దశ విధ వాయువులు. ~ దైవదర్శనం

దశ విధ వాయువులు.

ప్రాణమంటే జీవులు బ్రతకడానికి కావలసిన చైతన్య శక్తి. ప్రాణమనే  దాన్ని అర్ధం చేసుకోడానికి, ప్రాణ శక్తిని గురించి తెలుసుకుందాం. జ్ఞానేంద్రియాలు బయటనుండి విషయాలని తెస్తే వాటిని గ్రహించాలంటే, అవి మనస్సుతో సంబంధపడి పడి ఉండాలి. గాఢ నిద్రలో ఉన్నపుడు మనస్సు, జ్ఞానేంద్రియాలూ పనిచెయ్యవు. అప్పుడు మనలను జీవింప జేసే శక్తి ఒకటి ఉంటుంది. అది శ్వాస రూపంలో ప్రాణమని చెప్పబడుతుంది. జీవానికి, శరీరానికీ, ప్రాణానికి పరస్పరం సంబంధం ఉంటుంది. ప్రాణం యొక్క చైతన్యశక్తి వల్లనే మనస్సు బాహ్య విషయాలను గ్రహిస్తుంది. శరీరానికి కండర చలనం ద్వారా చైతన్యాన్ని కల్గించేది ఈ ప్రాణమే.  ప్రాణం బ్రహ్మము యొక్క ప్రకాశం చేత ప్రవర్తిస్తుంది. శరీరంలో ఈ ప్రాణశక్తి 5భాగాలుగా విభజించ బడింది. ముఖ్య ప్రాణం, చేసే పనుల భేదాన్ని బట్టి ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానమని  చెబుతారు.

   

1) ప్రాణము – ఇది ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించిఉన్న శ్వాశకోశాన్ని(respiration ) జ్ఞానేంద్రియాలని నియంత్రిస్తుంది. మన వాక్కును, మ్రింగటాన్ని(deglutition ), శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుదుంది. ఇది శరీరంలో ఊర్ధ్వచలనం కల్గి ఉంటుందని చెప్పబడింది.

2)  అపానము - ఇది నాభి నుండి అరికాళ్ళ వరకు వ్యాప్తిచెంది అధోచలనం కల్గి విసర్జన కార్యకలాపాలకు తోడ్పడుతుంది. ఉదాహరణకు మల మూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు మరియు శిశు జననము మొదలైన వాటిని నిర్వర్తిస్తుంది.

3) సమానము - నాభి నుంచి హృదయం వరకు వ్యాప్తిచెంది, మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్లు చేసి, ఒంటబట్టడానికి సహకరిస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి కల్గుతుంది.

4) ఉదానము - ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి, శరీరాన్ని ఊర్ధ్వ ముఖంగా పయనింప జేయడానికి ఉపకరిస్తుంది. అంటే మనలోనుండి  శబ్దం కలగడానికీ, వాంతులు చేసుకునేటపుడు బహిర్గతమవడానికీ, మన దైనందిత కార్యాల్లో తూలి పడిపోకుండా సమతులనంగా ఉండటానికి దోహదం చేస్తుంది.

5) వ్యానము - ఇది ప్రాణ, అపానాలను కలిపి ఉంచి, శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. నాడీమండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మన ప్రాణమయ కోశంలో సుమారు 72,000  సూక్ష్మ నాడులున్నట్లుగాను, అవిగాక వాటిని నియంత్రించే నాడీ కేంద్రాలూ (చక్రములు) ఉన్నట్లు పెద్దలు చెబుతారు.


హృదయమున ప్రాణము, గుద స్థానమున అపానము, నాభి ప్రదేశమున సమానము, కంఠ మధ్యమునందు ఉదానము, సర్వశరీరము నందు వ్యానము ఉన్నట్లు పంచ ప్రాణముల స్థాన నిర్ణయం చెప్పబడింది. ఈ ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములనే పంచ ప్రాణములు ; నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయము లనెడి పంచ ఉపప్రాణములు కలసి నాడీ మండల మంతా వ్యాపించి, దేహవ్యాపారములకు కారణమవుతోంది. నాగుడను ఉపవాయువు వల్ల కక్కుకొనుట ; కూర్మమను ఉపవాయువు వల్ల కను రెప్పలు విచ్చుట, మూయుట ; కృకర మను ఉపవాయువు వల్ల తుమ్ముట, దగ్గుట ; దేవదత్తమను ఉపవాయువు వల్ల ఆవులింత చెప్పబడ్డాయి. ధనుంజయ మనే  ఉపవాయువు శరీరమంతా వ్యాప్తించి, మరణానంతరం శరీరం లావెక్కడానికి తోడ్పడుతుంది. ఇలా దశవిధ వాయువులు దశేంద్రియ సంబంధము కల్గి, రాగ ద్వేషాది అనుభవాలకు అధోముఖమవు తున్నాయి.

 

మనస్సును సాధనముగా చేసుకొని, దశ విధ వాయువుల చివర నుండేది, కర్తృత్వ భోక్త్రుత్వ గుణములను కల్గి ఉండేది  బుధ్ధి అనే చిద్బిందువు. ఇదే సర్వ కార్య కారణాలకూ ఆశ్రయమై , వాసనలతో ఇంద్రియములతోను స్థూల సూక్ష్మ కారణ శరీరములనే  ఉపాధుల సంబంధం కల్గి, విషయానుసారముగా సంచరిస్తుంటుంది. ఇలా  పంచ ప్రాణములు పంచ కర్మేంద్రియాలు కలసి క్రియాశక్తి బలము కల్గి ఉన్నాయి. పంచ ఉపప్రాణములు పంచ జ్ఞానేంద్రియాలు కలసి జ్ఞాన శక్తి బలం కల్గి ఉన్నాయి. దశవిధ ప్రాణములు; మనస్సు బుధ్ధి చిత్తము అహంకారములనే అంతః కరణ చతుష్టయంతో కలసి ఇచ్ఛాశక్తి బలం కల్గి  సమస్త ఇంద్రియ వ్యాపారాలకూ కారణంగా ఉన్నాయి.


ప్రాణాయామంలో కుంభకం వల్ల శరీరంలో నాడులన్నీ వాయువుచే పూరించబడి, ఈ దశవిధ వాయువుల యొక్క చలనం వేగవంత మవుతుందని తద్వారా హృదయ కమలం వికసిస్తుందనీ చెప్పబడింది. పంచ ప్రాణాలు, పంచ ఉప వాయువులు కలిపి దశవిధ వాయువులుగా చెప్పబడ్డాయి. బ్రహ్మాండ పంచీకరణ



       పిండాండమందు పనిచేసే ఇంద్రియాలన్నీ,అవి పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని ఆధ్యాత్మికము అన్నారు. ఇక్కడ అధిదేవతలు ప్రేరణ చేస్తున్నారు.


