భాగవతం - తృతీయ స్కంధము - 28 వ భాగం ~ దైవదర్శనం

భాగవతం - తృతీయ స్కంధము - 28 వ భాగం

జయవిజయులకు సనకసనందనాదుల శాపము.

శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులని ఇద్దరు పార్షదులు ఉన్నారు. వైకుంఠములో వారిద్దరూ ద్వారం దగ్గర నిలబడతారు. వైకుంఠమునకు ఏడు ద్వారములు ఉంటాయి. ఏడవ ద్వారం దాటి లోపలి వెళితే స్వామి దర్శనం అవుతుంది. జయవిజయులు ఏడవ ద్వారమునకు అటూ ఇటూ నిలబడి ఉన్నారు. అప్పుడు సనకసనందనాదులు స్వామి దర్శనార్ధమై అక్కడికి వచ్చారు. వాళ్ళు మహా జ్ఞానులు. నిరంతరమూ భగవంతుని పాదములయందు భక్తితో ఉండే స్వరూపం ఉన్నవారు. వారు ఏడవ ద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. అపుడు జయవిజయులు వారిని ‘లోపలికి వెళ్ళడానికి వీలు లేదు’ అని అడ్డుపెట్టారు.

అపుడు సనకసనందనాదులు ‘ఇది వైకుంఠము. ఇక్కడ మాత్సర్యము ఉండదు. ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరము ఉండదు. అటువంటప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకుందుకు అభ్యంతరము ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆపినట్లు? లోపల ఉన్న స్వామి భక్త పరాధీనుడు. భక్తులయిన వారు వస్తే చాలు ఆయనే ఆర్తితో ఎదురువచ్చే స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు లోపల ఉంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయంలో ఆయనను దర్శనం చేయాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డుపెట్టడం మీకు మించిన స్వాతంత్ర్యము. కాబట్టి ఏది ఎక్కడ ఉండకూడదో దానిని మీరు చూడడం మొదలు పెట్టారు. కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలోకమునకు పొండి’ అన్నారు. అనేటప్పటికి జయవిజయులిద్దరూ సనకసనందనాడులు కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలు పెట్టారు.

ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఆయన శరీరం మీద నల్లని పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది. ఆ పుట్టుమచ్చను శ్రీవత్సము అని పిలుస్తాము. ఆ పుట్టుమచ్చను చూసి, ఆయన స్వరూపమును చూసి సనక సనందనాదులు పొంగిపోయారు. ‘మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపమును దర్శనం చేయగలిగాము. మా భాగ్యం పండింది’ అని ఆయన పాదముల మీద పడి నమస్కారం చేసి ‘పుష్పములో చేరే గండు తుమ్మెద ఎలా చేరుతుందో నిరంతరమూ నీ పాదములయందు అటువంటి భక్తి మాకు ప్రసాదించవలసింది’ అని ప్రార్థించారు.

అపుడు శ్రీమన్నారాయణుడు – ‘మీ స్తోత్రమునకు నేను చాలా సంతోషించాను. కానీ ఇక్కడ ఏదో చిన్న అల్లరి జరిగినట్లు నాకు అనిపించింది. ఏమయింది?’ అని అడిగాడు.

అపుడు వాళ్ళు – ‘స్వామీ మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు. కానీ మేము లోపలకి వస్తున్నప్పుడు ఏడవ ద్వారం దగ్గర ఈ పారిషదులు మమ్ములను అడ్డుపెట్టారు. మత్సరములు ఉండడానికి అవకాశం లేని వైకుంఠమునందు నీ దర్శనమునకు మమ్మల్ని పంపలేదు కనుక, వారు మాయందు విముఖులయి ఉన్నారు కనుక వారిని భూలోకమునందు జన్మించమని శపించాము. ఇప్పుడు నీవు ఎలా చెపితే అలా ప్రవర్తిస్తాము. ఒకవేళ మావలన అపరాధం అంటే మన్నించవలసినది’ అన్నారు.

అపుడు శ్రీహరి – ‘నా పాదములు మీవంటి బ్రహ్మ జ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు. కనుక ఇంతమంది చేత ఆరాధింపబడుతున్నాయి. మీవంటి వారిచేత పూజించబడి మిమ్మల్ని రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనం ఇస్తాను కనుక, నిత్యాపాయినియై నిరంతరమూ లక్ష్మి నావెంట వస్తోంది. నేను భక్త పరాధీనుడను. భక్తులయిన వారు పిలిస్తే పరుగెత్తుకు వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరుగెత్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించడంలో అడ్డువస్తే నా చేతిని నేను నరికేస్తాను’ అన్నాడు. ఎంతపెద్ద మాటో చూడండి! ఎందుకు అంటే ఆ చేయి లోకములనన్నితిని రక్షించే చేయి. అటువంటి మీరు నిరంతరమూ నన్ను తప్ప వేరొకరిని కొలవని వారు, ఎప్పుడూ నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు,చతుర్ముఖ బ్రహ్మ అంతటి వారు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చేయమంటే చేయకుండా కేవలము నా పాదపంజరము మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తుంది.’ ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమయిన విషయమును ప్రతిపాదన చేశారు.

