ఓం.. ఓంకారం... ~ దైవదర్శనం

ఓం.. ఓంకారం...

సృష్టి ఆరంభంలో బ్రమ్హ్మ దేవుడు, శ్రీ మన్నారాయణుడు నేను గొప్పంటే నేను గొప్ప అన్న వివాదానికి దిగారు. ఎంతకీ తెగని ఆ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. అప్పుడు వారిరువురి మధ్యన ఓంకార నాదంతో లింగా కారంలో ఉన్న అగ్ని ఉద్భవించినది. అది ఎవరా ? అన్న ఆశ్చర్యానికి లోనైనా వారికి " మీ ఇరువురలో ఎవరైతే నా అది అంతాలలో ఒక దానిని చూసి వస్తారో వారే గొప్ప " అన్న మాటలు వినిపించాయి. బ్రహ్మ హంస రూపంలో ఊర్ధ్వ దిశగా ఎగురుతూ వెళ్ళగా, మహా విష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని తొలుచుకుంటూ పాతాళం లోనికి వెళ్ళారు. ఎంతో దూరం వెళ్ళినా ఇరువురు ఆ లింగ ఆది అంతాలను కనుగొన లేక పోయారు. శ్రీ హరి తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నారు. కాని విధాత మాత్రం తాను లింగ అగ్ర భాగం చూశానని తెలిపి దానికి సాక్షిగా మొగలి పువ్వును చూపారు. అసత్యం చెప్పిన చతుర్ముఖుని మీద ఆగ్రహించిన లింగ రాజు ఆయనకు భూలోకంలో ఎక్కడా ఆలయం ఉండదని, ప్రజలు ఆయనను పూజించారని, వంత పాడిన మొగలి పువ్వు పూజకు అనర్హమైనదని శపించారు. ఈ సంఘటన జరిగినది , తొలిసారి ఓంకార నాదం ఉద్భవించినది ఇక్కడే కావడం వలన ఈ క్షేత్రానికి "ఓంకారం" అన్న పేరోచ్చినదని స్థానిక నమ్మకం.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలంలో ఉన్నది. మూడుపక్కలా పర్వతాలు, దట్టమైన అడవి, ప్రశాంత ప్రకృతితో కూడిన ప్రదేశంలో ఉంటుంది శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి ఆలయం. శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రం ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం.
స్వచ్చమైన గాలి, పచ్చని ప్రకృతి, మొక్కిన వారిని దరి చేర్చుకొనే పరమేశ్వరుని సన్నిధి, అందరికి అన్నం అన్న అవధూత శ్రీ కాశి నాయన మాటను నిజం చేస్తున్న ఆయన భక్త బృందం, ఇలా ఎన్నో ప్రత్యేకతల నిలయం ఓంకారం.
విజయనగర సామ్రాజ్యాదీశుడు అయిన శ్రీ కృష్ణ దేవరాయల వారి గురువైన శ్రీ వ్యాస రాయల వారు ఓంకార క్షేత్రం సందర్శించారని, ఇక్కడి వాతావరణానికి ముగ్ధులై కొంత కాలమిక్కడే ఉన్నారని అంటారు. దీనికి నిదర్శనంగా కోనేరు ఒడ్డున వట వృక్షం క్రింద ఉన్న శ్రీ హనుమంతుని విగ్రహాన్ని చూపుతారు. అపర ఆంజనేయ భక్తులైన వ్యాస రాయలు తమ నిత్య పూజకై అంజనా సుతుని ప్రతిష్టించారు. ఈ ప్రాంతాలలో పేరొందిన హనుమంతుని ఆలయాలు చాలా వరకు వీరి ప్రతిస్టే అని ఆధారాల ద్వారా అవగతమవుతోంది.
అదే వృక్షం క్రింద విఘ్న నాయకుని విగ్రహం, ఎన్నో నాగ ప్రతిష్టలు ఉంటాయి.
రాతి మండపాలను దాటిన తరువాత ప్రధాన ఆలయానికి ఉత్తరాన నవగ్రహ మండపం కనిపిస్తుంది. ఈశాన్యంలో పుష్కరణి ఉంటుంది. గర్భాలయంలో చందన, విభూతి కుంకుమ లెపనాలతొ సదాశివుడు లింగరూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటారు.
ప్రక్కనే అమ్మవారి సన్నిధి ఉంటుంది. ప్రతినిత్యం ఎన్నో అబిషేకాలు, అర్చనలు, పూజలు, అలంకరణలు ప్రధాన అర్చనా మూర్తులకు జరుగుతాయి. ఆలయానికి సమీపంలోనే అవధూత శ్రీ కాశి నాయన ఆశ్రమం ఉన్నది. ఓంకార క్షేత్ర సందర్శనార్ధం వచ్చిన ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం లభిస్తుంది ఈ ఆశ్రమంలో. ఆలయానికి వెనుక నూతనంగా శ్రీ జగద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ శనేశ్వర స్వామీ తపో వనాన్ని నిర్మించారు. ఇందులో పెద్ద నవగ్రహా మూర్తులను ఉంచారు.
ప్రతినిత్యం ఎందరో భక్తులు ఓంకార క్షేత్రాన్ని సందర్శించి శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకారేశ్వరుని కృపా కటాక్షాలను పొందుతుంటారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List