దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

శ్రీ త్రివేణి సంగమం - శ్రీ కనక సురభేశ్వరాలయo





త్రివేణి సంగమం వేణి అంటే నది. కృష్ణవేణి అంటే కృష్ణానది. ఇక్కడ త్రివేణి సంగమం అంటే మూడు నదుల సంగమం అన్నమాట. ప్రకాశం జిల్లాలోని సురభేశ్వర కొనలో మూడు నదులు కలుస్తాయి. 

గుండ్లకమ్మ నది, ఎర్రవాగు, లోతువాగు అనే మూడు నదులు సురభేశ్వర కోన వద్ద కలుస్తాయి. 

కనుక ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు.


నల్లమల కొండల మధ్య నుండి ప్రవహిస్తూ వచ్చిన గుండ్లకమ్మ నది ఇక్కడికొచ్చేసరికి ఎర్రవాగు, లోతువాగులతో కలుస్తుంది. నదిని పవిత్రంగా భావించే ప్రజలు రెండు లేదా మూడు నదులు కలిసే సంగమ ప్రాంతాన్ని మరింత పవిత్రమైందిగా తలుస్తారు. ఇంట్లో స్నానం చేయడం కంటే నదీ స్నానాన్ని పుణ్యకార్యంగా వర్ణించాయి ధార్మిక గ్రంధాలు. అందుకే కొందరు ఇప్పటికీ నదీ స్నానాన్ని ఇష్టపడతారు. ఇతర రోజుల్లో వీలు కాకున్నా కనీసం పర్వదినాల్లో నదీస్నానం చేస్తారు. మామూలు నది కంటే కూడా నదీ సంగమ పుణ్యస్థలంలో స్నానం చేయడం మరీ శ్రేయస్కరం. ఈ పరిసర ప్రాంతాలవాళ్ళే కాకుండా ఇతర జిల్లాల వారు కూడా త్రివేణి సంగమంలో స్నానం చేసి తరిస్తుంటారు. సాధారణ రోజుల కంటే శివరాత్రి పర్వదినం సందర్భంలో త్రివేణి సంగమాన్ని ఎక్కువమంది దర్శించుకొని ఈ సంగమ స్థలంలో స్నాన మాచరించి పూజలు జరుపుతూ వుంటారు. 


పవిత్ర క్షేత్రం కనక సురభేశ్వరాలయం..


అనేక పురాణ ఇతిహాసాలకు, చారిత్రక సంఘటనలకు నిలయం కంభం ప్రాంతం. కంభం మండలంలోని తురిమెళ్ళ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో వెలసిన శ్రీ కనక సురభేశ్వర కోన అలనాటి జమదగ్ని మహర్షి క్షేత్రంగా భావించి ప్రజలు యేటా మహాశివరాత్రి పండుగనాడు ఇక్కడి ఆలయాల్లో పూజలు జరుపుతుంటారు. 


ఈ క్షేత్రానికి సంబంధించి పలు గాథలు ప్రచారంలో వున్నాయి. ఈ క్షేత్రం త్రేతాయుగం ఉత్తరార్ధంలో నిర్మితమైనట్లు తెలుస్తోంది. ఆ క్షేత్రంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం వుందన్న విశ్వాసంతో దీనిని 'జమదగ్ని' క్షేత్రంగా పిలుస్తుంటారు.


నందీశ్వరుని కథ..


ఈ పుణ్యక్షేత్రంలో గల పాపేశ్వరుని ఆలయానికి తూర్పు ద్వారం ముందున్న నంది విగ్రహానికి సంబంధించిన కథ ఒకటి ఈ ప్రాంతంలో ప్రచారంలో వుంది. యజమాని ఆగ్రహంతో ఎద్దును కొట్టడంతో దాని కాలు విరిగిపోయింది. అంతట ఆ వృషభం విరిగిన కాలితో కుంటుకుంటూ సురభేశ్వర కోనకు రాగా, అక్కడ అడ్డంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నది ఆవలి తీరం నుండి ఇవతలి తీరానికి దుమికి, పాపేశ్వరుని ఆలయానికి వచ్చి పాపేశ్వరుని ఆలయానికి తూర్పు డాము ముందుకు వచ్చి కూర్చుని అక్కడే శిలగా మారిపోయిందని కొందరు ప్రజలు చెబుతుండగా, మరికొందరు ఎద్దు ఇవతలి తీరానికి వచ్చి పాపేశ్వరుని గుడిముందు కూర్చుని పాపవిముక్తి కొరకు ఆ ఎద్దు జ్ఞాపకార్థం దాని పోలికలతో కూడిన ప్రతిరూపాన్ని శిలారూపంలో చెక్కించి అక్కడ ప్రతిష్ఠ చేయించారని చెప్పుకుంటుంటారు.


శ్రీ సురభేశ్వర కోనలో అనేక చారిత్రక ఆధారాలు వున్నాయి. ఇక్కడ రాష్ట్ర కూటులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజుల కాలంనాటి అనేక శిలాశాసనాలు వున్నాయి. ఈ శాసనాలతోపాటు ఉన్న శిల్ప సంపద వారి సాంప్రదాయాలకు అద్దంపడతాయి. నాడు రాజులు యుద్ధానికి వెళ్ళినట్లు, ఈ కోనలో వారు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లు పురాతత శాస్త్రవేత్తలు తమ సర్వేలో పేర్కొన్నారు. ఇటీవల కొందరు పాశ్చాత్యులు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి, ఫోటోలు తీసుకొని వెళ్ళారు. 


ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న శ్రీ కనకసురభేశ్వర కోనయందలి కొన్ని దేవాలయములు శిథిలములుకాగా, కొన్ని గుండ్లకమ్మ నడి వరదల వల్ల కొట్టుకొనిపోయాయి. ఆలయాల్లోని కొన్ని విగ్రహాలను దొంగలు పెకలించి, ప్రతిష్ఠ సమయంలో లోపల వేసిన బంగారు వెండి తదితర విలువైన సొమ్మును దోచుకొనిపోయారు. తరువాత భక్తులే స్వయంగా విగ్రహాల్ని ప్రతిష్టించుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ క్షేత్రం పూర్వ వైభవంతో భాసిల్లుతోంది.


కోటి లింగాల గట్టు..


శ్రీ కనక సురభేశ్వర కోనలోని పాపనాశనము మందిరానికి సమీపంలో అగుపించే లింగాల సముదాయాన్ని 'కోటిలింగాల గట్టు' అని పిలుస్తారు. పూర్వం విజయనగర రాజు అయిన హరహరరాయలు ఒక సందర్భంలో గోహత్యాపాతకం చేశాడట. ఆ పాప పరిహారార్థం ఆయన కోనకు వచ్చి ఇక్కడ పాపనాశనము అనే మందిరాన్ని నిర్మించి, అందులో శివలింగాన్ని ప్రతిష్టింప జేసి, భక్తి శ్రద్ధలతో లింగానికి అభిషేకం చేసి పాపవిముక్తుడయ్యాడని ప్రతీతి. ఈ ఆలయానికి సమీపంలో వుండే కోటి లింగాలను కూడా వారే ప్రతిష్టించారని ప్రజలు చెపుతారు అందుకే ఆ ప్రదేశంలో నేటికీ ఎక్కడ చూసినా శివలింగాలు అగుపిస్తాయి. పాపనాశనమునకు దక్షిణము వైపున గల ద్వారానికి సుంకద్వారము అని పేరు.

