అలనాడు రాయలేలిన రతనాల సీమే రాయచోటిగా నేడు వెలుగొందుతోంది. రాయల కాలంలో రాచోటి పక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం వెలసింది. ఈ దేవాలయం రాయల కాలం నుండి అత్యంత ప్రసిద్ది గాంచింది.వెయ్యి ఏళ్ళ చరిత్ర ఈ దేవాలయానికి ఉంది. శ్రీ కృష్ణ దేవరాయలు...ఇతర సామంతరాజులు ఈ ప్రాంతానికి విచ్చేసి మాండవ్య నది ఒడ్డున సేద తీరుతూ ఉండేవారని ప్రతీతి. ఆ కాలంలోనే భద్రకాళి సమేత వీరభ్రస్వామి దేవాలయాన్ని భక్తి ప్రపత్తులతో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు మాండవ్య నది ఒడ్డున వెలసిన వీరభద్రస్వామి దేవాలయం భక్తులతో కళకళలాడుతోంది. గతంలో రాచోటిగా పిలువబడే ఈనాటి రాయచోటికి పేరు ప్రఖ్యాతలు రావడానికి వీరభద్రస్వామి దేవాలయమేనని పెద్దలు పేర్కొంటున్నారు. రాయచోటిలో వెలసిన భద్రకాళి సమేత వీరభద్రుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. వీరభద్ర ఆలయం వీరశైవుల పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్వయంగా వీరభద్రుడే విగ్రహ మూర్తిగా ఇక్కడ కొలువైనందున రాయచోటి వీరభద్ర ఆలయాన్ని దక్షణ భారత దేశ వీరభద్ర ఆలయానికి మూలవిరాట్గా పేర్కొంటుంటారు. చోళ సామ్రాజ్య విస్తరణలో భాగంగా యుద్దాలు చేసి ఆలసిపోయిన రాజాధిరాజ చోళుడు మానసిక ప్రశాంతత కోసం దేశ పర్యటనకు బయలుదేరి ఇక్కడి మాండవ్య నది తీరానికి చేరుకున్నాడు. కొండల, గుట్టల నడుమ ప్రవహిస్తున్న మాండవ్య నది ఒడ్డున సాగైన పూల తోటలతో ఈ ప్రాంతం ఆయనకు విశేషంగా ఆకర్షించిందని, దీంతో ఆయన ఇక్కడే తన సపరివారంతో నిలిచిపోయి భద్రకాళి సమేత వీరభద్రుని కొలువు జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని పునః నిర్మించాడని చరిత్ర చెబుతోంది. వీరభద్రునికి రాచరాయుడు అనే పేరు కూడా ఉంది. బ్రహ్మోత్సవాలు నిర్వహణ అనంతరం మార్చి 21 నుండి 24వ తేదీల మధ్యలో ఎన్నో ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం ఇక్కడి విశేషం. ఆలయ వాస్తు నిర్మాణ చాతుర్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. వీరభద్రుని హిందువులతో పాటు ముస్లింలు దర్శించుకుంటారు. ముస్లింలోని దేశముఖ్తేకు చెందిన వారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి పూజా సామాగ్రి పంపుతారు. ఆలయ కమిటీ వాటిని స్వీకరించి పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను తిరిగి వారికి పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ గాలిగోపురం ముందు భాగంలో 56 అడుగుల ఎత్తు గల ఏక శిలారాతి దీప స్తంభం ఉంది. ఇది ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంత పెద్ద ఏకశిల దీపాస్తంభం దక్షణ భారత దేశంలోనే మరెక్కడా లేదని చెప్పవచ్చు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ స్తంభంపై భాగంలో దీపం వెలిగించి స్వామి వారిని ఆరాదించడం ఆనవాయితీగా వస్తోంది.
https://www.facebook.com/rb.venkatareddy/posts/10204405427608582







No comments:
Post a Comment