వేద మార్గం చూపిన ఆధునిక మహర్షి స్వామి దయానంద సరస్వతి 195 జయంతి. ~ దైవదర్శనం

వేద మార్గం చూపిన ఆధునిక మహర్షి స్వామి దయానంద సరస్వతి 195 జయంతి.

జననం అంటే ఏమిటి?
మృత్యువు అంటే ఏమిటి?
జనన మరణాల మధ్య సాగే జీవిత మంటే ఏమిటి?
మనిషి లక్ష్యం ఏమిటి?
మనిషి మనిషిగా బతకాలంటే అతని లక్షణాలు ఎలా ఉండాలి?
మనిషిగా అతని బాధ్యతలు ఏమిటి?
అతని జీవన ప్రయాణం ఎలా సాగాలి?
ప్రశ్నతో ప్రారంభమై... సమాధానాల అన్వే షణలో నిరంతరంగా సాగిన సత్యశోధనా యాత్ర మహర్షి జీవితం !

గుజరాత్‌లోని టంకారాలో సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో 1824 ఫిబ్రవరి 12న జన్మించిన మూలశంకరుడు చిన్నతనం నుండీ సత్యాన్వేషే ! దయారాం అని ముద్దుగా పిలవబడే ఈ బాలుడే తర్వాత మహర్షి స్వామి దయానంద సరస్వతిగా ఖ్యాతి గాంచాడు.

ఆ రోజు శివరాత్రి !

తండ్రితో కలసి చిన్నారి మూలశంకరుడుకూడా శివాలయానికి వెళ్లాడు. తెల్లవార్లూ పూజ జరుగు తోంది. అర్థరాత్రి అయ్యేకొద్దీ ఒక్కరొక్కరుగా నిద్ర లోకి జారుకుంటున్నారు. మూలామాత్రం శివలింగం కేసే తదేకంగా అలా చూస్తూ కూర్చుండిపోయాడు.

గర్భగుడిలో చిన్నదీపం, అర్థరాత్రి కావడం, భక్తులంతా నిద్రపోవడంతో కొన్ని ఎలకలు వచ్చి శివుడికి నివేదించిన ప్రసాదాలను ఆరగించాయి. శివలింగంపైనా, పానపట్టుపైనా ఎలుకలు నిర్భయంగా పరుగులు తీస్తుంటే మూలా ఆశ్చర్యపోయాడు.సర్వశక్తి సమన్వితుడైన శివుడిపై ఎలుకలు ఎక్కితొక్కుతున్నా శివుడు ఏమీ అనడేం? ప్రశ్న మొదలయ్యింది.

పక్కనే పడుకున్న తండ్రిని లేపాడు.

'నాన్నగారూ... మీరు నాకు చెప్పిన మహాదేవుడు ఇదేనా? లేక - ఈ లింగం మరేదైనా పదార్థమా?' ప్రశ్నించాడు.మంచి నిద్ర మధ్యలో లేపి ఇలాంటి ప్రశ్న వేస్తున్న కొడుకుపై తండ్రికి తెగ కోపం వచ్చేసింది. 'నువ్వు నాస్తికుడు మాదిరిగా మాట్లాడితే నీ నోరు పడిపోతుంది. ఈ శివలింగమే మహాశివుడు. అంతే !' అని చిరాగ్గా చెప్పి మళ్ళీ నిద్రపోబోయాడు.

- అయినా - మూలా వదలకుండా - 'అదికాదు నాన్నగారూ.. మీరు చెప్పే శివుడు జీవశక్తియే... కానీ, - ఈ శివలింగం మాత్రం ఏకదలికా లేని, ఏ స్పందనాలేని జడపదార్థమే కదా...!? మళ్ళీ ప్రశ్నించాడు. తండ్రి కోపం రెట్టింపయ్యింది. కానీ - ఒక్కక్షణం ఆలోచిస్తే - కొడుకు చెబుతున్న దానిలో తర్కం ఉంది. అంతర్లీనంగా నిజమూ ఉంది. అందుకే - 'నిజమే ... ఇది శివుని విగ్రహమే గాని శివుడు కాదు' అంగీకరించాడు.

'నాన్నగారూ - మరయితే - శివుడికి బదులుగా ఈ విగ్రహాన్ని మనమెందుకు పూజించాలి? మూలా మళ్ళీ మరో ప్రశ్న వేశాడు. అందుకు తండ్రి సమాధానమిస్తూ... 'నువ్విలా అడగడం సమంజసమే! అయితే - ఈ కలియుగంలో శివుణ్ణి యదార్థరూపంలో మనం చూడలేము కదా! అందుకనే - ఈ విగ్రహంలోనే శివుడు ఉన్నాడని నమ్ముతూ ఆయన్ని ఆరాధిస్తాం. ఆయన సంతోషించి మనకు మోక్షం ప్రసాదిస్తాడు' అని చెప్పారు.

మూలాకి ఇది మరీ విచిత్రంగా అనిపించింది.

'అలాగైతే - శివుడిని పూజించామని భావిస్తే కూడా సరిపోతుంది కదా - విగ్రహాన్ని పూజించడం దేనికి? అంటూ కుమారుడు మళ్ళీ ప్రశ్నించాడు.