Share:

అరుణాచలంలో తప్పకుండా చదవ వలసిన శివ నామాలు

 

* అరుణాచల శివ నామాలు..

1.శోణాద్రీశుడు 2.అరుణాద్రీశుడు 3.దేవాధీశుడు 4.జన ప్రియుడు 5.ప్రపన్న రక్షకుడు 6.ధీరుడు 7.శివుడు 8.సేవకవర్తకుడు 9.అక్షిపేయామృతేశానుడు 10.స్త్రీపుంభావ ప్రదాయకుడు 11.భక్తవిజ్ఞప్తి సందాత 12.దీనబంధ విమోచకుడు 13.ముఖరాంఘిపతి 14.శ్రీమంతుడుడు 15.మృడుడు 16.మృగమదేశ్వరుడు 17.భక్త ప్రేక్షణకృత్ 18.సాక్షి 19.భక్త దోషనివర్తకుడు 20.జ్ఞానసంబంధనాథుడు 21.శ్రీహాలాహల సుందరుడు 22.ఆహవైశ్వర్యదాత 23.స్మర్త్యసర్వాఘనాశకుడు 24.వ్యత్యస్త నృత్యధ్వజధృక్ 25.సకాంతి 26.నటనేశ్వరుడు 27.సామప్రియుడు 28.కలిధ్వంసి 29.వేదమూర్తి 30.నిరంజనుడు 31.జగన్నాథుడు 32.మహాదేవుడు 33.త్రినేత్రుడు 34.త్రిపురాంతకుడు 35.భక్తాపరాధ సోడుడు 36.యోగీశుడు 37.భోగ నాయకుడు 38.బాలమూర్తి 39.క్షమారూపి 40.ధర్మరక్షకుడు 41.వృషధ్వజుడు 42.హరుడు 43.గిరీశ్వరుడు 44.భర్గుడు 45.చంద్రశేఖరావతంసకుడు 46.స్మరాంతకుడు 47.అంధకరిపుడు 48.సిద్ధరాజు 49.దిగంబరుడు 50.ఆరామప్రియుడు 51.ఈశానుడు 52.భస్మరుద్రాక్షలాంఛనుడు 53.శ్రీపతి 54.శంకరుడు 55.స్రష్ట 56.సర్వవిఘ్నేశ్వరుడు 57.అనఘుడు 58.గంగాధరుడు 59.క్రతుధ్వంసి 60.విమలుడు 61.నాగభూషణుడు 62.అరుణుడు 63.బహురూపుడు 64.విరూపాక్షుడు 65.అక్షరాకృతి 66.అనాది 67.అంతరహితుడు 68.శివకాముడు 69.స్వయంప్రభువు 70.సచ్చిదానంద రూపుడు 71.సర్వాత్మ 72.జీవధారకుడు 73.స్త్రీ సంగవామసుభగుడు 74.విధి 75.విహిత సుందరుడు 76.జ్ఞానప్రదుడు 77.ముక్తిదాత 78.భక్తవాంఛితదాయకుడు 79.ఆశ్చర్యవైభవుడు 80.కామీ 81.నిరవద్యుడు 82.నిధి ప్రదుడు 83.శూలి 84.పశుపతి 85.శంభుడు 86.స్వయంభువుడు 87.గిరీశుడు 88.మృడుడు*


*ఇవి నా ముఖ్యమైన నామములు*


*అరణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల* 🙏

Share:

శ్రీ మహాలక్ష్మీ దేవాలయం, కొల్హాపూర్




మహారాష్ట్రలోని మహాలక్ష్మీ దేవాలయానికి ప్రసిద్ధి. ఈ శక్తి పీఠం హిందువుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఈ ప్రదేశంలో తన భార్య లక్ష్మీ ప్రదేశంగా విష్ణువు చాలా ఇష్టపడతాడు అని నమ్ముతారు.
అష్టదశ శక్తిపీఠాలలో ఎంతో విశిష్టత పొందిన శక్తిపీఠం శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం. ఈ క్షేత్రం మహారాష్ట్ర లోని కొల్హాపూర్ నగరంలో ఉంది. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు కోలహాసురుడును సంహరించి ఇక్కడ వెలసిందని అందుకే కొల్హాపూర్ అనే పేరు వచ్చిందని కొందరు అంటుంటారు. మరికొందరు పద్మావతి పరిణయం వేళ తిరుమలేశుడు పై  అలిగిన అమ్మవారు ఇక్కడకు వచ్చి వెలిసిందని అంటుంటారు.

సకల సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. ఆమె కరుణ తమపై ప్రసరించాలని కోట్లాది భక్తులు నిత్యపూజలు చేస్తుంటారు. వైకుంఠంలో వున్న అమ్మవారు భక్తుల కోసం భూమిపై వెలసిన క్షేత్రమే మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని శ్రీమహాలక్ష్మీ ఆలయం. నిత్యం వేలాదిమంది భక్తులు ఆమెను దర్శించుకొని పునీతులవుతుంటారు. శక్తిపీఠంగా కూడా కొల్హాపూర్‌కు ఆధ్యాత్మిక ప్రాశస్త్యముంది.

🔸 ఆలయం ప్రాముఖ్యత.. 
ఇక్కడ సతీదేవినైణాలు పడినట్లుపురాణాలుచెబుతున్నాయి. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం అంతా కళాసృష్టి అని చెప్పవచ్చు. ప్రతినిత్యం  ఉదయం అలంకార అభిషేకం నిర్వహిస్తారు. మహాలక్ష్మి దేవి మూల విరాట పై ఫిబ్రవరి,నవంబర్ మసలలో సూర్య కిరణాలు నేరుగా ప్రసరించడం ఇక్కడ విశేషం. దీనినే కిరణోత్సవం అంటారు.

ప్రతి ఏడాది శరన్నవరాత్రి ఉత్సహావాలు వైభవంగా జరుపుతుంటారు. చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ అమ్మవారిని అంబబాయి అని కరివీర్ మహాలక్ష్మి అనే పేరులతో పిలుస్తారు. ఈఆలయ ప్రాంగణం అంతా అలనాటి రాజ సంస్కృతుల సాంప్రదాయలతో కనిపిస్తాయి.

🔸 ఇక్కడ చూడవలిసిన ఆలయాలు:
గర్భ గుడి ముందు వందడుగుల పొడవుగల మండపం ఉంటుంది. గర్భగుడిలో ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం ,దాని మీద మహాలక్ష్మి అమ్మవారు విగ్రహం కుర్చొని ఉన్న స్థితిలో ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో విరోబాఆలయంఉంది. విద్యాబుద్ధులు ప్రసాదించే తల్లి అయిన శారదా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. అలాగే కాళికా అమ్మవారు ,అతిబలేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది.