‘నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపమును అంగీకరిస్తున్నానో తెలుసా! వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఈ అధికారం నేను ఇచ్చాను. ఏడవ ప్రాకార ద్వారము వద్ద వుండి వచ్చిన వాళ్ళని లోపలి పంపించండి అని చెప్పాను, లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని తొందరగా ప్రవేశపెట్టాలి అని అంతరము తెలుసుకొని, ముందు వాళ్ళకి నమస్కారం చేసి, లోపలి ప్రవేశ పెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. పరమ భాగవతులయిన వారికి కలిగిన మనఃక్లేశము పట్టి కుదిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడడానికి నేను లోపల ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు నావద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరమునందు పుట్టిన కుష్ఠు తనని పాడు చేసినట్లు నేను వీళ్ళకి పదవి ఇస్తే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఈ జయవిజయులు నాకే తప్పు పేరు తీసుకువస్తున్నారు. మీవంటి వారికే వైకుంఠమునందు ప్రవేశము నిరాకరింప బడితే భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకము పాడయిపోతుంది. నేను భక్త పరాధీనుడను. అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు. కాబట్టి వాళ్ళను మీరు శపించడం కాదు నేను చెపుతున్నాను.’
‘వీళ్ళు ఉత్తర క్షణం భూలోకమునకు వెళ్ళి రాక్షసయోని యందు జన్మించి ఉగ్రమయిన రాక్షసులై అపారమయిన లోభత్వమును పొందుతారు’ అన్నాడు.

అప్పుడు జయవిజయులిద్దరు శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి ‘స్వామీ, లోపల ఉన్నవాడి హృదయమును అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. మమ్ములను క్షమించు. మళ్ళా మాకు ఎప్పుడు వైకుంఠమునకు ఆగమనం’ అని అడిగారు. అపుడు స్వామి ‘మీరు మూడు జన్మలలో గొప్ప రాక్షసులు అవుతారు. కానీ మిమ్మల్ని మళ్ళా దునుమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీ కోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళా తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా రక్షణే!

04. యజ్ఞ వరాహ మూర్తి:

ఇప్పుడు అందులో ఒకడయిన హిరణ్యాక్షుడు, పశ్చిమ సముద్రం అడుగున ఉన్న వరుణుడిని యుద్ధమునకు రమ్మనమని పిలుస్తున్నాడు. ఆ సమయమునకే యజ్ఞవరాహ మూర్తి జన్మించాడు. ఆయన అవతారం వచ్చింది. వరుణుడు అన్నాడు – ‘సముద్ర జలముల మీదకు ఒక కొత్త భూతం వచ్చింది. నీవు దానితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణంగా యజ్ఞవరాహ మూర్తిని ఎక్కడయినాఏదయినా ఫోటో చూసినప్పుడు, ఒక పంది స్వరూపమును వేసి దాని మూపు మీద రెండుకోరల మధ్య భూమిని ఎత్తుతున్నట్లుగా వేస్తారు. కానీ పరమాత్మ అలా ఉండదు. యజ్ఞవరాహ మూర్తి అంటే ఎవరో తెలుసా! యజ్ఞవరాహ మూర్తి వర్ణన విన్నా ఆవిర్భావమును గూర్చి విన్నా, చదివినా, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమయిపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపముతో ఆయన దర్శనం ఇచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఆ హుంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు. ఆయన గుర్ గుర్ అని శబ్దం చేస్తున్నాడు. వ్యాసులవారు అలాగే వర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞ వరాహం. ఇప్పుడు ఆయననను స్తోత్రం చేయాలి. అందుకని ఋషులందరూ నిలబడి ఋగ్వేదములోంచి, యజుర్వేదము లోంచి, సామవేదంలోంచి సూక్తములను వల్లిస్తూ ఆ యజ్ఞవరాహమునకు నమస్కారం చేస్తున్నారు.