       బ్రహ్మాండములో అధిదేవతలు పనిచేస్తుంటేనే పిండాండమందు ప్రేరణ అందుతున్నది. కాబట్టి బ్రహ్మాండమందు అధిదేవతలు ఆధ్యాత్మికముగా మారారు. వారు అక్కడ పనిచేస్తున్నారు కనుక వారిని ఆధ్యాత్మికము అన్నాము.


       అధిదేవతలు ఒక్కొక్కరు అందరిలోని అదే ఇంద్రియములను ప్రేరేపిస్తూ ఉన్నారు. ఉదాహరణకు చంద్రుడు అందరి మనస్సులను ప్రేరేపించుచున్నాడు. బృహస్పతి అందరి బుద్ధులను ప్రేరేపించుచున్నాడు. అంటే ఏమైంది?పిండాండములో వ్యష్టి మనస్సు ఉంటే,బ్రహ్మాండములో చంద్రుడే సమష్టి మనస్సు. పిండాండములో వ్యష్టి బుద్ధి ఉంటే,బ్రహ్మాండములో సమష్టి బుద్ధి పేరు బృహస్పతి. ఇలాగే 25 తత్వాలను చూడాలి.


       పిండాండములో ప్రేరేపించేవారు అధి దేవతలు. బ్రహ్మాండములో వారే శక్తి ప్రసారకులు. అక్కడ వారు చేసే పని ఉంది కాబట్టి వారు ఆధ్యాత్మికము. ఉదాహరణకు గుమాస్తాలు వారి సూపర్వైజరు చెప్పినట్లు చేస్తారు. గుమాస్తాలేమో ఆధ్యాత్మికము, సూపర్వైజరేమో అధి దైవికము.


       కాని ఆ సూపర్వైజరు అతడిపై ఆఫీసరుయొక్క ఆదేశాల మేరకు పనిచేస్తూ,గుమాస్తాల ద్వారా పని చేయిస్తూ ఉంటాడు. అతడు ఆఫీసరు చెప్పినట్లు చేస్తున్నాడు. కనుక ఆ సూపర్వైజరు ఆధ్యాత్మికము. ఆఫీసరేమో ఆధి దైవికము.


       ఇక్కడ గుమాస్తాలేమో జీవుల వ్యష్టి ఇంద్రియాలు. సూపర్వైజరేమో, గుమాస్తాలవద్ద ఆధి దైవికము, కాని పై ఆఫీసరు వద్ద ఆధ్యాత్మికము. అంటే పిండాండములో ఆధి దైవికమైన సమష్టి ఇంద్రియాలన్నీ బ్రహ్మాండములో ఆధ్యాత్మికమైనవిగా మారిపోయాయి.


       వ్యష్టి జీవుడైతే, సమష్టి ఈశ్వరుడు. ఈశ్వరుడు జీవులకు ఆధి దైవమైతే,పరమేశ్వరుడివద్ద ఈశ్వరుడు ఆధ్యాత్మికము. అలాగే వ్యష్టి మనస్సు, బుద్ధి మొదలగు ఇంద్రియములకు చంద్రుడు, బృహస్పతి అధి దైవతములైతే పరమేశ్వరునియొక్క జ్ఞానశక్తి ప్రేరణ చేతనే ఆ చంద్రుడు, బృహస్పతి పని చేస్తున్నారు. కాబట్టి చంద్రుడు, బృహస్పతి ఆధ్యాత్మికము. జ్ఞానశక్తి ఆధి దైవికము. ఈ విదముగా 25 తత్త్వాలను తీసుకోవాలి.


       పిండాండములో : వ్యష్టి మనస్సు ఆధ్యాత్మికము : సమష్టి మనస్సు, చంద్రుడు ఆధి దైవికము.


       బ్రహ్మాండములో : సమష్టి మనస్సు చంద్రుడు ఆధ్యాత్మికము : జ్ఞాన శక్తి ఆధి దైవికము


       పిండాండములో : వ్యష్టి బుద్ధి ఆధ్యాత్మికము : సమష్టి బుద్ధి బృహస్పతి ఆధి దైవికము


       బ్రహ్మాండములో : సమష్టి బుద్ధి బృహస్పతి ఆధ్యాత్మికము : జ్ఞానశక్తి ఆధిదైవికము.


       ఇదే విధముగా 25 తత్త్వాలకు నిర్ణయించుకోవాలి. అయితే, పరమేశ్వరుడివద్ద ఇన్ని ఇంద్రియాలు లేవు. కేవలము జ్ఞానశక్తి,క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అని మూడే శక్తులున్నాయి. అందువలన జీవులయొక్క అంతఃకరణ చతుష్టయము, జ్ఞానేంద్రియాలు తొమ్మిదింటికి అధి దేవత జ్ఞానశక్తి. పంచప్రాణాలు, పంచ కర్మేంద్రియాలయొక్క అధి దేవతలు పదిమంది ఆపై అధి దేవత క్రియాశక్తి ప్రేరణ వలన పనిచేస్తున్నారు.


       వ్యష్టి జీవుడైతే, సమష్టి ఈశ్వరుడు. జీవుడి ఆధ్యాత్మికమైతే, ఈశ్వరుడు ఆధి దైవికము. బ్రహ్మాండములో ఈశ్వరుడు ఆధ్యాత్మికమైతే,పరమేశ్వరుడు ఆధి దైవికము. జీవుడికి చిత్తవృత్తులు వస్తే, ఈశ్వరుడికి సంకల్పాలు వస్తాయి. ఈశ్వరునికి సంకల్పాలుంటే దానికి కారణము పరమేశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి.


       జీవుని ఇంద్రియాలు (9+10) - ఈ పందొమ్మిది వ్యష్టి ఇంద్రియాలు.

       ఈశ్వరునియొక్క (9+10) ఈ పందొమ్మిది సమష్టి ఇంద్రియాలు.


       అంటే ఈ 19మంది అధి దేవతలు ఈశ్వరునికి ఇంద్రియాలు. అందువలన ఈశ్వరుడు తన 19 సమష్టి ఇంద్రియాలు ముఖముగా చేసుకొని జీవులందరి 19 తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరాలచేత పనిచేయిస్తున్నాడు. ఈ విధముగా ఈశ్వరుడు కూడా ఆధ్యాత్మికమైనాడు, బ్రహ్మాండమందు. అక్కడి19మంది అధిదేవతలు కూడా ఆధ్యాత్మికమై పోయారు. ఈశ్వరుడికి ఆధిదైవము పరమేశ్వరుడు. ఈశ్వరునియొక్క 9 సమష్టి ఇంద్రియాలకు అధిదేవత జ్ఞానశక్తి. మిగిలిన 10సమష్టి ఇంద్రియాలకు అధిదేవత క్రియాశక్తి.