🔸 వైకుంఠపురి నుంచి:
శ్రీమహావిష్ణువు వైకుంఠంలో వుండగా భృగుమహర్షి వచ్చాడు. అయితే రుషి రాకను విష్ణువు గమనించలేదు. దీంతో ఆగ్రహం చెందిన భృగువు స్వామివారి ఎదపై కాలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి భూలోకానికి వెళ్లి కొల్హాపూర్‌ సమీపంలో తపస్సులో మునిగిపోయింది. భృగువు పాదంలో కన్నును లౌక్యంగా తీసివేసిన మహావిష్ణువు రుషి గర్వాన్ని అణచివేశాడు. అనంతరం అమ్మవారి కోసం అన్వేషిస్తూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కొల్హాపురంలో వెలసిన అమ్మవారి ప్రాశస్త్యం అందరికి తెలియడంతో క్షేత్రం అందరికి దర్శనకేంద్రంగా మారింది.

🔸ప్రళయంలోనూ చెక్కుచెదరదు..
ఈ ప్రాంతాన్ని కర్వీర్‌గా వ్యవహస్తారు. ఆ మహాదంపతులకు ఇష్టమైన ప్రదేశం కావడంతో మహాప్రళయంలోనూ చెక్కుచెదరదు. అందుకనే ఈ క్షేత్రాన్ని అవిముక్తేశ్వర క్షేత్రమని పేర్కొంటారు. లోకమాత జగదాంబ ఈ క్షేత్రాన్ని సృష్టించింది. అందుకనే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మహర్షులు, రుషులు పూజలు చేసినట్టు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. అమ్మవారి తపస్సు అనంతరం ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.

🔸 అరుదైన శిలపై అమ్మవారి రూపం:
శ్రీమహాలక్ష్మీదేవి విగ్రహాన్ని అరుదైన శిలపై చెక్కారు. నాలుగు హస్తాలు కలిగి భక్తులను దీవిస్తున్న రూపం మనల్ని ఆకట్టుకుంటుంది. ఫలం, గద, కవచం, పాత్రను నాలుగుచేతుల్లో కలిగివున్న దివ్యమంగళరూపం భక్తులకు ఎల్లప్పుడూ ఆశీర్వచనాలు ఇస్తుంటుంది. అంబా బాయిగా ఆమెను భక్తులు ఆరాధనతో పిలుస్తారు. ఆలయంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. శక్తిపీఠాల్లో కూడా కొల్హాపూర్‌ ఒకటి కావడం విశేషం.

🔸 కరణోత్సవం
సూర్యదేవుడు అమ్మవారి కటాక్షం కోసం ఏటా మూడురోజులు గర్భాలయంలోకి సూర్యకిరణాలను ప్రసారిస్తాడు. తొలిరోజు పాదాలకు, రెండో రోజు నడుము భాగానికి మూడోరోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసారిస్తాయి. ఈ ఉత్సవాలను కిరణ్‌ ఉత్సవ్‌గా వ్యవహరిస్తారు. ఈ దినాల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వేలాదిమంది భక్తులు కొల్హాపూర్‌కు చేరుకుంటారు. క్షీరసాగర మథనంలో జన్మించిన శ్రీలక్ష్మీదేవిని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా స్వీకరిస్తారు. నారాయణిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మీదేవి ఎక్కడ వుంటే అక్కడ సిరిసంపదలకు లోటువుండదు. ఆమె కటాక్షం కోసం యావత్‌ మానవాళి ప్రార్థిస్తుంది. స్వయంగా ఆమె తపస్సు చేసి వెలసిన ప్రాంతమే కొల్హాపురం. అందుకనే ఆ నగరంలో పేదరికం వుండదని సామెత. సహకార ఉద్యమంలో కొల్హాపూర్‌ కీలకమైన భూమిక పోషించింది. చక్కెర మిల్లులు ఎక్కువగా వుండటంతో భారతదేశానికి చక్కెర కేంద్రంగా మారింది.

Share:

పంచ శక్తులు - లక్ష్మి దేవి అమ్మవారి ప్రాముఖ్యత


లక్ష్మీ దేవి అమ్మవారు పరా ప్రకృతి నుండి ఆవిర్భవించిన మహాలక్ష్మీ పంచశక్తులలో మూడవది. ఆమె నారాయణునికి పత్నియై ఆశ్రయించిన వారికి అఖండమైన సర్వసంపదలనూ అనుగ్రహిస్తుంది. ఈమెయే వైకంఠంలో మహాలక్ష్మిగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజ్యాలలో రాజ్యలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా విరాజాల్లుతోంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, రూపలక్ష్మి వంటి అనేక నామాలతో ప్రకాశిస్తూ, విష్ణువక్షస్ధలంలో నిత్యనివాసిని అయింది.


స్వర్గలక్ష్మిగా ఉన్న ఈ అంశయే దుర్వాసిని శాపవశాన స్వర్గానికి దూరమై, దేవేంద్రులాదుల ప్రార్ధనచేత, శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పబలం వల్ల 'క్షీరసాగర కన్యక' గా ఆవిర్భవించింది.


తేజస్సునకు, మాంగల్యానికీ, కాంతికి శాంతి సుఖాలకు ప్రధాన దేవత ఈ లక్ష్మీదేవి. తనను ఆశ్రయించిన వారికి సంకల్ప మాత్రం చేతనే సర్వసంపదలనూ అనుగ్రహింపగల శక్తి ఆమెది.


ఆ లక్ష్మీదేవి, వేదవాక్కులలో, భగవన్నామములో, గోపుచ్ఛములో, తులసీవృక్షంలో, ఏనుగు కుంభస్ధలంలో,

శంఖంలో, ముత్యములో, స్త్రీల సీమంత ప్రదేశంలో, సత్య వాక్కులో, అగ్ని హోత్రములో సూక్ష్మరూపిణిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇలాంటి స్థానాలను ఆదరించి, గౌరవించి, పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది.తిరస్కరించిన వారికి కష్టాలు తప్పవు.


ఒక నాడు దూర్వాసముని వైకంఠంలో శ్రీ మహావిష్ణువును పూజించి, ఆయన ధరించిన పుష్పమాలను లక్ష్మీ ప్రసాదంగా స్వీకరించి, తిరిగి వెళ్తూ, మార్గం మధ్యలో స్వర్గలోకంలో ప్రవేశించాడు. తనకు ఆతిథ్య సత్కారాలను సమర్పించిన ఇంద్రునికి లక్ష్మీ ప్రసాదమైన పుష్పమాలను కానుకగా ఇచ్చాడు.


ఇంద్రుడు ఆ పుష్పమాలను విలాసంగా తన వాహనమైన ఐరావతం మెడలో వేశాడు. పుష్పమాలా స్పర్శకు కలత చెందిన ఆ ఏనుగు ఆ మాలను తొండంతో లాగి నేలపై పడవేసి, పాదాలతో త్రొక్కి, ఛిన్నా భిన్నం చేసింది. తానిచ్చిన పుష్పమాల తన ఎదుటే ఇలా విధ్వంసం కావడానికి కారకుడైన ఇంద్రుని పై దుర్వాసమహర్షి ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'రాజ్యబ్రష్టుడవై పొమ్మ'ని శపించాడు. ఇంద్రుడు స్వర్గరాజ్యాలక్ష్మికి దూరమై కొండల్లో, కోనల్లో సంచరించ సాగాడు. అలా సంచరిస్తూ, దేవేద్రుడు తన కష్టాలు తీరే ఉపాయం చెప్పుమని దేవగురువైన బృహస్పతిని కోరాడు. బృహస్పతి సూచనపై జగన్మాతను సేవించి ఆమె అనుగ్రహం పొందాలని థ్యాననిమగ్నుడయ్యాడు.


