* మార్గశిర నోము..
ఒకసారి గోకులంలో సకాలంలో వర్షాలు కురవక క్షామం ఏర్పడే సూచనలు కనిపించాయి. ఆ దుస్థితి నుండి బయటపడేందుకు ఊళ్ళోని కన్నెపిల్లలందరూ మార్గశిరమాసం నోము ఆచరిస్తే శుభప్రదమని ఊరి పెద్దలంతా
గోపికలకు బోధించారు. లోకక్షేమంతో పాటూ కృష్ణుడే తనకు భర్తగా లభించాలన్న కోరికతో గోకులంలోని ప్రతి కన్య మార్గశిర మాస నోము నోచడానికి సంసిధ్ధమయ్యారు.
ప్రాతఃకాలమున లేచి దైవ ప్రార్ధనలు చేస్తూ యమునాతీరానికి వెళ్ళి శుచిగా స్నానం చేసి కాత్యాయనీ దేవిని భక్తితో పూజించాలనేది నోము విధానం. ఆ నోము నోచడానికి గోపికలకి తోడుగా యమునానదికి కృష్ణుని పంపారు ఊరి పెద్దలు. ఇందువలన గోపికలకి ఆనందం మితిమీరింది.
ఎవరినైతే భర్తగా కోరుకుంటున్నారో ఎవరికోసం నోము నోచుకుందుకు సిధ్ధపడ్డారో ఆ కృష్ణుడే తమకు తోడుగా రావడం వారికి పరమానందం కలిగించింది. అన్నిటికంటే వారికి ఆనందం కలిగించినదేమిటంటే
అనుకోకుండా కృష్ణుని ని కోసం నోచే నోము మార్గశిరమాసం కావడం. మార్గశిర మాసపు చలికి భయపడి
పెద్దలు ఎవరూ బయటికి రారు. అందువలన ఏవిధమైన అడ్డంకులు లేకుండా కృష్ణుని తో ఆనందంగా గడపవచ్చని ఆ గోపికలకు ఆనందం.
శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలని కోరుకున్న ఆండాళ్ కి యీ గోపికలే మార్గదర్శకులు. తిరుప్పావై 26వ పాశురంలో " పెద్దల మార్గాన్నే అనుసరించాలి మనం" అని" అని ఆండాళ్ తన స్తుతులలో గోపికల మార్గమే పట్టింది.
గోపికలు నోము నోచిన మార్గశిర మాసంలోనే తనని కూడా ఒక గోపికగా భావించుకొని, తన స్నేహితురాండ్రను గోపికలుగా భావించి తన ఊరైన విల్లిపుత్తూరునే గోకులంగా భావించి. అక్కడ వున్న తిరుముక్కళమనే పుష్కరిణినే యమునా నదిగా భావించి, అక్కడ వటపత్రసాయి వున్న ఆలయాన్నే నందగోపుని ని ఇల్లుగా భావించి.
ఆలయంలో వున్న మహావిష్ణువు నే కృష్ణుని గా భావించి గోపికలు పూజించిన విధానాన్ని అనుసరించి యీ మార్గశిర మాస నోముని నోచింది ఆండాళ్. గపికలు నోచిన నోము మార్గశిరమాసమైనందున ఆండాళ్ అదే మార్గాన్ని అనుసరించి నోము ని ఆచరించిందని తిరుప్పావై చెపుతుంది..
ఆండాళ్ తిరువడిగలే శరణం..
No comments:
Post a Comment