       అయితే పరమేశ్వరుడు ఈ మూడు శక్తులతో కూడి, సగుణ రూపమై, సర్వవ్యాపకమై,అంతర్యామియై ఉన్నాడు. అతడికి మళ్ళీ అధిదేవతలు లేరు. అతడే మాయాశబలిత బ్రహ్మము. ఈ మూడు మాయాశక్తులు అలా చూపిస్తున్నాయి గాని, పరమేశ్వరుడు నిజానికి నిర్గుణుడే, పరబ్రహ్మమే. సగుణ నిర్గుణ అని రెండు లేవు. సగుణము మాయ గనుక నిర్గుణమే సత్యము, నిత్యము, అద్వయము.


       వ్యష్టి జీవులకు మూడు అవస్థలు,పంచకోశాలు ఉంటే సమష్టి ఈశ్వరుడికి కూడా మూడు అవస్థలు, పంచకోశాలు ఉన్నాయి.


       జీవుడు వ్యష్టిలో విశ్వుడు, తైజసుడు,ప్రాజ్ఞుడు అవస్థాభిమానులైతే ఈశ్వరుడు సమష్టిలో విరాట్‌ పురుష, హిరణ్యగర్భ అవ్యాకృతుడు సమష్టి అవస్థాభిమానులు. జీవుల తురీయం ప్రత్యగాత్మ అయితే ఈశ్వరుని తురీయం పరమాత్మ. వ్యష్టి శరీరత్రయమే సమష్టిలో విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృత శరీరాలు.


       ఈశ్వరుని యొక్క బహిః ప్రజ్ఞచేత విరాట్‌ స్వరూపము తోస్తున్నది. ఈశ్వరునియొక్క అంతఃప్రజ్ఞ చేత సమష్టి సూక్ష్మ శరీరమైన హిరణ్యగర్భుడు తోస్తున్నాడు. బహిఃప్రజ్ఞ తోచినప్పుడు జాగ్రదవస్థ. అంతఃప్రజ్ఞ తోచినప్పుడు స్వప్నావస్థ. ప్రజ్ఞ బయటకు, లోపలకు వ్యాపించకుండా స్థిరముగా ఉంటే అవ్యాకృతము. ఇది ఈశ్వరునియొక్క సుషుప్త్యావస్థ.


       సమష్టిలో జరిగే క్రియలు వ్యష్టిలో జరుగుతున్నాయి. ఎందుకంటే, వ్యష్టిలన్నీ ఆ సమష్టిలో అంతర్భాగము. వ్యవహారము ఈశ్వరుడిది అయితే జీవులలో ఈశ్వర వ్యవహారమే ఉన్నది. కాని జీవులు వారికి వారే వ్యవహరిస్తున్నట్లు అనుకుంటున్నారు. అజ్ఞానమంటే ఇదే. ఈశ్వరుడేది చేసినా, అది కారణము. దానియొక్క ఫలితమే కార్యము. కారణము ఈశ్వరునియొద్ద ఉంటే కార్యము జీవులవద్ద ఉన్నది. జీవులు స్వయంగా ఏ కార్యము చేయుటలేదు. కనుక జీవులయొక్క కర్తృ భావము,భోక్తృభావము అవిద్యా దోషము వలన వచ్చింది. ఈశ్వరుని వలన జరిగే పనులు ఈశ్వర లీల. అది జీవులనే పావులతో ఆడుతున్న ఆట. అందువలన జీవులు కీలుబొమ్మలే గాని, వారికి స్వతంత్రత లేదుద. ఈ విధముగా భావించుటయే జ్ఞానము. అందుకనే అంతా దైవేచ్ఛ, బాబా యిచ్ఛ అనుకోమన్నారు.


       జిల్లేళ్ళమూడి అమ్మ అంటుంది. ''అంతా సమష్టి కర్మేగా, వ్యష్టి కర్మ ఎక్కడున్నది నాయనా!'' మెహెర్‌బాబా అంటారు. ''నేను మందు వేసుకుంటే అందరికీ తగ్గుతుంది. మీరు వేసుకుంటే వేసుకున్న వారికే తగ్గుతుంది''.అందుకే అందరి మనస్సులు అమనస్కమవడానికి,తానే సమష్టి రూపంలో ఉంటూ, మనోనాశ్‌ కార్యక్రమము చేశారు. దాని ఫలితముగా జీవులలో క్రమక్రమముగా ఆధ్యాస తొలగుతుంది.


       అయితే ఈశ్వరుడికి శరీర తాదాత్మ్యత లేదు. అందువలన సమష్టి శరీరమైనటువంటి విరాట్‌ శరీరము బాధించదు. ఎందుకంటే ఈశ్వరునికి అవిద్యా దోషము లేదు. అవిద్యా దోషమున్న జీవుడికే శరీర తాదాత్మ్యత ఉంటుంది.


        జీవుల యొక్క జాగ్రదావస్థలో జరిగే వ్యవహారము, ఇతర అవస్థలలో జరిగే వ్యవహారంతోసహా హిరణ్యగర్భుడు యొక్క ఈశ్వరునియొక్క స్వప్నావస్థ. హిరణ్యగర్భునికి,ఇదంతా కల. ఆయన కలలోనే అందరు జీవులు ఉన్నారు, అన్ని అవస్థలు పొందుతూ ఉన్నారు. జీవుల యొక్క జాగ్రత్‌ స్వప్న సుషుప్తి తురీయావస్థలు అన్నీ కూడా ఈశ్వరుని యొక్క హిరణ్యగర్భ స్థితిలో, ఈశ్వరుని యొక్క స్వప్నావస్థలో భాగమే.


       జీవులు పుట్టి  జీవించి నశించే దంతా కూడా ఈశ్వరుని యొక్క స్వప్నావస్థే. ఈశ్వరుని యొక్క స్వప్నావస్థ ఎంతకాలం కొనసాగుతుందో, కొన్ని యుగాల పర్యంతము, అన్ని యుగాలలోకూడా అనేక జీవులు పుడుతూ జీవిస్తూ చస్తూ అనేక అనుభవాలు పొందినదంతా కూడా ఈశ్వరుని యొక్క స్వప్నావస్థయే.


       ఈశ్వరుని యొక్క స్వప్నావస్థ ఆగిపోయి,గాడనిద్రలోకి వెళితే, జీవుల యొక్క ఏ అవస్థలు కానీ, జీవుడు యొక్క ఏ ఉనికి గానీ, స్థూలంగా గానీ సూక్ష్మంగా గానీ ఉండవు. అంటే ఈశ్వరుడికి గాఢ నిద్రావస్థే, పిండాండమునందు జీవుల పరంగా చూస్తే అది ప్రళయము. ఈశ్వరునికది అవ్యాకృతము.


       ఇంతవరకు అర్థమయితే తప్ప బ్రహ్మాండ పంచీకరణ అర్థము కాదు. ఇక బ్రహ్మాండ పంచీకరణ మొదలుపెడదాము.


