దుర్గాసప్తశతి పారాయణ విధానము. ~ దైవదర్శనం

దుర్గాసప్తశతి పారాయణ విధానము.


శరన్నవ రాత్రులు (దేవి నవరాత్రులు) తొమ్మిది రోజులూ, దుర్గా సప్తశతిని పారాయణ చేయగల వారికి సమస్త సౌభాగ్య ఆయురారోగ్యములు, అఖండ పుణ్యఫల ప్రాప్తి సిద్దించటం అత్యంత సాధారణమైన అంశం. అయితే ఆ దుర్గా సప్తశతీపారాయణ క్రమము(విధానం) ఏమిటనేది చాలా మందికి కలిగే సందేహం! దుర్గాదేవీ భక్తులకు ఈ శరన్నవరాత్రుల్లో అనన్య మహిమాన్వితమైన సప్తశతీ పారాయణ క్రమం ఇక్కడ ఇవ్వబడింది. ఈ దుర్గా సప్తశతి యొక్క విశిష్టతను గుర్చి ముందుగా తెలుసుకోవాలి.

సప్తశతి విశిష్టత:
ఇంద్రాది దేవతలను అష్టకష్టాలపాలు చేసిన అసురులు విర్రవీగటం; దేవతల మొరపై కటాక్షించిన దుర్గాపరమేశ్వరి తిరిగి దేవతలకు స్వర్గలోక సామ్రాజ్యం ఇప్పించడం దుర్గా సప్తశతిలో ప్రధానాంశం.

అయినప్పటికీ ఇందులో లౌకికమైన కొన్ని కథలు కూడా చేరి ఉన్నాయి. తానెంతో ప్రేమతో,'తనవారు'అని భ్రమసిన భార్యాపుత్రుల చేతనే బయటకు తరమబడిన వైశ్య ప్రముఖుడు 'సమాధి'కథ, శత్రువుల చేత చిక్కి అంతవరకు సమస్త సుఖభోగాలనుభవించిన రాజు'సురధుడు' మన్యాశ్రమం చేరుకున్న వైనం.......తదుపరి-ఆ వైశ్యవరుడు,ఈ రాజప్రముఖుడూ కూడా దేవీ అనుగ్రహం చేత తిరిగి తమ-తమ యథాస్థితులను పొందగలగడం..........ఇత్యాది గాథలు దుర్గాదేవి మహిమను అపురూపంగా చూపిస్తున్నవి.
ఒకప్పుడు దేశంలో ఉపద్రవాలు, కరువు, ప్రకృతివైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఋత్విక్కులచేత ఈ దుర్గాసప్తశతి పారాయణ చేయించేవారని శతసంఖ్య పారాయణవల్ల అరిష్టాలు తొలగి అద్బుత ఫలితాలు కలిగాయని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇది కూడా మహర్షులే జగత్తుకు తెలియజేసిన అపూర్వసత్యం.

ఇంతటి విశిష్టత కలిగిన ఈ దుర్గా సప్తశతి యందు 13 అధ్యాయాలున్నాయి. నవరాత్రి తొమ్మిదిరోజులలోను ఈ 13 సంఖ్యగల అధ్యాయాలను ఎలా పారాయణ చేయాలి? అనే సమస్య సహజంగానే ఎవరికయినా కలుగుతుంది. ఇందుకు 3 విధాలను ఇక్కడ సూచించటం జరిగింది. దేవీ కటాక్షం పొందగోరువారు ఈ 3 విధాలలో ఏది ఎన్నుకున్నాఫలితం పొందడంలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు. కనుక భక్తులు తమకు అనుకూలమైన రీతిని ఎంపిక చేసుకోగలరు. మరో అంశం.....ఈ పారాయణ సమయంలో-ఆయా అధ్యాయాల్లో దేవతలు, ఇంద్రుడు, మునులు మున్నగు వారి స్తోత్రములు సందర్బానుసారం చేర్చబడి ఉన్నాయి.అవి ఇంకా అద్బుతఫలదాయకమైనవి.

మొదటి విధానము:
ఆశ్వయుజ మాసములోని శుక్లపక్షపాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిదిరోజులను శరన్నవ రాత్రములు అంటారని తెలిసినదే! ఈ 9 రోజులు అత్యంత పుణ్యప్రదమైన రోజులు. పారాయణ, నామజపం, దేవీస్తోత్రం, ఉపాసన, అర్చన....ఎవరికి ఏది అనుకూలమైతే అది ఆచరించటం అద్బుత పుణ్యదాయకం. మొదటి రోజు మొదలు తొమ్మిది రోజులూ ప్రతి దినమూ 13 అధ్యాయాములను పారాయణ చేయుట ఒక పద్దతి, పారాయణకు శ్రద్దభక్తులు అత్యంత అవసరం.13 అధ్యాయాలు ప్రతి రోజులు (కూర్చున్న ఆసనం పై నుంచి కదలకుండా) చేయడానికి కనీసం వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఐదారుగంటలకు తక్కువ లేకుండా పట్టవచ్చు! దైవకృప అపారంగా గల వారికి ఇది సాధ్యపడవచ్చు.!.మిగిలినవారికి మరో రెండు విధాలు:

రెండో విధానము:
1వరోజు (పాడ్యమి) ఒకే ఒక్క ప్రధమాధ్యాయం మాత్రమే
2వరోజు(విదియ) రెండు,మూడు,నాలుగు అధ్యాయాలు
3వరోజు(తదియ) ఐదు మొదలు పదమూడు అధ్యాయాలను పూర్తిగా
పైన చెప్పినట్లు-తొమ్మిది రోజులూ పుణ్యప్రదమైనవే కనుక మూడేసి రోజులను పారాయణకు ఎంచుకోవచ్చును. నియమం మాత్రం ఒక్కటే! "ఏ మూడు రోజులయినా"అనిచెప్పి ఒకటో రోజు చేసి, రెండ్రోజుల తర్వాత కొన్ని అధ్యాయాలు, మరో రెండ్రోజులు ఆగి కొన్ని అధ్యాయాలు చదువరాదు. పాడ్యమి, విదియ, తదియలు ఎవరికైనా ఇబ్బందుల-ఆటంకాల దృష్ట్యా కుదరనపుడు-చివరి మూడు రోజులను(సప్తమినాడు కాక), దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని ఎన్నుకొనవచ్చును.అనగా 10వరోజు అయినప్పటికీ-దసరా పండుగ (విజయదశమి) రోజును కూడా కలుపుకోగలరు.

మూడో విధానము:
మొదటిరోజు-మొదటి అధ్యాయం
రెండవరోజు-రెండు,మూడు అధ్యాయాలు
మూడవరోజు-నాలగవ అధ్యాయం
నాల్గువరోజు-ఐదు,ఆరు అధ్యాయాలు
ఐదవరోజు-ఏడవ అధ్యాయం
ఆరవరోజు-ఎనిమిదో అధ్యాయం
ఏడవరోజు-తొమ్మిది,పది అధ్యాయాలు
ఎనిమిదవరోజు-పదకొండవ అధ్యాయం
తొమ్మిదవరోజు-పన్నెండో అధ్యాయం
విజయదశమి రోజు-పదమూడో అధ్యాయం.
ఈ ప్రకారం పైన సూచించిన విధాలలో ఏదైనా ఎన్నుకోవచ్చు! అయితే, పారాయణ చేస్తున్నంతకాలం ఈ విషయాలపై శ్రద్ద వహించాలి :

దుర్గాష్టోత్తర శతనామ/సహస్రనామములతో(ఏదైనా సరే-ఒకటి)పూజించుట.ధూపదీప నైవేద్యాలు అర్పించుట.

పారాయణకు ముందు అక్షతలు చేతులోకి తీసుకొని, తాము కోరుకున్న కోరికను మనస్సులోనే చెప్పుకొనుట.

పారాయణం అయిన వెంటనే అష్టోత్తర శత నామస్తోత్రం పఠించుట. పునఃపూజ చేయుట.
పానకం/వడపప్పు(పంద్యారాలకు) కొబ్బరి, బెల్లంపొంగలి/దద్యోజనం/వడలు వంటి పదార్థాలలో ఎవరి శక్త్యానుసారం వారు మహానైవేద్యం సమర్పించుట.

పూర్ణిమ/శుక్రవారంనాటికి (ఏవైనా అనివార్యమైన ఆటంకాలు ఎదురైనప్పుడు) పారాయణ ముగిసేలా చూసుకొనుట.

పారాయణ పరిసమాప్తమైన రోజున,ముత్తైదువను భోజనానికి ఆహ్వానించి, వస్త్రం, ఎర్రనిది దక్షిణ సహితంగా(9 సంఖ్య ఉండేలా) దానం ఇచ్చి పాదనమస్కారం చేయుట.
ప్రతి పారాయణ భాగానికి ముందుగా ఈ 3 శ్లోకాలు పఠించుట.

శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే| సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే||
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే| శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే||
సర్వబాధా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః| మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః||
దుర్గాసప్తశతీ పారాయణం చేసేవారు ముఖ్యంగా గమనించాల్సింది: ఎటువంటి కోపతాపాలకిగాని/వికారాలకుగాని లోను కారాదు. శుచి శుభ్రతలను పాటించడం అత్యంత కీలకం.
ఓం నమశ్చండికాంబికాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః దుర్గా సప్తశతి🌹
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive