భాగవతం - 24 వ భాగం ~ దైవదర్శనం

భాగవతం - 24 వ భాగం

 పరీక్షిత్తు వేటకి వెళ్ళి వేటాడాడు. దప్పిక, ఆకలి కలిగింది. ఆకలి దప్పిక కలిగినప్పుడు అవి పోగుట్టుకునేందుకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. పరీక్షిత్తుకి బుద్ధి భ్రంశము అవుతోంది. అతడు దగ్గరలో ఉన్న మహర్షి ఆశ్రమమునకు వెళ్ళాడు. అక్కడ దాహార్తి తీర్చమని ఎవరిని అడగాలి? అక్కడ ఆశ్రమంలో సంచరిస్తున్న స్త్రీ పురుషులనెవరినయినా అడగాలి. కానీ పరీక్షిత్తు వారినెవరినీ అడగలేదు.అతనిలో అహంకారము ప్రవేశించింది. నేరుగా అక్కడ తపోదీక్షలో ఉన్న శమీకమహర్షి దగ్గరకు వెళ్ళాడు.

ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడు? కదలిక లేదు.స్థాణువయిపోయి ఉన్నాడు. ధ్యానమునందు తపస్సునందు చాలా మగ్నుడయిపోయి బ్రహ్మమునందు రమిస్తున్నవాడు కదలిక లేక కర్ర నిలబదిపోయినట్లు స్థాణువయి ఉండిపోతాడు.

ఆయన అలా కూర్చుండి ధ్యానమగ్నుడై ఏమాత్రం కదలిక లేకుండా ఉన్నాడు. ప్రాణాయామము చేత ప్రాణమును నియంత్రించాడు. కుంభకము చేత వాయువును పూరించి ఆపుచేసేశాడు.కాబట్టి వక్షఃస్థలం కదలదు. మనస్సు ఊపిరిమీద ఆధారపడుతుంది. అటువంటి మనస్సు ఇప్పుడు కదలడం లేదు. మనస్సు కదలకపోవడం వల్ల బుద్ధికదలడం లేదు. బుద్ధి కదలకపోవడం వల్ల ఇంద్రియములు కదలడం లేదు. బయట విషయమును కన్ను చూడదు, చెవులు వినబడవు. స్పర్శేంద్రియములు బాహ్యజ్ఞానము తెలియదు. అందుకని అలా ఉండిపోయాడు. ఆయన జాగ్రదాది మూడు అవస్థలను దాటిపోయి చివరకు తురీయమనే స్థాయికి చేరిపోయి, తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరమును చూస్తూ బ్రహ్మముగా నిలబడిపోయి ఉన్నాడు. అలా కూర్చుని బ్రహ్మముతో రమించి ఉండిపోతే ఆయన వెంట్రుకలు, గోళ్ళు, పెరిగిపోతున్నాయి. అవి జటలు కట్టేసి కేశ సంస్కారము లేక వ్రేలాడుతున్నాయి. ఒక కృష్ణజింక చర్మమును కట్టుకుని అలా కూర్చుని ఉండిపోయాడు. వస్త్రం కూడా లేదు.

అటువంటి శమీకమహర్షి దగ్గరకు దాహంకోసం ఆర్తిపొందిన పరీక్షిత్తు వెళ్ళాడు. ఆయన నీటికోసం వెళ్ళడం ప్రధానాంశం. కానీ పరీక్షిత్తు లోపల ఒక మౌనభాష బయలుదేరింది. ఏమిటది? ఇప్పుడు పరీక్షిత్తు తానెవరో మరిచిపోయాడు. అతని బుద్ధి భ్రంశము అయిపొయింది బ్రహ్మమునందు రమిస్తున్న తాపసిని చూసి నిశ్శబ్దముగా తాను వెళ్ళిపోవాలి. కానీ తాను అలా వెళ్ళలేదు. తాను మహారాజునని, వస్తే లేచి నిలబడలేదని, తనకు నమస్కరించలేదని, తనకి ఆసనం చూపిన్చ లేదని ఆ తపస్వి మిక్కిలి అహంకారుడని భావించాడు.

ఇప్పుడేమయింది? అంత గొప్ప పరీక్షిత్తు, తెల్లవారిలేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు అన్నీ తెలిసినవాడు అన్నిటినీ మరచిపోయాడు. కలి ప్రవేశము వలన అన్నీ భ్రంశము అయిపోయాయి. దీనివలన అతనిలో ఆగ్రహం పుట్టింది. యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఒక స్థానంలోంచి మరొక స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు.