ఇంద్రుని భార్య అయిన శచీదేవి కూడా తన భర్తకు స్వర్గరాజ్యాన్ని ప్రాప్తింప చేయవలసిందిగా లక్ష్మీదేవిని ప్రార్ధించింది.వారి మెఱలు విని లక్ష్మీదేవి వారిని అనుగ్రహించగా, ఇంద్రునికి మళ్ళీ స్వర్గరాజ్యం లభించింది.


లక్ష్మీదేవికి నిలయమైన, మంగళకరమైన పవిత్ర పదార్ధాలను అవమానించరాదు. అసత్యం పలికేచోట, స్త్రీని గౌరవించలేనిచోట, భర్తనెదిరించి పలికే ఇల్లాళ్ళున్న చోట, తన సంతానంలో కొందరిపట్ల పక్షపాత దృష్టితో ప్రవర్తించే తల్లి ఉన్న చోట,వేదవిప్రులను, పతివ్రతలను బాధించేచోట, వేదనింద,యజ్ఞనింద జరిగేచోట లక్ష్మీదేవి నిలువదని వివరిస్తూ వ్యాసమహర్షి ఈ వృత్తాంతాన్ని ముగించాడు.

Share:

అయ్యప్ప స్వాములకు శుభవార్త

తిరుమల తిరుపతికి వచ్చే స్వాములు కానీ తిరుపతి మీదుగా ప్రయాణం చేయుచున్న అయ్యప్ప స్వామి భక్తులకు ఉచిత అన్న ప్రసాదం..


అయ్యప్ప స్వామి భక్తులకు పాదాభివందనం. తిరుపతి వచ్చే స్వాములు కానీ తిరుపతి మీదుగా ప్రయాణం చేయుచున్న స్వాములు కానీ ముందుగా మీ యొక్క birth నెంబరు మీ సీట్ నెంబరు మీ గురుస్వామి కాంటాక్ట్ నెంబరు మాకు పెట్టిన యెడల మీ భోగి దగ్గరికి మేము వచ్చి మీకు అల్పాహారము అందించగలమని తెలియజేయుచుటకు సంతోషిస్తున్నాను. రెండు రోజుల ముందు మీ గురుస్వామి కాంటాక్ట్ నెంబర్. ఆధార్ నెంబరు. మీ ట్రైన్ పేరు ట్రైన్ నెంబరు. ట్రైన్ ఎన్ని గంటలకు తిరుపతికి వచ్చునో తెలియపరచవలెను. శ్రీ శ్యామల సాయి నిత్యాన్న ప్రసాద వితరణ కేంద్రం యొక్క సదుపాయాన్ని అయ్యప్ప స్వామి భక్తులకు కలుగజేయుచున్నదని తెలియజేసుకుంటునాను... మా దగ్గరికి వచ్చి అయ్యప్ప స్వాములకు. భోజన వసతి కల్పించబడును. తిరుపతిలో స్వాములు ఎక్కడ హోటల్స్ లో బోజనం చేయవద్దని మనవి. భోజనానికి వచ్చే స్వాములు ఒక్కరోజు ముందర మాకు తెలియపరచవలెను. సాయి స్వామి తిరుపతి. 9848043689

Share:

నేడు సౌభాగ్య సుందరి తీజ్ (వ్రతం)


సౌభాగ్య సుందరి వ్రతం అని కూడా పిలువబడే సౌభాగ్య సుందరి తీజ్ ఉత్తర భారతదేశంలో వివాహితులు చేసుకునే ఒక ముఖ్యమైన పండుగ.  సౌభాగ్య సుందరి తీజ్ సందర్భంగా మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు కోసం మాతృదేవికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.


సౌభాగ్య సుందరి తీజ్ సందర్భంగా ఆచారాలు:..


సౌభాగ్య సుందరి తీజ్ రోజున మహిళలు సూర్యోదయం  లేచి ప్రారంభ స్నానం చేస్తారు. వారు వివాహిత మహిళల 16 అలంకారాలను ధరిస్తారు. కొత్త దుస్తులను ధరిస్తారు. ఈ 16 అలంకారాలలో కొన్ని మెహెంది , కుంకుమ , గాజులు , రోలి , పసుపు పొడి , సుపారి , వెర్మిలియన్ మరియు చీలమండ.


సౌభాగ్య సుందరి తీజ్ సందర్భంగా , వివాహితులు స్త్రీ దేవత పూజలు చేస్తారు (పార్వతి దేవి యొక్క అభివ్యక్తి). మహిళలు శివుడు మరియు పార్వతీ దేవికి ప్రార్థనలు చేస్తారు మరియు అన్ని పూజలను కర్మ పద్ధతిలో చేస్తారు. భగవంతుడు మరియు దేవత విగ్రహాలను ఎర్రటి వస్త్రంతో కట్టి చెక్క వేదికపై ఉంచాలి. ముందు భాగంలో ఒక మట్టి దీపం వెలిగించాలి. మరియు దేవతలకు మోలి , రోలి , చావల్ , సుపారి మరియు పాన్ రూపంలో వివిధ ప్రసాదాలు చేస్తారు. పార్వతి దేవత విగ్రహాన్ని కూడా 16 అలంకారాలతో అందంగా అలంకరించాలి.


ఆచారాల ప్రకారం , పూజ సమయంలో గణేశుడికి మొదటి ప్రార్థనలు చేస్తారు. సౌభాగ్య సుందరి తీజ్ పూజలు చేసేటప్పుడు తొమ్మిది గ్రహాలతో పాటు శివుడి సంపూర్ణ కుటుంబాన్ని కూడా పూజిస్తారు.


ఈ రోజున భక్తులు తమ ఇంటికి ఒక బ్రాహ్మణుడిని ఆహ్వానిస్తారు. పార్వతి దేవికి నైవేద్యం కోసం మహిళలు ఈ రోజు కోసం విస్తృతమైన మరియు ప్రత్యేకమైన ఆహారాన్ని తయారు చేస్తారు. పూజ తరువాత , బ్రాహ్మణుడికి ఆహారం ఇవ్వడం మరియు అతనికి బట్టలు మరియు *'దక్షిణా'* ఇవ్వడం ఆచారం.


సౌభాగ్య సుందరి తీజ్ రోజున మహిళలు కఠినమైన ఉపవాసం చేస్తారు. వారు పగటిపూట ఏమీ తినరు , త్రాగరు. అన్ని పూజ ఆచారాలు పూర్తి చేసిన తరువాత సౌభాగ్య సుందరి తీజ్ వ్రతం పూర్తవుతుంది. మహిళలు తమ భర్తల సంక్షేమం మరియు దీర్ఘాయువు కోసం ఈ ఉపవాసాలను పాటిస్తారు.


సౌభాగ్య సుందరి తీజ్ యొక్క ప్రాముఖ్యత:..


