమతించటం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా చైనా గుర్తించింది. దీనితో 1995 తర్వాత ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు పథకాలు సిద్ధం చేయటం మొదలుపెట్టింది. ఒకప్పుడు కేవలం పర్వత మార్గం ద్వారానే యాత్రికులకు అందుబాటులో ఉండే కైలాస పర్వతం దగ్గరకు హెలికాప్టర్ సర్వీసు కూడా ప్రారంభమయింది. దీనితో కైలాస పర్వతం సందర్శించటానికి రెండు మార్గాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేం. ఏ నిమిషంలో వాన పడుతుందో.. ఏ నిమిషంలో ఎండ వస్తుందో కనుగొనటం చాలా కష్టం. అంతే కాకుండా కొన్ని సార్లు పర్వతాలలో విపరీతమైన మంచు కురుస్తుంది. కొన్ని రోజుల పాటు సూర్యకాంతి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్లలో ప్రయాణం చాలా ప్రమాదం. పైగా ఖర్చు ఎక్కువ. దీనితో ఎక్కువ మంది యాత్రికులు రోడ్డు మార్గంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మూడేళ్ల క్రితం టిబెట్లోని కొందరు బౌద్ధ బిక్షువులు చైనా ప్రభుత్వంపై తిరగబడడంతో దాన్ని వెంటనే అణచి వేసినప్పటికీ చైనా ఆలోచనల్లో మార్పు వచ్చింది. తమ సైన్యం టిబెట్లోని మారుమూల ప్రాంతాలకు సైతం త్వరగా చేరుకోవటానికి వీలుగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే మానస సరోవరం, కైలాస పర్వతానికి రోడ్ల నిర్మాణం ప్రారంభించింది. 70 శాతం పూర్తి.. మానస సరోవరానికి, కైలాస పర్వతానికి చేరుకోవటానికి రోడ్డు ద్వారానే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది- నేపాల్ నుంచి టిబెట్లోకి ప్రవేశించి జాంగ్ము, సాగాల మీదుగా మానససరోవరం చేరుకోవటం. ఖాట్మండు నుంచి టిబెట్ సరిహద్దుల్లో ఉండే ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్కు చేరుకోవటానికి కనీసం ఆరు గంటలు పడుతుంది. వేల అడుగుల లోతైన లోయల పక్క నుంచి.. హఠాత్తుగా విరిగి పడే కొండచరియలతో ఈ ప్రయాణం అత్యంత కఠినంగా ఉండేది. ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు. ఫ్రెండ్షిప్ బ్రిడ్జి దాటిన తర్వాత జాంగ్మూకు చేరుకోవటానికి ఒకప్పుడు 12-14 గంటలు పట్టేది. ఒకప్పుడు మట్టి రోడ్లు మాత్రమే ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రం తగ్గని తారురోడ్లు వచ్చేసాయి. అందువల్ల ఇప్పుడు ఏడెనిమిది గంటల్లో వెళ్లిపోగలుగుతున్నారు. అయితే వీటితో పాటు ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒక సైనిక శిబిరం కూడా వచ్చింది. జాంగ్మూ నుంచి సాగాకు, సాగా నుంచి మానస సరోవరానికి వెళ్లే రోడ్లు, ఆ దారిలోని మౌలిక సదుపాయాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయి. సాగా నుంచి మానస సరోవరానికి గత ఏడాది 30 శాతం మాత్రమే తారు రోడ్డు ఉంటే.. ఈ సారి అది 70 శాతానికి పెరిగింది. దీని వల్ల పన్నెండు నుంచి పదహారు గంటలు పట్టే ప్రయాణ సమయం ఎనిమిది గంటలకు తగ్గిపోయింది. ఈ ప్రాంతంలో మిగిలిన చోట్ల కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం ప్రారంభమయింది. వచ్చే ఏడాది మానస సరోవర యాత్ర ప్రారంభమయ్యే నాటికి సాగా నుంచి మానస సరోవరానికి ఆరు గంటల్లో వెళ్లిపోవచ్చంటే అతిశయోక్తి కాదు. మానస సరోవరం నుంచి కైలాస పర్వతం బేస్క్యాంపు దాకా కూడా చైనా ప్రభుత్వం రోడ్ల నిర్మాణం ప్రారంభించింది.