ఆ మహర్షిని ఎలా అవమానించాలా అని తలంచాడు. అక్కడ సమీపంలో చచ్చిపోయి పడివున్న పాము ఒకటి కనిపించింది. చచ్చిపోయిన పాము అయిన మెడలో వేసేసరికి చల్లగా తగులుతుంది. అపుడు మహర్షికి తెలివి వస్తుంది. అపుడు ఆయనను గేలిచేయవచ్చు అనుకున్నాడు. ఇపుడు పరీక్షిత్తు లోపల వికృతాతివికృతమయిన ఆలోచనలు పెరిగిపోతున్నాయి. అపుడు తన ధనుస్సు చివరి భాగంతో మృత సర్పమును పైకి ఎత్తాడు. ఒక ప్రభువు, ధర్మరాజు మనుమడు, అభిమన్యుడి కుమారుడు అయిన పరీక్షిత్తు, ఇపుడు ఒక చెయ్యరాని పనిని చేశాడు. ఇపుడు ప్రపంచంలో పరమ భయంకరమయిన సన్నివేశము జరుగుతోంది. ఆ మృత సర్పమును పైకెత్తి శమీక మహర్షి మెడలో వేశాడు.

కానీ ఆయనకు స్పర్శ తెలియలేదు. తపస్వియై ఉన్న వానిలోనికి కలి వెళ్ళలేకపోయాడు. ఎందుచేతనంటే మహర్షి ఇంద్రియములు, మనస్సు ఈశ్వరుని పట్టి వున్నాయి. ఒక్క స్థానమునకు ఆశ్రయం ఇచ్చిన పరీక్షిత్తులోనికి కలి ప్రవేశించి మొత్తం నాశనం చేయగలిగాడు.

కాబట్టి మనం బాగుపడాలంటే శమీక మహర్షి ఏది పట్టుకున్నాడో దానిని పట్టుకోవాలి అని భాగవతం చెపుతోంది. శమీకుడు ఈశ్వరుని పాదములు పట్టుకుని ఉన్నాడు. నీవు కూడా వాటిని పట్టుకో. ఆ స్పర్శ ఉన్నంతకాలం కలి నీ సమీపమునకు రాలేదు. ఇది భాగవతము చెప్తున్న తీర్పు. పరీక్షిత్తు తాను చేసిన పనికి సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయి, అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం తీసి ప్రక్కనపెట్టాడు. బంగారు కిరీటం ప్రక్కన పెట్టగానే అందులోంచి కలి బయటకు వెళ్ళిపోయాడు.

కిరీటం ప్రక్కన పెట్టగానే ఆయనకు అనుమానం వచ్చింది. ‘దాహం వేయడం ఏమిటి – నేను ఆయన ఆశ్రమమునకు వెళ్ళడం ఏమిటి – వెళ్ళిన వాడిని ఊరుకోకుండా చచ్చిపోయిన పామును ఆయన మెడలో వేయడం ఏమిటి – అయిపొయింది – నా రాజ్యం అయిపొయింది. నా ధనం అయిపొయింది – నా భోగం అయిపొయింది – నా పరిపాలన అయిపొయింది – నేను చెయ్యరాని దుష్కృతమును చేసేశాను – దీనికంతటికీ కారణం కలిపురుష ప్రవేశం – ఎంత తప్పు చేశానో కదా’ అని పశ్చాత్తాప పడ్డాడు. పరీక్షిత్తు సహజ స్థితి అదికాదు. కానీ కలిపురుషుడి వలన అలా భ్రష్టుడయి పోయాడు.

పరీక్షిత్తు మహర్షి మెడలో చచ్చిపోయిన పామును వేయడం, అక్కడ సమీపంలో ఉన్న మునికుమారులు చూశారు. వాళ్ళు పరుగెత్తుకుంటూ అక్కడికి సమీపంలో కౌశికీనది ఒడ్డున ఆడుకుంటున్న శమీక మహర్షి కుమారుడయిన శృంగి వద్దకు వెళ్ళారు. ఆ పిల్లవాడు మహా తపస్వి. ఆ పిల్లలు ‘మీనాన్నగారు తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు. మీ తండ్రి పలకలేదు. అపుడు ఆ రాజుకి కోపం వచ్చి చచ్చిపోయిన పామును ధనుస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెడలోవేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు.

ఈ మాటలు విన్న వెంటనే శృంగి అన్నాడు ‘నాతండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వలన రాజు క్షేమంగా రాజ్యమును పరిపాలించగలిగాడు. అని వెంటనే శాపం ఇవ్వడానికి కౌశికీ నదీ జలాలను చేతిలోకి తీసుకున్నాడు. చేతిలో ధనుస్సు ఉన్నది కదా అని ఆ రాజు చెయ్యకూడని పనిని చేశాడు. అటువంటి రాజు ఎవరయినా ఉండవచ్చు గాక! వానిని ఈశ్వరుడు, అడ్డినా, శ్రీమహావిష్ణువు అడ్డినా, నేటినుండి ఏడవనాటికి చచ్చి ఊరుకుంటాడు. తక్షకుడు అనే మహాసర్పము కాటు వలన రాజు మరణించుగాక!’ అని శపించి, నీళ్ళు విడిచిపెట్టి, తిరిగి ఆశ్రమమునకు వచ్చి, తండ్రి ముందుపడి ఏడవడం ప్రారంభించాడు.