       వ్యష్టిలో ఆకాశ పంచకం ఏమిటి? అంతర్‌ ఇంద్రియాలు. అందులో ఆధి దైవికం ఏమిటి అంటే - గురుమూర్తి, చంద్రుడు బృహస్పతి,క్షేత్రజ్ఞుడు, రుద్రుడు. ఆ ఆధిదైవికాలే ఈ బ్రహ్మాండ పంచీకరణలో ఆధ్యాత్మికాలు. ఈ ఆధ్యాత్మికంగా ఉన్న వీళ్ళకి ఆధి దైవికం ఏమిటి?అంటే గురుమూర్తి, చంద్రుడు, బృహస్పతి క్షేత్రజ్ఞుడు, రుద్రుడు ఈ 5 ఈశ్వరుని యొక్క సమష్టి ఇంద్రియాలకి, ఆధి దైవం ఎవరు?జ్ఞానశక్తి. అలాగే సమష్టి జ్ఞానేంద్రియాలకు కూడా జ్ఞానశక్తియే ఆధిదేవత. సమష్టి పంచ ప్రాణాలకి పంచ కర్మేంద్రియాలకి, ఒకే ఒక అధిదేవత క్రియాశక్తి,


       జ్ఞానశక్తి ఏమో సమష్టి అంతర్‌ ఇంద్రియాల అధి దేవతలకి, సమష్టి జ్ఞానేంద్రియాల అధి దేవతలకు, అధిదైవికంగా ఉంది. సమష్టి పంచప్రాణాలు, సమష్టి కర్మేంద్రియాలకు అధిష్ఠాన దేవతలు ఎవరైతే ఉన్నారో, ఆ పదిమందికి, ఆధి దైవికం క్రియాశక్తి.


       ఆకాశ పంచకము :  ఆకాశంలో అర్థభాగం గురుమూర్తికి గోళకంగా ఉండి తక్కిన అర్థాంశము నాలుగు భాగములై, ఒక పరక వాయువును కూడుకుని,  చంద్రుడుకి గోళకం అయ్యింది. పిండాండంలో మనసుకు గోళకం అయ్యింది అన్నాము.


       రెండవ పరక అగ్నితో కూడి బృహస్పతికి గోళకము అయ్యింది. పిండాండంలో ఒక పరక అగ్నిని కూడి, బుద్ధికి గోళకం అయ్యింది అన్నాము. ఒక పరక జలమును కూడి, క్షేత్రజ్ఞుడికి గోళకం అయ్యింది బ్రహ్మాండంలో. పిండాండంలో ఒక పరక జలమును కూడి, చిత్తమునకు గోళకం అన్నాము.


       ఒక పరక పృథ్విని కూడి, రుద్రునికి గోళకమయ్యెను. ఈశ్వరునికి ఇవి అంతర్‌ ఇంద్రియాలకు గోళకాలు.


       పిండాండంలో అక్కడ జ్ఞాత కూటస్థుడు. వ్యష్టి కూటస్థుడిని  కూటస్థ ఆత్మ అంటాం. బ్రహ్మాండములో సమష్టి కూటస్థుడిని  కూటస్థ బ్రహ్మ అంటాము.


       గురుమూర్తి సమష్టి జ్ఞాతగాను, చంద్రుడు ఈశ్వరుని యొక్క సమష్టి మనస్సుగాను,బృహస్పతి ఈశ్వరుని యొక్క సమష్టి బుద్ధిగాను,క్షేత్రజ్ఞుడు ఈశ్వరుని యొక్క సమష్టి చిత్తముగాను,రుద్రుడు ఈశ్వరునియొక్క సమిష్టి అహంకారముగాను ఈ ఐదు ఈశ్వరునికి అంతరింద్రియములు. ఇది ఆకాశ పంచకం.


       వాయు పంచకము : వాయువులో అర్థాంశము విశ్వయోనికి, గోళక మయ్యెను. తక్కిన అర్థాంశము 4 పరకలై, ఒక పరక ఆకాశమును కూడి, జయునకు గోళము అయ్యెను. రెండవ పరక అగ్నిని కూడి, అజునకు గోళకము ఆయెను.


       ఒక పరక జలమును కూడి విశిష్టునికి గోళకము అయ్యెను. ఒక పరక పృథ్విని గూడి,విశ్వకర్తకు గోళము అయ్యెను. ఈశ్వరుడికి ఇవి పంచ ప్రాణములకు గోళకములు. విశ్వయోని వ్యాన వాయువుగాను, జయుడు సమానవాయువుగాను, అజుడు ఉదాన వాయువుగాను, విశిష్టుడు ప్రాణవాయువుగాను,విశ్వకర్త అపానవాయువుగాను ఈశ్వరునికి పంచ ప్రాణములయ్యెను.


       అగ్ని పంచకము: అగ్నిలో అర్థాంశము సూర్యునికి గోళక మయ్యెను. తక్కిన అర్థాంశము4 పరకలు అయి ఒక పరక ఆకాశమును గూడి,అష్టదిక్పాలకులకు గోళకమైంది. రెండవ పరక వాయువును గూడి వాయుదేవునికి గోళకమైంది. మూడో పరక జలమును గూడి వరుణ దేవునికి గోళకము అయినది. నాలుగవ పరక పృథ్విని గూడి అశ్వినీదేవతలకు గోళకము అయ్యింది. అశ్వినీ దేవతలు ఇద్దరు కవలలు. ఈ అయిదుగురు ఈశ్వరునియొక్క జ్ఞానేంద్రియాలకు గోళకములు. అంటే అష్టదిక్పాలకులు సమిష్టి శ్రోత్రముగాను, వాయుదేవుడు సమష్టి త్వక్కుగానూ, సూర్యుడు సమిష్టి చక్షురింద్రియంగాను, వరుణుడు సమష్టి జిహ్వాగాను, అశ్వినీ దేవతలు సమష్టి ఘ్రాణముగాను ఈశ్వరునికి జ్ఞానేంద్రియాలు అయినవి.


       జల పంచకము : జలములో అర్థాంశము జ్ఞానశక్తికి గోళకము అయ్యెను. తక్కిన అర్థాంశము 4 పరకలై ఆకాశముతో కూడి పరాశక్తికి గోళకమాయెను. అధిష్ఠాన దేవతలుగా కొన్నిచోట్ల సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ బదులు, ఇక్కడ పరాశక్తి, ఆదిశక్తి,జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియా�శక్తి, అని చెప్పడం జరిగింది. ఇక్కడ జల పంచకంలో పంచశక్తులను ఉపయోగిస్తున్నాము. ఒక పరక వాయువును గూడి ఇచ్ఛాశక్తికి గోళము అయింది. ఒక పరక అగ్నిని గూడి ఆదిశక్తికి గోళకం మయ్యింది. ఒక పరక పృథ్విని గుడి క్రియాశక్తికి గోళకం అయింది. ఇవి ఐదు కూడా విషయ పంచకం. విషయేంద్రియాలు. ఈ విషయ పంచకం ఈశ్వరునికి పంచతన్మాత్రల గోళకములు. పరాశక్తి శబ్దముగాను ఇచ్చాశక్తి స్పర్శగాను ఆదిశక్తి రూపముగాను జ్ఞానశక్తి రసముగాను క్రియాశక్తి గంధముగాను ఈశ్వరునికి పంచతన్మాత్రలు అయ్యెను. ఈశ్వరునియొద్ద ఉన్న తన్మాత్రలే జీవునికి విషయాలుగా రూపాంతరము చెందినవి. మరొక్కమాట. పరమేశ్వరుని వద్ద ఉన్న జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి ఆధి దైవికముగా ఉన్నాయి. ఇక్కడ పంచశక్తులుగా ఉన్నవాటిలో మళ్ళీ జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి,క్రియాశక్తి క్రియోన్ముఖ స్థితిలో ఆధ్యాత్మికములై ఉన్నాయి. ఇది స్థాయీ భేదము.