అపుడు యజ్ఞవరాహం అడుగులు తీస్తూ అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించి తన నాసికతోటి మూపుతోటి సముద్ర అడుగు భాగమును కెలకడం ప్రారంభించింది. ముఖం అంతా నీటితో నిండిపోతోంది. యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను. ఒక్కసారి తన ముఖమును పైకెత్తి కనురెప్పలను ఒకసారి చిట్లించి మెడను అటూ ఇటూ విసురుతోంది.

అలా విసిరినప్పుడు దాని జూలులోంచి నీళ్ళు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి ఆయన నుండి పడిన నీటికోసమని దానిక్రింద తలపెట్టారు. ఈ కంటితో చూడరాని పరమాత్మ ఇవ్వాళ యజ్ఞవరాహంగా వచ్చారు. ఆ నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి వెతికి భూమిని పట్టుకుని దానిని మూపు మీదకు ఎత్తుకుని రెండు దంష్ట్రల మధ్య ఇరికించి, పైకి ఎత్తి చూపించారు. అలా చూపించేసరికి దానిని చూసి ఋషులందరూ స్తోత్రం చేశారు.

మాఘ కవి తన చివరి రోజుల్లో  ఘూర్జర దేశం నుంచి ధారానగరం చేరాడు.తన తీవ్రమైన అస్వస్థత వల్ల
భోజరాజు ఆస్థానానికి తాను పోలేక  తాళపత్రం మీద ఒక శ్లోకం వ్రాసి తనభార్య చేతికిచ్చి భోజరాజుకు యిచ్చి రమ్మని పంపించాడు. ఆమె భోజుడి సభకు వచ్చి ఆ తాళపత్రం రాజుకు సమర్పించి తనభర్త తీవ్రమైన అస్వస్థత వల్ల రాలేక యిది పంపించారని చెప్పింది.అప్పటికే మాఘ కవి కవిత్వాన్ని  అందరూ పోగుడుతూండే వారు.
రాజు ఆ తాళపత్రం చదివి సభకు వినిపించాడు.అది అద్భుతమైన ప్రభాత వర్ణన.

        కుముద వన మపశ్రీ:, శ్రీమదంభోజ షండం
        త్యజతి ముదములూకః,ప్రీతిమాన్ చక్రవకః !
        ఉదయం-అహిమ రశ్మి: -- ,యాతి శీతాంశు రస్తం
        హతవిధి లలితానాం, హా,  విచిత్రో విపాకః
తా:--ఒకపక్క తెల్ల కలువల గుంపు కళ తప్పి వుంది,మరో పక్క తామరపూల సమూహానికి శోభ హెచ్చింది,
గుడ్లగూబ జోరు కోల్పోతున్నది,చక్రవాక పక్షికి హుషారు పెరుగుతున్నది,వేడి కిరణాల సూర్యుడు ఒక పక్క వుదయిస్తూవుంటే,మరోపక్క చల్లని కిరణాల చంద్రుడు క్రుంకుతున్నాడు,ఈ పాడు విధిలీల లలితమైన ప్రభావం  వస్తువులమీద ఎంత విచిత్రంగా వుంటుంది.ఒకరికి మాలినది యింకొకరికి చేటు అవుతున్నది.
  ఈ అద్భుతమైన వర్ణన విని భోజరాజు ఆనందం తో పొంగిపోయాడు.మాఘ పత్నికి మూడు లక్షలిచ్చి
అమ్మా!ఈ సొమ్ము ప్రస్తుతానికి మీ భోజనాదికాలకు మాత్రమే.రేపు ఉదయం నేను స్వయంగా వచ్చి మాఘకవిని దర్శించుకొని సత్కరిస్తాను అన్నాడు.
ఆ సొమ్ము తెసుకొని ఆమె యింటికి బయల్దేరింది.దోవలో ఎందరో యాచకులు కనిపించారు.వారంతా మాఘకవి కావ్యాల గొప్పతనం గురించి పొగుడుతున్నారు.మాఘుడి భార్య రాజు తనకిచ్చిన సొమ్మంతా వాళ్లకు దానం చేసేసి వట్టి చేతులతో యిల్లుచేరింది.స్వామీ! మీ శ్లోకం చదివి సంతోషించి చాలా సొమ్ము
బహూకరించాడు.కానీ అది నేను దోవలోనే యాచాకులకిచ్చి వేశాను.అని చెప్పింది అందుకు మాఘుడు
మంచిపని చేశావు.కానీ ఒకటే చిక్కు యింకా యాచకులు వస్తూ వుంటారు కదా!వాళ్ళకేమి యిచ్చేది?అన్నాడు.అంతలోనే  ఒక యాచకుడు వచ్చిమాఘుడి దగ్గర కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదని గ్రహించి
యిలా శ్లోకం చెప్పాడు.