సౌభాగ్య సుందరి తీజ్ ఒక ముఖ్యమైన సంఘటన , ముఖ్యంగా వివాహిత మహిళలకు. ఈ పూజలు చేసే ధర్మాలు *'తీజ్', 'కార్వా చౌత్'* లతో సమానమని తెలుసు. పేరు సూచించినట్లుగా , సౌభాగ్య సుందరి తీజ్ పండుగ ఒకరి జీవితంలో సానుకూలత మరియు అదృష్టాన్ని తెస్తుంది. సద్గుణమైన భర్త , కుమారులు ఆశీర్వదించబడటానికి పూజలు మరియు ఆచారాలను మహిళలు పవిత్రంగా చేస్తారు. సౌభాగ్య సుందరి తీజ్‌ను పాటించడం ద్వారా ఎవరైనా మంచి కోసం తమ విధిని మార్చుకుని సంతోషకరమైన , విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చని నమ్ముతారు. అంతేకాకుండా , యువ మరియు అవివాహితులైన బాలికలు కూడా సౌభాగ్య సుందరి తీజ్ వ్రతాన్ని ఏ వివాహ దోషాల నుండి విముక్తి పొందటానికి మరియు వివాహం ఆలస్యాన్ని అధిగమించడానికి ఉంచుతారు. 'మంగ్లిక్ దోషం'తో బాధపడుతున్నవారికి మరియు వారి కుండలిలోని ప్రతికూల గ్రహ స్థానాలకు ఈ వ్రతం ప్రత్యేకంగా సహాయపడుతుంది. పూర్తి అంకితభావంతో ప్రదర్శించినప్పుడు , యువతులు తగిన మ్యాచ్‌ను కనుగొనగలుగుతారు. మరియు ఆనందకరమైన వివాహ జీవితాన్ని కూడా గడుపుతారు. సౌభాగ్య సుందరి తీజ్ మహిళలకు *'అఖండ్ వర్దన్' (దైవిక ఆశీర్వాదం)* గా ప్రదానం చేయబడిందని సరిగ్గా చెప్పబడింది.

Share:

గంగాదేవి



దేవలోకంలో మందాకిని, పాతాళలోకంలో భాగీరధి, భూలోకంలో గంగ ముల్లోకాలలో పుణ్యం అనుగ్రహించే
 ' త్రిపాదకా '  అని కీర్తించబడుతున్నది. ఈ పుణ్య జలాలలో స్నానం చేసినా, కొంచెం నీరు తలపై జల్లుకున్నా సకలపాపాలను తొలగిపోతాయని పురాణాలు తెలియచేస్తున్నవి. 
 
తల్లీ.. గంగా దేవీ.. అని పఠిస్తూ భక్తిశ్రద్ధలతో గంగని పూజించాలి.
ప్రవహించే గంగని స్పర్శించి నమస్కారించడం; 
గంగలో మునిగి స్నానం చేయడం;
గంగా నదిలో నిలబడి పూజించడం;
గంగలో నిలబడి పితృ దేవతలకు అర్ఘ్యం యివ్వడం;
నదిలోని మట్టిని తీసుకుని నమస్కారం చేయడం వంటి  విధానాలను మన పూర్వీకులు ఏర్పరిచారు.

ఈ విధంగా చేయడం వలన సర్వ పాపాలు నశిస్తాయి. గంగనదిని దర్శించలేనివారు గంగదేవి నామాన్ని  స్మరించడం.. చేతిలో ఉదక పాత్రను పెట్టుకుని మకరం మీద ఆశీనురాలైన గంగాదేవి పటానికి నమస్కరిస్తూ
భక్తిశ్రద్ధలతో పూజలు చేయవచ్చును.

Share:

తిరుప్పట్టూరు పరమశివుడు.

 







యగశాస్త్రాన్ని రచించిన పతంజలి మహర్షి జీవసమాధి అయిన స్థలాలు కొన్ని ఆలయాలుగా ప్రసిధ్ధిచెందాయి. విటిలో ప్రముఖమైనది తిరుప్పిడూరు అనే తిరుప్పట్టూరు.

పులికాళ్ళ మహర్షిగా పేరుగాంచిన వ్యాఘ్రపాదులవారిచే పూజించబడిన  దివ్యక్షేత్రం యిది. తిరుచ్చి - చెన్నై మార్గంలో తిరుచ్చి సత్రం బస్ స్టాండ్ నుండి 30 కి.మీ దూరంలో వున్న అద్భుతమైన ఊరు.

తిరుప్పట్టూరు దర్శన భాగ్యం కేవలం దైవ యోగం వున్న వారికే కలుగుతుందని అంటారు. ఆవిధంగా తిరుప్పట్టూరు వచ్చే భక్తుల విధివ్రాతలను శుభకరంగా మార్చి వ్రాయాలని పరమశివుడు యిచ్చిన ఆనతి.

ఒకానొక కాలంలో ఆది శేషువుపై అరమూత కన్నులతో శయనించిన మహావిష్ణువు తనలో తాను నవ్వుకుంటూ పరవశించిపోతూ వున్నాడు. పరమానందంతో ఆయన శరీరం బరువెక్కింది.

మహావిష్ణువుని మోస్తున్న ఆదిశేషువుకి మహావిష్ణువు హటాత్తుగా బరువు పెరగడంతో మ్రోయడానికి శ్రమ కలిగినది. మహావిష్ణువుని భరించడం భారంగా తోచినది. మహావిష్ణువు అంత ఆనందభరితుడై వుండడానికి కారణం ఏమిటో తెలియక ఆశ్చర్యపడ్డాడు ఆదిశేషువు. స్వామినే అడిగాడు. 

అందుకు మహావిష్ణువు తన్మయత్వంతో "ఆదిశేషా.. నా దేహం బరువు ఎక్కడానికి కారణం నీవు తెలుసుకోవాలనుకుంటున్నావు. చెప్తాను, విను. నేను ఇక్కడనుండే కైలాసంలో మహేశ్వరుని ఆనందతాండవం తిలకించాను. నా మనస్సు ఉప్పొంగిపోయింది. ఆ నాట్యం చూసి ఆనందించేను.

అందువలన నా దేహం మనసు ఆనందంతో బరువెక్కినది" అని తెలిపాడు. ఆదిశేషువుకి సందేహం తీరినది. కానీ ఆ శివతాండవాన్ని  తాను దర్శించాలని ఉవ్విళ్ళూరాడు.

మహేశ్వరుని ఆనందతాండవాన్ని యీ దాసుడు కూడా చూడాలి. ఆ భాగ్యాన్ని కలుగజేయండని మహావిష్ణువుని వేడుకున్నాడు. అందుకు మహావిష్ణువు తెలిపిన ఆదేశం పాటిస్తూ ఆదిశేషువు కైలాసానికి దిగువన తపస్సు చేయనారంభించాడు.

ఆదిశేషువు సుదీర్ఘకాల తపస్సుకి మెచ్చి  శివుడు ప్రత్యక్షమై ఆదిశేషువు కోరిక తీరే మార్గం తెలిపాడు. "నీవు భూలోకంలో వ్యాఘ్రపురంలో కశ్యప మహర్షికి కద్రువకి పుత్రునిగా పుట్టి పతంజలి అనే పేరుతో పెరిగిన పిదప అనేక ముఖ్య పుణ్యస్ధలాలలో నా తాండవలీలలు నీవు దర్శించగలవు" అని అభయమిచ్చాడు.  

ఆవిధంగా భూలోకంలో జన్మించిన పతంజలి సకల శాస్త్రాలు అధ్యయనం చేసి  యోగవిద్యలో పాండిత్యం సంపాదించి గొప్ప యోగి అయినాడు.  

పతంజలి మహర్షికి మిత్రుడు వ్యాఘ్రపాదులు. ఈ ఇరువురు మానవరూపాలలో కనిపించినా పతంజలి మహర్షి నడుముకి కింద భాగం  సర్పరూపములో, వ్యాఘ్రపాదులు పేరుకు తగినట్లు ఆయన శరీరం క్రిందిభాగం పులి రూపంలోను వుంటుంది.

ఈ ఇద్దరు ఋషులు దేశమంతా తీర్ధయాత్రలు చేసి వచ్చారు. ఆ సమయంలో వారికి దర్శనం యిచ్చిన ఈశ్వరుడు దక్షిణాదిన గల తిల్లై క్షేత్రంతో కలిపి తొమ్మిది పులియూర్ శైవక్షేత్రాలను దర్శిస్తే వారికి తన తాండవ దర్శనం లభిస్తుందని వరమిచ్చాడు.

పతంజలి, వ్యాఘ్రపాదులు ఇద్దరూ ముందుగా  పుష్యమాసంలో పుష్యమి తిధిన తిల్లైగా పేరు పొందిన పులియూరుకి వచ్చారు.వారి వెంట  మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు కింకరులతో, శివగణాలు, గంధర్వులు అందరూ తిల్లైకి తరలి వచ్చారు. అక్కడ ఈశ్వరుడు కనకసభాపతిగా  ఆనందతాండవాన్ని ప్రదర్శించి అందరిని ఆనందపరిచాడు.

మునులు ఇద్దరికి ఆనందంతో కన్నీరు వర్షించగా "ఈశ్వరా..ఈ తాండవాన్ని దర్శించడానికే జన్మించాము. చాలు.. చాలు, మా జన్మ ధన్యమయింది. మమ్మల్ని యిప్పుడే మీలో ఐక్యం చేసుకొని ముక్తిని ప్రసాదించండి" అని వేడుకున్నారు..

"ఎప్పుడైతే కోరికలతో మీరు జన్మ ఎత్తారో  అప్పుడే మీరు మాయామోహంలో చిక్కుకున్నారు అని అర్ధం. నా తాండవం చూడాలని కోరుకున్నారు. అది నెరవేరినది.

ఇప్పటికిప్పుడు వెంటనే మోక్షం అసాధ్యం. నేను చెప్పిన విధంగా మిగతా ఎనిమిది పులియూర్లను దర్శించండి. మీ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించండి, వెళ్ళండి.  

ఈ ఎనిమిది క్షేత్రాలలో ఒక అద్భుతమైన స్ధలంలో మీ కోరిక నెరవేరుతుందని అనుగ్రహించాడు పరమశివుడు.

ఈ దివ్య మార్గం కేవలం ఒక్క పతంజలి, వ్యాఘ్రపాదులకు మాత్రమే చూపించిన మార్గం కాదు, మానవజన్మ ఎత్తిన వారందరికి వర్తిస్తుంది.

పరమశివుడు చెప్పినట్లుగానే పతంజలి, వ్యాఘ్రపాదుల వారుమిగతా ఎనిమిది స్ధలాలు దర్శించడానికి బయలుదేరేరు. తిల్లై అనే  పులియూరు నుండి బయలుదేరి,

తిరుప్పాదిరుప్పు పులియూరు, ఎరుక్కతం పులియూరు, ఓమాం పులియూరు, సిరుపులియూరు, అత్తిపులియూరు తప్పళాపులియూరు, పెరుంపులియూరు, గానాట్టంపులియూరు అనే ఎనిమది శైవ క్షేత్రాలను దర్శించారు. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధమైన శివతాండవ దర్శనాలతో ఆనందించి పరవశించారు. లక శ్రేయస్సు కోసం తమ జీవితాలను వెచ్చించి అంతిమంగా శివైక్యం చెందారు..


Share:

పార్ధివలింగాల పూజాఫలం

Share:

శ్రీ మీనాక్షీ సమేత అగస్త్యేశ్వర స్వామి..




కృష్ణా నది,ముచికుందా నదుల సంగమం అయిన వాడపల్లి వద్ద ఉన్న  అతి పురాతన దేవాలయాల్లో మీనాక్షి అగస్త్యేశ్వరాలయం ఒకటి. 


ఈ గుడిలో పానువట్టం మీద శివలింగం మరో రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శివలింగం మీద ఒక చిన్న గుంట ఉండి అందులో నుంచి నీరు ఎప్పుడూ ఉబికి వస్తూ ఉంటుంది. అయితే ఆ నీరు శివలింగం నుంచి కిందకు పొర్లదు. అంతే కాకుండా ఆ గుంటలో నీటి మట్టం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. ఇది అగస్త్య మహాముని ప్రతిష్టించిన ఆలయం. 6000 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఆలయం ఇది 


పూర్వం అగస్త్య మహాముని దేశసంచారం చేస్తూ కృష్ణా, ముచికందా సంగమ స్థానం లో సాయం సంధ్యావందనం పూర్తిచేసి ధ్యానం లో ఇదో గొప్ప దివ్యస్థలం అని గుర్తించి శివలింగం,లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్టించి పూజించి,అభిషేకించి ముందుకు యాత్రకు వెళ్లినట్టు చరిత్ర చెబుతోంది.


ఆ తర్వాత పుట్టలు పట్టి సుమారు 5,400 సంవత్సరాలు స్వామి పుట్టల్లోనే ఉన్నారు. రెడ్డిరాజుల పరిపాలనా కాలంలో  పుట్టలో ఉన్న స్వామి బయల్పడ్డారు. ఇక్కడే ఆలయం నిర్మించి స్వామికి ఈ స్థలాన్ని అంకితం చేశారు రెడ్డిరాజులు 600 సంవత్సరాల క్రితం.



పక్షిని రక్షించి ప్రతిగా తన శిరస్సు నుండి మాసం ఇచ్చిన శివయ్య. ఇందుకు సంబంధించి స్థానిక కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఒక రోజు ఒక బోయవాడు పక్షిని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ శివలింగం వెనుకాల దాక్కొంది. శివుడు జాలిపడి ఆ పక్షిని రక్షించాలనుకొన్నాడు. అయితే బోయవాడు వచ్చి ఆ పక్షి తనదని దానిని తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు.

 

దీంతో శివుడు తాను ఈ పక్షికి మాట ఇచ్చానని అయితే నీ కోరిక కూడా సమంజసంగా ఉందని చెబుతారు. నీ ఆకలి తీర్చుకోవడానికి వీలుగా నా తల నుంచి కొంత మాంసం తీసుకోవాలని సూచిస్తాడు. ఆ బోయవాడు ఇందుకు అంగీకరించి తన వద్ద గొడ్డలితో శివుడి శిరస్సును కొంత మేర ఖండించి చేతి వేళ్లతో కొంత మాంసాన్ని తీసుకొంటాడు.