తండ్రికి బాహ్యస్మృతి వచ్చింది. ‘ఎందుకు ఏడుస్తున్నావు? అని కుమారుని అడిగాడు. తండ్రీ మీ కంఠమునందు మృత సర్పము ఉన్నది అన్నాడు. దానిని తీసి క్రింద పడవేశాడు శమీకుడు. ఎవరు వేశారు అని కుమారుని ప్రశ్నించాడు. నాకు తెలియదు. ఎవరో రాజు వేశాడట. నేటికి ఎడవనాటికి ఆ రాజు చచ్చిపోవాలని నేను ఆ రాజును శపించాను అని శృంగి జవాబిచ్చాడు. వెంటనే మహర్షి అన్నారు – నాయనా, ఎంతపని చేశావు. నీవు చేసిన దుష్కర్మ వలన మనకి పాపం సంప్రాప్తిస్తుంది. నీవు రాజు మరణించాలని కోరుకున్నావు’. కలిపురుషుడు ప్రవేశించిన మనస్సులు అలా ఉంటాయి. అపకారియందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు. అటువంటి పరిపాలకుడు ఎక్కడ వస్తాడు మనకు! సమాజము భ్రష్టు పట్టిపోతుంది. పరీక్షిత్తును కొట్టి సమాజమునందు ఇన్ని ప్రమాదములు తేవడానికే కలి ఇలా నీచేత శాపం ఇప్పించాడు. నీవు క్రోధమునకు వశుడవు అయిపోయావు. ఎంత పొరపాటు చేశావు!’ అన్నాడు.

ఈవార్త పరీక్షిత్తుకు అందిపోయింది. ఇంకా నాటికి ఎదవరోజున శరీరం విడిచిపెట్టేస్తానని ప్రాయోపవేశం చేస్తానని గంగ ఒడ్డుకు వెళ్ళి, తూర్పుదిక్కుకు కొసలు ఉండేలా దర్భలు పరుచుకుని ప్రాయోపవేశం చేసి, ఈశ్వరుని యందు మనస్సును నిలబెట్టాడు. గంగ ఒడ్డుకు ఎందుకు వెళ్ళాడు అంటే ఎవరయినా గంగ దగ్గరకు వచ్చి ‘అమ్మా, గంగమ్మా’ అని పిలిస్తే గంగమ్మ పొంగిపోయి ఆ పిలిచినా వానిని ఎంతగానో అనుగ్రహిస్తుంది. గంగలో స్నానం చేయడం ద్వారా అతడు చేసిన తప్పులన్నిటినీ తీసివేసి మోక్షమును ప్రసాదించి పంపించివేస్తుంది. గంగ ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. ఎవరు యాగం చేస్తే దేవతలు అందరూ వచ్చి కూర్చున్నారో అటువంటి మహా పురుషుడు శాపగ్రస్తుడై ప్రాయోపవేశం చేశాడు. ఈ సన్నివేశమును చూడడానికి గౌతముడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు మొదలయిన ఋషులందరూ వచ్చారు. ఈ ఏడురోజులలో తాను ఏమిచేస్తే మోక్షం పొందుతాడో చెప్పవలసినదని పరీక్షిత్తు అందరినీ అడుగుతున్నాడు. ఇంత ధర్మమూ ఉన్నవాడు ఇంత అధర్మమయిన పని చేసేయ్యడమా! కలికి కొద్ది అవకాశం ఇస్తే అంత ప్రమాదమును తెచ్చేశాడు. కాలమును అతిక్రమించడం ఎవరి తరం కాదు. ఇంతటి స్తితిలో కూడా ఈశ్వర పాదములు పట్టుకున్న వాడు మాత్రం చెక్కు చెదరడం లేదు. ఆ సమయంలో అక్కడికి పదహారు సంవత్సరముల వయస్సు కల ఒకాయన వచ్చాడు. ఆయన మంచి యౌవనంలో ఉన్నాడు. నల్లటి జుట్టు ముఖం మీద చిందరవందరగా పడిపోయి ఉంది. ఒక కౌపీనము పెట్టుకుని ఉన్నాడు. చుట్టూ చిన్నపిల్లలు అందరూ చేరారు. సూర్యుడు  భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్లుగా ఒకరు పిలవకపోయినా ఆవుపాలు పితికే సమయం కంటే ఎక్కువసేపు ఒకచోట నిలబడని శుకుడు తనంత తాను నడిచి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయన తేజస్సు చూసి పొంగిపోయిన పరీక్షిత్తు ‘కృష్ణ భగవానుడిని మా వంశము అంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయంలో నాకు మార్గం చూపించడానికి గురువును పంపాడు కృష్ణ పరమాత్మ’ అని పొంగిపోయి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి శుకుడి కాళ్ళమీద పడితే, కదిలి వెళ్ళిపోవడం అలవాటున్న శుకుడు కూర్చున్నాడు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List