       పృథ్వి పంచకము: పృథ్విలో అర్థాంశము మృత్యుదేవతకు గోళక మయ్యెను. తక్కిన అర్ధాంశము 4 పరకలై, ఒక పరక ఆకాశమును గూడి అగ్నిదేవునికి గోళకమయ్యెను. అక్కడ వాగింద్రియానికి గోళకమైంది అంటాం, ఇక్కడ అగ్ని దేవుడికి గోళకమైంది. ఒక పరక వాయువుని గూడి, దేవేంద్రునికి గోళకము అయ్యింది. ఒక పరక అగ్నిని గూడి ఉపేంద్రునికి  గోళకము అయ్యింది. ఒక పరక జలమును గూడి,ప్రజాపతికి గోళకమయ్యెను. ఈశ్వరుడికి ఇవి కర్మేంద్రియములకు గోళకములు. అగ్నిదేవుడు వాక్కు గాను, దేవేంద్రుడు పాణిగాను, ఉపేంద్రుడు పాదముగాను, ప్రజాపతి గుహ్యముగాను,మృత్యుదేవత పాయువుగాను ఈశ్వరునికి కర్మేంద్రియములు అయ్యెను.


       పిండాండమునందు ఎవరైతే ఆధి దైవికంగా ఉన్నారో బ్రహ్మాండమందు వాళ్ళే ఆధ్యాత్మికం అయ్యారు. ఈ విధముగా ఆకాశ వాయు అగ్ని జల పృథ్వి పంచకాలు అయ్యాయి బ్రహ్మమునందు. పిండాండ మునందు కదంబాలు ఎలా చెప్పామో, అలాగే బ్రహ్మాండమందు కూడా కదంబాలు ఉన్నాయి.


       పృథ్వి కదంబం: పృథ్వి అర్థాంశములో మృత్యుదేవత పుట్టెను. పృథ్విలో జలము కూడగా క్రియాశక్తి అయ్యెను. పృథ్విలో అగ్ని కూడగా అశ్వినీదేవతలు అయ్యెను. పృథ్విలో వాయువు కూడగా విశ్వకర్త అయ్యెను. పృథివి ఆకాశము కూడా రుద్రుడు అయ్యెను. క్రిందనుంచి పైకి,చివరి వరుసలో పాయురింద్రియము, గంధము,ఘ్రాణము, అపానవాయువు, అహంకారముగా వున్నవి. కదంబములో అలా కిందినుంచి పైకి వస్తున్నాయి. తరువాత క్రిందినుండి పైకి ఆఖరి వరుసనుండి రెండవ వరుస చూడండి.

       జల కదంబం: జలములో పృథ్వి కూడగా ప్రజాపతి అయ్యెను. జలముయొక్క అర్థాంశము జ్ఞానశక్తి అయ్యెను. జలములో అగ్ని కూడగా వరుణుడు డయ్యెను. జలములో వాయువు కూడగా విశిష్టుడు అయ్యెను. జలములో ఆకాశము కూడగా క్షేత్రజ్ఞుడు అయ్యెను.


       అగ్ని కదంబం : అగ్నిలో పృథ్వి కూడగా ఉపేంద్రుడు అయ్యెను. అగ్నిలో జలము కూడగా ఆదిశక్తి అయ్యెను. అగ్నియొక్క అర్థాంశము సూర్యుడు అయ్యెను. అగ్నిలో వాయువు కూడగా అజుడు అయ్యెను. అగ్నిలో ఆకాశము కూడగా బృహస్పతి అయ్యెను.


       వాయువు కదంబం: వాయువులో పృథ్వి కూడగా దేవేంద్రుడు, వాయువులో జలము కూడగా ఇచ్ఛాశక్తి, వాయువులో అగ్ని కూడగా వాయుదేవుడు, వాయువు యొక్క అర్థాంశము విశ్వయోని అయ్యెను. వాయువులో ఆకాశము కూడగా చంద్రుడు అయ్యెను.


       ఆకాశ కదంబం: ఆకాశంలో పృథ్వి కూడగా అగ్నిదేవుడు అయ్యెను. ఆకాశములో జలము కూడగా పరాశక్తి, ఆకాశములో అగ్ని కూడగా అష్టదిక్కులు, ఆకాశంలో వాయువు కూడగా జయుడు, ఆకాశము యొక్క అర్థాంశము గురుమూర్తి అయ్యెను.


       ఇది బాగా అర్థం చేసుకోవాలంటే పిండాండంలో ఉన్న ఈ ఐదు కదంబాలు, బ్రహ్మాండంలో  5 కదంబాలు పక్కనపెట్టి చదువుకోవాలి. పిండాండంలో జల కదంబమును చదివి వెంటనే బ్రహ్మాండంలో జల కదంబం చదివితే అక్కడ అధిదేవతలు ఇక్కడ ఆధ్యాత్మికము అయినట్లుగా, అక్కడ వ్యష్ఠి వ్యవహారం ఇక్కడ సమష్టి అయినట్లుగా తెలుస్తుంది. పటాలు చూచి,చెప్పుకుంటూ అవగాహన పెంచుకోవాలి.


       కదంబం అంటే ఏమిటి? ఈ ఐదు భూతములు ఎన్ని రకాలుగా రెండు రెండుగా ఉండే అవకాశమున్నదో, దేనిలో ఏది కలసి రెండు రెండు అయినాయో ఆ విధముగా వర్గీకరించబడినదే కదంబము అని అర్థము. రెండు లేక అనేక రకాల పూలతో ఉన్న మాలను కదంబంము అంటారు కదా! ఒకే రకం పూలమాలను కదంబం అనరు.


       ఆకాశ భూత స్తబకము: ఈశ్వరుడనే గురుమూర్తి జయునితో కూడి, అష్టదిక్కుల ద్వారా,పరాశక్తిని గుర్తెరిగి, అగ్ని దేవుని ద్వారా వచించున్నాడు.


       వాయుతత్వ స్తబకము:  స్తబకము అంటే వ్యాపారము వ్యవహారము. ఇంద్రియ వ్యాపారము. ఇక్కడ ఈశ్వరుని విలాసము. ఈశ్వరుడనే గురుమూర్తి చంద్రరూపమై, విశ్వయోనిని కూడుకొని, వాయుదేవుని ద్వారా ఇచ్ఛాశక్తిని గుర్తెరిగి, దేవేంద్రుని ద్వారా దానప్రతిగ్రహణములు చేయుచున్నాడు.


