* నాగలోక మహారాణి.
వంగ దేశంలో ' సంత్ సౌదాగర్' అనే వ్యాపారి వుండే వాడు. ఆ వ్యాపారి గొప్ప శివభక్తుడు. పరమశివుని తప్ప మరొక దైవాన్ని పూజించే వాడు కాదు. వంగ దేశస్తులు మానసాదేవి అనే నాగ దేవతని ఎక్కువగా కొలుస్తారు.
కాని సంత్ సౌదాగర్ మాత్రం మానసాదేవిని శతృవుగా చూసేవాడు. తన పలుకుబడి వున్న ప్రాంతాల్లో మానసాదేవి
పూజ చేసేవారిని అడ్డుకునేవాడు. దినితో కోపగించిన మానసాదేవి, వ్యాపారి యొక్క ఆరుగురి పిల్లలు
మరణించేలా చేసింది. అయినా సంత్ ఏమాత్రం చలించలేదు. తన లక్ష్యాన్ని మార్చుకోలేదు. తన శివపూజను మానకుండా చేసేవాడు. ఒక సారి సంత్ సౌదాగర్ తన వ్యాపారం చేసే సరుకునంతా 14 ఓడలలో నింపుకుని సముద్రయానం చేయసాగాడు.
మానసాదేవి సముద్రం మధ్య వ్యాపారి ముందు ప్రత్యక్ష మై, తనను పూజించకపోతే , ఆ వ్యాపారి పలు విధాలైన కష్టాలు ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించింది. సంత్ తన ధైర్యాన్ని కోల్పోలేదు. మానసాదేవి ఒక భయంకర తుఫాన్ వచ్చేలా చేసి, వ్యాపారి సామానంతా సముద్రంలో మునిగిపోయేలా చేసింది. వ్యాపారికి తనను కాపాడుకోవడమే కష్టమైనది.ఎలాగో ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. 12సంవత్సరాలపాటు అన్యదేశంలో బీదరికంతో పోరాడి చాలా శ్రమపడి స్వదేశానికి వచ్చాడు.
వ్యాపారికి ఒక మగ బిడ్డ కలిగాడు. అతను పెరిగి పెళ్ళీడుకు వచ్చాడు.కాని ఆ సంతోషం ఎంతో కాలం నిలువ లేదు. పుత్రుడు జాతకం ప్రకారం , పెళ్ళి అయిన రాత్రే , పాము కరిచి మరణిస్తాడని జోస్యులు చెప్పారు. వ్యాపారి తన కుమారుని ప్రాణాలు కాపాడే ప్రయత్నాలు చేయసాగాడు. బలమైన ఇనప కమ్మీలతో తలుపులతో కళ్యాణ వేదిక తయారు చేయించాడు. కుమారుడు లకీందర్ , బేహీలాను పెళ్ళి చేసుకుని సంతోషంగా వున్న సమయంలో , ఎంతో భద్రతతో నిర్మించిన ఆ గదిలోని చిన్న రంధ్రం గుండా ఒక పాము ప్రవేశించి లకీందర్ ప్రాణాలను తీసింది. విధిని గెలవడం ఎవరికి సాధ్యం? అందరూ దుఃఖంలో మునిగి వున్నారు. కాని పెళ్ళి కూతురైన బేహీలా వ్యాకులపడలేదు.
ఈ దురదృష్టాన్ని తనకి వరప్రసాదంగా మార్చుకోవాలని ప్రయత్నించసాగింది. ఎందరు ఎదురు చెప్పినా లెక్క చేయకుండా, తన భర్త శవాన్ని ఒక పడవలో పెట్టుకుని సముద్రంలో పయనం ఆరంభించింది. అనేకరోజులపాటు రాత్రి అని పగలని చూడకుండా పడవని నడుపుకుంటూ వెళ్ళ సాగింది. చనిపోయిన లకీందర్ శరీరం ఎండకూ , వానకు ,గాలికి కరిగిపోసాగింది. ఎముకలుమాత్రమే మిగిలాయి. అయినా బేహీలా కృతనిశ్చయంతో
పడవ నడుపుకుంటూ వెళ్ళసాగింది. ఆరు మాసాల తరువాత ఆమె భగవంతుని సన్నిధికి వెళ్ళింది. తన గుణగణాలతో దేవుని మెప్పించింది.
ఆ దేవుని వరాల ఫలితంగా తన భర్తని , అతని ఆరుగురు సోదరులను పునర్జీవులను చేయించి తిరిగి ఇల్లు చేరింది. వెంటనే మానసాదేవిని భక్తి శ్రధ్ధలతో పూజించినది. ఆమె కోరిక ప్రకారం సంత్ సౌదాగర్ కూడా తన ఎడమ చేతితో ఒక పుష్పాన్ని తీసుకుని మానసాదేవిని అర్చించాడు. ఈ విధంగా మానసాదేవి పూజలు వారింట ఆరంభమైనవి.
ఈ బేహీలా, లకీందర్ కధ పారంపర్యంగా వంగదేశంలో బహుళ ప్రచారం పొందింది. భార్యాభర్తల అనుబంధం ,అన్యోన్య ప్రేమ, పతిభక్తికి ఉదాహరణగా ఈ కధను చెప్పుకుంటారు. శ్రావణమాసం లోని ఆఖరి రాత్రి భాద్రపద మాసంలోని మొదటి రోజు మానసాదేవిని పూజించే రోజుగా ఏర్పడినది. వంగదేశానికి చెందిన ద్విజాబన్సీదాస్ మైమెన్ సింగ్ అనే ఆయన ఈ పండుగ విశిష్టతని పాటల రూపంలో పొందుపరిచారు.
వ్యవసాయదారులు విత్తనాలు జల్లే కాలంలో ఒక రోజు పొలం పనులకు స్వస్తి చెప్పి ,ఆ రోజున లకీందర్..బేహీలా
అమర ప్రేమ కధను పండుగగా జరుపుకుంటారు. దుర్గాపూజలకి ముందు వారాలలో యీ పండుగ జరుపుకుంటారు. ఉత్తర ప్రదేశ్ లోని హరిద్వార్ నుండి 3 కి.మీ దూరంలో ప్రసిధ్ధిపొందిన మానసాదేవి ఆలయం వున్నది. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని కాశ్యపమహర్షి నిర్మించినట్లు స్థల పురాణాలు తెలియజేస్తున్నాయి...
No comments:
Post a Comment