* శ్రీ రాజరాజేశ్వరి ఆలయం..
నెల్లూరులోని దర్గామిట్ట ప్రాంతంలో నెలకొన్న రాజరాజేశ్వరదేవి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది.
భక్తజనాలను సంరక్షించే ఈ శక్తి స్వరూపిణిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివితీరదు.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆలయాలకు ప్రసిద్ధి గాంచింది.. అంతేకాదు మన రాష్ట్రంలో ఉన్న చాలా ఆలయాలకు ఎంతో చరిత్రాక నేపథ్యం ఉంది. అలాంటి వాటిలో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి దేవస్థానం ఒకటి. ఇది పురాతన ఆలయం కాదు. కానీ 70, 80 దశకాల్లో కట్టిన ఆధునిక దేవాలయం. నెల్లూరు నగరంలోని దర్గామిట్ట ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. జిల్లా నుంచి ఎంతోమంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారిని కన్నులారా దర్శించుకుంటారు. నిత్య దీప ధూప నైవేద్యాలతో, పూజాది కైంకర్యాలతో ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలుగులీనుతోంది.
శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని శ్రీ రత్నస్వామి ముదలియార్ నిర్మించినట్లు చెబుతారు. అమ్మవారి ఆలయంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ సుందరేశ్వర స్వామి, గాయత్రీదేవి అమ్మవారు, వినాయకుడు, నవగ్రహాలు.. ఈ దేవస్థానంలో ఉపాలయాలుగా ఉన్నాయి. ఈ దేవస్థానాన్ని దేవాదాయ శాఖ 1985లో తన ఆధీనంలోకి తీసుకుంది. సాధారణంగా ప్రాచీన దేవాలయాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. కానీ ఈ ఆధునిక దేవాలయానికి కూడా అంతే విశిష్టత ఉండడం విశేషం.
ప్రాచీన వైభవం లేకపోతేనేం ఎంతో అందంగా నిర్మించారు రాజరాజేశ్వరీ దేవాలయాన్ని ,ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంటుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి ఊరట పొందడానికి గుడికి వెళ్తాం. నెల్లూరు రాజరాజేశ్వరీ దేవాలయానికి వెళ్ళడం ద్వారా ప్రయోజనం తప్పకుండా నెరవేరుతుంది. భక్తులు ప్రశాంత చిత్తంతో వెనుదిరిగి వస్తారు.
అమ్మవారు కాత్యాయని, కనకదుర్గాదేవి, రాజరాజేశ్వరీ దేవి, కాళీమాత, మహాగౌరి, మహిషాసురమర్దిని - ఇలా ఏ రూపంలో ఉన్నా మహోన్నతమైనదే. మనల్ని ఊరడిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. అమ్మవారు భక్తజనావళిని సంరక్షించే శక్తి స్వరూపిణి. విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ప్రధాన ఆలయంలోని అమ్మవారిని, ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలను దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు ఇతర ఏర్పాట్లు చేశారు.
అమ్మవారిని దర్శించుకుంటే సమస్యలు తీరి, కష్టాలు పోయి మనసు ప్రశాంతంగా ఉంటుందని భక్తుల విశ్వాసం.
రాహుకాల పూజలు ఈ ఆలయంలో ప్రత్యేకంగా జరుగుతాయి. గ్రహదోషాలు పోయేందుకు భక్తులు నిమ్మకాయల్లో దీపాలను వెలిగిస్తుంటారు.
వైభవంగా నవరాత్రులు..!
రాజరాజేశ్వరీ దేవి దేవస్థానంలో దసరా ఉత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తారు. ఒక్కో రోజు, ఒక్కో అలంకారంలో అమ్మవారిని తీర్చిదిద్దుతారు.
చివరిరోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో కొలువు దీరుస్తారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసేందుకు రెండు కనులు చాలవు.
నవరాత్రుల్లో అమ్మవారి భక్తులైతే భవానీ మాల ధరించి ఉపాసన చేస్తారు. చివరి రోజు దీక్ష విరమిస్తారు.
శ్రావణ మాసంలోనూ ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక శుక్రవారాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. నెల్లూరులో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు శక్తి స్వరూపిణిగా విజయరూపిణిగా ఆశ్రిత రక్ష పోష జననియై... భక్తులను కటాక్షిస్తూ విరాజిల్లుతోంది.
నెల్లూరు రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి నిత్యం జరిపే పూజా కార్యక్రమాలతో బాటు పర్వదినాల్లో విశేష సేవలు, ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు.
దర్శన వేళలు: ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4.30నుంచి రాత్రి 9 గంటల వరకు.
ఎలావెళ్లాలి:
నెల్లూరు బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి లోకల్ ఆటోలు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి రాజరాజేశ్వరదేవీ టెంపుల్ అని అడిగితే ఎవ్వరైనా తీసుకెళ్తారు.
No comments:
Post a Comment