విఘ్నేశ్వరుడు నదుల అవతరణ.. ~ దైవదర్శనం

విఘ్నేశ్వరుడు నదుల అవతరణ..

గంగా పార్వతుల మధ్య కొంతకాలం క్రమ క్రమంగా ద్వేషం వర్థిల్లుతుండగా, గంగా పుష్కరం వచ్చింది. ఆ సమయంలో నారదుడు పార్వతి దగ్గరికి వెళ్ళి, ‘‘ముక్కోటి దేవతలు వారివారి మహత్తులు, శక్తులు గంగాజలానికి సంక్ర మించేలాగ పుష్కర స్నానాలు చేస్తున్నారు. అమ్మా గౌరీ! నీవు కూడా అలాగ చేస్తే, విశాల హృదయం గల మంచిదానివి నీవేనని, లోకం నిన్నే మెచ్చుకుంటుంది!'' అని చెప్పి అలాగే వెళ్ళి, గంగతో, ‘‘గంగాభవానీ! నిన్ను పావనం చేద్దామని పార్వతి విజ…ుం చేస్తున్నది, తెలుసా!'' అన్నాడు.

 ‘‘అలాగా! దయదాక్షణ్యాలు, చాటు కుందామని వస్తున్నదా, రానీ చెపుతాను,'' అన్నది గంగ. పార్వతి పూలు జల్లి గంగలో దిగబోతూంటే, ‘‘ఆగు! నన్ను మలినపరచకు!'' అని గంగ ఆటంకపరిచింది. ఇద్దరికీ గొప్ప వివాద సంవాదం జరిగింది.

 ‘‘కుమారస్వామిని శరవణ సరస్సు కన్నది; నీ అవిటి చేతుల్లో నలిగిన బొమ్మ బాబు, పాపం, గజముఖుడయ్యాడు; నీవు మాత్రం సంతానభాగ్యం లేని ఒఠ్ఠిగొడ్రాలివి!'' అన్నది గంగ. ‘‘నేనెవర్నో తెలుసా, పరమశివుడి అర్ధాంగిని, భాగేశ్వరిని!'' అన్నది పార్వతి. ‘‘తెలియకేం, బాగా తెలుసు. కట్టుకున్న అమాయకుణ్ణి సగం తినేసిన పరమపాత కివి?'' అన్నది గంగ. ‘‘జారిపడిన భ్రష్టురాలివి నువ్వు!'' అన్నది పార్వతి.

‘‘హాలాహలం గొంతు దిగకుండా మ్రింగిన తాపాన్ని చల్లార్చితే మెచ్చి,నచ్చి,మనోహర కుసుమకుమారిగా తలను దాల్చిన జగద్రక్షƒ కుడికి ఇష్టురాలినో, భ్రష్టురాలినో లోకానికి తెలుసు!'' అంది గంగ. ‘‘ఎవరో పిలిస్తే వస్తూ చిక్కులుపడిన అర్భకురాలివి. వల్లమాలిన సుకుమారితనం దేనికి?'' అన్నది పార్వతి.

 ‘‘నువ్వలాగే అంటావులే! బలులు కోరే జాలిలేని అమ్మతల్లివి! వామాచారిణివి, మలినపు, అంటరాని మాతంగివి, కఠినాత్ము రాలివి, మోటుదానివి, శక్తివి!'' అని గంగ గడగడా అనేసింది. ‘‘బాగా గుర్తుచేశావు గంగా! ఔను, నేను శక్తిని, మహాశక్తిని!''అంటూ పార్వతి ఆవేశం పొందింది. మరుక్షణమే ప్రళయప్రభంజ నాలు వీచాయి. చీకట్లు కమ్మాయి. మెరుపు లతో ఆకాశం గర్జించింది.పిడుగులు పడ్డాయి. భూమి కంపించింది. మంచు శిఖరాలు కరి గాయి. పార్వతి ఆవేశానికి గంగ పరిహాసం చేస్తూ, ‘‘చాల్లే! చల్లనిదాన్నికదా అని నన్ను చిన్నచూపు చూశావేకాని, నేను జలశక్తిని అన్న సంగతి మరిచావు; నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే!'' అంటూ గంగ హిమాలయ శిఖరాగ్రాల ఎత్తున పొంగింది. గంగానది పరవళ్ళు తొక్కుతూ ఉత్తర భూమిని జలమయం చేసింది.