తండ్రికి సమాధానం దొరకలేదు.

కుమారుడికి సందేహం తీరలేదు.

ప్రశ్నగా ప్రారంభమై...

సమాధానాలు పొందుతున్న దశలో మరిన్ని సందేహాలకు ఊపిరి పోసుకుంటూ సత్యశోధనలో నిరంతర ప్రయాణం సాగించారు దయానంద సరస్వతి.ఒక విషయం మీద సమగ్ర సమాచారం పొందాలంటే - ముందుగా మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి.

జీవితంలో మనం ఎదగాలంటే...

సమాచారం సంపూర్ణంగా తెలియాలంటే...

అది ప్రశ్నించడం ద్వారానే సాధ్యమౌతుంది

దొరికిన సమాధానంతో సంతృప్తి పడుతూ అదనపు సమాచారం సేకరించలేనినాడు ఆ వ్యక్తి అభివృద్ధి ఆగిపోతుంది.

21 సంవత్సరాల వయసులో సత్యాన్వేషణకోసం ఇల్లు విడచిన మూలశంకరుడు స్వామి పూర్ణానందుడిద్వారా సన్యాసదీక్ష స్వీకరించాడు. దీంతో అతను దయానంద సరస్వతిగా మారాడు.

సమర్థుడైన గురువుకోసం సుమారు 15 సంవత్సరాలపాటు అన్వేషించిన దయానంద సరస్వతీ స్వామి విరజానందుని దర్శనంతో, శిష్యరికంతో పరిపూర్ణుడయ్యాడు. మహర్షిగా రూపుదిద్దుకున్నాడు.హైందవ సంస్కృతీ సంప్రదా యాల విలువల్ని చాటిచెప్పడమే కాకుండా తన పర బేధం లేకుండా అన్ని మతాలనూ పరిశీలిస్తూ, అన్ని మతగ్రంథాలనూ అధ్యయనం చేస్తూ, మత గ్రంథాల మాటున సాగుతున్న మూఢ నమ్మకాలను తూర్పారబెట్టి, మతం కన్నా మనిషి ప్రధానం అంటూ చాటిచెప్పిన గొప్ప మానవతావాది దయానందసరస్వతి.

1857లో భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రా మం వైఫల్యం కావడంతో చెల్లా చెదురైపోతున్న భారతజాతిని సమైక్యపరచడంలో దయానంద సరస్వతి తీసుకున్న చొరవ బ్రిటీష్‌వారిని సైతం అప్రమత్తుల్ని చేసింది. సాయుధ విప్లవం ద్వారా భారతావనికి త్వరితగతిన స్వాతంత్య్రం రాగలదని నమ్మేవారాయన. స్వాతంత్య్రం ఒకళ్ళు ఇచ్చేది కాదు... మనకై మనం సాధించుకోవాలని చెప్పేవారాయన !

ఆయన ప్రసంగాలలో నర్మగర్భంగా సాగే స్వాతంత్య్రేచ్ఛ క్రమక్రమంగా ప్రజలలో చైతన్యజ్వాలను రగిలింపచేసింది. అందుకే - స్వామీజీ ఎక్కడికెళ్ళినా - బ్రిటీష్‌ గూఢచారులు వెన్నంటే ఉండేవారు. స్వామీజీపై జరిగిన విషప్రయోగంలో బ్రిటీష్‌వారి హస్తం ఉన్నట్లు కూడా రుజువయ్యింది. అనంతరకాలంలో - 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పడటం, స్వాతంత్య్రపోరాటం ఉధృతం కావడం జరిగింది.

పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అభివృద్ధి చెందాలనీ, స్త్రీ పురుష బేధం లేకుండా అందరికీ విద్యావకాశాలు కల్పించాలనీ అభిలషించే వారాయన. ఈ లక్ష్య సాధనకోసం పలుచోట్ల గురుకులాలు స్థాపించారు. కాంగడీ గురుకులం ఈనాటికీ తన విజ్ఞాన జ్యోతుల్ని ప్రసరింపచేస్తూనే ఉంది. అలాగే - 1975లో దయానంద సరస్వతి స్థాపించిన 'ఆర్యసమాజ్‌' నేడు ఒక మహాసంస్థగా దేశవిదేశాలలో హైందవ సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతూనే ఉంది. తన సత్యాన్వేష యాత్రలో తాను నమ్మినదీ, ప్రజలకు మేలు కలుగచేసేదీ ఏమైనప్పటికీ, అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిర్భయంగా ప్రకటించే స్వామీజీకి ఆత్మీయులతోబాటే వ్యతిరేకులు కూడా అధిక మయ్యారు. స్వామీజీ జోథ్‌పూర్‌ సంస్థాన పర్యటనలో ఉండగా - విషప్రయోగం జరగడం తో తీవ్ర అస్వస్థ తకు గురై 1883 అక్టోబర్‌ 31న పరమపదించారు. పేరులోనే కాదు, వ్యక్తిత్వంలో కూడా పోతపోసుకున్న దయాస్వరూపం స్వామీజీ. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం కావాలి..!

https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List