ఆ చేతివేళ్ల గుర్తులను మనం ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. ఇక స్వామివారి గాయన్ని కడగడానికి నేరుగా గంగమ్మే ఇక్కడికి వచ్చిందని చెబుతారు. అందువల్లే ఈ శివలింగం పై గుంటలో నీరు ఎల్లప్పుడు ఉంటుందని చెబుతారు. ఇదిలా ఉండగా క్రీస్తుశకం 1524లో శ్రీ శంకరాచార్యలు శిష్యసమేతంగా ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ బిలం (గుంట) లోతు ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక ఉద్దరిణికి తాడు కట్టి ఆ బిలంలో వదిలారు. ఎంత సమయమైనా ఆ తాడు అలా వోపలికి వెళుతూనే ఉంది. దీంతో ఆ తాడును పైకి లాగారు.


ఆ ఉద్దరిణికి రక్త మాంసాలు అంటుకున్నాయి కాని ఆ బిలం లోతు తెలియలేదు. దీంతో శంకరాచార్యలు లయకారకుడైన నిన్ను పరీక్షించడానికి నేను ఎంతవాడినని పరి పరి విధాలుగా ప్రార్థించారు. తర్వాత ఈ వివరాలను తెలుపుతూ అక్కడ పాళీ భాషలో రాతి శాసనం కూడా వేయించారు సదరు శాసనాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇది నదీ సంగమం కనుక ఇక్కడ అస్తికలు నిమజ్జనం కూడా చేస్తుంటారు. 


ఈ వాడపల్లి శ్రీ అగస్త్యేశ్వస్వామి సందర్శనం వల్ల భూత, ప్రేత పిశాచాల భయం ఉండదని స్థానిక భక్తుల నమ్మకం.


ఓం నమః శివాయ 🙏

Share:

కాశీలోని పిశాచమోచన తీర్థం..




(ఈ తీర్థంలో పిండప్రదానం చేస్తే పిశాచరూపంలో ఉన్న పితృలకు విమోచనం కలుగుతుంది)


కపర్ది అనే గణపుడు కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి, విమలోదకం అనే కుండాన్ని తవ్వాడు. ఆ శివలింగాన్ని కపర్దీశ్వరుడు అని పిలుస్తారు. పూర్వం 'వాల్మీకి' అనే భక్తుడు కపర్ధీశ్వరుడిని అర్చిస్తూ అక్కడ తపస్సు చేశాడు. 


ఒక రోజు అతను ఘోరాకృతి కల రాక్షసుణ్ణి చూసాడు. వాల్మీకి ఆ ప్రేతను "నీవు ఎవరవు? ఎక్కడి నుండి ఇక్కడకు వచ్చావు?" అని భయపడకుండా ప్రశ్నించాడు. అప్పుడు ఆ పిశాచి నమస్కరిస్తూ "గోదావరి తీరంలో ప్రతిష్ఠానమనే గ్రామంలో, దానాలు స్వీకరిస్తూ బ్రతికే బ్రాహ్మణుడను నేను. ఆ కర్మ వలన నేనీ దశను పొందాను.


ఏవైనా పర్వలయందు దానం చేయనివారు, తీర్ధాలలో దానాలు స్వీకరించినవారు ఇట్టి జన్మ ఎత్తుతారు! ఒకనాడు ఒక బ్రాహ్మణుడను ఆవహించాను‌. ఆ బ్రాహ్మణుడు ధనం ఆశతో కాశీ నగరానికి వచ్చాడు. అతను కాశీలో ప్రవేశిస్తుండగా, అతని పాపాలతో సహా నేను బయటకు నెట్టివేయబడ్డాను.


ఓ తపోనిధీ! మావంటి ప్రేతలకు, మహాపాపాలకు ఈ కాశీలో ప్రవేశించే అర్హతలేదు! ఇదీ ఈశ్వరాజ్ఞ! ఈరోజు ఒక కోమటిని భక్షిద్దామని దగ్గరకు వెళ్ళాను. అతను శివనామాలను చెబుతూ ఉండడం వలన, వాటిని వినడంవల్ల నా పాపం కూడా తగ్గింది.


అందువలన ఈ కాశీ క్షేత్రంలో ప్రవేశించగలిగాను! మహాత్మా! దారుణమైన ఈ పిశాచరూపం నుండి నన్ను ఉద్ధరించుము" అని ప్రార్ధించాడు! 


అప్పుడు ఆ మహాత్ముడు "ఓ పిశాచమా! నీ పాపం పోవాలంటే ఈ విమలోదకమున స్నానము చేయి! ఈ తీర్ధ ప్రభావంవల్ల, కపర్దీశుని దర్శనం వలన నీకు ఈ పిశాచత్వము పోతుంది" అని చెప్పాడు! అప్పుడు పిశాచి "జల దేవతల అనుగ్రహం నామీద లేదు" అన్నాడు. అప్పుడు వాల్మీకి తన దగ్గర ఉన్న విభూతినిచ్చి, నుదుటన ధరించమన్నాడు. 


విభూతిని ధరించడంవల్ల జలదేవతలు ఏమీ చేయలేదు. అలా నీటిలో దిగి, స్నానం చేసి, ఆ నీటిని త్రాగి ఆ జలాశయం నుండి బయటకు వచ్చిన ఆ పిశాచి, తన పిశాచత్వము తొలగిపోగా, దివ్య శరీరాన్ని పొందింది!


దివ్యగంధాన్ని, దివ్య మాలలను ధరించి, దివ్య మార్గాన వెళుతూ, ఆకాశం నుండి ఆ మహాత్ముడికి నమస్కరిస్తూ.. "హే! భగవాన్! మీ వలన ఈ నీచమైన పిశాచ శరీరం నుండి, ఈ తీర్ధమహిమ వలన దివ్యమైన శరీరాన్ని పొందాను!


ఈనాటి నుండి ఇది పిశాచమోచన తీర్ధంగా పిలవబడుతుంది! ఈ తీర్ధంలో ఎవరైతే స్నానం చేసి, సంధ్యాతర్పణ పూర్వకంగా పిండప్రదానం చేస్తారో, పిశాచ శరీరాన్ని పొందిన వారి పితృపితామహులు అందరూ కూడా పైశాచ్యం నుండి విముక్తి పొందుతారు!


ఉత్తమగతిని పొందుతారు! ఈ తీర్ధంలో మాఘశీర్ష శుద్ధ చతుర్ధశినాడు స్నానాదులు చేసినా పిశాచమోచనం జరుగుతుంది.


అతడు ఎక్కడ మరణించిన పిశాచ శరీరం పొందడు! సాంవత్సరిక యాత్రను చేసినవారు తీర్ధాల్లో దానాలు స్వీకరించడం వలన వచ్చిన పాపాలు నుండి విముక్తులవుతారు.


ఇక్కడ స్నానంచేసి, కపర్దీశుణ్ణి అర్చించి, అన్నదానం చేసినవాడికి ఎక్కడా భయమేలేదు" అని నమస్కరిస్తూ దివ్యలోకాలకు వెళ్ళాడు. వాల్మీకి ఈ మహాశ్చర్యకరమైన సంఘటన చూసి, కపర్దీశుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందాడు! 


ఒక్క శివయోగికి పిశాచమోచన తీర్థంలో భోజనం పెట్టినా, కోటి శివయోగులకు పెట్టిన ఫలాన్ని పొందుతారు.