 దేవతలు బారులు తీర్చి ఆకాశం మీది నుంచి జరిగిన బీభత్సాన్ని చూస్తూ, ‘‘అమ్మలు ఒకరినొకరు ఆడిపోసుకోవడం కాదుగాని ప్రళయం తెచ్చిపెట్టారు!'' అని నిట్టూర్చి, కలహబీజం నాటిన నారదుణ్ణి ఒక్కుమ్మడిగా నిందించారు. విఘ్నేశ్వరుడు దక్షణం నుంచి తిరిగివస్తూ, నారదుణ్ణి చూసి, ‘‘కలహభోజనా, ఇప్పుడు కడుపునిండిందా? హఠాత్తుగా జగత్తుకు ఎంత ఉపద్రవం తెచ్చిపెట్టావయ్యా!'' అన్నాడు.

 నారదుడు, ‘‘ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడే కదా కడుపునిండిన వినాయకు లెవరో, లోక కళ్యాణం కోసం నడుము బిగించి పాటుపడే నాయకుడెవరో తెలిసేది!'' అని ఛలోక్తి విసురుతూ వెళ్ళాడు. విఘ్నేశ్వరుడు కైలాసం చేరాడు. కైలాసంలో పార్వతి పశ్చాత్తాపంతో తనలో తాను, ‘‘మళ్ళీ మరొక భగీరథుడు తరలిం చుకుపోతేనేగాని గంగ ఉధృతం తగ్గదు!'' అని గట్టిగా అనుకున్నది. ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు. ఏమీ ఎరగనట్టు పార్వతి ముంగిటకు వచ్చి మెల్లగా వంగి పాదాభివందనం చేసి, ‘‘అమ్మా, ఒక మంచిపని తలపెట్టాను, ఆశీర్వదించమ్మా!'' అన్నాడు.

‘‘విఘ్నేశ్వరుడు తలపెట్టితే అడ్డేమిటి, 
నాయనా! ఇంతకూ నువ్వేదో దక్షణంగా వెళ్ళివచ్చినట్టున్నావు, విశేషమేమిటి?'' అన్నది పార్వతి. విఘ్నేశ్వరుడు, ‘‘ఏం చెప్పమంటావు? వింధ్యకు దిగువ అంతా శూన్యంగా ఉన్నది. ఆ ప్రదేశం అంతా పైరు పచ్చగా, నీ అన్నపూర్ణ నామధేయాన్ని పొందితే ఎంత బాగుంటుంది! అనిపించిందమ్మా, గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కాదా, ఏమంటావమ్మా?'' అన్నాడు.

పార్వతి, ‘‘నేననేదేముందబ్బా, అంతా ఆ విశ్వనాథుడిదే కదా భారం!''అన్నది చాలా నిర్లిప్తంగా. విఘ్నేశ్వరుడు, ‘‘అలా అని మనం ఊరికే చూస్తుండవలసిందేనా? ప్రపంచానికి ఒక మంచి పని జరగాలంటే మన ప్రయత్నం ఉండాలా వద్దా?'' అన్నాడు. ‘‘తప్పకుండా ఉండాలి. అందునా నీలాంటి వాడు పూనుకుంటే జరగనిదేముంది!''అంది పార్వతి.

 ‘‘ఆ మాట చాలునమ్మా, వెళ్ళి వస్తాను,'' అని పార్వతి పాదాలు తొండంతో కళ్ళకద్దు కొని అక్కడ నుంచి బయలుదేరిన విఘ్నే శ్వరుడు, తిన్నగా గౌతమమహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. గౌతముడు పడమటికనుమల నడుమ చిన్న ఆశ్రమం ఏర్పరచుకొని, అవసరం మట్టుకు సేద్యం చేసుకుంటూ ఉన్నాడు.


విఘ్నేశ్వరుడు నిండుచూలుతో ఉన్న ఆవుగా మారాడు. పెరిగిన చేను తొక్కుకుంటూ మేస్తున్న ఆవును అదలించి తరిమే ప్రయత్నంగా గౌత ముడు కమండలం నీరు అరచేత్తో విసిరాడు. ఆ నీటిచుక్కలు పడీపడ్డంతో ఆవు పడిపోయి గిలగిల తన్నుకొని కొయ్యబారింది. గౌతముడు తన సుకృతాన్నీ, తపస్సునూ ధారబోసినా మాయదారి గొడ్డు మూసిన కన్ను తెరవలేదు.

నారదుడు దేవేంద్రుణ్ణి ఉసిగొలిపాడు. ఇంద్రుడికి గౌతముడి మీద తీరని పగ ఉంది. బ్రహ్మ అపూ
ర్వసుందరిగా అహల్యను సృష్టి చేశాడు. ఇంద్రుడు చాలా ఆశపడ్డాడు. ఇంకా చాలామంది పోటీపడ్డారు. భూదేవిని ప్రదక్షణంచేసి ఎవరు ముందువస్తే, అహల్య అతని దవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు. గౌత ముడు ప్రసవిస్తున్న ఆవు చుట్టూరా తిరిగి వచ్చి, బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భార్యగా గెల్చుకున్నాడు.

