కుత్తాలమ్ ఒక ప్రముఖ శైవక్షేత్రం. తమిళ తేవార స్తోత్రాలలో ఈ గ్రామం పేరు తిరుతురుత్తి . రెండు నదులకి మధ్య ప్రదేశాన్ని "దురిత్తి" అని పిలుస్తారు.
పురాణ కాలంలో ఈ ప్రాంతమంతా ఉత్తాల వృక్షాలతో నిండిన వనంగా వుండినందున ఉత్తాలంగా పిలిచేవారు.
కాలక్రమంలో యీ పేరు కుత్తాలంగా మారింది. తివారపాటలలో స్తుతించబడిన 37 వ కావేరీ దక్షిణ తీరం యిది. సమయక్కురవరి లో ముగ్గురుభక్తులు పాడిన ప్రాచీనస్ధలంగా ఖ్యాతిగాంచినది.
పడమటి ముఖంగా వున్న ఈ ఆలయం విశిష్టమైనది. మహేశ్వరుడు వెలసిన ఈ ఆలయంలో సప్త ఋషులు, అగ్ని, సూర్యుడు, వరుణుడు పూజలు చేసి అర్చించారు. పరమశివ భక్తుడైన సుందరమూర్తి నాయన్మార్ రుగ్మతను గుణపరచిన మహిమ గల ఆలయం. చోళ రాజమాత సెంబియన్ మహాదేవి కట్టించిన ఆలయం.
పర్వతీదేవితో వున్న వినాయకుడు ఇక్కడ కటాక్షించడం ఒక విశిష్టత. భగవంతుని ఆనతితో భరతముని యొక్క పుత్రికగా జన్మించిన ఉమాదేవి కావేరీ తీరాన ఉత్తాల వృక్షం క్రింద తపమాచరించగా తపము ఫలించి, ఉమాదేవి పూజించిన శివలింగం నుండి పరమేశ్వరుడు దర్శనమిచ్చి ఉమను గాంధర్వ వివాహం చేసుకున్నాడు.
ఈ దైవ కళ్యాణాన్ని దేవలోక వాసులు, భూలోకవాసులు చూసి ఆనందించేలాగ మరల కళ్యాణం చేసుకుని కరుణించాలనే భరద్వాజ మహర్షి ప్రార్ధనను మన్నించి, ఒక ముహూర్తం రోజున కళ్యాణ ఘట్టాన్ని కటాక్షింప చేస్తానని అనుగ్రహించి, అంతర్ధానమైనాడు. పరమేశ్వరుడు ఇక్కడ అవతరించినప్పుడు, వెంట వచ్చిన ఛత్రము ఉత్తాలవృక్షంగాను, పరమేశ్వరుని చరణాలు మోస్తూ వచ్చిన వేదాలు పాదుకలుగాను అమరాయి.
స్వామి భరద్వాజ మునికి దర్శనమొసగి అంతర్ధానమైన సమయంలో , ఛత్రమును, పాదుకలను ఆలయంలో
వదలి వెళ్ళిపోయాడు. ఈనాటికీ యీ చిహ్నాలను ఆలయానికి ముందు భాగమున దర్శించవచ్చు. తను యిచ్చిన
మాటను కాపాడుకొనుట వలన "సొన్నవర్ అరివార్"అనే (మాట నిలుపుకొనిన) పేరుతో పరమేశ్వరుడు అనుగ్రహం ప్రసాదిస్తున్నాడు.
వృషభరాశి వారు , జాతకంలో శుక్రబలం లేని వారు యీ ఆలయంలో పూజలు జరిపితే శుభఫలితాలు కలుగుతాయని భక్తుల ధృఢ విశ్వాసం.
మైలాడుతురై.. కుంభకోణం వెళ్ళే మార్గంలో, మైలాడుతురై నుండి సుమారు 10 కి.మీ దూరంలో కుత్తాలమ్ క్షేత్రం వున్నది...
No comments:
Post a Comment