ఈ ఏడాది బేస్క్యాంపు నుంచి కైలాస పర్వతం కింది దాకా జీపులపై వెళ్లటానికి కూడా కొందరికి అనుమతులు ఇచ్చింది. ఇదే ఒరవడి ఇంతే జోరుగా కొనసాగితే- కైలాస పర్వతానికి నేరుగా జీపుల్లో వెళ్లే అవకాశం ఏర్పడవచ్చు. అంటే వచ్చే రెండు, మూడేళ్లలో- మానస సరోవర యాత్ర- చాలా మందికి ఒక పిక్నిక్గా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అదనంగా ఐదు వేల యువాన్లు- అంటే 40 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఉక్కు కవచం.. ఒక పక్క వేల మంది యాత్రికులు సునాయాసంగా కైలాస్ మానససరోవర యాత్రకు రావటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న చైనా ప్రభుత్వం.. మరోవైపు వారిపై అంతే కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తోంది. ఉదాహరణకు ఫ్రెండ్షిప్ బ్రిడ్జి దాటడానికి (అంటే టిబెట్లో ప్రవేశించటానికి) ఎంత సమయం పడుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కొందరు యాత్రికులకు రెండు రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విధంగా దలైలామా గురించి కాని.. టిబెట్ స్వాతంత్య్ర పోరాటం గురించిగాని పుస్తకాలు పట్టుకెళితే – వారికి టిబెట్లో ప్రవేశం ఉండదు. జాంగ్ము, సాగా వంటి పట్టణాలలో ఫోటోలు తీయటాన్ని కూడా చైనా సైన్యం నిషేధించింది. సాగాలో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన స్థలమని హిందువుల, బౌద్ధుల ఇద్దరి విశ్వాసమూ. అందువల్ల చాలామంది ఈ నదీ తీరాన ప్రార్థనలు చేయటానికి ప్రయత్నిస్తూ ఉం టారు. అయితే ఈ నదీతీరానే చైనా సైనిక శిబిరం కూడా ఉంది. అందువల్ల ఇక్కడ ప్రార్థనలు చేయటాన్ని.. ఫోటోలు తీయటాన్ని ఈ ఏడాది కొత్తగా నిషేధించారు.

ఇక మానససరోవర ప్రాంతంలోని గుడారాలలో నివసించే వారిని చైనా సైన్యం అనుక్షణం గమనిస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిసి తీర్థయాత్రలోని ఆనందాన్ని మనకు తగ్గించేస్తున్నాయని చైనావాళ్లు గుర్తిస్తున్నట్టు లేరు. ఎవరూ అధిరోహించని కైలాస పర్వతం కైలాసపర్వతాన్ని టిబెటన్ భాషలో రిన్పోచి అని పిలుస్తారు. ప్రతి ఏడాది వేల మంది హిందూ భక్తులు కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. టిబెటన్లు కూడా ఈ పర్వతాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. ఈ పర్వతంపై పాదం మోపటం పాపంగా భావిస్తారు. అందువల్ల వీరు మోకాళ్లపై కైలాస పర్వతాన్ని ఎక్కుతారు. హిందువులు ఎక్కువగా కైలాస పర్వతం చుట్టూ 52 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తారు కాని పర్వతాన్ని అధిరోహించరు. అయితే పాశ్చాత్య దేశాలకు చెందిన అనేక మంది సాహసికులు కైలాస పర్వతాన్ని అధిరోహించటానికి గతంలో ప్రయత్నించారు. అయితే ఏదో ఒక కారణం వల్ల ఈ ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. 1926లో హ్యుగ్ రటిల్ఎడ్జ్ అనే బ్రిటిష్ సాహసికుడు చేసిన ప్రయత్నం చరిత్రలో నమోదు అయిన తొలి ప్రయత్నం. 1936లో హ్యుబర్ట్ టిచి అనే వ్యక్తి కూడా ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ప్రయత్నించాడు. అయితే చివరి నిమిషంలో అతను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

1950 నుంచి 80 దాకా చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. 1980లో రిన్హోల్డ్ మెస్నర్ అనే వ్యక్తికి ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే మెస్నర్ ఈ అవకాశాన్ని ఎందుచేతో ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత 2001 దాకా కైలాస పర్వతాన్ని అధిరోహించటానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదు. 2001లో స్పెయిన్కు చెందిన జీసస్ మార్టినిజ్ నోవాస్ నేతృత్వంలోని ఒక బృందానికి చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కైలాస పర్వతం హిందూ మత విశ్వాసాలతో ముడిపడి ఉందని.. అందువల్ల దానిని అధిరోహించటానికి అనుమతి ఇవ్వకూడదంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చింది. దీనితో చైనా ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ఎవరికీ అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. అతి పవిత్రం మానస సరోవరం..