గోవు సాక్షాత్తూ భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతముడి చేతి మీదుగా గోహత్య జరిగింది! పగ తీర్చుకోడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప మునిపుంగవుడి వేషంతో తిరిగి తిరిగి, ‘‘గౌతముడు గోహత్య చేసిన మహాపాపి! అతని ఆశ్రమం మైలపడి పోయింది. గౌతముడిని చూసినా, ఆశ్రమంలో అడుగుపెట్టినా మహాపాతకం చుట్టుకుం టుంది! దీనికి పవిత్ర గంగాజలాలు ఆశ్రమ సీమలో ఆవు మీద నుంచి ప్రవహించాలే తప్ప వేరే పరిహారం ఏదీ లేదు!''

అని లోకమంతా చాటి,సాటి మహర్షులను బాగా రెచ్చగొట్టాడు. ఋషులు గౌతముణ్ణి వెలివేశారు. ఆశ్రమవాసులంతా ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడి గంగానది! ఎక్కడి పడమటి కనుమలు! అయినప్పటికీ గౌతముడు భగీరథుణ్ణి ఆదర్శంగా పెట్టుకొని తలపెట్టిన కార్యం, సాధించి తీరాలన్న పట్టుదలతో గంగాదేవిని గూర్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు.

కపిలమహాముని కోపాగ్నికి బూడిద పోగులైన తన తాతలను తరింపజేయడానికి భగీరథుడు జలాధి దేవతైన గంగాదేవిని తపస్సు చేసి మెప్పించి దివినుండి భువికి దింపాడు. శివుడు తన జటాజూటంలో గంగను ధరించాడు, గంగ గంగాభవాని అనిపించుకుంది. గంగను ఒదలమని భగీరథుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు జడల ముడి సడలించి గంగను కొద్దిగా ఒదిలాడు.

 గొప్ప వేగంతో గంగ చిమ్ముకొచ్చి నలుదెసలా హిమాలయాల్లో పడింది. భగీరథుడి వెంట గంగ ప్రవాహంగా తూర్పు ముఖంగా వెళ్లింది. గంగకు భాగీరథి అని పేరు వచ్చింది. హిమాలయల్లో పడిన గంగ కొంత హిందు కుశ శిఖరాల మీదుగా పడమరకు ఇందు నదిగా ప్రవహించింది. ఇందు నదినే సింధునది అన్నారు. భరతఖండానికి వాయువ్యంగా ఉన్న సింధునది మూలంగా హిందూదేశమనే పేరు వచ్చింది.

భగీరథుడి వెంటమహావేగంగా వెళుతూన్న గంగను తన ఆశ్రమం పాడవకుండా జహ్నుమహా ముని తాగేశాడు. భగీరథుడు జహ్నుమునిని ప్రార్థించి గంగను విడుదల చేయించాడు. జహ్నుమహాముని చెవినుండి గంగ వెలికి వచ్చి నందువల్ల గంగకు జాహ్నవి అనే పేరుకూడా వచ్చింది. తరవాత గంగాజలం కపిలాశ్రమం చేరి, భగీరథుడి పితరుల మీదుగా ప్రవహించి తరింపజేసి భగీరథుడి ప్రయత్నాన్ని ఫలింప జేసింది.

భగీరథుడు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదని గౌతముణ్ణి మెచ్చుకొని గంగ ప్రసన్నురాలై అదేవిధంగా గౌతముడి వెంట బయలుదేరింది. దారి పొడవునా గంగాదేవి అడుగుజాడల్లో ఎన్నో ేుర్లు, వాగులు పుట్టాయి. గౌతమాశ్రమం చేరుతూనే గంగ నదీ ప్రవాహమై గౌతముడు దారి చూపుతూ ముందు నడుస్తూంటే, ఆవు మీది నుంచి జలజలా పారి గలగలా ప్రవహించి గౌతమి అని పేరు పొందింది.

 మాయదారి ఆవు దిగ్గున లేచి నాలుగడు గులు ముందుకు వేసి, చుట్టుపక్కల కలయచూసి అలా పైకెగసి ఆకాశంలో అదృశ్యం కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్క రించాడు. విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి, ‘‘అమ్మా!తనయుణ్ణి మన్నించు. నీ దయామృత జలాలతో వింధ్యకు దిగువనున్న భూభాగమంతా సుభిక్షం కావాలని ఇంతపని చేశాను.

