అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణ వల్లభే!
జ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం భిక్షాం దేహిచ పార్వతి!!
అన్నము నుండే సమస్త జీవులు సృష్టింపబడుతున్నవి.
సమస్త జీవులకు ప్రాణశక్తి అన్నము నుండే ఉద్భవిస్తుంది.
ఆకలి ప్రాణ శక్తిని క్షీణింపజేస్తున్నది.
కనుక అన్నము - ప్రాణ శక్తి - ఆకలి మూడును ఒకదానికొకటి అనుసంధానము కలిగి ఉన్నవి. సమయానికి అన్నము లభింపకున్న ప్రతి జీవి అలమటించును. కనుకే అన్నము పర బ్రహ్మ స్వరూపమై ఉన్నది.
ఆకలి రెండు రకములు ..
మొదటిది శరీర పోషణకు సంబందించినది..
రెండవది పారమార్ధికమునకు సంబందించినది.
ఈ రెండు ఆకళ్ళను తీర్చే తల్లి శ్రీ అన్నపూర్ణాదేవి. అందుకే అమ్మను ప్రాణ శక్తిని , జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటాము.
కాశీ క్షేత్రంలో అన్నపూర్ణా దేవి కొలువై ఉన్నట్లే శ్రీ క్షేత్ర హొరనాడు అనే క్షేత్రలో శ్రీ ఆది శంకర ప్రతిష్టిత అన్నపూర్ణా దేవి ఆలయం ఉన్నది..
స్థలపురాణం..!
భారత దేశం అంతటా పాద యాత్ర చేసి ఎన్నో పీఠాలను స్థాపించిన ఆది శంకరులు ఒకసారి మార్గ మద్యంలో ఒక చోట ఆగారు. శంకరులకు వారి శిష్య బృందానికి ఆకలిగా ఉంది. అది దట్టమైన అడవి ప్రాంతం. ఎక్కడా ఆతిద్యమిచ్చే గృహాలు లేవు. అప్పుడు శంకరులు అన్నపూర్ణా దేవిని స్తోత్రం చేయగా ఒక పండు ముత్తదువ రూపంలో వారిని సమీపించి ఆకలితో ఉన్నట్లు ఉన్నారు. మీరంతా మా గృహానికి వచ్చి మా ఆతిద్యం స్వీకరించవలసినది అని కోరింది.
శంకరులు వారి శిష్యులు ఆ ముత్తైదువ గృహానికి వెళ్ళగా అక్కడ పంచ భక్ష పరమాన్నాలతో షడ్రసోపేతమైన అన్నము పెట్టింది. శంకరులు ఆవిడ శ్రీ అన్నపూర్ణా దేవి అని గుర్తించి మరల స్తోత్రం చేసి అమ్మవారిని అక్కడే కొలువై ఉండమని ప్రార్ధించారు.
అప్పుడు అన్నపూర్ణ అక్కడ శాశ్వతంగా నిలిచిపోయారు. అదే నేడు హొరనాడు శ్రీ అన్నపూర్ణా ఆలయంగా భాసిల్లుతోంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించిన వారికి ఈ జన్మలో అన్నపానీయాలకు లోటు ఉండదు అని ప్రతీతి.
హొరనాడు అనే ప్రాంతం బెంగళూరు నుండి 330 కి.మీ. దూరంలో గల అందమైన ప్రాంతం. ఇది శృంగేరి" క్షేత్రం నుండి 75 కి.మీ. దూరంలో గలదు. బెంగళూరునుండి ఈ ప్రాంతానికి ప్రతిరోజూ బస్సులు ఉంటాయి.
No comments:
Post a Comment