       అగ్ని తత్వ స్తబకము: ఈశ్వరుడనే గురుమూర్తి బృహస్పతి రూపమై, అజుని కూడుకొని, సూర్యుని ద్వారా ఆదిశక్తిని గుర్తెరిగి,ఉపేంద్రుని ద్వారా  గమనాగమన ములు చేయుచున్నాడు.


       జలతత్వ స్తబకము: ఈశ్వరుడనే గురుమూర్తి క్షేత్రజ్ఞ రూపమై, విశిష్టుని కూడుకొని, వరుణుని ద్వారా జ్ఞానశక్తిని గుర్తెరిగి, ప్రజాపతి ద్వారా ఆనందిస్తున్నాడు.


       పృథ్వితత్వ స్తబకము: ఈశ్వరుడనే గురుమూర్తి రుద్రరూపమై, విశ్వకర్తను కూడుకొని,అశ్వనీ దేవతల ద్వారా క్రియాశక్తిని గుర్తెరిగి,మృత్యుదేవత ద్వారా మలవిసర్జన చేయుచున్నాడు.


       అష్టప్రకృతి లయము : ముందు కర్మేంద్రియాలను తరువాత విషయాలని తరువాత జ్ఞానేంద్రియాలను, అట్లాగే వీటన్నింటినీ లయం చేసి, అష్ట ప్రకృతి లయంలో వరుసగా సూక్ష్మ పృథ్వి సూక్ష్మ జలములో లయము, సూక్ష్మ జలము సూక్ష్మ అగ్నిలో  లయము, సూక్ష్మ అగ్ని సూక్ష్మ వాయువులో లయము, సూక్ష్మ వాయువు సూక్ష్మ ఆకాశంలో లయము, సూక్ష్మ ఆకాశం మహదహాంకారంబు లో లయము, మహ దాహంకారము మహత్తులో లయము, మహత్తు అవ్యక్తముగానున్న అచల పరిపూర్ణమును చూచి లయము అని అన్నాము కదా!


       వ్యష్టి జీవుడు సమష్టి ఈశ్వరుడు యొక్క అంశ కదా! అలాగే సూక్ష్మ భూతాల అంశాలుగా తన్మాత్రలున్నాయి. మరి బ్రహ్మాండమంటే సూక్ష్మం కదా! పిండాండం స్థూలం కదా! అందుకని పృథ్వికి కఠినాంశ, జలమునకు ద్రవాంశ ,అగ్నికి తేజాంశ, వాయువుకు చలనాంశ, ఆకాశమునకు బయలాంశ అని బ్రహ్మాండము చెప్పుకోవాలి. ఇక లయ విధానము చెప్పుకుందాము.


       పృథివీ పంచక లయము : పృథ్వి యొక్క కఠినాంశములో ఆకాశం యొక్క బయలాంశ చేరగా,అగ్నిదేవుడు లయము. పృథ్వి యొక్క కఠినాంశంలో వాయువు యొక్క చలనాంశ చేరగా, దేవేంద్రుడు లయం, పృథ్వియొక్క కఠినాంశంలో అగ్ని యొక్క తేజాంశ చేరగా ఉపేంద్రుడు లయం, పృథివియొక్క కఠినాంశములో జలముయొక్క ద్రవాంశ చేరగా గుహ్యేరద్రియము లయము. పృథివి అను నిండాంశంలో దాని అర్థాంశము చేరగా మృత్యు దేవత లయము.


జల పంచకలయం:  జలం యొక్క ద్రవాంశలో ఆకాశం యొక్క బయలాంశ చేరగా పరాశక్తి లయం. జలం యొక్క ద్రవాంశంలో వాయువు యొక్క చలనాంశ చేరగా ఇచ్ఛాశక్తి లయం. జలము యొక్క ద్రవాంశంలో అగ్నియొక్క తేజాంశ చేరగా ఆదిశక్తి లయం. జలం యొక్క ద్రవాంశలో, పృథ్వి యొక్క కఠినాంశ చేరగా క్రియాశక్తి లయం. జల మను నిండాంశములో దాని అర్థాంశము చేరగా జ్ఞానశక్తి లయము.


       అగ్ని పంచక లయము: అగ్ని యొక్క తేజాంశంలో ఆకాశము యొక్క బయలాంశము చేరగా అష్టదిక్కులు లయము. అగ్ని యొక్క తేజాంశము లో వాయువు యొక్క చలనాంశము చేరగా  వాయుదేవుడు లయము. అగ్ని యొక్క తేజాంశములో జలం యొక్క ద్రవాంశం చేరగా వరుణుడు లయము. అగ్ని యొక్క తేజాంశంలో పృథ్వి యొక్క కఠినాంశము చేరగా అశ్వనీ దేవతలు లయము. అగ్ని అనే నిండు అంశంలో దాని అర్థాంశము చేరగా, సూర్యుడు లయము.


       వాయు పంచక లయము: వాయువు యొక్క చలనాంశములో ఆకాశము యొక్క బయలాంశ చేరగా జయుడు లయము. వాయువు యొక్క చలనాంశములో  అగ్నియొక్క తేజాంశ చేరగా అజుడు లయము. వాయువు యొక్క చలనాంశంలో జలము యొక్క ద్రవాంశం చేరగా విశిష్టుడు లయము. వాయువు యొక్క చలనాంశములో పృథ్వియొక్క కఠినాంశము చేరగా  విశ్వకర్త లయము. వాయువు అనే నిండాంశములో దాని అర్థాంశము చేరగా విశ్వయోని లయము.


       ఆకాశ పంచక లయము : ఆకాశము యొక్క బయలాంశములో, పృథ్వి యొక్క కఠినాంశము చేరగా రుద్రుడు లయము. ఆకాశము యొక్క బయలాంశములో జలము యొక్క ద్రవాంశం చేరగా క్షేత్రజ్ఞుడు లయము. ఆకాశము యొక్క బయలాంశములో అగ్ని యొక్క తేజాంశము చేరగా, బృహస్పతి లయము. ఆకాశము యొక్క బయలాంశములో వాయువు యొక్క చలనాంశము చేరగా చంద్రుడు లయము. ఆకాశమనే నిండాంశములో గురుమూర్తి అనే అర్థాంశము చేరగా, గురుమూర్తి లయము.


       పిండాండ పంచీకరణలో సూక్ష్మ పృథ్వి,సూక్ష్మ జలము, సూక్ష్మ అగ్ని, సూక్ష్మ వాయువు,సూక్ష్మ ఆకాశము ఎలా ఉన్నాయో, వాటి బదులు ఇక్కడ ఏమున్నాయి అంటే, అధిష్టాన దేవతలుగా మృత్యుదేవత, జ్ఞానశక్తి ,సూర్యుడు, విశ్వయోని,గురుమూర్తి ఉన్నారు. పృథ్వి జలములో, జలము అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశములో లయమైనట్లుగానే, మృత్యుదేవత జ్ఞానశక్తిలో లయము, జ్ఞానశక్తి సూర్యుడిలో లయము, సూర్యుడు విశ్వయోనిలో లయము,విశ్వయోని గురుమూర్తిలో లయము. అలా చెప్పుకోవాలి.