                          ఆశ్వాస్య పర్వత  కులం తపనోష్ణ తప్తం -
                          ఉద్ధామ దావ విధురాణి చ కాననాని
                          నానానదీ నద శతానిచ పూరయిత్వా
                          రిక్తోస్తి యత్, జలదః సైవ తవోత్తమశ్రీ:(సా-యేవ-తవ-వుత్తమశ్రీ:)
తా:-- ఓ! మేఘుడా! సూర్యుడి వేడికి మాడిపోయిన కొండల గుంపునూ,దావాగ్ని తో కాలి చెడిపోయిన  అడవులనూ చల్లబరిచి, ఓదార్చి,అనేక నదీ నదాలను నీటితో నింపి వేసి నువ్వు వట్టిపోతే మాత్రం ఏమయింది?అదే నీకు అసలైన ఘనత
ఎంతటి పేదరికం లోవున్నా మాఘుడు వదాన్యుడు, సాహిత్యాభిమాని అంత  చక్కని  శ్లోకం  చెప్పిన కవిని
సత్కరించాలని వుబలాటం వున్నా చేతిలో సొమ్ము లేదు.బాధపడుతూ యిలా అన్నాడు.

                      అర్థాః న సంతి, న ముంచతి మాం దురాశా!
                      త్యాగే రతిం మహతి దుర్లలితం మనః మే
                      యాచ్నా చ లాఘవకరీ, స్వవధే చ పాపం
                      ప్రాణాః స్వయం వ్రజత!కిం పరిదేవనేన
తా:-- చేతిలో ధనం లేదు కానీ నన్ను ఈ దురాశ వదలకున్నది.నా పాడు మనసుకు దానం మీదే ఆసక్తి.
యాచన చేసినా దానం చేద్దామనుకుంటే చులకన  అయిపోతాను.ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం కదా!
ఓ!ప్రాణము లారా!మీ అంతట మీరే నన్ను విడిచి వెళ్ళిపొండి విచారమెందుకు?ఈ స్థితిలో మాఘుడిని చూసి వచ్చిన యాచకులు వచ్చిన త్రోవనే వెళ్ళిపోయారు.మాఘుడికి చాలా దుఖం కలిగింది.

         వ్రజత వ్రజత ప్రాణాః! అర్థిభి: వ్యర్థతాం గతాః
         పశ్చాదపి చ గంతవ్యం ; కవ స్వార్థః పునరీ దృశః
తా:--ఓ ప్రాణము లారా!యాచకులకు పనికి రాకుండా పోయిన నన్ను విడిచి ఆ యాచాకుల్లాగే వెళ్ళిపొండి
తర్వాతయినా పోవాల్సిందే కదా?అని విలపిస్తూనే మాఘుడు ప్రాణాలు వదిలాడు.
భోజరాజుకు ఈ విషయం తెలిసి రాత్రికి రాత్రే నూర్గురు బ్రాహ్మణులతో సహా మాఘుడి వసతి గృహానికి వచ్చి
చూశాడు.మరుదినం ఉదయమే మాఘుడికీ ఆయనతో బాటు ప్రాణాలు వదిలిన ఆయన భార్యకూ స్వంత
కొడుకు లాగా అంత్యక్రియలు యధావిధిగా జరిపించాడు.ఇది భోజ ప్రబంధము లోని కథ.
"శిశుపాలవధ"మహా కావ్యాన్ని, భారవి వ్రాసిన "కిరాతార్జునీయం"ని మించిన కావ్యాన్ని వ్రాయాలనే పట్టుదలతో 20 సర్గల కావ్యాన్ని  వ్రాశాడు.మాఘుడు  "శిశుపాలవధ"కూడా పంచమహా కావ్యాలలో  ఒకటి.ఈ కావ్యం లో తొమ్మిది సర్గలు చదివితే,యిక ఆ పాఠకుడికి సంస్కృత భాషలో కొత్త పదం అంటూ కనపడదని నానుడి.
"నవ సర్గ గతే మాఘే నవశ బ్దః  నవిద్యతే". ఆ కావ్యానికి వ్యాఖ్యానం వ్రాసిన మల్లినాథ సూరి "మాఘే,మేఘే
గతం వయః"అన్నాడు.(నా జీవిత మంతా మాఘ కావ్యాన్నీ,మేఘదూతం కావ్యాన్నీ  అధ్యయనం చేయటం తోనే గడిచి పోయింది అని చెప్పుకున్నాడు).
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List