* తిల్లై కాళి అమ్మ..🔱
కైలాసంలో పరమశివుడు ఉమాదేవితో ఆశీనుడైవున్నాడు. త్రినేత్రాలను మూసుకుని ఆలోచనలో మునిగిపోయాడు.
ముల్లోకాలను తమ అంతర్నేత్రంతో దర్శించారు. ముల్లోకాలలో చాలా ప్రాంతాలలో రాక్షసుల హింసాకాండలు, దుర్మార్గాలు పెచ్చు పెరిగాయి. దానవులు ఎదురు వచ్చిన ప్రతీ ప్రాణిని చంపడం మొదలెట్టారు. దేవతలకు నిలువ నీడ లేకుండా చేసారు. మానవులు వారి చేతికి చిక్కి నానా బాధలు అనుభవిస్తున్నారు. వారంతా ఈశ్వరుని వేడుకున్నారు. పరమేశ్వరుడు తన నేత్రాలను తెరిచి మెల్లగా చల్లని చూపులు ప్రసరింప చేశాడు.
పరమేశ్వరుని త్రినేత్రం దానవుల వేపు దృష్టి సారించింది. ఈశ్వరుని త్రినేత్రం క్రోధావేశంతో నిప్పులు కురిపించింది.
పరమేశ్వరుడు అర్ధ దేహమైన తన అర్ధాంగిని వీక్షించి తిల్లై కి తన అనుగ్రహం తిరిగి లభిస్తుందని చెప్పాడు. లోక రక్షణార్ధం ఉమాదేవి పరమేశ్వరునితో విశ్వరూపం ధరించినది. కోపాగ్ని ప్రజ్వరిల్లగా ముల్లోకాలను చుట్టి వచ్చి ఉగ్రకాళిగా దర్శనమిచ్చినది. వీరమహాకాళి గా మారిన పార్వతీదేవి ఆగ్రహావేశాలు తగ్గక తిల్లై అరణ్యాలలో తీవ్రవాయు రూపంలో సంచరించింది. కాళి అంటేనే వాయువు అనే అర్ధం ఒకటి ఉన్నది. ముల్లోక ప్రాణులను దానవులనుండి కాపాడేందుకు ఉమాదేవిని ఉగ్రకాళిగా, వాయుగుండంగా మార్చిన ఆనంద నటరాజస్వామి తిల్లై అధిపతిగా తన ఝుటా ఝూటమునుండి ఒక జడను విసిరివేయగా అది ఒక వాయు గుండంగా మారి
ఆ అంధకారాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. ఒక గుహలో తనలో అర్ధ దేహంగా వున్న దేవిని కాంతి రూపాన తనలో ఐక్యం చేసుకుని తన కుడిపాదం ఎత్తి తాండవం ఆరంభించాడు. ప్రపంచంలో ప్రతి అణువు చలించిపోయింది. అక్కడ మరొక తాండవం ఆరంభమైనది. పతంజలి మహర్షి పరమేశ్వరుని పద భంగిమలను రెప్పార్చక తన్మయుడై చూడసాగాడు. తిల్లై అరణ్యాలలో తపము చేసుకునే 3000 మంది మునిగణాలు త్రినేత్రుని భక్తితో పూజించారు.
ఆ సందర్భాన బ్రహ్మదేవుడు కూడా పరమభక్తితో శివుని సేవించాడు. ఆ అరణ్యంలో ఒక భాగం దట్టమైన తిల్లై తీగలతో ఒకదానితో ఒకటి కలసిపోయి ఒక గుహలా ఏర్పడింది. ఆ గుహ అంతర్భాగం నుండి వెలువడిన ఒక గాఢమైన నిట్టూర్పుతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఆ నిట్టూర్పు వలన ఏర్పడిన ఉష్ణం దావానలంలా వ్యాపించింది. ఒక వాయు గుండం మహావేగంగా గుహ ద్వారాన్ని ఢీకొట్టింది.
ఆ నల్లని రూపం, కారుమేఘాన్ని జడగా చేసి దానిమీద కపాలాన్ని ధరించి, దానవుల కపాలాలను మెడలో మాలగా ధరించి, నేత్రముల నుండి అగ్ని ధారాలు కురియగా అగ్ని రూపంగా దర్శనమిచ్చింది. తన హస్తాలలోని ఆయుధాలన్ని దానవుల రక్తంతో ఎఱ్ఱబారాయి. ఈశ్వరుని కనుసంజ్ఞలతోనే దుష్ట సంహారం చేసిన కాళి ఇంకా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నది. తారకాసుర, మహిషాసుర, భండాసురుల ఖండిత శిరస్సులు చేతిలో ధరించినది. దేవి శిరస్సు వెనుక భాగాన లేచిన అగ్ని జ్వాలలు ఆ వనంలోని వృక్షాలను దహించాయి.
దూరాన తాండవ నటరాజుని కాలిగజ్జెల సవ్వడి కాళికాదేవి చెవులను తాకినవి. తనను నిర్లక్ష్యపరుస్తూ మహర్షుల పూజలకి ఆనందిస్తున్న ఈశ్వరుని మీద కోపం పొంగినది.వారి భక్తి తన శక్తిని మించినదా అని ఆవేశం చెందింది. సర్వత్ర శివశక్తి నిండి వున్నదనే సత్యాన్ని మరచి కేవలం తనశక్తి యే గొప్పదని తనని తాను స్వామినుండి వేరుచేసుకొని భావించినది. శివుని కన్న తనే గొప్పగా భావించిన ఆ నల్ల రూపం కలిగిన కాళి క్రోధాగ్నితో నటరాజస్వామిని సమీపించింది. అక్కడున్న మునుల ఆశ్రమాలను ధ్వంసం చేసింది. యోగుల తపస్సు
భగ్నమైనది. హరునికి ఘోరమైన తన కోర పళ్ళను చూపింది. దానితో తాండవ నటరాజు కోపంతో అగ్నిలా జ్వలించాడు. ఝుటాఝూటాలు ఎగిసిపడుతూండగా కాళిని చూసి "ఇంక ఆపు 'అని గట్టిగా అదమాయించాడు.
కాళి మరింత ఆగ్రహం తో ఎదురు తిరిగింది. "నాట్యానికి స్త్రీలే తగినవారు,పురుషులు కాదు, మీకు చేతనైతే నాతో సమానంగా నాట్యం చేసి నన్ను జయించండి. మీరు ఓడి పోతే తిల్లై సరి హద్దులలో వుండాలి. నేను ఓడిపోతే
తిల్లై సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించను ".. అని కాలు విసిరి సవాలు చేసింది.
No comments:
Post a Comment