ఈ అధ్యాయాన్ని విన్నవారు భూతప్రేత పిశాచాదులచే బాధింపబడరు అని సుబ్రహ్మణ్యస్వామి అగస్త్యమహర్షితో చెప్పాడు..


Pishach Mochan, Ramakanth Nagar, Chetganj, Varanasi, Uttar Pradesh 221001

https://www.google.com/maps/place/pishach+mochan+kund/@25.3212747,82.9954145,787m/data=!3m1!1e3!4m5!3m4!1s0x398e2fc207010721:0x2516f9b11b986523!8m2!3d25.3199849!4d82.9955218

Share:

శ్రీ లక్ష్మీ నృసింహ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం..








సింగరకొండ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రఖ్యాతి గాంచినవి. సింగరకొండ అద్దంకి నుండి 6 కి.మీ. దూరంలో ఉంది. మొదట్లో సింగన కొండ అని పిలవబడ్డ నరసింహ క్షేత్రం, అయిననూ ఆంజనేయ స్వామి క్షేత్రం గానే ప్రఖ్యాతి గాంచెను.

 

సింగరకొండపై లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉండగా కొండ దిగువన చెరువు ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే భూతప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని స్థానికులు చెప్తారు.


శ్రీ నరసింహ స్వామి ఆలయ చరిత్ర :..


శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని 14వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 

క్షేత్ర మహత్యాన్ని అనుసరించి, 14వ శతాబ్దానికి చెందిన సింగన్న అనే నృసింహస్వామి భక్తుడు ఉండేవాడు. సింగన్న కూతురు నరసమ్మ. ఆమె రోజు ఆవులను మేపేందుకు కొండమీదికి వెళ్ళేది. ఆ ఆవుల్లో ఒక ఆవు పాలు ఇవ్వకపోవడాన్ని సింగన్న గమనించాడు. ఒకటి రెండు రోజులైతే అనుకోవచ్చు. 

కానీ ఇన్ని రోజుల పాలు ఎందుకు ఇవ్వడంలేదా అని ఆలోచించాడు. అసలు సంగతి ఏమిటో కనిపెట్టాలని సింగన్న కూడా కొండమీదికి వెళ్ళాడు. పాలు ఇవ్వని ఆవును అనుసరించి వెళ్ళాడు.


ఆవు కొండపైన ఒక రాయి దగ్గరికి వెళ్ళింది. ఆ రాతిలోంచి ఒక బాలుడు ఉద్భవించి, ఆవు పాలను తాగి వెళ్ళడం చూసిన సింగన్న ఆశ్చర్యానికి అంతులేదు. తన ఆరాధ్య దైవం అయిన నృసింహ స్వామి బాలుని రూపంలో వచ్చి పాలు తాగడంతో సింగన్న మహదానందపడిపోయాడు.. తన కళ్ళతో రాయి నుండి బాలుడు రావడం చూశాడు గనుక, ఆ రాతిని పరమ పవిత్రంగా భావించి అక్కడే నృసింహస్వామికి దేవాలయం కట్టించాడు. ఇక కొండ దిగువన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామికి సంబంధించిన స్థల పురాణం తెలుసుకుందాము.


ప్రసన్నాంజనేయ స్వామి స్థల పురాణం : ..


సతమ్మ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపధం బయలుదేరిన ఆంజనేయుడు, ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారని ఒక నమ్మకం. అందుకే ఇచ్చట ఆంజనేయుడు దక్షిణాముఖుడై కనపడతారు. 


అద్దంకి తాతాచార్యులు అని గొప్ప భక్తుడు సింగరకొండలో కొండపై గల నరసింహ స్వామి గుడిలో ధ్వజారొహణ చేయుచుండగా, కొండ క్రింద ఒక దివ్యపురుషుడు ఒక ఆంజనేయ విగ్రహమునకు హారతి ఇచ్చుచూ కనబడెను. పరుగు పరుగున క్రిందకు వెళ్ళిన తాతాచార్యుల వారికి పురుషుడు మాయమై, దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయ విగ్రహం కనపడింది. వాళ్ళు కొండ దిగి వచ్చి చూసేసరికి ఆ పుణ్యమూర్తి కనిపించలేదు. మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగిపోతూ కనిపించింది. 

దాంతో ఆ గ్రామస్తులు, చుట్టుపక్కలవారు కలిసి, లక్ష్మీ నృసింహ దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా కట్టించారు. ఇక్కడి ఆలయంలో స్వామి వారు అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక్కడ భవనాశనీ తటాకాన్ని చూడవచ్చు. 


ప్రతి శని, ఆది, మంగళవారాలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ దశమి మొదలు బహుళ పాడ్యమి వరకు బ్రహోత్సవాలు జరుగుతాయి. 


పూజలు..


సింగరకొండలో ప్రతి మంగళ వారం మరియు శని వారం విశేష పూజలు జరుగును. ముఖ్య పండుగలు అయిన ఉగాది, శ్రీరామ నవమి, హనుమ జ్జయంతి, ముక్కోటి, సంక్రాంతి, బ్రహ్మోత్సవాల తిరునాల్లు ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజులలో లక్షల కొద్దీ భక్తులు వచ్చి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీశ్శులు పొందెదరు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్ష తమలపాకుల పూజ, కోటి తమలపాకుల పూజ చూడుటకు రెండు కళ్ళూ చాలవు.


నిత్యాన్నదాన పథకం..


స్వామివారిని దర్శించుకొనడానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం జరుగును. ప్రతి మంగళవారం, శనివారం 150 మంది భక్తులకు, మిగతా రోజులలో 50 మంది భక్తులకు, అన్నప్రసాద వితరణ జరుగుచున్నది.


ఆలయం దర్శనం సమయం ఉదయం 5:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తిరిగి 4:00 నుండి రాత్రి 8:00 వరకు..


వసతి:..

సింగరకొండ లో వసతి పొందాలనుకునేవారు దేవస్థానం ఏర్పాటు చేసిన కాటేజీలలో బస చేయవచ్చు. కనుక ఇక్కడికి వచ్చే యాత్రికులు మారుతి భవన్ లో వసతి పొందవచ్చు. అద్దె తక్కువ ధరకే లభిస్తుంది. 


ఎలా చేరుకోవాలి..?


హైదరాబాద్ నుండి 290 కిలోమీటర్లు, విజయవాడ నుండి 110 కిలోమీటర్లు, ఒంగోలు నుండి 36 కిలోమీటర్లు, అద్దంకి నుండి 5 కిలోమీటర్ల దూరంలో సింగరకొండ కలదు..

Share:

కడప శ్రీ పొలతల అక్కదేవతల పూజ | దెయ్యాల పూజ | Kadapa Sri Polathala Akkade...

Share:

భారతీయ ఆవు పేడ పిడకలు అమ్మబడును || Indian cow dung Pidakalu is sold పిడక...

Share:

Common sense on protecting yourself from coronavirus - What are they and...

Share:

Coronavirus covid 19 What it does to the body - What happens to your bod...

Share:

East Africa's first community-owned Kenya elephant sanctuary takes lead ...

Share:

భారతీయ సంప్రదాయ జానపద కోలాటం డాన్స్ || Indian traditional Folk kolatam d...

Share:

NASA's telescope to unravel dark energy, alien life Wide Field Infrared...

Share:

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List