       పంచభూత లయము: కఠినంశము ద్రవాంశమందు, ద్రవాంశం తేజాంశమందు,తేజాంశము చలనాంశమునందు, చలనాంశము బయలాంశమునందు, బయలాంశము మహదహంకారమునందు, మహదహంకారము మహత్తునందు, మహత్తు అవ్యక్తముగానున్న అచల పరిపూర్ణమును చూచి లయము.


సూక్ష్మాతిసూక్ష్మ భూతాలు అంటే, సూక్ష్మ భూతాలయొక్క అంశలు అన్నమాట, అవి లయమైనాయి.


       అష్ట ప్రకృతి ఏమిటి? కొందరు సూక్ష్మ పంచ భూతాలు, సూర్యుడు, చంద్రుడు, పురుషుడు అంటున్నారు. కొందరేమో పంచతన్మాత్రలు,మహదహంకారము, మహత్తు, అవ్యక్తము అంటున్నారు. మన సాంఖ్య పద్ధతిలో చివరి మూడు మహదహంకారము, మహత్తు, అవ్యక్తము అని తీసుకుందాము. మొదటి ఐదులో పిండాండములో సూక్ష్మ భూతాలను,బ్రహ్మాండములో తన్మాత్రలను అనగా అంశలను తీసుకుందాము.


       ఈశ్వరుడు మళ్ళీ సుషుప్త్యావస్థ నుంచి,జాగ్రదావస్థలోకి ఎప్పుడైతే మేల్కొంటాడో అప్పుడు ఈశ్వరునికి సంకల్పం వస్తుంది. అదే ఇచ్చాశక్తి. ఇచ్ఛాశక్తివల్ల సంకల్పం కలిగింది. ఆ సంకల్పంవల్ల ఏకకాలంలో బహిః ప్రజ్ఞ, అంతః ప్రజ్ఞ పనిచేస్తుంది. బహిఃప్రజ్ఞ చేసిందంతానేమో పంచ భూతాలు, నామరూపాలు,జోవోపాధులుగా అస్తిత్వము కలిగి ఉంటుంది.


       అది విరాట్‌ పురుషుని యొక్క అన్నమయకోశంగా స్థూలదేహంగా ఉంటుంది. అంతః ప్రజ్ఞగా జరిగేదంతా స్వప్నతుల్యముగా లీలా విలాసముగా, అసంగముగా జగద్విలాసముగా ఉంటుంది.


       క్రియాశక్తి అధి దేవతగా పని జరిగేదంతా ఈశ్వరుని ప్రాణమయకోశముగా ఉంటుంది. జ్ఞానశక్తి అధిదేవతగా జరిగేదంతా ఈశ్వరుని మనోమయ కోశముగా ఉంటుంది. ఇచ్ఛాశక్తి అధి దేవతగా ఉండేది ఎక్కడైతే ఈశ్వర సంకల్పము ప్రారంభమవుతుందో, అక్కడ మహత్తుగా ఉంటుంది. అదే ఈశ్వరునియొక్క విజ్ఞానమయ కోశము. అవ్యాకృత స్థితియే ఈశ్వరునియొక్క ఆనందమయ కోశము లేక సుషుప్త్యావస్థ. ఈ విధముగా ఈశ్వరునియొక్క పంచకోశాలు నిర్ణయించాము.


       బ్రహ్మాండం కేవలం శక్తిరూపం. పిండాండమందు జరిగే వాటికి ఆ శక్తి ఆధారము. అందువలన శక్తికి కూడా ఒక స్పందన కావాలి. ఆ స్పందన ఈశ్వరుని యొక్క స్పందన. ఈశ్వరుని స్పందనలకు కారణము పరమేశ్వరుని నుండి వస్తోంది. ఈశ్వరుని యొక్క ఇంద్రియాలన్నీ కూడా పరమేశ్వరుని యొక్క ఇంద్రియాలతో పనిచేస్తాయి. ఆ పరమేశ్వరుని యొక్క ఇంద్రియాలు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి,క్రియాశక్తి. ఈ మూడూ మాయ గనుక, ఆ మాయయే ఈశ్వరునికి ఉపాధి అయినది. పరమేశ్వరుడు మాయకు ప్రభువైనాడు. అందువలన పరమేశ్వరుడు నిర్గుణుడే.


       అంతఃకరణ చతుష్టయము, పంచ జ్ఞానేంద్రియాలు, కలసి 9 ముఖాలతో జ్ఞానశక్తి ప్రేరణతోటి, ఈశ్వరుడు మనోమయకోశంలో ఉండి, ఈ తొమ్మిది ముఖాలద్వారా, జీవుని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అలాగే పంచప్రాణాలు,పంచకర్మేంద్రియాలకు అధిదేవతలైనటువంటి 10మంది దేవతలు క్రియాశక్తి ప్రేరణచేత,ప్రాణమయకోశంలో ఉంటూ, జీవుల యొక్క పంచప్రాణాలను, జీవునియొక్క పంచ కర్మేంద్రియాలను ప్రేరేపిస్తూ అక్కడ పని చేస్తున్నాయి కాబట్టి, ఈ పది ఈశ్వరునియొక్క ఇంద్రియాలు అని పిలువబడేవి,10 ముఖాలుగా పనిచేస్తున్నాయి.


       కనుక ప్రాణమయ కోశంలో ఏమో ఈశ్వరుడు పది ముఖాలుగా పనిచేస్తున్నాడు. మనోమయ కోశంలోనేమో 9 ముఖాలుగా పనిచేస్తున్నాడు. అంటే జీవునియొక్క సూక్ష్మ శరీరంలో వున్న19 తత్వాలు ఈ రకంగా 19తత్వాలలో ఉన్నటువంటి ఇంద్రియాలను ఈశ్వరుడు సమష్టిగా ఉండి, ఈశ్వరుని యొక్క ఇంద్రియాలతోటి, జ్ఞానశక్తి క్రియాశక్తి యొక్క ప్రేరణతో ఈ 19 ముఖాలతోటి, ఈశ్వరుడు పనిచేస్తున్నాడు. ఈశ్వరుని 19 ముఖాలద్వారా జీవుల సృష్టి, స్థితి లయలు జరుగుతున్నాయి.


       జీవులయొక్క 19 ఇంద్రియాలు హిరణ్యగర్భునికి  ఇంద్రియాలైన అధిష్టాన దేవతల ప్రేరణతో పనిచేస్తున్నాయి. మరల జీవులు వారివారి కర్మానుభవం పొందేటట్లు చేస్తాయి. ఈ పని విరాట్పురుషుని వల్ల స్థూలంలో,హిరణ్యగర్భునివల్ల సూక్ష్మంలో జరుగుతుంది. కనుక ఈ 19 ముఖాలలో పనిచేసేటటువంటిది కేవలం హిరణ్యగర్భుడే కాకుండా, విరాట్‌ పురుషుడు కూడా. ఇవి ఈశ్వరుని యొక్క అవస్థలే కాని, ఈశ్వరుడు ఒక్కడే.


