బడే హనుమాన్‌జీ మందిర్‌. ~ దైవదర్శనం

బడే హనుమాన్‌జీ మందిర్‌.






 * శయన హనుమంతుడు..!

* బడే హనుమాన్‌జీ మందిర్‌..


ఏ దేవాలయంలో అయినా.. కుడిపక్కకు తిరిగీ లేదా గర్భగుడికి అభిముఖంగా దర్శనమివ్వడం మనందరికీ తెలిసిందే. కానీ, ప్రయాగలోని త్రివేణీ సంగమానికి దగ్గర్లో ఉన్న బడే హనుమాన్‌జీ మందిర్‌లో మాత్రం ఆంజనేయుడు వెల్లకిలా శయన ముద్రలో ఉండి. భక్తుల పూజలు అందుకుంటున్నాడు. దేశంలో ఈ ఒక్క ఆలయంలోనే హనుమంతుడు ఇలా వీరముద్రలో కనిపిస్తాడని అంటారు.


పేరుకు తగినట్లుగానే బడే హనుమాన్‌ జీ మందిరంలోని హనుమంతుడి విగ్రహం ఇరవైఅడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పులో ఉంటుంది. గర్భగుడి కూడా హనుమంతుడు శయనించేందుకు వీలుగా దాదాపు ఎనిమిది అడుగుల లోతుగా ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులెవరైనా స్వామివారిని పైనుంచే చూసి పూజించాల్సి ఉంటుంది. ఈ  రామభక్తుడిని దర్శించేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచీ రావడం ఒక విశేషమైతే... స్వామివారికి అభిషేకం చేయడానికి ప్రతిఏటా గంగానదే తరలిరావడం ఇక్కడున్న మరో ప్రత్యేకత. వర్షాకాలంలో నీటి ప్రవాహ ఉద్ధృతి పెరిగినప్పుడు గంగ ఉప్పొంగి.. ఆలయంలోపల ఉన్న హనుమంతుడి విగ్రహం వరకూ వస్తుంది. ఆ సమయంలో గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తరువాత ఆ నీరు ఎక్కడికి పోతుందనేది ఇప్పటివరకూ ఎవరూ గుర్తించలేకపోయారు. అలా గంగాజలం హనుమంతుడిని తాకడం వల్ల దేశంలో సుఖసంతోషాలూ, ప్రశాంతత వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం. ఆ వింతను చూసేందుకే భక్తులు వర్షాకాలంలో ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు.


స్థలపురాణం..

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ అనే ఊళ్లో ఓ హనుమంతుడి భక్తుడు ఉండేవాడు. అతడికి సిరిసంపదలు ఉన్నా.. సంతానం లేదట. దాంతో వింధ్యాచల పర్వతాల దగ్గర హనుమంతుడి ఆలయం కట్టించాలని నిర్ణయించుకుని, భారీ ఆంజనేయుడి విగ్రహాన్ని తయారుచేయించాడట. ఆ విగ్రహానికి పలు నదీజలాలతో అభిషేకం చేయించేందుకు సిద్ధమై, ప్రయాగకూ చేరుకున్నాడట. ఆ రాత్రి అతడికి కలలో హనుమంతుడు కనిపించి.. ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేసి వెళ్తే గనుక కోరికలన్నీ నెరవేరతాయని చెప్పాడట. ఆ భక్తుడు హనుమంతుడు చెప్పినట్లుగానే విగ్రహాన్ని  వదిలేసి వెళ్లిపోయాడట. ఆంజనేయుడు వరమిచ్చినట్లుగానే అతడికో బిడ్డ కలిగాడట. అయితే ఆ భక్తుడు వదిలివెళ్లిన విగ్రహం రోజులు గడిచేకొద్దీ నీళ్లల్లో మునిగి... క్రమంగా ఇసుకలో కూరుకుపోయింది. 


కొన్నాళ్లకు ఓ స్వామిజీ మాఘమాసంలో త్రివేణీ సంగమంలో స్నానం చేయడానికి అక్కడికి చేరుకున్నాడరు. తనతో తెచ్చుకున్న త్రిశూలాన్ని అక్కడున్న ఇసుకలో గుచ్చి... ధుని తయారుచేసుకునే సమయంలో ఆ త్రిశూలానికి రాయి తగిలిన శబ్దం వినిపించడంతో చుట్టూ ఉన్న ఇసుకను తీయడం మొదలుపెట్టారు. చివరకు అతడికి హనుమంతుడి విగ్రహం కనిపించింది. అది తెలిసి స్థానికులూ అక్కడికి చేరుకుని ఆ విగ్రహాన్ని కడిగి.. పైకెత్తి ఎక్కడైనా ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించారట. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ విగ్రహాన్ని నిలబెట్టలేకపోవడంతో అక్కడే పడుకున్న భంగిమలోనే ఉంచి.. ఆలయం కట్టారు. అదే #బడే #హనుమాన్‌ మందిర్‌ అయ్యింది. 


ఇక్కడ హనుమంతుడి విగ్రహం పెద్దగా ఉండటం వల్లే స్వామివారిని బడే హనుమాన్‌ అని పిలుస్తారు. ఆంజనేయుడి కుడిపాదం దగ్గర రావణుడి విగ్రహం ఉంటుంది. దుర్భుద్ధి ఉన్నవారిని హనుమంతుడు నశింపచేస్తాడనడానికి సంకేతమే ఆ విగ్రహమని భక్తులు విశ్వసిస్తారు. అలాగే మరోపాదం దగ్గర మనోధైర్యానికి నిదర్శనమైన కామద దేవి, నుదుటి దగ్గర రాముడు, లక్ష్మణుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ హనుమాన్‌ జయంతి రోజున విశేషంగా పూజలు జరుగుతాయి. మిగిలిన రోజుల్లో మామూలుగానే భక్తులు వచ్చి... స్వామిని దర్శించుకుని కోరినట్లుగా పూజలు చేయించుకోవచ్చు. ఈ హనుమంతుడిని ప్రయాగ కొత్వాల్‌ అనీ పిలవడం గమనార్హం.


ఎలా చేరుకోవచ్చంటే...

ఇది ప్రయాగలోని త్రివేణీ సంగమానికి దగ్గర్లోనే ఉంటుంది. మార్చి, అక్టోబరు నెలలు ఈ ఆలయాన్ని దర్శించేందుకు అనువైన సమయం.  ప్రయాగ రాజు రైల్వేస్టేషన్‌ నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉంటుంది. విమానంలో వెళ్లాలనుకునేవారు బామ్‌రువాలీ ఎయిర్‌పోర్టులో దిగి... అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. విమానాశ్రయం నుంచి దాదాపు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List