బ్రహ్మపుత్ర, కర్ణాలి (గంగ), సింధు, సట్లజ్ నదులు మానస సరోవరం నుంచి పుట్టాయని భక్తుల భావన. అయితే దీనికి కచ్చితమైన ఆధారాలేమీ లేవు.

సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులను బౌద్ధ పూర్ణిమ నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు. కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి ఇది మారుతుంది కూడా. ఆ కాలంలో కూడా ఉష్ణోగ్రత కొన్నిసార్లు మైనస్కి వెళ్లిపోతుంది.

భారత ప్రభుత్వం ఏడాదికి 750 మందిని మాత్రమే ఈ యాత్రకు పంపిస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు.

మానస సరోవర ప్రాంతంలో తెల్లవారు జాము రెండున్నర నుంచి నాలుగున్నర వరకూ ఆకాశంలో విచిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానం చేయటానికి ఆ సరోవరానికి వస్తారనేది భక్తుల నమ్మకం. ఈ కాంతిని చూడటానికి భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు.
చైనా ప్రభుత్వం మానస సరోవర ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు చేపట్టింది. ఒక ప్రైవేట్ సంస్థ ఇక్కడ ఒక హోటల్ను కూడా నిర్మిస్తోంది. ఇటువంటి నిర్మాణాల వల్ల మానస సరోవర పవిత్రత దెబ్బతింటుందని.. పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రాంతమంతా శక్తిమయం.... సైన్స్ ప్రకారం- కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న పరిస్థితుల వల్ల ఎక్కువ శక్తి (ఎనర్జీ) ఉంటుంది. దానిని ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలు ఉంటాయి. మానస సరోవరం, కైలాస పర్వతం అలాంటి ప్రాంతాలు. నేను ఈ ప్రాంతానికి గత ఏడేళ్లుగా వస్తున్నాను. వచ్చిన ప్రతి సారి ఒకో విధమైన అనుభూతి ఏర్పడుతూ ఉంటుంది. దానిని నేను మాటల్లో వర్ణించలేను. మానస సరోవరంలో రాత్రి వేళ అనేక కాంతులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకు కనిపించే శక్తిరూపాలు. ఇక కైలాస పర్వతం గురించి చెప్పాలంటే ఆదిముని- ఈశ్వరుడు మానవ ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించటానికి మొదట ఈ ప్రాంతానికే వచ్చాడు. మూడు నాలుగు నెలల పాటు కదలకుండా మెదలకుండా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. ఈశ్వరుడిని చూడటానికి పెద్ద గుంపు తయారయింది. ధ్యానంలో ఉన్న యోగి ఏవో అద్భుతాలు చేస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఎటువంటి అద్భుతాలు జరగటం లేదు. గుంపు పలచబడింది. ఏడుగురు మాత్రం మిగిలారు. ఈశ్వరుడు కళ్లు విప్పాడు. ఆ ఏడుగురు తమకు జ్ఞానం ప్రసాదించమని ప్రార్థించారు. తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారు. ఈశ్వరుడు అప్పుడు ప్రసాదించిన విజ్ఞానం- ఈ పర్వత సానువుల్లో ఉంది. ఈ విజ్ఞానం శక్తి రూపంలో ఉంటుంది. ఒక ఇల్లు కట్టినప్పుడు దానిని నిలబెట్టడానికి కొన్ని కర్రలు అవసరమవుతాయి. ఈ పర్వత శ్రేణులు కూడా అలాంటివే. అమూల్యమైన విజ్ఞాన భాండాగారాన్ని తమలో దాచుకున్నాయి. ఈ విజ్ఞానాన్ని అందుకోవాలంటే క్రమశిక్షణ అవసరం. నిబద్ధత అనివార్యం. ఈ రెండు ఉన్నవారు మాత్రమే ఈ ప్రాంతానికి రాగలుగుతారు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఈ ప్రాంతానికి వచ్చే సమయానికి ‘నేను’ అనే అహం చచ్చిపోతుంది. అహం చనిపోయినప్పుడు మానవుడు విజ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. అందుకే నిష్ఠగా, ఏకాగ్రతతో ఈ ప్రాంతానికి వచ్చినవారికి అనేకమైన అలౌకిక, ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతాయి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List