       ఈశ్వరుడు అంతఃప్రజ్ఞతోటి, ఈ 19ముఖాలతో పనిచేస్తుంటే హిరణ్యగర్భుడుగా పని చేసినట్లు అయ్యింది. అలాగే ఈశ్వరుడు ఈ 19ముఖాలతో బహిఃప్రజ్ఞతో పనిచేస్తే విరాట్పురుషుడు పనిచేసినట్లైనది.


       ఈ రకంగా ఈశ్వరుడు 19 ముఖాలతో జీవులయొక్క వ్యష్టి ఇంద్రియాలను అన్నింటినీ తాను సమష్టి రూపంలో ఉంటూ ప్రేరేపిస్తున్నాడు. ఆయన ప్రేరేపించడం అనేది లేదు. ఆయనవైపు నుంచి చూస్తే ఈశ్వరుడు ఒక ఆధ్యాత్మ, సమష్టి జ్ఞాత ఈశ్వరుడు. ఆయనే చేస్తున్నట్లైనది. కాబట్టి ఇదంతా ఈశ్వరునియొక్క వ్యవహారమైంది.


       ఈశ్వరుడు చంద్రుడనే మనస్సుతో జీవుల మనస్సుగా ఆలోచించుచున్నాడు. ఈశ్వరుడు బృహస్పతి అనే బుద్ధితో జీవుల బుద్దిగా నిర్ణయించుచున్నాడు. ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు అనే చిత్తముతో జీవుల చిత్తముగా చింతన చేయుచున్నాడు. ఈశ్వరుడు రుద్రుడు అనే అహంకారముతో జీవుల అహంకారముగా అభిమానించుచున్నాడు. ఇలాగే మిగిలిన ఇంద్రియాలన్నీ  19 ఇంద్రియాలలో పంచప్రాణాలు పోతే ఇక 14 ఇంద్రియాలు మిగిలినవి. కనుక ఈశ్వరుడు తన చతుర్ధశేంద్రియాలతో సర్వము జీవులయందు విలాసము జరుపుచున్నాడు.


       ఈశ్వరునికి సప్త అంగాలు ఉన్నాయి. ఏమిటవి అంటే, భూమి, నీరు, అగ్ని, వాయువు,ఆకాశం, పంచభూతాలు, సూర్యుడు, ద్యులోకం మొత్తం 7. ఈ 7 కలిసి సప్త అంగాలు. అంటే,పృథ్వి అనే భూతం ఈశ్వరుని యొక్క పాదాలు,జలము అనే భూతం ఈశ్వరునియొక్క మూత్రస్థానం, అగ్ని భూతం ఈశ్వరునియొక్క ముఖ స్థానం, వాయువు అనేది ఈశ్వరుని యొక్క ప్రాణం, ఆకాశము ఈశ్వరుని యొక్క ఉదరము. ఈశ్వరుడు నేత్రాలు సూర్యుడు, ఈశ్వరునియొక్క శిరస్సు ద్యులోకం. ద్యులోకమంటే సర్వర్గలోకము. ఈ విధముగా ఈశ్వరుడు తన సప్తాంగాలతో, 19ముఖాలతో జీవులయందు, ఆధ్యాత్మికంగా ఉంటూ, జీవులను కీలుబొమ్మలుగా ఆడిస్తున్నాడు. ఇదీ ఈశ్వర విలాసము.


       ఇప్పుడు బ్రహ్మాండ పంచీకరణం ఈ విధంగా చెప్పి ముగిద్దాము. గురుమూర్తి జ్ఞాతగా,చంద్రుడు మనసుగా, బృహస్పతి బుద్ధిగా,క్షేత్రజ్ఞుడు చిత్తముగా, రుద్రుడు అహంకారముగా పిండాండమందున్న జీవుల అంతరింద్రియముల ద్వారా, వ్యవహరించుచున్నాడు. అది ఆకాశ పంచకం. వాయు పంచకానికి వెళితే, జయుడు సమానవాయువుగా విశ్వయోని వ్యాన వాయువుగా  అజుడు ఉదాన వాయువుగా,విశిష్టుడు ప్రాణవాయువుగా, విశ్వకర్త అపానవాయువుగా జీవుల పంచ ప్రాణముల ద్వారా వ్యవహరించుచున్నాడు.


       అగ్ని పంచకంలో అష్టదిక్కులు సర్వజీవుల యొక్క శ్రోత్రేంద్రియములుగా, వాయుదేవుడు సర్వజీవుల యొక్క త్వగింద్రియముగా, సూర్యుడు సర్వ జీవులయొక్క చక్షురింద్రియములుగా,వరుణుడు సర్వ జీవులయొక్క జిహ్వేంద్రియములుగా, అశ్వనీ దేవతలు సర్వ జీవులయొక్క ఘ్రాణేంద్రియములుగా అన్ని వ్యష్టులు కూడిన సమష్టిగా వ్యవహరించుచున్నాడు.


       జల పంచకంలో పరాశక్తి శబ్ద తన్మాత్రగా ఆదిశక్తి స్పర్శ తన్మాత్రగా ఇచ్ఛాశక్తి రూప తన్మాత్రగా, జ్ఞానశక్తి రస తన్మాత్రగా, క్రియాశక్తి గంధ తన్మాత్రగా జీవులద్వారా విషయ పంచకమును గుర్తించుచున్నాడు.


       విశ్వాన్ని ప్రేరేపించేది తన్మాత్రల రూపంలో ఉంది. ప్రేరేపించబడ్డాక, పిండాండంలో అది విషయం అయ్యింది.పృథ్వీ పంచకములో,అగ్నిదేవుడు సర్వ జీవులయొక్క వాగింద్రియములుగా, దేవేంద్రుడు సర్వ జీవులయొక్క పాణీంద్రియములుగా, ఉపేంద్రుడు సర్వ జీవుల యొక్క పాదేంద్రియములుగా,ప్రజాపతి సర్వ జీవులయొక్క గుహ్యేంద్రియములుగా, మృత్యుదేవత సర్వ జీవులయొక్క పాయురింద్రియములుగా సర్వ జీవులయొక్క వ్యష్టి ఇంద్రియములతో కూడిన సమష్టి కర్మేంద్రియాలతో వ్యవహరించుచున్నాడు. ఇది బ్రహ్మాండ పంచీకరణ. ఇది మననం చెయ్యగా చెయ్యగా స్థిరమవుతుంది. బ్రహ్మాండ పంచీకరణ సామాన్యముగా బుద్ధికి పట్టదు. వ్యష్టి అనుభవము పూర్తియైన వారికి స్పష్టమవుతుంది.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List