దక్షణ గంగగా అవతరించిన నీవు, గోవును బ్రతికించి ఇచ్చినందువల్ల గోదావరి అని పేరు పొందుతావు!'' అని చేతులెత్తి మ్రొక్కి అదృశ్యమయ్యాడు. గోదావరి అనేక ఉపనదులతో తూర్పుగా పయనించి తూర్పు మైదానాల్ని సస్యశ్యామలం చేసింది. సప్తఋషులు, దేవతలు పరమానందంతో గోదావరిలో జలకమాడారు. గౌతముణ్ణి ఎన్నో విధాల శ్లాఘించి అపర భగీరథుడు అన్నారు.

 గోదావరి సప్తగోదావరిగా చీలి తూర్పు సముద్రాన్ని చేరింది. గంగ గోదావరి ప్రవాహంగా మారుతున్నప్పుడు, ఆమె నల్లని వేణీభరము విరజిమ్ము కొని పడమటికనుమల్లో చిక్కుపడింది. మహావిష్ణువు తన చేతి వ్రేళ్ళతో సుతారంగా ఆ చిక్కు విడదీశాడు.

కృష్ణవర్ణుడైన విష్ణువు వ్రేళ్ళ సందులనుంచి కొప్పులో నీరు జారుతూ కృష్ణవేణి, కృష్ణానది అని పిలువబడుతూ మరొక గొప్పనది ప్రవహించింది. అలాగే గంగాజలం ఆకాశంలో ఎగిరి, దక్షణంగా ఉన్న కవేరమహాముని ఆశ్రమంలో కమండలంలో పడి, కన్యగా పెరిగి, అగస్త్యుని వెంట అరణ్యాల్లో విహరిస్తూ, కావేరినదిగా మారి, అందమైన జలపాతాలతో దక్షణసీమలో ప్రవహించింది.

ఆ విధంగా గౌతమమహర్షి తెచ్చిన గంగ మరొక మూడు గొప్ప నదులుగా దక్షణ భారత భూమిని సుభిక్షం చేసింది. దేశంలో గంగ, గోదావరి, కృష్ణ, కావేరి అని నాలుగు నదుల పేర్లు చెప్పుకోవడం పరిపాటి అయింది. గౌతమముని ఆశ్రమం తిరిగి కళకళ లాడింది. ఆశ్రమాన్ని వదిలిన మునులందరూ మళ్ళీ వచ్చి చేరారు. గోదావరి పొడవునా అనేక క్షేత్రాలు వెలిశాయి.

 గౌతముడి కీర్తి కూడా వ్యాపించింది. గంగ పడమటికనుమలకు ప్రవహించడం అనేది అసంభవమైనది గనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడేగాని, అసంభవాన్ని సాధించి సంభవంగా మార్చిన గౌతముడి గొప్ప దనాన్ని గుర్తించి ఆయన వద్దకు వెళ్ళి క్షమాపణ వేడుకున్నాడు. గౌతముడికి మాత్రం సంతోషం లేకపోయింది.

అదివరకే ఇంద్రుడి మోసం కారణంగా అహల్యను బండరాయిగా పడి ఉండమని శపించి, ఉత్తరదేశం నుంచి వింధ్య దాటి పడమటి చరియలో ఆశ్రమంకట్టుకుని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకొంటు న్నాడు. గోదావరి అవతరణంతో పడమటి కనుమల్లోని మునుల ఆశ్రమాలు మరింత శోభించాయి. అత్రిమహాముని త్రిమూర్తుల అంశలతో పుత్రవంతుడయ్యాడు. ఆయన పత్ని అనసూయ అతిథులకు నిరతాన్నదానం చేస్తూన్నది.

 గౌతముడి ఆశ్రమం చుట్టూరా కూడా సస్యసమృద్ధి విశేషంగా ఉన్నా అహల్యలేని కొరత కనిపిస్తూనే ఉన్నది. తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనస్సులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి, ‘‘గౌతమా! విచారించకు. త్వరలోనే విష్ణువు అవతరించి రాముడై తన పాదం మోపి, నీ భార్యను మనిషిగా చేస్తాడు.

 పాషాణి పునీత అవుతుంది! గోదావరి అవతరణానికిగాను, నీకు చాలా శ్రమ ఇచ్చాను. గోదావరికి గౌతమి నామం చిరస్థాయిగా ఉంటుంది!'' అన్నాడు. గౌతముడు ఆ మాటలకు సంతోషంతో, ‘‘విఘ్నేశ్వరా! అంతా నీ సంకల్పబలం వల్లనే కదా జరిగింది! గోదావరి జలాలూ, విఘ్నేశ్వ రుని కృపా ఎల్లకాలమూ రక్షిస్తూఉంటాయి!'' అన్నాడు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List